వాషింగ్టన్: ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు మరోసారి అవకాశం కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న.. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐలు తమవంతు సహకారం అందించాలని మాజీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమెరికా బాల్టిమోర్లో జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) జాతీయ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభల్లో ప పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత రెండు రోజులుగా ఉత్తర అమెరికా నలుమూలల నుంచి వచ్చిన తెలుగు సోదరులు, సోదరీమణులు, ప్రముఖులు, వృత్తి నిపుణులు, శ్రేయోభిలాషులతో కలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించే అవకాశం లభించింది. వారందరు దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం, మానవత్వం, ప్రజాకేంద్రిత పాలన గురించి తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది.అన్నారు.

అనంతరం తన ప్రసంగంలో డా. వై.ఎస్.ఆర్ ఆశయాలను, విలువలను వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆయన నిబద్ధత, పారదర్శక.. పాలన, పేదల పట్ల ఉన్న అంకితభావం గురించి వారందరికీ వివరించానని తెలిపారు. ఈ సందర్భంగా ATA ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాయకత్వానికి, నిర్వాహకులకు, విశిష్ట అతిథులకు సభకు హాజరైన తెలుగు సమాజానికి వైఎస్సార్సీపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ హెల్త్ హాస్పిటల్స్ ఛైర్మన్ డా. ప్రేమ్ సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


