టెల్ అవీవ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ షాక్ ఇచ్చారు. గాజాలో శాంతి కోసం ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల శాంతి ప్రణాళికను ఇజ్రాయెల్ తిరస్కరించిందన్నారు. ఈ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తెలిపారు. హమాస్ పూర్తిగా నిరాయుధులయ్యే వరకు గాజా నుంచి వైదొలగబోలేదని నెతన్యాహు తేల్చిచెప్పారు
ఇజ్రాయెల్- హమాస్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు, ముఖ్యంగా ప్రస్తుత యుద్ధానికి ముగింపు పలకడానికి ట్రంప్ గాజా శాంతి ఫార్ములా రూపొందించారు. దీని ప్రకారం గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేసి, హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను ,ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను పరస్పరం విడుదల చేయాలి. అదే విధంగా ఇజ్రాయెల్ బలగాలు గాజా నుండి క్రమంగా తమ దళాలను ఉపసంహరించుకోవాలి. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ తొలుత అంగీకారం తెలిపింది. అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల తర్వాత, ఇజ్రాయెల్ ఈ శాంతి ప్రణాళికలోని మొదటి దశ ఒప్పందంపై సంతకం చేసింది.
కాగా తాజాగా ఈ పాలసీని వ్యతిరేకిస్తూ నెతన్యాహూ బాంబు పేల్చారు. నెతన్యాహూ తన వ్యాఖ్యల్లో "15-సూత్రాల పత్రాన్ని ఇజ్రాయెల్ తిరస్కరిస్తుంది. హమాస్ నిజంగా నిరాయుధులయ్యే వరకు ఐడిఎఫ్ ఎలాంటి ఉపసంహరణ చేపట్టదు. మన బలగాలకు, మన పౌరులకు ఎదురయ్యే ముప్పులను అడ్డుకుంటూనే ఉంటుంది," అని ఇజ్రాయెల్ రక్షణ దళాలను ప్రస్తావిస్తూ నెతన్యాహు క్యాబినెట్ సమావేశంలో అన్నారు. దీంతో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ఇజ్రాయెల్ నిర్ణయంతో గాజాలో శాంతిని స్థాపించడానికి హమాస్ను నిరాయుధులను చేయడానికి జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలు మళ్లీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. హమాస్ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టే వరకు ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రస్తుత స్థానాల నుంచి వెనక్కి వెళ్లేది లేదని తేల్చిచెప్పడంతో.. గాజాలో సైనిక ఉద్రిక్తతలు దాడులు కొనసాగే అవకాశం ఉంది.


