పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాల్లో ఉన్న ఫిన్టెక్ సంస్థ ఫోన్పే సుమారు 1.05 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం కంపెనీ సుమారు 9-10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 – రూ. 87,000 కోట్లు) వేల్యుయేషన్తో నిధులు సమీకరించినట్లు అవుతుందని పేర్కొన్నాయి.
మూడేళ్ల క్రితం కంపెనీ 100 మిలియన్ డాలర్లు సమీకరించినప్పటి 12 బిలియన్ డాలర్ల విలువతో పోలిస్తే ఇది గణనీయంగా తక్కువ కావడం గమనార్హం. అయితే వేల్యుయేషన్ తగ్గినా కూడా పేటీఎం ఐపీవో తర్వాత ఫోన్పే ఇష్యూ రెండో అతి పెద్ద ఐపీవోగా నిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పేటీఎం 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) వేల్యుయేషన్తో 2021 నవంబర్లో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫోన్పే ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండనుంది. కంపెనీలో వాటాదారులైన వాల్మార్ట్, టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఫైనాన్స్ వాటాలు విక్రయించనున్నాయి. ఐపీవోతో మైక్రోసాఫ్ట్, టైగర్ గ్లోబల్ పూర్తిగా ని్రష్కమించే యోచనలో ఉన్నాయి.


