ఎల్రక్టానిక్స్‌కు షార్ట్‌ సర్క్యూట్‌ | Electronics industry warns of production hit as printed circuit board raw material shortage deepens | Sakshi
Sakshi News home page

ఎల్రక్టానిక్స్‌కు షార్ట్‌ సర్క్యూట్‌

Aug 5 2026 12:39 AM | Updated on Aug 5 2026 12:39 AM

Electronics industry warns of production hit as printed circuit board raw material shortage deepens

పరిశ్రమలకు పీసీబీల కొరత కష్టాలు 

ముడి వస్తువుల రేట్లకు రెక్కలు 

ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం, ఏఐ సర్వర్లకు భారీగా డిమాండ్‌ నెలకొనడంతో ఎల్రక్టానిక్స్‌కి కీలకమైన ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులకు (పీసీబీ) కొరత ఏర్పడింది. దీనితో టెలికం, మొబైల్, ఆటోమోటివ్‌లలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్‌ తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, ప్రధాన షిప్పింగ్‌ మార్గాల్లో సరఫరా వ్యవస్థకు అంతరాయాలు ఏర్పడటం, అధునాతన ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వైపు కీలక విడిభాగాలను మళ్లిస్తుండటమనేది ఎల్రక్టానిక్స్‌ పరిశ్రమకు అవసరమైన పీసీబీల షార్టేజీకి దారి తీస్తోంది.

దేశీయంగా పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్లుగా ఎల్రక్టానిక్స్‌ విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈసీఎంఎస్‌ స్కీము కింద రూ. 15,000 కోట్ల పైగా పెట్టుబడులు వస్తున్న తరుణంలో సర్క్యూట్‌ బోర్డుల కొరత ఏర్పడటం పరిశ్రమకు ఆందోళన కలిగిస్తోంది. పీసీబీల తయారీలో ఉపయోగించే స్పెషాలిటీ కెమికల్స్‌ని ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా ప్లాంటుపై ఇరాన్‌ ఇటీవల దాడులు చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారినట్లు ఎలక్ట్రానిక్స్‌ తయారీ సేవల సంస్థ సిర్మా ఎస్‌జీఎస్‌ తెలిపింది.

‘‘ఈ త్రైమాసికంలోను, రాబోయే త్రైమాసికంలోనూ మెటీరియల్‌ వ్యయాలపరంగా ఒత్తిడి కొనసాగుతుంది. సౌదీ అరేబియాలోని ఓ ప్లాంటుపై ఇరాన్‌ దాడి చేయడంతో ఒక్కసారిగా పీసీబీల కొరత ఏర్పడింది. ఈ సర్క్యూట్‌ బోర్డుల తయారీలో ఉపయోగించే ఒకానొక స్పెషాలిటీ కెమికల్‌ సరఫరాలో 80 శాతం భాగం అక్కడి నుంచే ఉంటోంది’’ అని కంపెనీ ఎండీ జస్బీర్‌ సింగ్‌ గుజ్రాల్‌ తెలిపారు.  

దేశీయంగా తయారీపై ఫోకస్‌.. 
ఈసీఎంఎస్‌కి దరఖాస్తు చేసుకున్న కంపెనీల్లో సిర్మా కూడా ఒకటి. పీసీబీల తయారీకి కూడా కంపెనీకి అనుమతులు వచి్చనప్పటికీ, ఉత్పత్తి ప్రారంభం కావడానికి మరికొన్ని త్రైమాసికాలు పట్టేయనున్నట్లు గుజ్రాల్‌ వివరించారు. ప్రతిపాదిత పీసీబీ ప్లాంటు 70 శాతం పూర్తి కాగా, మిగతా 30 శాతం ఈ నెలాఖరుకు పూర్తి కానుందని చెప్పారు. ‘‘జనవరి నుంచి మార్చి వరకు ట్రయల్‌ ప్రాతిపదికన ఉత్పత్తి చేస్తాం. అది పూర్తయ్యాక, కస్టమర్లకు శాంపిల్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. మేము సొంతంగా కూడా కొంత ఉపయోగించుకుంటాం. 2027–28లో వాణిజ్యపరంగా ఉత్పత్తి, అటు తర్వాత 2028–29లో పూర్తి స్థాయిలో తయారీ ప్రారంభమవుతుంది’’ అని వివరించారు.

మరోవైపు, పీసీబీల్లో ఉపయోగించే కాపర్‌ క్లాడ్‌ ల్యామినేట్‌ కెమికల్స్‌ (సీసీఎల్‌) కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటోందని ఎల్రక్టానిక్స్‌ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఎల్సినా సెక్రటరీ జనరల్‌ రాజు గోయల్‌ తెలిపారు. ‘‘విప్రో, సిర్మా ఎస్‌జీఎస్‌ సంస్థలు సీసీఎల్‌ కోసం తొలిసారిగా ప్లాంట్లు పెడుతున్నాయి. అలాగే 100 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్న ఫొటోరెసిస్ట్స్‌ని కూడా దేశీయంగానే తయారు చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని వివరించారు. రాగి, నికెల్‌ తదితర ప్లేటింగ్‌ కెమికల్స్‌లాంటివి దేశీయంగా 20–40% మేరకే తయారవుతున్నాయని, ఉత్పత్తి సామర్థ్యాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ధరలు పెంచిన గ్లోబల్‌ సంస్థలు.. 
ఈ ఏడాది జనవరి ప్రారంభం నుంచి ముడి వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయని గోయల్‌ చెప్పారు. ‘‘ఇదీ అదీ అని తేడా లేకుండా కీలకమైన అన్ని ముడి వస్తువుల వ్యయాలు గత 8–9 నెలల్లో పెరిగిపోయాయి. ముఖ్యంగా లో–బ్రొమైన్‌ ఎపోక్సీ రెసిన్‌ రేటు 70 శాతం, జుషి 7628 గ్లాస్‌ క్లాత్‌ ధర 8 నెలల్లో రెట్టింపయ్యింది. ఇక ప్రధానమైన కాపర్‌ ఫాయిల్, ఎలక్ట్రోలిటిక్‌ కాపర్‌ ధరలు 30 శాతం పెరిగాయి’’ అని తెలిపారు. ‘‘పీసీబీల సరఫరాలో ఎక్కువ భాగం ఏఐ సర్వర్ల డిమాండ్‌ని తీర్చడానికే పోతోంది.

మరోవైపు స్మార్ట్‌ మీటర్లు, పవర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లు, ఈవీ సిస్టమ్‌లు మొదలైన ఎల్రక్టానిక్స్‌కి డిమాండ్‌ 30–40 శాతం మేర పెరుగుతోంది. దీనితో ధరలు పెరిగిపోతున్నాయి. గ్లోబల్‌ పీసీబీ సరఫరా సంస్థలు 20 శాతం పైగా రేట్లను పెంచేశాయి’’ అని గోయల్‌ వివరించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు సత్వరం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రూపొందుతున్న సీసీఎల్‌ తయారీ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, వాటికి అవసరమైన పెట్టుబడులు, యంత్రపరికరాలు, టెక్నాలజీ సకాలంలో లభించేలా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement