
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. ఆ దేశాలు ప్రతీకార చర్యలతో రగిలిపోతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్పోర్టులను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గగనతలాలపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తమ గగనతలాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేయగా.. అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. దీంతో లెబనాన్, జోర్డాన్, ఇరాక్లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు, తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్కు తగిన గుణపాఠం నేర్పాలన్న టార్గెట్తో సోమవారం ఉదయం క్షిపణుల వర్షం కురిపించింది.
టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో కనీసం ఎనిమిది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది.