టోక్యో: హిరోషిమా అణుబాంబు దాడిపై తాజాగా శాస్త్రవేత్తలు సంచలన నిజాలు వెల్లడించారు. 1945 ఆగస్టు 6న జపాన్లోని హిరోషిమాపై అమెరికా జరిపిన అణుబాంబు దాడి ప్రపంచ చరిత్రను మార్చివేయడమే కాకుండా, భూమిపై ఎన్నడూ లేని ఒక సరికొత్త పదార్థం తయారీకి కారణమైంది. దాదాపు 81 ఏళ్ల తర్వాత, శాస్త్రవేత్తలు హిరోషిమా బే (సముద్రతీర) ఇసుకలో లభించిన 'హిరోషిమైట్' (Hiroshimaite) అనే అవశేషాల నుంచి ఒక విచిత్రమైన పదార్థాన్ని కనుగొన్నారు. ఈ మేరకు ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్లో తాజా అధ్యయనం ప్రచురితమైంది.
అణు విస్ఫోటనం సెకన్ల వ్యవధిలో ఉష్ణోగ్రతను ఏకంగా 7,000 డిగ్రీల సెల్సియస్కు పెంచింది. ఈ తీవ్రమైన వేడి కారణంగా భవనాలు, లోహాలు, మట్టి, గాజు, నీరు వంటివి ఆవిరై ఒక భారీ అగ్నిగోళం (Fireball) ఏర్పడింది. ఈ అగ్నిగోళం వేగంగా చల్లబడి సూక్ష్మమైన బిందువులుగా (Microscopic droplets) మారి భూమిపై పేరుకుపోయాయి. వీటిలో ప్రధానంగా కాల్షియం, అల్యూమినియం, సిలికాన్ మిశ్రమంతో కూడిన గాజు పదార్థాలు ఉన్నాయి.
అయితే ఈ తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య సాధారణ పరిస్థితుల్లో ఏర్పడని సరికొత్త మిశ్రమాలు ఉద్భవించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇసుకలో సహజంగా ఉన్న లోహాలు కరిగి, ఇనుము-క్రోమియం, నికెల్, మాంగనీస్, మాలిబ్డినం వంటి విభిన్న నిష్పత్తులతో కూడిన సూక్ష్మ లోహ మిశ్రమాలు తయారయ్యాయి. వీటిలో ఒక చిన్న రేణువులో సాధారణ ప్రాంతాల కంటే అత్యధికంగా సిలికాన్ ఉన్నట్లు తేలింది. ఇందులో 63 శాతం ఇనుము, 15 శాతం క్రోమియం, 9 శాతం నికెల్, 7 శాతం సిలికాన్ ఉన్నాయి. అత్యంత విపరీతమైన ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలు ఏ విధంగా స్పందిస్తాయో ఈ సంచలన ఆవిష్కరణ నిరూపించింది.
ఇది కూడా చదవండి: కోవిడ్-19 పుట్టుకపై సంచలన నిజాలు వెల్లడి!


