మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేయడం అంటే పెద్ద సాహసమే. కానీ కొన్నిసార్లు ఉద్యోగం కంటే.. సొంత వ్యాపారమే ఎక్కువ సంతృప్తిని, మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అలాంటి ఓ యువకుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఎక్స్(X)లో అంకిత్ పాండే అనే వ్యక్తి తన స్నేహితుడి గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఏడాదికి రూ.11 లక్షల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అతని స్నేహితుడు ప్రమోషన్స్, కార్పొరేట్ జీవితాన్ని పక్కనబెట్టి సొంత ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ తన సొంత స్థలంలోనే ఒక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించాడు.
ప్రారంభంలో చిన్న స్థాయిలోనే మొదలైనప్పటికీ.. ప్రస్తుతం అతని వ్యాపారం బాగా విస్తరించింది. ఇప్పుడు దాదాపు 300 ఇళ్లు, దుకాణాలకు ప్రతిరోజూ తాగునీటి క్యాన్లను సరఫరా చేస్తున్నాడు. రోజుకు సుమారు 300 క్యాన్లు విక్రయిస్తుండగా, ఒక్కో క్యాన్ను రూ.30కి అమ్ముతున్నాడు.
దీంతో రోజుకు దాదాపు రూ.9 వేల ఆదాయం, అంటే నెలకు సుమారు రూ.2.7 లక్షల టర్నోవర్ వస్తోంది. సొంత స్థలం కావడంతో అద్దె భారం లేదు. నీటి శుద్ధి, విద్యుత్ ఖర్చులకు నెలకు సుమారు రూ.15 వేల, రవాణాకు మరో రూ.20 వేల ఖర్చవుతోంది. ఈ ఖర్చులన్నీ తీసేసిన తర్వాత కూడా ప్రతి నెల సుమారు రూ.2.35 లక్షల లాభం మిగులుతోందని అంకిత్ పాండే తెలిపారు. అంటే ఏడాదికి దాదాపు రూ.28.5 లక్షల ఆదాయం వస్తోంది. ఇది ఆయన గతంలో కార్పొరేట్ ఉద్యోగంలో పొందిన వార్షిక జీతం కంటే రెండింతలకు పైగానే ఉంది.
My friend quit his ₹11 LPA 9-to-5 job in Bengaluru.
Now he earns nearly ₹28 lakh a year from his home.
Instead of chasing promotions, he went back home and started a simple water purification business.
He installed a water purification plant on his own property and connected… pic.twitter.com/uY3mfTd0d3— Ankit Pandey (@iamankitpande) August 3, 2026
ఈ కథను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అంకిత్ పాండే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. విజయమంటే పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయడమే కాదు. ప్రజలకు ప్రతిరోజూ అవసరమయ్యే సమస్యకు పరిష్కారం చూపే వ్యాపారం కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని అన్నారు. చివరగా ఎవరైనా.. ''రూ.11 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఇలాంటి వ్యాపారం చేస్తారా?'' అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.
ఈ పోస్టుపై చాలామంది స్పందించారు. ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నందున, స్వచ్ఛమైన తాగునీటికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఈ కథ ఒక మంచి సందేశాన్ని ఇస్తోందని అన్నారు. ఉద్యోగ హోదా కంటే, ప్రజలకు అవసరమైన సేవను అందించే వ్యాపారం స్థిరమైన ఆదాయాన్ని అందించగలదని పేర్కొన్నారు.


