72 కిలోమీటర్ల వరకు దాడికి అవకాశం
న్యూఢిల్లీ: భారత్తో సరిహద్దుల వెంబడి తమ సైనిక కార్యకలాపాలను పాకిస్తాన్ ఉధృతం చేస్తోంది. ఫిరంగి సామర్థ్యాలను గణనీయంగా పెంచుతోంది. ఇందులో భాగంగా చైనాలో తయారైన 250 ఎస్హెచ్–15 ట్రక్–మౌంటెడ్ సెల్ఫ్–ప్రొపెల్డ్ హోవిట్జర్ ఫిరంగులను మోహరించిందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్ సైన్యం భారత్తో ఉన్న తన తూర్పు సరిహద్దు వెంబడి ఉత్తరం నుండి దక్షిణం వరకు కీలక ప్రాంతాల్లో 155 ఎంఎం ఫిరంగి వ్యవస్థలను మోహరించడం ప్రారంభించింది. ఇటీవలి కాలంలో ఇస్లామాబాద్ చేపట్టిన అత్యంత ముఖ్యమైన ఫిరంగి దళాల మోహరింపు కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి.
పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యంచేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత తన సాయుధ దళాలను ఆధునీకరించే ప్రయత్నాలను పాకిస్తాన్ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే చైనా నుంచి అత్యాధునిక శతఘ్నులను సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ ‘నోరింకో’ ఈ ఫిరంగులను ఉత్పత్తి చేస్తోంది. వీటిని సరిహద్దుల్లో మోహరించడం ద్వారా భారత భూభాగంలో 72 కిలోమీటర్ల దూరం వరకు దాడి చేసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పాకిస్తాన్, చైనా మధ్య రక్షణ బంధం నానాటికీ బలపడుతోంది. పాకిస్తాన్కు చైనా పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేస్తోంది.


