యుద్ధానికి బ్రేక్‌.. ఇరాన్‌ కీలక ప్రకటన | Trump Iran Deal Move: Secret Hormuz Talks For Middle East Future | Sakshi
Sakshi News home page

యుద్ధానికి బ్రేక్‌.. ఇరాన్‌ కీలక ప్రకటన

Aug 3 2026 6:49 AM | Updated on Aug 3 2026 7:00 AM

Trump Iran Deal Move: Secret Hormuz Talks For Middle East Future

అమెరికా-ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన వాతావరణం ఒక్కసారిగా చర్చల వైపు మళ్లింది. ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇప్పుడు దౌత్య మార్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన ట్రంప్‌.. సోమవారం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు కొంత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇరాన్‌ కీలక మౌలిక వసతులపై భారీ దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. చివరి దశలో వాటిని నిలిపివేసినట్లు ట్రంప్‌ తెలిపారు. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఖతార్‌ వంటి గల్ఫ్‌ దేశాలు యుద్ధాన్ని విస్తరించకుండా దౌత్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ట్రంప్‌ చెప్పారు.

ఇరాన్‌పై తాను చేపట్టబోయిన సైనిక చర్య సాధారణ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఆ దాడి జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచేదని వ్యాఖ్యానించారు. “నేను ప్రజలను చంపాలని కోరుకోవడం లేదు. యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే భారీ విధ్వంసం జరిగేది.. తిరిగి నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది” అని ట్రంప్‌ పేర్కొన్నారు.

అందుకే యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే ప్రాణనష్టం, విధ్వంసం రెండింటినీ నివారించవచ్చని తెలిపారు.

ఇరాన్‌తో ఒక ఒప్పందం దగ్గరలోనే ఉంది” అని ట్రంప్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ ఒప్పందంలో ఏ అంశాలపై రాజీ కుదరబోతోందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు
మరోవైపు ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియన్‌ కూడా అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. అమెరికా తన హామీలను గౌరవించాలి.. పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలి అనే సంకేతాలను పెజెష్కియన్‌ ఇచ్చారు.

జూన్‌లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందమే భవిష్యత్‌లో ఇరాన్‌ విదేశాంగ విధానానికి కీలక ఆధారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇరాన్‌ తన ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోదని కూడా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

టెహ్రాన్‌కు దౌత్య బృందాలు!
అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలకు మార్గం సుగమం చేసేందుకు మధ్యవర్తి దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత.. టెహ్రాన్‌లో పరోక్ష చర్చలకు వేదిక సిద్ధమవుతోందని సమాచారం. అమెరికా, ఇరాన్‌ మధ్య నేరుగా చర్చలు కాకుండా.. ఒమన్‌, ఖతార్‌ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది.

ఇప్పటికే ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ.. సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ తదితర దేశాలతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ దేశాల సహకారంతో యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, హార్ముజ్‌ జలసంధి విషయంలో ఒక అవగాహనకు రావడమే లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి.

హర్ముజ్‌ జలసంధిపై అసలు పోరు
అమెరికా-ఇరాన్‌ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్‌ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందుకే ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ.. ఒమన్‌తో హార్ముజ్‌ నిర్వహణపై జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అయితే ఇవి అమెరికాతో నేరుగా జరుగుతున్న చర్చలు కావని ఇరాన్‌ స్పష్టం చేసింది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు హర్ముజ్‌ను పూర్తిగా తీసుకెళ్లడం సాధ్యం కాదని కూడా సంకేతాలు ఇచ్చింది.

హర్ముజ్‌ కోసం తెర వెనుక డీల్‌!
హర్ముజ్‌ జలసంధి విషయంలో కొత్త విధానం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు పర్యవేక్షిస్తారు? నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి? వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ఒమన్‌ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలోనూ అమెరికా-ఇరాన్‌ మధ్య రహస్య దౌత్య చర్చలకు ఒమన్‌ వేదికగా నిలిచింది.

ఇరాన్‌ వ్యూహం.. చర్చలు కూడా, ఒత్తిడి కూడా
ఇరాన్‌ ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే.. మరోవైపు తన వ్యూహాత్మక బలాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ.. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌, పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ తదితరులతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై చర్చించినట్లు ఇరాన్‌ వెల్లడించింది. అయితే హార్ముజ్‌పై తన ప్రభావాన్ని మాత్రం కొనసాగించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.

అణు అంశమే అసలు పరీక్ష!
అమెరికా-ఇరాన్‌ మధ్య జరిగే ఏ ఒప్పందానికైనా అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్‌ అణు సామర్థ్యాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ రెండు అంశాలపై రాజీ కుదిరితేనే చర్చలు విజయవంతమయ్యే అవకాశం ఉంది.

ట్రంప్‌ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి
యుద్ధ భయాల మధ్య పెరిగిన చమురు ధరలు ట్రంప్‌ తాజా ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 4 డాలర్లకు పైగా పడిపోయింది. అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు తగ్గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి.

ఎర్రసముద్రంలో ఉత్కంఠ!
మరోవైపు సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన రెండు చమురు నౌకలు బాబ్‌ అల్‌ మందెబ్‌ జలసంధిని దాటాయి. హౌతీల హెచ్చరికల మధ్య కూడా చమురు రవాణా కొనసాగుతుండటం గమనార్హం. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు తమ ఆటోమేటిక్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలను నిలిపివేసినట్లు సమాచారం.

ఇజ్రాయెల్‌ చూపు చర్చలపైనే
అమెరికా-ఇరాన్‌ చర్చలను ఇజ్రాయెల్‌ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఎలాంటి రాజీ వచ్చినా అది తమ భద్రతకు ముప్పుగా భావించే ఇజ్రాయెల్‌.. గతంలో ఇరాన్‌పై కఠిన వైఖరి ప్రదర్శించింది. అందుకే ఈ చర్చలు కేవలం వాషింగ్టన్‌, టెహ్రాన్‌ మధ్య వ్యవహారం కాకుండా మొత్తం పశ్చిమాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారాయి.

యుద్ధానికి ముగింపా? లేదంటే.. 
అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలకు మార్గం సుగమమైనప్పటికీ.. పూర్తి ఒప్పందం ఇంకా దూరంలోనే ఉంది. హర్ముజ్‌ నియంత్రణ, అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపు, భద్రతా హామీలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. యుద్ధం అంచుల నుంచి చర్చల బల్లపైకి వచ్చిన అమెరికా-ఇరాన్‌ సంబంధాలు.. నిజంగా శాంతి దిశగా అడుగులు వేస్తాయా? లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామమేనా? అన్నది రాబోయే చర్చలే తేల్చనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement