రాబర్ట్ కియోసాకి అంటే ముందుగా గుర్తొచ్చేది.. ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకం. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఈ బుక్.. తన జీవితాన్ని మార్చేసిందని, మిలియనీర్ను చేసిందని హెచ్బీ క్యాపిటల్ ఫౌండర్ & సీఈఓ 'హన్నా హామండ్' వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
13 ఏళ్ల వయసులో నా దగ్గర రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉండేది. ఈ పుస్తకం నా జీవిత దిశనే మార్చేసింది. చిన్నప్పుడే కియోసాకి నాకు హీరో అయ్యారు, అని హన్నా హామండ్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. కష్టపడి పనిచేసి, ఆర్థిక జ్ఞానం పెంపొందించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాను. దీని ఫలితంగా 25 ఏళ్లకే మిలియనీర్ అయ్యానని ఆమె పేర్కొంది.
నా జీవితంలో నేను ఊహించని విషయం ఏమిటంటే.. నా ఫ్రెండ్ జో పోలిష్ ద్వారా రాబర్ట్ కియోసాకిని కలుసుకోవడం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమె ఇంటి దగ్గరలోనే కియోసాకి నివసిస్తున్నారని నాకు అప్పటి వరకు తెలియదు.
ఈ సందర్భంలో ఆమె తన జీవితాన్ని తిరిగి ఒకేసారి నెమరు వేసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం జీవితం దుర్భరంగా ఉండేది.ఇప్పుడు నా బాల్యంలో ఆశను నింపిన వ్యక్తి పక్కన నిలబడి ఉన్నాను. ఆ పుస్తకంలోని మాటలు నన్ను కష్టకాలంలో నిలబెట్టాయి, ముందుకు నడిపించాయని హన్నా హామండ్ పేర్కొన్నారు.


