ఐటీ షేర్లలో అమ్మకాల సునామీ
1069 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
నిఫ్టీకి 288 పాయింట్ల నష్టం
రూ. 2.85 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: అమెరికా ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ కొత్త అప్డేట్ తీసుకొచ్చినప్పుడల్లా ‘ఐటీ మార్కెట్’ వణికిపోతోంది. తాజాగా కోబాల్ వంటి పాత ప్రోగ్రామింగ్ భాషలతో పనిచేస్తున్న సిస్టమ్లు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మార్చేందుకు తమ ‘క్లాడ్ కోడ్’ టూల్ ఉపయోగపడుతుందని ప్రకటించింది. ఈ కోడింగ్ టూల్స్తో ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులపై వ్యయాలు తగ్గి, కంపెనీల ఆదాయాల పరిమితం కావొచ్చని పరిశ్రమ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో ఐటీ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఒకశాతానికి పైగా పతనమైంది.
అంతర్జాతీయ వాణిజ్య సంబంధిత అనిశి్చతులు, క్రూడాయిల్ ధరలు, అమెరికా–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 1069 పాయింట్లు పతనమై 82,226 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288 పాయింట్లు నష్టపోయి 25,425 వద్ద నిలిచింది. ఒక్కరోజే రూ.2.85 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.466 లక్షల కోట్లకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా డాలర్ పుంజుకోవడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 6 పైసలు బలహీనపడి 90.95 వద్ద స్థిరపడింది.
బలహీనంగా మొదలై.. భారీ నష్టాల్లోకి..
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే బలహీనంగా మొదలయ్యాయి. ట్రేడింగ్ గడిచే కొద్ది మరింత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఏఐ భయాలు ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేయటంతో ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడితో చిత్తు అయ్యాయి. రియల్టీ, మీడియా స్టాక్స్ కూడా భారీగానే నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,360 పాయింట్లు క్షీణించి 82 వేల స్థాయి దిగువన 81,934 వద్ద, నిఫ్టీ 385 పాయింట్లు పతనమై 25,328 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అలాగే మంగళవారం నిఫ్టీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల వీక్లీ ఎక్స్పైరీ కావడంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మార్పు, చేర్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి.
⇒ ఆంథ్రోపిక్ తాజా అప్డేట్ ప్రకటనతో భారత ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్టీఐఎం 6.50%, టెక్ మహీంద్రా 6.17%, పెర్సిస్టెంట్ 6%, హెచ్సీఎల్ టెక్ 5.83%, కోఫోర్జ్ 5.24% క్షీణించాయి. ఎంఫసిస్ 3.67%, టీసీఎస్ 3.56%, ఇన్ఫోసిస్ 3.56%, విప్రో 3% పతనమయ్యాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్సు 4.8% నష్టపోయింది. కృత్రిమ మేధ ఆందోళనలతో నిఫ్టీ ఐటీ ఇండెక్సు ఈ ఫిబ్రవరిలో ఏకంగా 21% కుప్పకూలింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2008) తర్వాత ఈ సూచీ ఒక నెలలో ఆ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.
⇒ బీఎస్ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో ఐటీ 5%, రియల్టీ 2.61%, టెలీకమ్యూనికేషన్ 1.79%, కన్జూమర్ డి్రస్కేషనరీ 1.12%, ఇండ్రస్టియల్స్ 0.91%, క్షీణించాయి. స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.68%, 0.54% చొప్పున క్షీణించాయి.
⇒ ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ యూఎస్ సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కూడా ఇతర చట్టాల ద్వారా టారిఫ్లు విధిస్తామని ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో ఇండోనేíÙయా 1.4%, హాంగ్కాంగ్ 1.85%, సింగపూర్ 0.4% పతనమయ్యాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ సూచీలు అరశాతం వరకు పతనమయ్యాయి. అమెరికా స్టాక్ సూచీలు ఆరంభంలో భారీగా పడి, వెంటనే కోలుకుని లాభాలతో ట్రేడవుతున్నాయి.
ఐబీఎంకు ఆంథ్రోపిక్ భయం
ఐబీఎం సిస్టమ్స్లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోబాల్ను తమ ‘క్లాడ్ కోడ్ టూల్ ఆధునికీకరించగలదంటూ ఆంథ్రోపిక్ చేసిన ప్రకటనతో ఐబీఎం షేరు కుప్పకూలింది. సోమవారం ఏకంగా 13.2% క్షీణించి 223.35 డాలర్ల వద్ద ముగిసింది. 2000 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువకు ఒక్కరోజే 40 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
టెక్ నిపుణులు నెలల పాటు శ్రమించి రూపొందించే కోడ్ లాంగ్వేజీని స్వల్ప వ్యవధిలో పూర్తి చేసే కోబాల్ క్లాడ్ కోడ్ టూల్ ఆవిష్కరణతో ఐబీఎంతో పాటు అంతర్జాతీయంగా సైబర్ సెక్యురిటీ, సాఫ్ట్వేర్ యాస్ ఏ సర్వీస్ (సాస్) రంగంలోని దిగ్గజ కంపెనీల షేర్లు భారీ నష్టపోయాయి. ఈ ప్రభావమూ దేశీయ ఐటీ సంస్థల షేర్లపై పడింది. సోమవారం భారీ నష్టం నుంచి తేరుకున్న ఐబీఎం షేరు మంగళవారం ఇంట్రాడేలో 4.27% లాభంతో 232.88 డాలర్లను తాకింది.


