టొరంటో: కెనడాలోని టొరంటోలో గత డిసెంబర్లో జరిగిన భారత సంతతికి చెందిన హిమాన్షీ ఖురానా (30) హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆమె భాగస్వామి అబ్దుల్ గఫూరీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్ 20, 2025న ఈ హత్య జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న గఫూరీని, ఆగస్టు 7న టొరంటో విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు టొరంటో పోలీసులు శనివారం ప్రకటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందని దర్యాప్తులో తేలింది.
నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే అతనికి పెరోల్ లేని జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. డిసెంబర్ 19న హిమాన్షీ కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా, మరుసటి రోజు ఉదయం ఆమె మృతదేహం ఆమె ఇంట్లోనే లభ్యమైంది. టొరంటోలోని భారత కాన్సులేట్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని ప్రకటించింది. నిందితుడు విదేశాలకు పారిపోయినప్పటికీ, అంతర్జాతీయ పోలీసు ఏజెన్సీల సహకారంతో అతడిని కెనడాకు రప్పించి, అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: బ్రెజిల్లో విషాదం: హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!


