అమెరికా మెరుపుదాడి.. ఖండించిన ప్రపంచదేశాలు | America Attack On Iran Donald trumps threatens to attack again | Sakshi
Sakshi News home page

అమెరికా మెరుపుదాడి.. ఖండించిన ప్రపంచదేశాలు

Jun 23 2025 1:36 AM | Updated on Jun 23 2025 1:39 AM

America Attack On Iran Donald trumps threatens to attack again

ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్‌ అణుకేంద్రాలపై బంకర్‌ బస్టర్‌ బాంబులేసిన ట్రంప్‌ సేన

ఇస్ఫహాన్‌ అణుకేంద్రంపై టోమాహాక్‌ క్రూజ్‌ క్షిపణులతో దాడి 

చరిత్రచూడని స్థాయిలో ప్రతిదాడిచేస్తామన్న ఇరాన్‌ 

ఇరాన్‌ యుద్ధం ఆపకుంటే మళ్లీ దాడిచేస్తామన్న ట్రంప్‌ 

అమెరికా జోక్యంతో భగ్గుమన్న ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధాగ్ని 

అగ్రరాజ్య దాడిని ఖండించిన ప్రపంచదేశాలు 

ఇరాన్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ 

చమురు రవాణాను అడ్డుకుంటూ, హోర్ముజ్‌ జలసంధిని మూసేసేందుకు సిద్ధమైన ఇరాన్‌ 

ప్రపంచం మీద వేలాడుతున్న పెట్రోధరల కత్తి 

సమరంలో పైచేయి కోసం రష్యా, చైనాల సాయానికి ఇరాన్‌ ప్రయత్నాలు 

పుతిన్‌తో ఇరాన్‌విదేశాంగ మంత్రి భేటీ  

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ/మాస్కో: పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే శత్రుత్వంతో పరస్పర దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్‌ మధ్యలోకి అగ్రరాజ్యం హఠాత్తుగా వచ్చి భీకరదాడులతో పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను మరింత ఎత్తుకు ఎగదోసింది. పర్వతగర్భంలో పటిష్టంగా, రహస్యంగా ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని బద్దలుకొట్టే లక్ష్యంతో అమెరికా యుద్ధవిమానాలు వేల కేజీల బరువైన అతిభారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. 

ఇరాన్‌ రాజధాని సమీప ఫోర్డో అణుకేంద్రంపై శనివారం అర్ధరాత్రిదాటాక గంటలకు జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ పెనిట్రేటర్‌(ఎంఓపీ) గైడెడ్‌ బాంబులను అమెరికా బీ–2ఏ స్పిరిట్‌ స్టెల్త్‌ బాంబర్‌ విమానాలు జారవిడిచాయి. ఈ బాంబులు 200 అడుగుల లోతుకు చొచ్చుకెళ్లి అక్కడి భూగర్భాన్ని బద్దలుకొట్టాయి. నతాంజ్‌ అణుకేంద్రంపైనా అమెరికా ఇవే బాంబులను వేసింది. మొత్తంగా 14 జీబీయూ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్, జనరల్‌ డేనియల్‌ కెయిన్‌ వెల్లడించారు.  

ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌.. 
శనివారం అర్ధరాత్రిదాటగానే ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’పేరిట ఈ దాడులను చేసింది. అమెరికాలోని మిస్సోరీలోని వైట్‌హ్యాన్‌ వైమానిక స్థావరం నుంచి ఆరు బీ–2ఏ విమానాల దండు దండయాత్ర మొదలైంది. ఏకధాటిగా 37 గంటలపాటు ప్రయాణించి, మార్గమధ్యంలో గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటూ 11,400 కిలోమీటర్లు ప్రయాణించిమరీ ఫోర్డో, నతాంజ్‌ అణుకేంద్రాలపై ఒక్కోటి దాదాపు 14,000 కేజీల బరువుండే 14 బంకర్‌ బస్టర్‌ బాంబులను పడేశాయి. 

ఆ తర్వాత ఇస్ఫహాన్‌ అణుకేంద్రంపై అమెరికా జలాంతర్గామి 30 టోమాహాక్‌ క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఈ మూడు అణుకేంద్రాలపై 75 దాకా గైడెడ్‌ క్షిపణులను ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. మొత్తంగా 125 విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. కొన్ని విమానాలు దాడిచేయగా మిగతావి శత్రుసేనలను తికమక పెట్టేందుకు వేర్వేరు దిశల్లో చక్కర్లు కొట్టాయి. మెరుపువేగంతో దాడులుచేసి తిరిగి తమతమ స్థావరాలకు చేరుకున్నాయి. 

యుద్ధ, రవాణా, ఇంధన విమానాలు ఈ ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హ్యామర్‌’లో పాల్గొన్నాయి. అమెరికా దాడుల్లో అణుకేంద్రాల్లో మౌలికవసతులు ఏ స్థాయిలో నాశనమయ్యాయో ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే పర్వతం పైభాగంలో ఆరు భారీ రంధ్రాలు పడ్డట్లు తాజాగా తీసిన ‘ప్లానెట్‌ ల్యాబ్స్‌ పీబీసీ’ఉపగ్రహ ఫొటోల్లో కనిపించింది. 

అయితే అణుబాంబు తయారీని అడ్డుకునేందుకు బాంబులేశామని, ఇరాన్‌లో యుద్ధాన్ని ఎగదోసి, ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమకు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ స్పష్టంచేశారు. అయితే అణుబాంబు తయారీ సామర్యాన్ని ఇరాన్‌ సంతరించుకోవద్దనే లక్ష్యంతోనే తాము యుద్ధంలో పాల్గొన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తమ సైనికచర్యను సమర్థించుకున్నారు. 

తమపై ప్రతిదాడి చేస్తే మిగతా లక్ష్యాలపై దాడులు తప్పవని ఇరాన్‌ను హెచ్చరించారు. అయితే దాడుల తర్వాత ఆయా అణుకేంద్రాల నుంచి ఎలాంటి అణుధారి్మకత వెల్లడైన ఛాయలు కనిపించలేదని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ స్పష్టంచేసింది. దాడికి ముందే అక్కడి నుంచి యురేనియం నిల్వలను తరలించినట్లు ఇరాన్‌ అధికారులు వెల్లడించారు. 


ఊహించనిస్థాయిలో దెబ్బకొడతాం: అబ్బాస్‌ 
ఓవైపు అణు మధ్యవర్తిత్వం కోసం స్వాగతం పలుకుతూ మరోవైపు సమరాగ్నిని రాజేస్తున్న అగ్రరాజ్యాన్ని ఊరికే వదిలిపెట్టబోమని ఇరాన్‌ ప్రతిజ్ఞచేసింది. చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో దాడులుచేసి బదులు తీర్చుకుంటామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ప్రకటించారు. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోపరేషన్‌ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన అబ్బాస్‌ ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

‘‘దౌత్యనీతిని కాలరాస్తూ అమెరికా మాపై దాడులకు తెగబడింది. మేం దౌత్యాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టి దేశ రక్షణ కోసం భీకరపోరు చేయాల్సిన తక్షణావసరమిది. దుస్సాహసంతో దారుణంగా దాడులు చేసిన యుద్ధోన్మాద అమెరికా తదుపరి తీవ్ర పర్యావసానాలకు బాధ్యతవహించాల్సి ఉంటుంది. అమెరికా చర్యలకు ఇరాన్‌ తన సైన్యంతో బదులుతీర్చుకుంటుంది. 

దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఇరాన్‌ పాటుపడుతుంది’’అని అబ్బాస్‌ అన్నారు. మరోవైపు తమపై దాడిచేసిన ఇజ్రాయెల్‌పైనా ఇరాన్‌ ఆదివారం మిస్సైళ్లను ప్రయోగించింది. తన అమ్ములపొదిలోని మధ్యస్థ శ్రేణి ఖుర్రమ్‌షహర్‌–4 క్షిపణిను సైతం ఇరాన్‌ ప్రయోగించింది. ఇది ఒకేసారి 1,500 కేజీల బరువైన వేర్వేరు వార్‌హెడ్లను ఏకంగా 2,000 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని ఈ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.  


దాడులను పొగిడిన ఇజ్రాయెల్‌ 
ఇరాన్‌పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్‌ స్వాగతించింది. ఇదొక అద్భుత, సాహసోపేత, చరిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ, అధ్యక్షుడు ఇసాక్‌ హెర్జోగ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘దాడులు చేయాలని కోరాం. కానీ అమెరికా నిర్ణయం ముందస్తుగా మాకుతెలీదు. ఇదొక చారిత్రక నిర్ణయం. 

అమెరికా నేరుగా దాడులు చేస్తున్నందున ఇక మేం దాడులు చేయబోమని అనుకోవద్దు. ఇరాన్‌ మా భూభాగాలపై క్షిపణులు వేస్తోంది. మేం వాటికి బదులు చెప్పాలి’’అని ఇసాక్‌ అన్నారు. ఆదివారం సైతం ఇరాన్‌లోని డజనుకుపైగా మిలటరీ స్థావరాలపై దాడులుచేశామని చెప్పారు. అయితే ఆస్పత్రులు, మెడికల్‌ సెంటర్లపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోందని ఇరాన్‌ ఆరోపించింది. 

ఆదివారం నాటికి ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్‌లో 865 మందిదాకా చనిపోయారని, 3,396 మంది గాయపడ్డారని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే ‘హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌’సంస్థ ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత సురక్షిత బంకర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. తమ దేశంలో 24 మంది చనిపోయారని, వేయి మంది గాయపడ్డారని ఇజ్రాయెల్‌ పాత లెక్కలనే చెబుతోంది 


మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్‌ 
ఇరాన్‌పై దాడులను చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. దాడుల తర్వాత ఇరాన్‌కు ప్రపంచదేశాల నుంచి సైనిక సాయం పెరుగుతుందని రష్యా వ్యాఖ్యానించింది. ఈ మేరకు రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదెవ్‌ ‘ఎక్స్‌’ లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘దాడుల కారణంగా ఆ అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదు. 

పైగా ఇరాన్‌కు బయటి మద్దతు పెరుగుతోంది. అణువార్‌హెడ్‌లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మంతనాలు జరిపేందుకు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ ఆదివారం మాస్కోకు వెళ్లారు. భేటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

జలసంధి దిగ్భందం!! 
ప్రపంచ చమురు జీవనాడికి పేరొందిన హోర్ముజ్‌ జలసంధిని మూసేస్తామని ఇరాన్‌ బెదిరించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయానికి ఇరాన్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలపింది. అయితే జాతీయ ప్రయోజనాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ‘సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

అది కూడా ఆమోదిస్తే జలసంధి ద్వారా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. దాంతో ఇంధన కొరత ఎక్కువై, గిరాకీ పెరిగి, పెట్రో ధరలు మరింత అధికంకానున్నాయి. భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముంది. 

మరోవైపు, అమెరికా జోక్యం, బాంబు దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆదివారం ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఉద్రిక్తతలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ వివరాలను మోదీ తన ‘ఎక్స్‌’ఖాతాలో వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement