ఆదాయం, లాభదాయకతల్లో వృద్ధి
ముసాయిదా ప్రాస్పెక్టస్లో వెల్లడి
న్యూఢిల్లీ: ఐపీవో బాటలో సాగుతున్న ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే పనితీరు మెరుగుపడుతున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం చూస్తే.. గత మూడేళ్లలో ఆదాయం, లాభదాయకత, నగదు ఆర్జన పుంజుకున్నట్లు తెలుస్తోంది. నిర్వహణ ఆదాయం గతేడాది(2024–25) రూ. 7,115 కోట్లకు చేరింది. 2022–23లో నమోదైన రూ. 2,914 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 56 శాతం జంప్చేసింది. వివిధ బిజినెస్ విభాగాల మానిటైజేషన్ సైతం ఇందుకు సహకరించింది.
వీటిలో మర్చంట్ చెల్లింపులు, రుణాలు, బీమా పంపిణీ కలగలసి ఉన్నాయి. ఆదాయంలో మర్చంట్ పేమెంట్ల బిజినెస్ 15 శాతం నుంచి 2025కల్లా 28 శాతానికి బలపడగా.. 2025 సెప్టెంబర్ తో ముగిసిన ఆరు నెలల్లో 31 శాతానికి ఎగసింది. రుణాలు, బీమా పంపిణీ విభాగం సైతం 2023లో నామమాత్ర వృద్ధి కనబరచగా.. 2025కల్లా 8 శాతానికి, తదుపరి ఆరు నెలల్లో 12 శాతానికి పుంజుకుంది. ఇది కంపెనీకి కీలకమైన చెల్లింపుల బిజినెస్ నుంచి డైవర్సిఫికేషన్ను సూచిస్తోంది.
నష్టాలకు చెక్
పలు అంశాలలో నిర్వహణా పనితీరు మెరుగుపడిన నేపథ్యంలో ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే నష్టాలు సైతం తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది రూ. 1,727 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే రూ. 1,069 కోట్లమేర రికవర్ అయ్యాయి. ఇదే కాలంలో నష్టాల మార్జిన్ 90.68 శాతం నుంచి 22.64 శాతానికి మెరుగుపడ్డాయి. గత రెండేళ్ల(2024, 2025)లో సర్దుబాటు తదుపరి నిర్వహణ లాభం(ఇబిటా) సానుకూలస్థాయికి చేరింది.
నిర్వహణ సామర్థ్యం, కఠిన వ్యయ నియంత్రణలు ఇందుకు సహకరించాయి. ఇక 2024–25లో రూ. 190 కోట్లకుపైగా ఫ్రీ క్యాష్ఫ్లో సాధించగా.. తదుపరి 6 నెలల్లో రూ. 250 కోట్లు అందుకుంది. ప్రధానంగా కార్యకలాపాల ద్వారానే నగదు ఆర్జన సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు 2025 సెప్టెంబర్ లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.


