జీడీపీలో ప్రభుత్వ నికర రుణభారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి తగ్గనుండడంతో.. ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరగనున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం స్థూల రుణ సమీకరణను రూ.17.3 లక్షల కోట్లుగా.. నికర రుణ సమీకరణ జీడీపీలో 3 శాతంగా పేర్కొనడాన్ని ప్రస్తావించింది. ఇది క్రమంగా కరోనా ముందస్తు స్థాయిలకు తగ్గించుకోవడంగా ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. రూ.17.3 లక్షల కోట్ల స్థూల రుణ సమీకరణ అంచనాలకు మించి ఉందని, ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత తగ్గుతుందంటూ ఓ వర్గం ప్రజల్లో నెలకొన్న ఆందోళలను ఈ సందర్భంగా ప్రస్తావించింది.
ఆర్బీఐ డేటా ప్రకారం 2019–20లో జీడీపీలో ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ రూ.4.73 లక్షల కోట్లు (2.4 శాతం)గా ఉండడం గమనార్హం. 2020–21లో కరోనా విపత్తు కారణంగా ఏకంగా రూ.10.33 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా ముందస్తు స్థాయిలకు నికర మార్కెట్ రుణ సమీకరణ తగ్గించుకుంటున్నందున ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరుగుతుందని, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్బీఐ బులెటిన్ స్పష్టం చేసింది. ఇక 2024–25 ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ జీడీపీలో 3.5 శాతం (రూ.11.63 లక్షల కోట్లు), 2025–26లో 3.2 శాతం (రూ.11.32 లక్షల కోట్లు) చొప్పున ఉండడం గమనార్హం.


