అందరి విధానం కావాలి: భారత్
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం సార్వజనీన విధానంగా మారాలని భారత్ పేర్కొంది. భారత్–అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం శనివారం ఢిల్లీలో జరిగింది. ఇందులో అరబ్ లీగ్కు చెందిన 19 సభ్యదేశాల నుంచి మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రారంభం ప్రసంగం చేశారు. గాజా సంక్షోభానికి ముగింపు పలికే సమగ్ర శాంతి పథకం భద్రతా మండలి తీర్మానం 2803కు అనుగుణంగా ఉండటం మేలన్నారు.
కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలు ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. ఇటువంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఉమ్మ డి ప్రయోజనాల కోసం శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును బలోపేతం చేసే శక్తులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని జై శంకర్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంతో ఎదురవుతున్న సవాళ్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన... దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్త సమన్వయ ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చారు.
రెండు ప్రాంతాలకు ఉన్న అతిపెద్ద ఉమ్మడి ముప్పు అన్ని రూపాల్లోనూ ఉన్న ఉగ్రవాదమేనని ఆయన తెలిపారు. అంతర్జాతీయ సంబంధాలను, ప్రాథమిక దౌత్య సూత్రాలను ఉల్లంఘించే సీమాంతర ఉగ్రవాదం ఏమాత్రం ఆమోదయోగ్యం కానిదని స్పష్టం చేశారు. ఉగ్రవాద బాధిత దేశాలకు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని తెలిపారు. ఉగ్రవాదం పీడను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, జీరో టాలరెన్స్ విశ్వజనీన నియమావళిగా ఉండాలని జైశంకర్ అన్నారు.
మోదీతో అరబ్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ
భారత్– అరబ్ లీగ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి వచ్చిన మంతుల్రు అంతకు ముందు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుస్థిర పశ్చిమాసియా కోసం మోదీ చేస్తున్న కృషిని వారి ప్రశంసించారు. ‘అరబ్ ప్రపంచం భారత్ యొక్క విస్తృత పొరుగులో ఒక భాగం. మన మధ్య లోతైన నాగరికత సంబంధాలు, ప్రజల మధ్య అనుబంధాలు, చిరకాల సోదర బంధాలు ఉన్నాయి. అలాగే శాంతి, ప్రగతి, స్థిరత్వంపై మనకు ఉమ్మడి నిబద్ధత ఉంది’అని మోదీ వారితో పేర్కొన్నారు.


