‘మీకు బోలెడు లాభాలొచ్చాయ్‌’ | Lower Prices Now Trump Slams Big Oil Excess Profits as Crude Drops | Sakshi
Sakshi News home page

‘మీకు బోలెడు లాభాలొచ్చాయ్‌’

Aug 4 2026 8:31 AM | Updated on Aug 4 2026 8:31 AM

Lower Prices Now Trump Slams Big Oil Excess Profits as Crude Drops

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ పెట్రోల్ బంకుల్లో సామాన్య వినియోగదారులకు ధరల ఉపశమనం లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రధాన చమురు కంపెనీలు అనైతికంగా విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నాయని ఆరోపిస్తూ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తక్షణమే తగ్గించాలని ఆదేశించారు. ‘చమురు దిగ్గజాలు అధిక లాభాలు గడిస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధన ధరలను వెంటనే తగ్గించండి’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు.

ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అడ్డంకుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగి ఎక్సన్ మొబిల్, షెవ్రాన్ వంటి అమెరికన్ చమురు సంస్థలు గత త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. అయితే, మిలిటరీ చర్యలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 83 డాలర్ల స్థాయికి పడిపోయాయి. ముడిచమురు ధరలు పడిపోయినా రిటైల్ మార్కెట్లో పెట్రోల్ ధరలను తగ్గించకుండా కంపెనీలు లాభపడటంపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈక్రమంలో షెవ్రాన్ సీఈఓ మైక్ విర్త్‌ను ట్రంప్ నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. తమ ప్రభుత్వ వ్యూహాత్మక విధానాలు, మద్దతు వల్లే వెనిజువెలా వంటి ప్రాంతాల్లో షెవ్రాన్ తిరిగి బలమైన స్థానానికి చేరుకుని భారీగా ఆర్జిస్తోందని, కానీ ఆ క్రెడిట్‌ను యాజమాన్యం గుర్తించడం లేదని విమర్శించారు. ‘ప్రభుత్వ పరిపాలన అందించిన మద్దతు, స్థిరత్వం లేకపోతే అమెరికా చమురు పరిశ్రమ దెబ్బతినేది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కంపెనీలు ఆ ప్రయోజనాన్ని ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు అందించాల్సిందే’ అని స్పష్టం చేశారు.

అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద సవాలుగా మారాయి. దీంతో ఓటర్ల అసంతృప్తిని చల్లార్చేందుకు ట్రంప్ ఇంధన దిగ్గజాలపై ఒత్తిడి పెంచుతున్నారు. చమురు కంపెనీలు వెంటనే స్వీయ నియంత్రణ పాటించి బంకుల్లో ధరలు తగ్గించకపోతే ధరల పెంపుపై జస్టిస్ డిపార్ట్‌మెంట్ ద్వారా విచారణ జరిపించేందుకు సైతం వైట్‌హౌస్ వెనుకాడకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement