600 నివాసాలు బుగ్గి
ఎమర్జెన్సీ ప్రకటించిన గవర్నర్
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని పశ్చిమాన కార్చిచ్చు వ్యాపిస్తోంది. నివాసాలు, వ్యాపార సంస్థలు, ఇతర నిర్మాణాలు కలిపి మొత్తంగా 600 వరకు భవనాలు బుగ్గిపాలైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు. నీటిశుద్ధి కేంద్రం, ఇంధన ప్లాంట్, సైనిక ఆస్పత్రి సహా మరో 5,000 నివాసాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాషింగ్టన్లోని రెండో అతిపెద్ద నగరం స్పొకానె చుట్టుపక్కలున్న సుమారు 2,50,000 ఎకరాల్లోని ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేసింది.
60,000 మంది వినియోగదారులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మరణాలు సంభవించలేదు. కాలిఫోర్నియా నుంచి రప్పించిన ఫెడరల్ బలగాలు, రాష్ట్ర, స్థానిక విభాగాల్లోని 4,000 మంది సిబ్బంది కార్చిచ్చును అదుపు చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు ఈదురు గాలులు తోడవ్వడంతో మంటల వ్యాప్తిని అడ్డుకోవడం కష్టంగా మారింది.
స్పొకానెలోని ఓల్డ్ ట్రయిల్స్, ఫెయిర్వ్యూ, మెడోవ్యూల్లో వేర్వేరుగా కార్చిచ్చు మొదలైందని, ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గుసన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ వేసవిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,50,000 ఎకరాల్లో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందని ఆయన తెలిపారు.


