breaking news
peace talks
-
పుతిన్-మోదీ భేటీ వేళ.. జెలెన్స్కీకి ఫోన్కాల్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ వేదికగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ భేటీ కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ శాంతి చర్చల అంశంపై ఈ ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.కీవ్పై మాస్కో దాడుల ఉధృతమైన నేపథ్యంలో.. తాజా పరిస్థితులు, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సమావేశ వివరాలను జెలెన్స్కీ మోదీకి వివరించారు. అలాగే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సమావేశానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు.‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన చర్చలో యుద్ధ పరిస్థితి, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్ శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని భారత ప్రధాని, జెలెన్స్కీతో ఫోన్కాల్ సారాంశాన్ని వెల్లడించారు. మరోవైపు.. జెలెన్స్కీ కూడా సంభాషణను ఉపయోగకరమైన, ముఖ్యమైన చర్చగా అభివర్ణించారు. అలస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం జరిగినప్పటి నుంచి.. రష్యా నుంచి శాంతి సంకేతాలు రాలేదని, రష్యా ఇటీవల తమ పౌరులపై దాడులు ఉధృతం చేస్తోందని, అసలు పుతిన్ శాంతి చర్చలకు సిద్ధంగా లేడని జెలెన్స్కీ అంటున్నారు. ఈ యుద్ధం ముగియాలంటే వెంటనే కాల్పుల విరమణ అమలు కావాలని అని జెలెన్స్కీ మోదీతో చెప్పినట్లు తెలుస్తోంది. -
కాస్త తగ్గిన పుతిన్? ట్రంప్, జెలెన్స్కీ ‘నో’ కామెంట్స్
నాలుగేళ్ల తర్వాత అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగానే ఈ సమావేశం జరిగిందన్నది తెలిసిందే. అయితే ఆ మీటింగ్ సారాంశమేమీ ఇప్పటిదాకా బయటకు రాలేదు.ఆగస్టు 15వ తేదీన మూడు గంటలపాటు రహస్య మంతనాలు చేసిన ఈ ఇరుదేశాల నేతలు.. సంయుక్త మీడియా సమావేశంలో తాము చెప్పాలనున్నది చెప్పి తలోదారి వెళ్లిపోయారు. దీంతో భేటీ సంతృప్తికరంగా జరగలేదనే విశ్లేషణలు నడిచాయి. అయితే తాజాగా ఆ భేటీలో ఉక్రెయిన్కు పుతిన్ చేస్తున్న(అలస్కాలో చేసిన) డిమాండ్లు ఏంటో ప్రస్తావిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్ష కార్యాలయం ‘క్రెమ్లిన్’ వర్గాలు వెల్లడించిన ఆ డిమాండ్లను పరిశీలిస్తే..డోన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా అప్పగించడంనాటోలో చేరాలనే ఆలోచనను పక్కనపెట్టేయడంపశ్చిమ బలగాల మోహరింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదుఉక్రెయిన్పై ఒత్తిడి తగ్గించిన పుతిన్?వాస్తవానికి ఈ మూడు పాత డిమాండ్లే! మరి కొత్తగా పుతిన్ ఏం చెబుతున్నారంటే.. 2024 జూన్లో ఉక్రెయిన్కు పెట్టిన కఠినమైన భూభాగాల డిమాండ్లను కొంత మేర తగ్గించినట్టు రష్యా వర్గాలు అంటున్నాయి. పాత డిమాండ్లను పరిశీలిస్తే.. డోనెత్స్క్(Donetsk), లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను పూర్తిగా రష్యాకు అప్పగించాలి. నాటో సభ్యత్వాన్ని త్యజించాలి. పశ్చిమ దేశాల బలగాలు ఉక్రెయిన్లో మోహరించకూడదు.కొత్త ప్రతిపాదనల్లో.. ఉక్రెయిన్ డోన్బాస్లో తన నియంత్రణలో ఉన్న భాగాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గాలి. రష్యా జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాల్లో ప్రస్తుత యుద్ధ రేఖలను నిలిపివేస్తుంది. ఖార్కివ్, సుమీ, డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించిన చిన్న భాగాలను తిరిగి అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం.. డోన్బాస్లో 88%, జపోరిజ్జియా, ఖెర్సన్లో 73% రష్యా నియంత్రణలో ఉంది.అయితే.. నాటో విస్తరణపై నిషేధం, ఉక్రెయిన్ సైన్యంపై పరిమితులు, పశ్చిమ శాంతి బలగాల మోహరింపు నిషేధం వంటి పాత డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి. అదే సమయంలో.. 2022 ఇస్తాంబుల్ ఒప్పందాలను పునరుద్ధరించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. ఇందులో ఐరాస భద్రతా మండలి నుంచి ఉక్రెయిన్కు భద్రతా హామీలు పొందే ప్రతిపాదన ఉంది.ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. గతంలో ఈ డిమాండ్లను "సరెండర్" (లొంగిపోవడం)గా అభివర్ణించిన తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, రష్యా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వెనక్కి తగ్గే ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు.డోనెత్స్క్, లుహాన్స్క్(Donetsk) కలిపిన డోన్బాస్ ప్రాంతం ఉక్రెయిన్కు రక్షణ కోటగా పనిచేస్తుందని జెలెన్స్కీ మొదటి నుంచి చెబుతున్నారు. ‘‘తూర్పు ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం అంటే దేశం ఉనికి కోల్పోవడం’’ అని అంటున్నారాయాన. ‘‘ఇది మా శక్తివంతమైన రక్షణ రేఖల అంశం’’ అని కుండబద్దలు కొట్టారు. ఇక.. నాటో సభ్యత్వం.. రాజ్యాంగబద్ధ లక్ష్యమని చెప్పారు. పైగా దీనిని ఉక్రెయిన్కు భద్రతా హామీగా భావిస్తున్నారు. నాటో సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు రష్యాకు లేదు అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్, నాటో రష్యా కొత్త ప్రతిపాదనలపై ఇప్పటివరకైతే స్పందించలేదు.అలాస్కాలోని అంకరేజ్ నగరంలో జరిగిన అమెరికా-రష్యా అధ్యక్షులు భేటీ తర్వాత శాంతికి ఉత్తమ అవకాశాలు ఏర్పడినట్టు క్రెమ్లిన్ వర్గాలు అంటున్నాయి. అయితే.. డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం రాజకీయంగా, వ్యూహపరంగా అసాధ్యమైన విషయని పరిశీలకులు అంటున్నారు. రెండు పక్షాలకు అంగీకారయోగ్యంగా లేని షరతులతో శాంతి ప్రతిపాదనలు చేయడం.. ట్రంప్కు షో మాత్రమే కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.అస్పష్టతలు & అడ్డంకులుఉక్రెయిన్ డోన్బాస్ను అప్పగించేందుకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై రష్యాకు స్పష్టత లేదు.అమెరికా రష్యా ఆక్రమించిన భూభాగాలను గుర్తిస్తుందా? అనే ప్రశ్న కూడా ఇంకా పరిష్కారమవ్వలేదు.జెలెన్స్కీ అధికార బాధ్యతపై పుతిన్ సందేహాలు వ్యక్తం చేశారు, కానీ కీవ్ ఆయనను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా పేర్కొంటోంది.ట్రంప్ పాత్రఉక్రెయిన్ యుద్ధం ముగించి.. తానొక శాంతి కాముకుడిననే విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పుతిన్, జెలెన్స్కీలతో విడిగా భేటీ అయిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. -
ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అనంతరం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ ఇరువురు సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోందంటూ పేర్కొన్నారు. సుమారు నాలుగేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించిన ఆయన.. దీర్ఘకాలికశాంతి కోసం ప్రయత్నిస్తామన్నారు.‘‘ వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడిరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాండెర్లెయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన చర్చలు అద్భుతంగా ముగిశాయి. వాషింగ్టన్ సమన్వయంతో యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు భద్రతా హామీలు అందించాలనే దానిపైనే చర్చలు ప్రధానంగా సాగాయి. రష్యా, ఉక్రెయిన్లతో శాంతి నెలకొనబోతుందనే విషయంపై నేతలందరూ సంతోషం వ్యక్తం చేశారు. చర్చల ముగింపులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేను ఫోన్ కాల్లో మాట్లాడాను. జెలెన్స్కీ, పుతిన్ మధ్య భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వీరి భేటీ ఎక్కడ జరగాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి నేను భేటీ అవుతాను. సుమారు నాలుగేళ్ల యుద్ధం ముగించేందుకు ఇదొక మంచి ముందడుగు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య సమావేశం జరగనుంది’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే భేటీ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనేదానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. వైట్హౌజ్లో ట్రంప్-జెలెన్స్కీ, ఈయూ నేతల భేటీపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.అంతకు ముందు.. భేటీ ముగిశాక ట్రంప్తో జరిగిన చర్చలపై జెలెన్స్కీ సంతోషం వ్యక్తం చేశారు. చాలా నిర్మాణాత్మకంగా భేటీ జరిగిందని.. భద్రతా హామీలతో సహా పలు సున్నిత విషయాలపై మాట్లాడినట్లు తెలిపారు. త్రైపాక్షిక భేటీకి తాము సిద్ధమేనంటూ పేర్కొన్నారాయన. అదే సమయంలో జెలెన్స్కీతో పాటు వచ్చిన యూరోపియన్ నేతలు ట్రంప్తో చాలా కీలక విషయాలపై చర్చించారు. ఎవరేమన్నారంటే.. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం, సెక్యూరిటీ గ్యారంటీలు చర్రితలో నిలిచిపోయే కీలక ముందడుగుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు. రష్యాతో సమావేశానికి ముందే కాల్పుల విరమణ జరగాలని జర్మన్ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పునేందుకు రష్యాపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ.. ట్రంప్ త్రైపాక్షిక సమావేశంపై చర్చించారని, అయితే దీన్ని విస్తృతం చేసి యురోపియన్ నేతను ఆ భేటీకి అనుమతించాలని ప్రతిపాదించారు. ఇది యూరప్ మొత్తానికి సంబంధించిన విస్తృత భద్రతా హామీలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ ఈ వివాదం మళ్లీ తలెత్తకుండా ఎలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు. శాంతి ఒప్పందానికి ఇది ముందస్తు షరతు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసే దాడులను అడ్డుకోవాలని అందుకు మిత్రపక్షాలు కలిసిరావాలని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె పేర్కొన్నారు.ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల నేతల ప్రకటనలతో.. ఆ చర్చల్లో అంతగా పురోగతి కనిపించలేదన్న విమర్శ వినిపించింది. పైగా అలస్కా భేటీలో పుతిన్ పెట్టిన భూభాగాల మార్పిడి షరతును జెలెన్స్కీ వ్యతిరేకించడంతో.. వైట్హౌజ్ చర్చలూ విఫలం కావొచ్చని అంతా భావించారు. అదే సమయంలో.. ఈ ఏడాదిలోనే వైట్హౌజ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు జెలెన్స్కీ విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో అంచనాలకు భిన్నంగా తాజా భేటీ ప్రశాంత వాతావరణంలో.. అదీ యూరోపియన్ నేతల సమక్షంలో జరగడం గమనార్హం. -
కొన్ని మారవు! యుద్ధం ఆపడం ఇక..: ట్రంప్
పుతిన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీతో ఉక్రెయిన్ శాంతి చర్చలు జరపబోతున్నారు. అయితే దానికంటే కొన్ని గంటల ముందు ఆయనో కీలక ప్రకటన చేశారు. జెలన్స్కీ కాస్త తగ్గి.. కాంప్రమైజ్ కావాలన్న రీతిలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారాయన. రష్యా నుంచి క్రిమియాను తిరిగి పొందడం, ఉక్రెయిన్ నాటోలో చేరడం ఈ రెండూ అసాధ్యమేనని ట్రంప్ ఆ పోస్టులో స్పష్టం చేశారు. ‘‘తలుచుకుంటే జెలెన్స్కీ వెంటనే రష్యాతో యుద్ధాన్ని ముగించవచ్చు. లేదంటే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. 12 ఏళ్ల కిందట ఒక్క తూటా పేలకుండానే ఒబామా క్రిమియా భూభాగాన్ని రష్యాకు అప్పజెప్పారు. అలాగే నాటోలోనూ ఉక్రెయిన్ చేరడం వీలుకాదు. కొన్ని ఎన్నటికీ మారవు అనే విషయాన్ని గుర్తించాలి’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలస్కా వేదికగా ట్రంప్ మూడు రోజుల కిందట అలస్కాలో భేటీ అయ్యారు. అయితే కాల్పుల విరమణ విషయంలో పుతిన్ అస్సలు తగ్గలేదని తెలుస్తోంది. యుద్ధవిరామం గురించి కాకుండా.. భూభాగాల మార్పిడిపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. పుతిన్ ప్రతిపాదన ప్రకారం.. క్రిమియాపై సర్వాధికారాలు రష్యావే. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు అనే షరతులు ఉన్నాయి. అయితే జెలెన్స్కీ మాత్రం రక్షణపరంగా కీలక ప్రాంతాలైన తూర్పు భూభాగాల ఉపసంహరణను తిరస్కరిస్తూనే శాంతి చర్చలకు సిద్ధమయ్యారు. అలస్కా సమావేశం తర్వాత.. ట్రంప్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతోనూ ఫోన్లలో మాట్లాడారు. పుతిన్తో జరిగిన చర్చల సారాంశాన్ని వాళ్లను చేరవేశారాయన. అంతేకాదు.. శాంతి చర్చల్లో పురోగతి కనిపించిందని కూడా ప్రకటించారు. వైట్హౌజ్లోని తన ఓవెల్ ఆఫీస్లోనే జెలెన్స్కీతో ట్రంప్ సోమవారం భేటీ కాబోతున్నారు. జెలెన్స్కీ గతంలో అమెరికాకు ఒంటరిగా వెళ్లి.. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేత లైవ్లో తిట్లు తిన్నారు. ఈ క్రమంలో.. ఈసారి జెలెన్స్కీతో పాటు బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే తదితరులు వాషింగ్లన్ వెళ్తారని సమాచారం. ఉక్రెయిన్ భద్రతా హామీలతో పాటు రష్యాపై ఆంక్షలు కొనసాగించాలని వీళ్లంతా ట్రంప్ను ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తోంది. బెదిరింపుల నుంచి బతిమాలేదాకా.. రష్యాపై ఆంక్షలు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై నేరుగా విమర్శలు.. ఉక్రెయిన్ యుద్ధం ఆపే క్రమంలో ట్రంప్ మొదటి నుంచి చేసుకొస్తోంది ఇదే. బెదిరింపులతోనే ఇరు దేశాధినేతలను దారికి తేవాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే అవేవీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ట్రంప్ సహనం కట్టలు తెంచుకున్నా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేకపోయింది. ఈ క్రమంలో అలస్కా భేటీ తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. పుతిన్ టఫ్గాయ్.. ఇక అంతా జెలెన్స్కీ చేతుల్లోనే ఉందంటూ వ్యాఖ్యానించారాయన. అయితే యూరోపియన్ దేశాల ప్రొత్సహంతో జెలెన్స్కీ కూడా ఈ విషయంలో అస్సలు తగ్గడం లేదు. దీంతో ట్రంప్ బతిమాలింపు దిశగా ప్రయత్నాలు చేయబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత.. త్రైపాక్షికం?పుతిన్, జెలెన్స్కీలతో కలిసి ట్రంప్ త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. గ్జిన్హువా మీడియా సంస్థతో జర్మన్ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ మాట్లాడుతూ.. ఆగస్టు 22వ తేదీన ఈ భేటీ ఉండనుందని, జెలెన్స్కీ-ట్రంప్ భేటీ తర్వాత దీనిపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. అయితే రష్యా, ఉక్రెయిన్ ఈ ప్రకటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. బదులుగా యుద్ధ విరామంతో పాటు ఉక్రెయిన్కు భద్రతా హామీలు దక్కుతాయి. -
ఇవే ప్రశ్నలు వీళ్లిద్దరినీ కాకుండా.. ఆయన్ని అడిగే దమ్ముందా?
ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది. శాంతి చర్చల్లో ముందడుగు పడకపోతే కఠినంగా వ్యవహరిస్తానంటూ రష్యాపై రంకెలు వేసిన ట్రంప్.. అలస్కా చర్చల తర్వాత కాస్త మెత్తబడ్డాడు. ఉక్రెయిన్ శాంతి చర్చలు అర్ధరహితంగా ముగిసినట్లు వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో.. ట్రంప్ ఇంకా అలస్కాలో ఉండగానే పుతిన్ అక్కడి నుంచి నిష్క్రమించడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే..అలస్కాలో జర్నలిస్టులు సంధించిన ప్రశ్నలను ఇరు దేశాల అధినేతలు స్వీకరించలేదు. తాము చెప్పాలనుకున్నది చెప్పి.. తలోదారి వెళ్లిపోయారు. యాంకరేజ్ విమానాశ్రయంలో, అలాగే చర్చలు ప్రారంభం కావడానికి ముందు పీస్ రూమ్లోనూ ఇరు దేశాధినేతలు మీడియా ముందు ఆసీనులయ్యారు. ఆ సమయంలో ఉక్రెయిన్ కాల్పుల విరమణ, యుద్ధంలో సాధారణ పౌరులు మరణించడం లాంటి ప్రశ్నలు పుతిన్కు ఎదురయ్యాయి. ‘‘సాధారణ పౌరుల్ని చంపడం ఇంకెప్పుడు ఆపుతారు?’’ అంటూ ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. దానికి పుతిన్ తనకేమీ వినబడడం లేదన్నట్లు సైగ చేసి చూపించారు. అదే సమయంలో ‘‘ట్రంప్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్ముతున్నారు?’’ అని మరో విలేఖరి ప్రశ్నించగా.. జర్నలిస్టుల గోలతో పుతిన్ ఇచ్చిన వివరణ వినిపించనట్లే కనిపించింది. పుతిన్పై అంతర్జాతీయ నేరస్థుల కోర్టు కేసు ఉన్నప్పటికీ.. అమెరికా భూభాగంలోకి ఎందుకు ఆహ్వానించారు?. ఉక్రెయిన్ను నేరుగా భాగం కానీయకుండా కాల్పులవిరమణ డీల్ కుదర్చాలని ట్రంప్ భావిస్తున్నారా?. పుతిన్ ఎలాంటి రాయితీలు ఇవ్వవచ్చు? ట్రంప్ ఏమి అంగీకరించవచ్చు? ఇది యుద్ధ విరామానికి దారి తీస్తుందా? లేదంటే రాజకీయ నాటకం మాత్రమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. అయితే వీటిలో వేటికి సమాధానాలు రాలేదు. దీంతో.. సోషల్ మీడియా సదరు జర్నలిస్టుల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఇవే ప్రశ్నలను గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహును అడిగే దమ్ముందా? అని నిలదీస్తోంది. ‘‘2023 అక్టోబర్ 7వ తేదీన గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటిదాకా 60 వేలమందికిపైనే మరణించారు. అందులో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు గణాంకాలతో సహా చెబుతున్నాయి. అయితే ఈ మరణాలపై నెతన్యాహు ఏనాడూ స్పందించగా పోగా.. కనీసం విచారం కూడా వ్యక్తం చేసింది లేదు. పైగా ఎంతసేపు హమాస్ అంతమే శాంతికి మార్గం అంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి తోడు మానవతా సాయం అందకుండా చేశారనే ఆరోపణలు ఆయపై ఉన్నాయి. ఈ క్రమంలో యుద్ధ నేరాల కింద అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహుపై వారెంట్ సైతం జారీ చేసింది.ఈ పరిణామాలపై ఇటు ఇజ్రాయెల్.. అటు అమెరికా జర్నలిస్టులెవరూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. మరోవైపు.. రెండుసార్లు నెతన్యాహు అమెరికా పర్యటనకు వచ్చారు. ఆ సమయంలోనూ జర్నలిస్టులెవరూ.. గాజా పౌరుల మరణాల గురించి ఎందుకు నిలదీయలేదు?’’ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో లక్షల మంది మరణించారు. మూడున్నరేళ్ల యుద్ధానికి పుల్స్టాప్ పెట్టే ఉద్దేశంలో పర్సూయింగ్ పీస్ పేరిట అలస్కా చర్చల్లో పాల్గొన్నారు. ట్రంప్-పుతిన్లు ఐదారుగంటలు అలస్కాలోనే గడపగా.. రెండున్నర గంటలపాటు చర్చలు జరిగాయి. అయితే.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు పట్టుబట్టగా.. అందుకు రష్యా అధినేత ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. Vladimir Putin’s reaction was nothing short of remarkable—reporters shouted, but his expression told its own story. pic.twitter.com/07vkASuJIc— Tarique Hussain (@Tarique18386095) August 15, 2025భేటీకి ముందు జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించని ఇరువురు నేతలు.. సంయుక్తంగా నిర్వహించిన ప్రెస్మీట్లోనూ మీడియా ప్రతినిధులను ప్రశ్నలకు అనుమతించలేదు. మరోవైపు.. అలస్కా చర్చల సారాంశం కోసం రష్యా అధికారుల బృందాన్ని పలువురు జర్నలిస్టులు కలిసే ప్రయత్నమూ విఫలమైంది. అదే సమయంలో.. ట్రంప్ తన అనుకూల రిపోర్టర్లతో పుతిన్పై ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేశారని, దాని నుంచి పుతిన్ భలేగా తప్పించుకున్నారనే వాదన నెట్టింట నడుస్తోంది... అలస్కాలో ట్రంప్ దౌత్యం విఫలమేనని కొన్ని అమెరికన్ మీడియా చానెల్స్ ప్రముఖంగా చర్చిస్తున్నాయి. కానీ, ట్రంప్ మాత్రం ఎంతో కొంత పురోగతి సాధించాం అని చెబుతుండడం గమనార్హం. ‘‘పుతిన్ చాలా టఫ్, స్ట్రాంగ్ ఫెల్లో. ఇక దారికి రావాల్సింది జెలెన్స్కీనే’ అన్నట్లు ఫ్యాక్స్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఇంకోవైపు.. అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీలో రష్యా అనుకూల ఏకపక్ష డీల్ కుదరనందుకు సంతోషమంటూ ఉక్రెయిన్ ఎద్దేవా ప్రకటన విడుదల చేసింది. -
ఇక రంగంలోకి ట్రంప్.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాడా?
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల భేటీ తేదీ, వేదిక ఖరారు అయ్యింది. ఆగస్టు 15వ తేదీన అలస్కాలో తాను పుతిన్తో భేటీ కాబోతున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు.నాకు, పుతిన్కు మధ్య భేటీ కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ సమావేశం వచ్చే శుక్రవారం ఆగస్టు 15వ తేదీన గ్రేట్ అలస్కా స్టేట్లో జరగోబోతోంది అని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారాయన. మరోవైపు.. క్రెమ్లిన్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. అయితే ఈ చర్చలతో ట్రంప్ ఏం సాధించబోతున్నారనే విశ్లేషణ ఇప్పటికే మొదలైంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి శాంతి చర్చలు పలు దఫాలుగా జరిగాయి. ఇస్తాంబుల్(టర్కీ)లో చర్చలు జరిగినా, తన రాయబారితో ట్రంప్ స్వయంగా ఇరు దేశాల మధ్య ట్రంప్ సంప్రదింపులు ఇప్పటివరకు శాంతి ఒప్పందం కుదరలేదు. అయితే ఈ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుగొనడం కోసం స్వయంగా ట్రంపే ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారని వైట్హౌజ్ అంటోంది. తద్వారా యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడనున్నాయని అంటోంది. భౌగోళికంగా తటస్థ ప్రాంతం కావడం వల్ల ఉక్రెయిన్ చర్చలకు అలస్కా ఎంపిక చేసినట్లు చెబుతోంది. కొసమెరుపు ఏంటంటే.. యుద్ధ రుణభారంతో కుంగిపోయిన పూర్వపు రష్యా సామ్రాజ్యపు అధినేత జార్ అలెగ్జాండర్-2 1867లో అలస్కాను అమెరికాకు 7.2 మిలియన్ డాలర్లకు అమ్మేశాడు. రష్యా డిమాండ్లు• క్రిమియా, డోనెత్స్క్, లుహాన్స్క్ వంటి ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని రష్యా కోరుతోంది.• నాటోలో చేరే ఉక్రెయిన్ ఆలోచనను విరమించుకోవాలని రష్యా పట్టుబడుతోంది.ఉక్రెయిన్ వైఖరి• భూభాగాలపై రాజీకి ఉక్రెయిన్ నిరాకరణ• అంతర్జాతీయ మద్దతుతో శాంతి చర్చలు కొనసాగించాలన్న పట్టుదలఇప్పటివరకు రష్యా కాల్పుల విరమణకు అంగీకరించింది లేదు. అమెరికా ప్రతినిధులు జెలెన్స్కీతో కూడిన త్రైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించినా, రష్యా ఇంకా స్పందించలేదు. మరోవైపు.. పుతిన్ శాంతి చర్చలు నాటకీయంగా మార్చేశారని జెలెన్స్కీ విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో.. తమ భాగస్వామ్యం లేకుండా శాంతి చర్చలు జరగడం సరికాదని అంటున్నారాయన. ఈ తరుణంలో.. మొన్నటిదాకా నియంతగా జెలెన్స్కీపై మండిపడ్డ ట్రంప్, ఇప్పుడు భేటీ కావడానికి సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. తాను ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ తీవ్రంగా భావిస్తున్నారు. జెలెన్స్కీని తన దగ్గరకు రప్పించుకున్నప్పటికీ.. విమర్శించి పంపించారే తప్ప చర్చల్లో పురోగతి సాధించలేకపోయారు. ఆపై అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ను ఇరు దేశాలకు పంపించి దౌత్యం నడిపించారు కూడా. ఈ క్రమంలో ఇటు రష్యా డిమాండ్లకు తలొగ్గాలని ఉక్రెయిన్కు సూచించడంతో పాటు చర్చల్లో ఉక్రెయిన్ను భాగం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.పుతిన్ స్పందనట్రంప్ ఉంటే అసలు ఈ యుద్ధం జరిగేదే కాదు ట్రంప్తో చర్చలకు సిద్ధంగా ఉన్నానుఅమెరికా, రష్యా ప్రశాంతంగా మాట్లాడుకోవాలిజెలెన్స్కీ అభిప్రాయంఅమెరికా నాయకత్వంపై ఆశ ఉంది రష్యా దాడులు ఆగకపోతే శాంతి సాధ్యం కాదుట్రంప్–పుతిన్ చర్చల్లో ఉక్రెయిన్ ఉండాల్సిందేపుతిన్, ట్రంప్ చివరిసారిగా 2018 ఫిన్లాండ్ రాజధాని హెల్సెంకీలో భేటీ అయ్యారు. అలాగే దాదాపు పదేళ్ల తర్వాత పుతిన్ అమెరికాకు రానున్నారు. శాంతి చర్చల్లో ఈ ఇద్దరి భేటీ కీలకం కానుంది. అలాగే ఈ సమావేశం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.తనను తాను శాంతికాముకుడిగా ప్రకటించుకున్న ట్రంప్.. ఇప్పటిదాకా పలు దేశాల మధ్య యుద్ధాలను ఆపానంటూ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ యుద్ధాన్ని కూడా ఆపేస్తాడా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఉక్రెయిన్ యుద్ధాన్ని తానే ఆపేస్తానంటూ మొదటి నుంచి ట్రంప్ చెబుతూ వస్తున్నారు. అయితే.. ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఆర్థిక ఒత్తిడి, రాయబార చర్చలు, వ్యక్తిగత సంబంధాలు ద్వారా యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. మూడు దేశాల మధ్య సహకారం, నమ్మకం, ప్రామాణిక చర్చలపైనే ఈ సంక్షోభం ముగియడం అనేది ఆధారపడి ఉంటుందన్నది విశ్లేషకుల మాట. -
అందుకు రెడీ అన్న పాక్.. భారత్ స్పందన కోసం ఎదురుచూపు
భారత్తో చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఆయా అంశాలపై చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధమంటూ పునరుద్ఘాటించారు. దీనిపై భారత్ తుది నిర్ణయం తీసుకోవాలన్న దార్.. ఆ దేశ అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు బంతి.. భారతదేశ కోర్టులో ఉందంటూ దార్ వ్యాఖ్యానించారు.వాణిజ్యం నుంచి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి వివిధ అంశాలపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘అర్థవంతమైన చర్చలు’ అవసరమంటూ ఆయన నొక్కి చెప్పారు. కాశ్మీర్, భద్రత, ఆర్థిక సంబంధాలతో సహా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి చర్చలు తిరిగి ప్రారంభించాలని దార్ పిలుపునిచ్చారు.కాగా, పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ కఠిన వైఖరి అవలంబించిన సంగతి తెలిసిందే. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు ఆ దేశంతో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను కట్ చేసింది. ఆపరేషన్ సిందూర్తో పాక్తో పాటు పీవోకేలో ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్ మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు మే 10వ తేదీన ఒక అంగీకారానికి రావడం తెలిసిందే. -
దౌత్య యుద్ధం దెబ్బకు దిగొచ్చిన పాక్!
టెహ్రాన్: దౌత్య యుద్ధం దెబ్బకు పాకిస్తాన్ దిగొచ్చింది. భారత్తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ఆ దేశ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్(Shehbaz Sharif) సోమవారం కీలక ప్రకటన చేశారు. కశ్మీర్ సహా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ వేదికగా ప్రకటించారాయన. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన 7 అఖిల పక్ష బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో.. ఇరాన్ పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ శాంతి ప్రస్తావన తెస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత్తో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం(Peace Talks). కశ్మీర్, ఉగ్రవాదంపై పోరు, నీటి పంపకం, వాణిజ్యం.. ఇలా అన్ని వివాదాలపై ఇరు దేశాలం సామరస్యంగా చర్చించుకునేందుకు మేం రెడీ. ఒకవేళ శాంతి చర్చలకు భారత్ గనుక సమ్మతిస్తే.. మేం శాంతిని ఎంత బలంగా కోరుకుంటున్నామో వాళ్లకు తెలియజేస్తాం. ఈ విషయంలో మా చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని షెహ్బాజ్ షరీఫ్ ప్రకటనను పాక్ పత్రిక ది డాన్ ప్రముఖంగా ప్రచురించింది. మరోవైపు.. టెహ్రాన్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీతో చర్చలు జరిపారు. ఈ భేటీకి పాక్ సైన్యాధ్యక్షుడు అసీమ్ మునీర్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగానూ భారత్తో ఉద్రిక్తతలు, గాజా అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు డాన్ కథనం పేర్కొంది. పాక్ శాంతి ప్రతిపాదనను ప్రశంసించిన ఇరాన్.. ఇరు దేశాలు(భారత్-పాక్) మధ్య త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్లోని ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదులను భారత సైన్యం నాశనం చేసింది. ఆపై పాక్పై దౌత్యపరమైన యుద్ధం చేస్తోంది. ఆ దేశ దౌత్యవేత్తలను వెనక్కి పంపించేసింది. ఉగ్రవాదాన్ని పాక్ ఎలా పెంచి పోషిస్తూ ప్రోత్సహిస్తోందనే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై గట్టిగా వినిపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అగ్రదేశాలు సహా పలు దేశాలు భారత్కు మద్ధతు ప్రకటించాయి. ఈ క్రమంలో పాక్కు నిధులు సమకూర్చకూడదని ఐఎంఎఫ్కి కూడా విజ్ఞప్తి చేసింది కూడా. అయితే తాజాగా ఇస్లామాబాద్ వర్గాలు దీర్ఘకాలికంగా కొనేసాగుతున్న వివాదాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీకి కబురు పంపాయి. భారత ప్రధాని మోదీ మాత్రం ఆ చర్చలు పరిమితంగానే ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు. పాక్తో చర్చలు గనుక జరగాల్సి వస్తే.. అది పీవోకే, ఉగ్రవాద అంశాలపై మాత్రమేనని కుండబద్ధలు కొట్టారు.ఇదీ చదవండి: ఒట్టు.. నా భార్యను నన్ను కొట్టలే! -
పుతిన్ లేకుండానే ఉక్రెయిన్–రష్యా చర్చలు
ఇస్తాంబుల్: తుర్కియే వేదికగా ఉక్రెయిన్తో జరిగే మొట్టమొదటిసారిగా జరిగే ప్రత్యక్ష శాంతి చర్చలకు అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదని రష్యా తెలిపింది. అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ సారథ్యంలోని బృందం గురువారం తుర్కియే రాజధాని అంకారా చేరుకుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల బృందానికి సాయంగా నలుగురితో కూడిన నిపుణుల బృందం కూడా ఉందన్నారు. ఉక్రెయిన్తో జరిగే చర్చలకు అధ్యక్షుడు పుతిన్ వెళ్లడం లేదన్నారు. మూడేళ్లుగా జరిగే యుద్ధానికి ముగింపు పలికేందుకు తుర్కియేలో జరిగే శాంతి చర్చలకు రావాలని పుతిన్కు జెలెన్స్కీ సవాల్ విసిరారు. తాజా పరిణామంపై తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న నాటో సమావేశానికి హాజరైన జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ.. కీలకమైన విధాన నిర్ణయాలను తీసుకునే అధికారం ఆ బృందంలోని వారెవరికీ లేదని వ్యాఖ్యానించారు. అందుకే చర్చలకు తాను సైతం వెళ్లనని, రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ సారథ్యంలో ప్రతినిధి బృందాన్ని పంపుతానని ప్రకటించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్తో మాట్లాడాక చర్చల తేదీ, ప్రాంతం వెల్లడిస్తామన్నారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామన్న యూరప్ నేతల హెచ్చరికలు, ట్రంప్ ఒత్తిడితో పుతిన్ ఈ చర్చలకు హాజరయ్యే అవకాశముందని సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. చివరికి ఇరుదేశాల అధ్యక్షులకు బదులుగా ప్రతినిధి బృందాలను పంపడం నిరాశ కలిగించిందని పరిశీలకులు అంటున్నారు. నేను వెళ్లనిదే పుతిన్ రారు తుర్కియేలో జరిగే చర్చలకు పుతిన్ హాజ రు కాకపోవడంపై ఖతార్లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయం తనకు ఆశ్చ ర్యం కలిగించలేదన్నారు. ‘నేను వెళ్లనిదే ఆ యన అక్కడికి రావడం అసాధ్యం’అంటూ పుతిన్ నిర్ణయాన్ని సమరి్ధస్తూ మాట్లాడారు. -
శాంతి చర్చల్లో పురోగతి?.. ట్రంప్ కీలక ప్రకటన
రోమ్: ఉక్రెయిన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక అడుగు పడిందా?. ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీతో నేరుగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతి తెలిపారా?. శుక్రవారం అమెరికా దౌత్యవేత్తతో జరిగిన చర్చల సారాంశం ఇదేనని తెలుస్తుండగా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఈ విషయంపై నేరుగా ప్రకటన చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో(Pope Francis Funeral) పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోమ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒప్పందానికి చాలా దగ్గరగా పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల్లో ఒక మంచి రోజు. రష్యా ఉక్రెయిన్లు నేరుగా సమావేశం అయ్యేందుకు అంగీకరించాయి. చాలావరకు అంశాలపై సానుకూలంగా రెండు దేశాలు స్పందించాయా’’ అని మీడియాతో ప్రకటించారాయన. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్రూత్ సోషల్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు.మరోవైపు.. క్రెమ్లిన్(Kremlin) వర్గాలు తమ అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్తో జరిగిన చర్చ సానుకూలంగా జరిగిందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. శాంతి ఒప్పందానికి తాము సిద్ధమేనని, అయినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో క్రిమియాను వదులుకునేందుకు ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. కానీ, శుక్రవారం టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ట్రంప్ ఇంటర్వ్యూలో.. క్రిమియా రష్యాతోనే ఉంటుందని, జెలెన్స్కీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.అమెరికన్ బిలియనీర్ అయిన స్టీవ్ విట్కాఫ్(Steve Witkoff).. ట్రంప్కు అత్యంత నమ్మకస్తుడు కూడా. అందుకే ఆయన్ని ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ ప్రయోగించారు. అయితే ఉక్రెయిన్ను రెచ్చగొట్టేలా ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.ఇదిలా ఉంటే.. చర్చల్లో పురోగతి గనుక చోటు చేసుకుంటే తాను మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటానంటూ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. ఈ సాగదీత వ్యవహారం ఇలాగే కొనసాగితే పెద్దన్న పాత్ర నుంచి ఆయన తప్పుకుంటారని వైట్హౌజ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈలోపే.. చర్చల్లో పురోగతి చోటు చేసుకుందన్న ప్రకటన వెలువడడం గమనార్హం. 2022 ఫిబ్రవరిలో రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమణతో మొదలు పెట్టిన యుద్ధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరువైపుల నుంచి వేల మంది మరణించగా.. ఆస్తి నష్టం ఊహించని స్థాయిలోనే జరిగింది. తాజాగా.. రష్యా కీవ్పై జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు. ఈ కారణంగా పోప్ అంత్యక్రియలకు జెలెన్స్కీ హాజరు కాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. విట్కాఫ్తో పుతిన్ చర్చ జరగడానికి కొన్నిగంటల ముందే.. మాస్కో శివారులో కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా జనరల్ యరోస్లావ్ మోస్కాలిక్ కన్నుమూయడం విశేషం. అయితే ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తుండగా.. కీవ్ వర్గాలు ఇంతదాకా ఎలాంటి స్పందన చేయలేదు.తాను అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పుతిన్పై, అటు జెలెన్స్కీ తీరుపై(దాడులు కొనసాగిస్తుండడం.. చర్చలకు అడుగులు ముందుకు పడకుండా చేస్తుండడం) ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. -
Maoists Peace Talks ఇరువురి అజెండా ఒకటవ్వాలి!
వామపక్ష తీవ్రవాదమైన నక్సలిజాన్ని 2026 మార్చి నాటికి సమూలంగా అంతం చెయ్యాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా హోం మంత్రి అమిత్ షా ప్రకటించి, ఆ లక్ష్యం నెర వేరేలాగా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. సాధార ణంగా బీజేపీ ప్రతిపాదిత విధా నాలను వ్యతిరేకించడమే విధానంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు నక్సలిజంపై యుద్ధం విషయంలో మాత్రం అమిత్ షా కి అనుకూలంగా ఉన్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్లు కూడా మావోయిస్టుల ఏరివేతలో తాము భాగస్వాములేనని ప్రకటించారు. దాదాపుగా జాతీయ ఏకాభిప్రాయంతో మావోయిస్టుల ఏరివేత జరుగుతున్నదనేది వాస్తవం. వేల సంఖ్యలో ఉన్న పారామిలిటరీ బలగాలను ఎదుర్కోవటం మావో యిస్టులకు కుదరడం లేదు. ఈ స్థితిలో మావోయిస్టులు తెల్ల జెండా ఎత్తి లొంగిపోకుండా మేము చర్చలకు సిద్ధం అని ప్రకటించారు. అయితే ఈ చర్చల ప్రకటన కొత్తదేమీ కాదు. నక్స లిజం పుట్టిన తర్వాత చర్చల ప్రస్తావన ఒకసారి కన్నా ఎక్కువ సార్లే వచ్చింది. 2004లో ఆంధ్ర ప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపినా అవి విఫల మయ్యాయి. ముందుగా ఆయుధాలు, అడవులను వదిలి బయటకు రావాలని ప్రభుత్వం చర్చలకు నిబంధన పెడితే... రక్షణ బలగాలను ముందుగా ఉపసంహ రించుకోండి అంటున్నారు మావోయిస్టులు. చుట్టు ముట్టిన ప్రతిసారీ చర్చల ప్రతిపాదన పెట్టి కొత్త స్థావరాలను సృష్టించుకున్నారు మావోయిస్టులు అనేది ప్రభుత్వ వర్గాల వాదన. చర్చల పేరుతో బయటకు రప్పించి తమ ఆనవాళ్ళను తెలుసుకుని దాడులుపెంచుతున్నారనేది మావోయిస్టుల ఆరోపణ. ఎవరి వాదనలు ఎలా ఉన్నా అడవుల్లో పోరాటం సాగుతున్నది. మావోయిస్టులు, భద్రతా దళాల సభ్యులు నేలకొరుగుతున్నారు. కొత్త తరం మావో యిజం పట్ల ఆకర్షించబడటం లేదు. అడవిబాట పట్టి తమ జీవితాలను వృథా చేసుకునే ఆలోచన నేటి యువతకు లేదు. అయినా కొందరు యువకులు మావోయిస్టులుగా మారుతున్నారంటే వారి గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న పెత్తందారీ వ్యవస్థలో బలిపశు వులు కావటమే. అలాంటి పెద్దలను వ్యక్తిగా వ్యతిరేకించలేక, పోరాడే మార్గం కనబడక నక్సల్స్ సహాయం కోసం అడవుల్లోకి వెళుతున్నారు. తమ వ్యక్తిగత కక్షను నక్సల్స్ ద్వారా తీర్చుకున్న తర్వాత వారికి ఆ ఉద్యమంతో అవసరం లేదు. కానీ అప్పటికే పోలీసులు లిస్టులోకి ఎక్కి ఉన్న ఆ యువతీయువకులు అడవులు, ఆయుధాలను వదలలేక అక్కడే ఉంటున్నారు. ఇటీవల కాలంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టుల కథలు ఇటువంటివే. నక్సల్ ఉద్యమం పుట్టిన నాటికి ఉన్న సామాజిక పరిస్థితులు నేడు లేవు. భూమి మీద పెత్తనం బడా భూస్వాముల చేతిలో లేదు. పలు రాష్ట్రాలలో అమలైన భూసంస్కరణలు కేంద్రం, రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాల వరకు మార్పును తెచ్చాయి. ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. జీతాలు పెరిగాయి. యువతలో సైద్ధాంతిక రాద్ధాంతం కన్నా కెరీర్ ముఖ్యం అనే అభిప్రాయం పెరిగింది. అందుకే నక్సల్ ఉద్యమంవైపు కొత్తవారు వెళ్లడం లేదు. ఒకనాటి సైద్ధాంతిక నేతలు వయసుమళ్లి మరణించారు. కొందరు అనారో గ్యంతో చివరి దశకి చేరారు. బయటి సమాజంలోఉండే అవలక్షణాలు అడవుల్లోని మావోయిస్టుల్లోనూ ఉన్నాయి. శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ, కుల అహంకా రాలు, అధికారాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు మాజీ మావోయిస్టుల నోటి వెంట వచ్చాయి. మరోవైపు నవీన ఆయుధాలు, సాంకేతికతను భద్రతా బలగాలు ప్రయోగిస్తున్నాయి. అడవిలో ఏ మూల నక్కిన నక్సలైట్నైనా పట్టకలిగిన సాంకేతికత వచ్చింది. గురిచూసి వారిని చంపేసే డ్రోన్స్ వచ్చాయి. ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఆసు పత్రులు, పాఠశాలలను నిర్మించారు. కమ్యూనికేషన్ టవర్లు, బ్యాంకులు ఏర్పాటు చేశారు. అభివృద్ధి ఫలా లను గిరిజనులు అనుభవించి, మావోయిస్టులకు మద్దతు తగ్గించారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గిరిజనులు 2024 ఎన్నికల్లో భారీగా ఓటింగ్లో పాల్గొనడం అందుకు నిదర్శనం. చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిఅయితే ప్రభుత్వ అభివృద్ధి నమూనాను మావో యిస్టులు తిరస్కరిస్తున్నారు. అటవీ, ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ అభివృద్ధి ముసుగులో దోచుకుంటున్నారు అనేది వారి ఆరోపణ. రహదారులనిర్మాణం, గనుల ఏర్పాటుకు, ముడి సరుకు రవాణాకు తప్పించి ఆ ప్రాంత అభివృద్ధికి పనికి రాదన్నది మావోయిస్టుల మాట. ఎవరి వాదన వారిది. వాస్తవం ఆ రెండింటి మధ్యలో ఎక్కడో ఉంటుంది. గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలంటే వారిని నలిపేస్తున్న ఇరుపక్షాలలోనూ మార్పులు రావాలి. ముందుగా ప్రభుత్వం సమాజంలో ఉన్న ఆర్థిక అవక తవకల తొలగింపునకు కూడా ఒక నిర్దిష్ట ప్రణాళికను ప్రకటించాలి. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఒక స్పష్ట యోజనను ప్రకటించాలి. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. అధికారంలో ఉన్నవారి ఆదరణతో పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల సంపద సమకూర్చుకున్నారు. అదే సమ యంలో సామాన్య వర్గాలు ఆర్థికంగా చితికి పోతు న్నాయి. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధికార యంత్రాంగం అవినీతి పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నక్సల్స్ ఉద్యమం మళ్లీ బలపడుతుంది. అవినీతి, సామాజిక, ఆర్థిక అసమాన తలను తొలగించే విధానాల అమలు మాత్రమే ప్రజ లందరినీ ఏకం చేసి, సవ్య అభివృద్ధి అజెండాకి కట్టు బడి ఉండేలా చేస్తాయి. అడవి బాట పట్టినవారిదీ, అధి కారంలో ఉన్న వారిదీ ఒకే తరహా అజెండా కాగలిగితే ఘర్షణ వాతావరణం పోయి, సమాజం ప్రశాంతంగా ఉంటుంది.-పి. వేణుగోపాల్ రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులుpvg2020@gmail.com -
మావోయిస్టులపై మారణకాండ : చర్చలు జరపాలి
ప్రభుత్వం మావోయిస్టులపై జరుపుతున్న యుద్ధాన్ని, మారణకాండను చర్చల ఆధారంగా ముగించాల్సిన సమయం ఆసన్నమైంది! వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మావోయిస్టు ముప్పును నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తోంది. ప్రస్తుతం 400 మంది సాయుధ కేడర్ మాత్రమే మిగిలి ఉన్నారని, ఎక్కువ భాగం ఆయుధాలు మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్నామని కూడా చెబుతున్నారు. ఇదే వాస్తవమైతే మావోయిస్టుల వలన ప్రభుత్వానికి వచ్చే నష్టం, శాంతి భద్రతల సమస్య ఏమీ లేదు. అయినా ఎన్కౌంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ సంభాషణకు సీపీఐ (మావోయిస్ట్) సంసిద్ధత వ్యక్తం చేయటం ప్రాముఖ్యాన్ని సంత రించుకుంది. దాన్ని సులభతరం చేయడానికి, చర్చల కాలంలో యుద్ధాన్ని నిలిపివేయాలని మావోయిస్టులు కోరారు. అయితే, మావోయిస్టులు ఎటువంటి షరతులు ముందుకు తేక పోతేనే బీజేపీ నేతృత్వంలోని ప్రభు త్వం చర్చలకు వెళుతుందని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి అన్నారు. చర్చలలో మావోయిస్టు సమస్యకు తగిన పరి ష్కారం చూపి అమాయక ఆదివాసీల జీవనం సాఫీ అయ్యేలా ప్రభుత్వం వ్యవహరించాలి.– మన్నవ హరిప్రసాద్ సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్, పొలిట్ బ్యూరో సభ్యుడు -
శాంతి చర్చలకు సిద్ధం: కేంద్రానికి మావోయిస్టుల లేఖ
న్యూఢిల్లీ, సాక్షి: మావోయిస్ట్ రహిత భారత్ నినాదంతో ఆపరేషన్ కగార్ను దూకుడుగా ముందుకు తీసుకెళ్తోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఈ క్రమంలో గత 100 రోజుల్లో వివిధ ఎన్కౌంటర్లలో 120 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అదే సమయంలో మరోపక్క భారీగా దళ సభ్యులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు మావోయిస్టులు శాంతి చర్చల ప్రతిపాదన ఉంచారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే.. కాల్పుల విరమణకు సిద్ధమంటూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది. ‘‘ప్రజల కోసం ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి. ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుపుతున్న హత్యాకాండను ఆపాలి.’’ .. శాంతి చర్చల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణం కల్పించాలి. అప్పుడు మేం వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం’’ అని మావోయిస్ట్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైంది. దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ప్రభుత్వం మారితేనే!
మాస్కో: ఉక్రెయిన్లో ప్రభుత్వం మారితేనే శాంతి నెలకొంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత శాంతి చర్చలు జరపాలన్నారు. చర్చల్లో అమెరికాతో పాటు బ్రిక్స్ దేశాలు, ఉత్తర కొరియా కూడా పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తర రష్యాలోని ఓడరేవు పట్టణం ముర్మాన్స్కోలో సైనికుల బృందంతో పుతిన్ శుక్రవారం మాట్లాడారు. మూడేళ్ల యుద్ధానికి ముగింపు పలకడానికి సిద్ధమేనన్నారు. అయితే శాంతి ప్రక్రియ కోసం పలు షరతులు విధించినట్టు రష్యా అధికార వార్తా సంస్థ టాస్ తెలిపింది. ఉక్రెయిన్లో ఎన్నికలు జరగాలి. ఆ దేశం అంతర్జాతీయ పాలనలోకి రావాలి. ఆలోపు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరాలి. కీలక ఒప్పందాలపై సంతకాల వంటివన్నీ ఆ తర్వాతే’’ అని పుతిన్ పేర్కొన్నట్టు వెల్లడించింది. ‘‘శాంతియుత పరిష్కారమే మా అభిమతం కూడా. కానీ ముందుగా ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం రావాలి. యూరప్తో కలిసి పనిచేయడానికీ నేను సిద్ధం. కానీ యూరప్ అస్థిరంగా వ్యవహరిస్తూ మమ్మల్ని మభ్యపెట్టజూస్తోంది’’ అని పుతిన్ ఆరోపించారు. యుద్ధం ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారంటూ కొనియాడారు. తాత్కాలిక కాల్పుల విరమణ కోసం సౌదీ అరేబియాలో ఈ వారం రష్యా, ఉక్రెయిన్, అమెరికా చర్చలు జరపడం తెలిసిందే. వాటి తీరుపై అమెరికా పెదవి విరిచింది. ‘‘నల్ల సముద్రంలో నౌకలపై సైనిక దాడులను నిలిపేయడానికి రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయి. కానీ ఆ తర్వాత శాంతి చర్చలను అవి సీరియస్గా తీసుకోవడం లేదు’’ అని పేర్కొంది. ఏప్రిల్లో రెండో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. -
పుతిన్కు యుద్దమే ఇష్టం.. ట్రంప్ ప్లాన్ కష్టమే: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కసరత్తు జరుగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తిరస్కరణకు పుతిన్ సన్నద్ధమవుతున్నారని జెలెన్స్కీ అన్నారు. అలాగ, ఉక్రెయిన్ ప్రజలనే చంపాలన్నదే పుతిన్ లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడానికి కారణాలు వెతుకుతున్నారు. కాల్పుల విరమణను ఆలస్యం చేయడానికి, అమలుకాకుండా ఉండేందుకు పుతిన్ సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ కండీషన్స్ పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగా ఈ విషయం నేరుగా చెప్పడానికి భయపడుతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తూ మా దేశ ప్రజలు చంపాలన్నదే పుతిన్ లక్ష్యం. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం అంగీకరించకుండా సాకులు వెతుకుతున్నారు.షరతులు లేని కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతిపాదన చేసింది. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను అంగీకరించింది. దీనిపై పర్యవేక్షణ ధృవీకరణను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా కూడా తెలిపింది. ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాల్పుల విరమణ సమయంలో, దీర్ఘకాలిక భద్రత, శాశ్వత శాంతి గురించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం, యుద్ధాన్ని ముగించడానికి ఒక ప్రణాళికను సిద్ధంగా ఉంచాం. ఉక్రెయిన్ వీలైనంత త్వరగా నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము దీని గురించి అమెరికా ప్రతినిధులతో కూడా మేము చర్చించాం. ఉక్రెయిన్తో యూరోపియన్ భాగస్వాములు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మిత్రదేశాలకు దీని గురించి తెలుసు.ఈ ప్రక్రియను క్లిష్టతరం చేసే పరిస్థితులను మేము ఏర్పాటు చేయడం లేదు. రష్యా కారణంగానే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమవుతోంది. పుతిన్ సంవత్సరాల తరబడి శాంతి లేకుండా యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అతనిపై ఒత్తిడి పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. పుతిన్పై ఆంక్షలు విధించాలి. ఈ యుద్ధాన్ని ముగించమని రష్యాను బలవంతం చేయడానికి మేము ప్రతీ ఒక్కరితో కలిసి పని చేస్తూనే ఉంటాము. అని చెప్పుకొచ్చారు. Right now, we have all heard from Russia Putin’s highly predictable and manipulative words in response to the idea of a ceasefire on the front lines—at this moment he is, in fact, preparing to reject it.Of course, Putin is afraid to tell President Trump directly that he wants… pic.twitter.com/SWbYwMGA46— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 13, 2025మరోవైపు.. కాల్పుల విరమణ ప్రతిపాదనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. మాస్కోలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ట్రంప్ ఆలోచన సరైందే. కచ్చితంగా మేం మద్దతిస్తాం. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని మా అమెరికా మిత్రులతో ఇతర భాగస్వాములతో చర్చిస్తాం. ఒప్పందం ఉల్లంఘన కాకుండా.. సరైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. యుద్ధం ఆపాలన్న ప్రతిపాదనకు మేం అంగీకరిస్తున్నాం. అయితే కాల్పుల విరమణ.. శాశ్వత శాంతి దిశగా సాగుతుందన్న ఆశాభావంతో అందరం ముందుకు వెళ్లాలి. సమస్య మూలాలను తొలగించాలి’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్న ట్రంప్నకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. భారత్, చైనా, దక్షిణాఫ్రికా నేతలకూ కృతజ్ఞతలు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మూడు దేశాలు కూడా కీలక పాత్ర పోషించాయని పుతిన్ సంకేతం ఇచ్చారు. -
అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాష్టింగన్/మాస్కో: ఉక్రెయిన్-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదుర్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్తో డీల్ చేసుకునేందుకు రష్యా పలు డిమాండ్లను అమెరికా ముందుకు తీసుకొచ్చినట్టు యూఎస్కు చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరడం విశేషం.ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్దం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. అయితే, జాబితాలో రష్యా ఏం కోరిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఇక,గత మూడు వారాలుగా పలు నిబంధనలపై అమెరికా, రష్యా అధికారులు చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా డిమాండ్లు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్హౌస్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం. రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుంది. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారు’ అని స్పష్టం చేశారు.Trump threatens Putin with 'devastating' punishment if he doesn't agree to 30-day ceasefire with Ukraine. pic.twitter.com/vU6rLTX479— Daily Mail Online (@MailOnline) March 12, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ మాత్రం కీవ్కు నాటో సభ్యత్వం ఇవ్వాలని ముందు నుంచి డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్లో విదేశీ దళాలను మోహరించకూడదని చెబుతోంది. ఈ మేరకు అమెరికాతో కూడా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ డిమాండ్లపైనే రష్యా కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ను నాటోలో చేర్చకూడదనే వాదనలు వినిపిస్తోంది. మాస్కో కాల్పుల విరమణకు సంతకం చేయకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. -
ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో రష్యా(Russia) ఓ అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో అవసమైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా దౌత్య వేత్తలతో రష్యా అధికారులు చర్చలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. మాస్కో నుంచి ఈ ప్రకటన వెలువడడం విశేషం.ఉక్రెయిన్ సంక్షోభం(Ukraine Crisis) ముగిసేలా ఓ ఒప్పందం కోసం ఈ సమావేశం జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆ చర్చల అజెండాపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోమని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక.. అమెరికాతో చర్చలు ఇరాన్తో సంబంధాలను దెబ్బ తీయొచ్చన్న వాదనను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. అయితే తమ ప్రతినిధులు లేకుండానే శాంతి చర్చలు జరుపుతుండడంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము లేకుండా జరిపే ఎలాంటి చర్చలకు, ఒప్పందాలకు తాము గుర్తింపు ఇవ్వబోమని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు నాటో దేశాలు కూడా రియాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకానొక దశలో.. ఇది మాస్కో-వాషింగ్టన్ మధ్య సంబంధాలు బలపర్చుకునే సమావేశాలుగానే నాటో మిత్రపక్షాలు భావిస్తున్నాయి. -
కాల్పుల విరమణ: బైడెన్ వ్యాఖ్యలను ఖండించిన హమాస్
న్యూయార్క్: ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. సోమవారం చికాగోలో జరిగిన డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ సమావేశం అనంతరం ఎయిర్పోర్టులో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ ఒప్పందం నుంచి పాలస్తీనా( హమాస్) ఎనక్కి తగ్గుతోంది.కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఒప్పందం కోసం సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరగుతుందో చూద్దాం. ఈ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని అన్నారు. అయితే బైడెన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించటం లేదని హమాస్ తెలిపింది. అదేవిధంగా తమకు జూలై 2న సమర్పించిన ఒప్పంద ప్రతిపాదన ఇటీవలి కొత్త ప్రతిపాదనకు చాలా విరుద్దంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొత్త షరతులు, గాజా పట్ల నేర ప్రణాళికకు అమెరికా అంగీకరిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది. బైడెన్ చేసిన వ్యాఖ్యలు తప్పుదారి పెట్టించేలా ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. కాల్పుల విరమణ, బంధీల విడుదలకు సంబంధించి విభేదాలు తలెత్తకుండా అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్ చర్చల కోసం కసరత్తు చేస్తున్నారు. -
సరిహద్దు సమస్యల పరిష్కారానికే పెద్ద పీట
గోవా: తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో శాంతి స్థాపన లక్ష్యంగా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. గురువారం జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఒ) విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి గోవాకి వచ్చిన కిన్ గాంగ్తో బెనౌలిమ్ బీచ్ రిసార్ట్లో జై శంకర్ సమావేశమయ్యారు. సరిహద్దు సమస్యతో పాటు ఎస్సీఒ, జీ–20, బ్రిక్స్కు సంబంధించిన అంశాలపై ఇరుదేశాల మంత్రులు చర్చించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్ రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించారు. ఎస్సీఓలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం గోవాకు చేరుకున్నారు. -
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా పర్యటన.. ఇద్దరు మిత్రులు సాధించిందేమిటి?
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం తన వంతు సహకారం అందిస్తానన్న ప్రకటనతో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యా పర్యటన ప్రారంభించారు. శాంతి ప్రణాళికతో వచ్చానని చెప్పారు. తన బృందంతో కలిసి మూడు రోజులపాటు రష్యా రాజధాని మాస్కోలో మకాం వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో, ఆయన బృందంతో సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం చైనా–రష్యా పదికిపైగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అండగా ఉంటానని పుతిన్కు జిన్పింగ్ అభయ హస్తం ఇచ్చారు. ఉక్రెయిన్పై ఏకపక్షంగా దండయాత్రకు దిగిన రష్యా పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ప్రపంచంలో దాదాపు ఏకాకిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్ట్ వారెంటు జారీ చేసింది. రష్యా నుంచి బయటకు రాగానే పుతిన్ను అరెస్టు చేయడం తథ్యమని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యాలో పర్యటించారు. పుతిన్కు స్నేహహస్తం అందించారు. జిన్పింగ్ రష్యాలో ఉన్న సమయంలోనే అమెరికా మిత్రుడైన జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా ఉక్రెయిన్లో అడుగుపెట్టడం గమనార్హం. చైనా, రష్యా మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు ప్రపంచ దేశాలపై అమెరికా, దాని మిత్రదేశాల పెత్తనం ఇకపై చెల్లదన్న సంకేతాలు ఇవ్వడమే జిన్పింగ్, పుతిన్ భేటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐదు కీలక అంశాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో చూద్దాం.. ఉక్రెయిన్పై చొరవ సున్నా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో జిన్పింగ్ ఏమీ సాధించలేకపోయారు. యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచలేదు. కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్లో హింస, అమాయక ప్రజల మరణాలపై మాటమాత్రంగానైనా స్పందించలేదు. ఉక్రెయిన్లో ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలంటూ జిన్పింగ్, పుతిన్ సంయక్తంగా పశ్చిమ దేశాలకు హితబోధ చేశారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రయోజనాలను గౌరవించాలని సూచించారు. శాంతికి చొరవ చూపుతానన్న జిన్పింగ్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పుతిన్తో భేటీలో ఆ ఊసే ఎత్తలేదు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికిప్పుడు తమ సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రతిపాదన ఏదీ లేదని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు పశ్చిమ దేశాల రెచ్చగొట్టే చర్యలే కారణమని చైనా, రష్యా చాలా రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సైనిక సహకారం, రక్షణ సంబంధాలు నాటో దేశాలతోపాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా(ఏయూకేయూఎస్) భద్రతా చట్టం వంటి వాటితో తమకు ముప్పు పొంచి ఉందని చైనా, రష్యా చెబుతున్నాయి. అందుకే పరస్పరం సైనిక సహకారం మరింత పెంపొందించుకోవాలని, రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకోవాలని జిన్పింగ్, పుతిన్ నిర్ణయించుకున్నారు. ఆసియా ఖండంలో స్థానికంగా ఎదురవుతున్న చిక్కులను పరిష్కరించుకోవడంతోపాటు పశ్చిమ దేశాలకు చెక్ పెట్టడానికి ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు. పలు ఆసియా–పసిఫిక్ దేశాలతో అమెరికా సైనిక–రక్షణ సంబంధాలు మెరుగుపడుతుండడం పట్ల ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా శాంతికి, స్థిరత్వానికి విఘాతం కలిగించే బాహ్య సైనిక శక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఇకపై ఉమ్మడి సైనిక విన్యాసాలు తరచుగా చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. తద్వారా తాము ఇరువురం ఒక్కటేనని, తమ జోలికి రావొద్దంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక కూటమి అమెరికాకు వ్యతిరేకంగా తామే ఒక కొత్త కూటమిగా ఏర్పాటు కావడంతోపాటు నూతన వరల్డ్ ఆర్డర్ నెలకొల్పాలన్నదే చైనా, రష్యా ఆలోచనగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ ఆర్డర్ తమ సొంత అజెండాలకు అనుగుణంగా, ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. దీనిపై జిన్పింగ్, పుతిన్ మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేద్దామని ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. అమెరికా పెత్తనం కింద ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందన్నదే వారే వాదన. జిన్పింగ్ చైనాకు బయలుదేరే ముందు పుతిన్తో కరచాలనం చేశారు. కలిసి పనిచేద్దామని, అనుకున్న మార్పులు తీసుకొద్దామని చెప్పారు. మన ఆలోచనలను ముందుకు తీసుకెళ్దామని అన్నారు. పశ్చిమ దేశాల శకం ముగిసిందని, ఇకపై చైనా ప్రాబల్యం మొదలుకాబోతోందని జిన్పింగ్ పరోక్షంగా వెల్లడించారు. వ్యాపార, వాణిజ్యాలకు అండ యుద్ధం మొదలైన తర్వాత తమ దేశం నుంచి వెళ్లిపోయిన పశ్చిమ దేశాల వ్యాపార సంస్థల స్థానంలో చైనా వ్యాపారాల సంస్థలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. నాటో దేశాల ఆంక్షల తర్వాత ఎగుమతులు, దిగుమతుల విషయంలో చైనాపై రష్యా ఆధారపడడం పెరుగుతోంది. ఇరు దేశాల నడుమ ఇంధన వాణిజ్యం అభివృద్ధి చెందుతోంది. చమురు, గ్యాస్, బొగ్గు, విద్యుత్, అణు శక్తి వంటి రంగాల్లో ఇరుదేశాల సంస్థలు కలిసికట్టుగా పనిచేసేలా మద్దతు ఇస్తామని జిన్పింగ్, పుతిన్ తెలిపారు. కొత్తగా చైనా–మంగోలియా–రష్యా నేచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు చేపడతామని పుతిన్ వెల్లడించారు. రష్యాకే మొదటి ప్రాధాన్యం ► ఇతర దేశాలతో సంబంధాలను పణంగా పెట్టయినా సరే రష్యాతో బంధాన్ని కాపాడుకోవాలని చైనా పట్టుదలతో ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ► అమెరికా వ్యతిరేకతే ఏకైక అజెండాగా రెండు దేశాలు ఒక్కటయ్యాయని అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్కు నాటో దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ► ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్దం మొదలయ్యాక జిన్పింగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ► యుద్ధాన్ని ఏనాడూ ఖండించలేదు. ► రష్యాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తన వైఖరి ద్వారా తేల్చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధాన్ని ఆపే దమ్ము చైనాకి ఉందా?
కీవ్/బీజింగ్: ఏడాది కాలంపాటు జరిగిన విధ్వంసకాండ.. నరమేధం తర్వాత ఉక్రెయిన్ యుద్దం ముగింపు దశకు చేరుకోబోతోందా?.. అదీ వీలైనంత తర్వలోనేనా?. దురాక్రమణను నిలిపేసి.. బలగాలను వెనక్కి రప్పించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరిస్తారా?.. ఒక బాధిత దేశంగా శాంతి చర్చలకు తామే తొలి అడుగు వేస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన వేళ.. చైనా చేస్తున్న ప్రయత్నాలపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను మొదటి నుంచి చైనా వ్యతిరేకించడం లేదు. అలాగని సమర్థించడమూ లేదు. కానీ, ఉన్నపళంగా శాంతి చర్చల రాగం అందుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు శుక్రవారం.. ఇరుదేశాలు సమన్వయం పాటించాలని సూచిస్తూ పొలిటికల్ సెటిల్మెంట్ పేరుతో 12 పాయింట్ల పేపర్ను విడుదల చేసింది చైనా ప్రభుత్వం. ఆ వెంటనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ సైతం.. చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో భేటీకి సిద్ధమంటూ ప్రకటించారు. వెనువెంటనే.. రష్యా సైతం చైనా శాంతి చర్చల పిలుపును స్వాగతించింది కూడా!. చైనా శాంతి ప్రణాళిక నేపథ్యంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ను కలవనున్నట్లు ప్రకటించారు. జింగ్పిన్ను కలిసి చర్చించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపిన ఆయన.. ఇది ప్రపంచ భద్రతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారించాలంటే రష్యాకు చైనా నుంచి ఆయుధాలు సరఫరా కాకుండా చూస్కోవడమే ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని, చైనా కూడా ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారాయన. మరోవైపు.. జెలెన్స్కీ-జిన్పింగ్ భేటీ ఎప్పుడన్నదానిపై స్పష్టత లేకున్నా.. ఈ పరిణామంపై రష్యా కూడా స్పందించింది. రష్యా విదేశాంగ ఒక ప్రకటనలో.. చైనా శాంతి ప్రయత్నాలను అభినందించింది. బీజింగ్ అభిప్రాయాలను మేం గౌరవిస్తాం అంటూ అందులో స్పష్టం చేసింది రష్యా విదేశాంగ శాఖ. ఈ తరుణంలో శాంతి చర్చలకు బీజింగ్ వేదిక కాబోతోందని, త్వరలోనే యుద్ధానికి పుల్స్టాప్ పడొచ్చని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు విశ్లేషణాత్మక ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. పుతిన్ వార్నింగ్ను తప్పుబట్టిన చైనా! ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫిబ్రవరి 24వ తేదీతో.. సరిగ్గా ఏడాది పూర్తి చేసుకుంది. ఒకవైపు ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. రష్యా సైతం భారీగా బలగాల్ని కోల్పోయింది. అయినప్పటికీ రష్యా మాత్రం ‘తగ్గేదేలే..’ అనుకుంటూ రెండో ఏడాదిలోకి అడుగుపెట్టేసింది. అసలు యుద్ధానికి ముగింపు ఎప్పుడు? అనేదానిపై ఎవరూ అంచనా వేయలేని స్థితి. ఈ తరుణంలో.. బుధవారం మాస్కోలోని చైనా దౌత్యవేత్త వాంగ్ యూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కలిశాడు. ఆ తర్వాత చైనా నుంచి శుక్రవారం శాంతి ప్రణాళిక బయటకు రావడం గమనార్హం. చైనా ఇరు దేశాలకు శుక్రవారం కీలక సూచన చేసింది. రెండు దేశాలు సంయమనం పాటించాలి. తక్షణ శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని చైనా తన శాంతి ప్రకటనలో సూచించింది. పొలిటికల్ సెటిల్మెంట్లో.. ఉక్రెయిన్-రష్యాలు ముఖాముఖి చర్చలకు ప్రయత్నించాలని చైనా, యావత్ ప్రపంచాన్ని కోరింది. పుతిన్ అణ్వాయుధాల ప్రయోగం హెచ్చరికల నేపథ్యంలో.. అణ్యాయుధాలను వాడడమే కాదు, వాటిని యుద్ధ క్షేత్రంలో మోహరించడం కూడా పెను విపత్తేనని పుతిన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. అంతర్జాతీయ మానవతా చట్టానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని సూచించింది. పౌరులు/ పౌర సౌకర్యాలపై దాడులు చేయకూడదని చెప్పింది. అత్యవసరంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని అందులో పేర్కొంది చైనా. చైనా వెరీ డేంజర్: వెస్ట్రన్ కంట్రీస్ ఇదిలా ఉంటే.. చైనా చేసిన శాంతి ప్రతిపాదలను ఉక్రెయిన్కు మద్ధతు ఇస్తున్న పాశ్చాత్య దేశాల్లో చాలావరకు తిరస్కరించాయి. పైగా మాస్కోతో బీజింగ్కు ఉండే సన్నిహిత సంబంధాల దృష్ట్యా.. జాగ్రత్తగా ఉండాలని ఉక్రెయిన్ను, జెలెన్స్కీని హెచ్చరించాయి. ‘‘రష్యా.. చైనాకు వ్యూహాత్మక మిత్రదేశం. అలాంటి దేశంలో సన్నిహితంగా ఉంటూనే.. దురాక్రమణ విషయంలో తటస్థంగా ఉంటూ వస్తోంది. ఇది ఉక్రెయిన్ గమనించాలి. ఇదేకాదు.. 12 పాయిట్ల పొలిటికల్ సెటిల్మెంట్లో.. ఎక్కడా కూడా రష్యా బలగాలు ఉక్రెయిన్ గడ్డ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని చైనా చెప్పలేదు. పైగా రష్యాపై సానుకూల ధోరణి ప్రదర్శిస్తూ.. ‘‘ఏకపక్ష ఆంక్షల’’ను తీవ్రంగా ఖండించింది కూడా’’ అని పాశ్చాత్య దేశాలు చెప్తున్నాయి. ఇక చైనా శాంతి చర్చల పిలుపుపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ స్పందించారు. బీజింగ్ను నమ్మడానికి వీల్లేదని, ఎందుకంటే అది ఉక్రెయిన్పై దురాక్రమణను ఏనాడూ ఖండించలేదని తెలిపారు. మరోవైపు రష్యాకు బీజింగ్ నుంచి ఆయుధాల సరఫరా జరుగుతోందని అమెరికా ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. బీజింగ్ ఆ ఆరోపణను ఖండించింది. -
తలబొప్పి పలికించిన తత్త్వం
తలబొప్పి కడితే కానీ తత్త్వం బోధపడదంటే ఇదే. పాలు పోసి పెంచిన తీవ్రవాద సర్పం తన మెడకే చుట్టుకొంటూ, అస్తవ్యస్త విధానాలతో ఆర్థికంగా నట్టేట మునిగాక పాకిస్తాన్ తెలివి తెచ్చుకుంటున్నట్టుంది. నిరుడు పగ్గాలు పట్టిన ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోట హఠాత్తుగా ఊడిపడ్డ భారత్తో శాంతి చర్చల మాట చూస్తే అలాగే అనిపిస్తోంది. రెండురోజుల పర్యటనకు వెళ్ళిన ఆయన దుబాయ్ వార్తాఛానల్ ‘అల్ అరేబియా’తో సోమవారం మాట్లాడుతూ భారత్తో మూడు యుద్ధాలతో గుణపాఠాలు నేర్చామనీ, నిజాయతీగా శాంతి చర్చలు జరపాలనీ, ఉభయులకూ మిత్రదేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్యవర్తిగా వ్యవహరించాలనీ అన్నారు. కానీ, ఆ మర్నాడే పాక్ ప్రధాని కార్యాలయం హడావిడిగా వివరణనిచ్చింది. కశ్మీర్లో ‘చట్టవిరుద్ధ చర్యల’పై భారత్ వెనక్కి తగ్గితేనే చర్చలంటూ మెలికపెట్టింది. తప్పంతా తమదేనని అనిపించుకోవడం ఇష్టం లేని శక్తిమంతమైన సైనిక వర్గాలు ఒత్తిడి తేవడంతో పాక్ పాలకులు అలా స్వరం సవరించుకోవాల్సి వచ్చింది. కానీ అసలంటూ చర్చల ప్రస్తావన రావడం విశేషమే. భారత్తో శాంతి నెలకొంటేనే పాక్ ఆర్థికవ్యవస్థకు లాభమని షెహబాజ్, ఆయన సోదరుడైన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్లు తరచూ చెబుతుంటారు. కానీ, భారత్తో చేసిన మూడు యుద్ధాలతో బుద్ధి వచ్చిందనీ, వాటి వల్ల కష్టాలు, కన్నీళ్ళు, నిరుద్యోగం, పేదరికమే దక్కాయనీ ఒక పాకిస్తానీ పాలకుడు అనడం ఇదే తొలిసారి. అందుకే, షెహబాజ్ తాజా మాటలు తరచూ చేసే శుష్క ప్రకటనల కన్నా భిన్నమైనవి, ప్రాధాన్యమున్నవి. అందులోనూ ఆర్థిక కష్టాల్లో 300 కోట్ల డాలర్ల మేర భుజం కాస్తున్న ‘సోదర’ దేశం యూఏఈని శాంతిసంధాతగా రమ్మనడమూ కీలకమే. నిజానికి, దాయాదుల మధ్య తెర వెనుక చర్చల ప్రక్రియకు మధ్యవర్తి పాత్ర తమ దేశమే పోషించిందని యూఏఈ ఉన్నత దౌత్యాధికారి 2021లో బయటపెట్టారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు నిచ్చాయన్నారు. మళ్ళీ ఆ సోదర దేశాన్నే పాక్ సాయం కోరింది. నిజాయతీ ఎంత ఉందో కానీ, ఇన్నాళ్ళకు పాక్ పాలకులు సరైన దోవలో ఆలోచిస్తున్నారు. డాలర్ నిల్వలు పడిపోతూ, శ్రీలంక బాటలో పాక్ కూడా దివాళా తీసే ప్రమాదపుటంచున ఉంది. ఈ నేపథ్యంలోనే ‘అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం చెలరేగితే, ఏం జరిగిందో చెప్పడానికైనా ఎవరూ మిగలర’న్న ఆకస్మిక జ్ఞానం వారికి కలిగిందనుకోవాలి. నిజానికి, పాక్ చర్చల ఆకాంక్ష, కశ్మీర్ సమస్య పరిష్కారం, చివరకు భారత్తో శాంతిస్థాపన ఆలోచనలు కొత్తవేమీ కావు. జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాలనలోనే ఈ కథ కంచి దాకా వెళ్ళినట్టే వెళ్ళి, ఆఖరి క్షణంలో అడ్డం తిరిగింది. అప్పట్లో ఇక్కడ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ఒత్తిడి, అక్కడ ముషారఫ్ను బలహీనపరిచిన దేశీయ సమస్యలు కలసి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చాయి. ఆ మధ్య ఇమ్రాన్ ఖాన్ – సైన్యాధ్యక్షుడు జనరల్ బజ్వా ద్వయం కూడా ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని ప్రయత్నించింది. కానీ, పాక్ పాలక వర్గాలు పడనివ్వలేదు. దేశ ఆర్థిక సమస్యలు, తీవ్రవాద ‘తెహ్రీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్’ (టీటీపీ) తలనొప్పి, పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయాల్లో మార్పులు – ఇలా అనేకం శాంతి గీతాలాపనకు కారణం. పశ్చిమాసియాలో కీలకమైనవీ, పాక్కు ‘సోదర’ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా తాజా పరిస్థితుల్లో భారత్కు దగ్గరయ్యాయి. దీంతో, పాక్ రూటు మార్చక తప్పట్లేదు. పైగా, భారత్తో శాంతి నెలకొంటే వాయవ్యాన తలనొప్పిగా మారిన తాలిబన్లపై దృష్టి పెట్టవచ్చు. ఈ ఏడాదే పాక్లో ఎన్నికలు జరగనున్నందున ఈ శాంతి వచనాలు ఊహించదగ్గవే. అధికారం కోరే ప్రతి పార్టీ ఓటర్లకు గాలం వేస్తూ, ఎన్నికల మేనిఫెస్టోలో భారత్తో శాంతిస్థాపన అంశాన్ని చేర్చడం షరా మామూలే. గత ఎన్నికల్లో ప్రధాని పీఠానికి పోటీపడ్డ ముగ్గురూ ఆ వాగ్దానమే చేశారు. ఇప్పుడు ఎన్నికల వేళ షెహబాజ్ అదే పల్లవి అందుకున్నట్టున్నారు. కశ్మీర్కు స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ 2019 ఆగస్ట్లో తీసుకున్న నిర్ణయాన్ని భారత్ పునః సమీక్షించే అవకాశం లేదు. అది మినహాయించి, జమ్ము–కశ్మీర్ల రాష్ట్ర హోదా పునరుద్ధరణ లాంటివి కోరుతూ చర్చలంటే కథ కొంత ముందుకు నడుస్తుంది. అదే సమయంలో యూఏఈ సహా ఉభయ మిత్రులూ, తెర వెనుక శక్తిమంతులూ ఎందరున్నా... అంతర్గత అంశమైన కశ్మీర్పై అంతర్జాతీయ జోక్యం మనకు సమ్మతం కానే కాదు. అది గుర్తెరిగి ప్రవర్తిస్తేనే తాజా ప్రతిపాదనకు సార్థకత. పీఎంఓ ప్రకటన అటుంచి, చర్చలకు కట్టుబడి ఉన్నామని షెహబాజ్ బృందం చేతల్లో చూపాలి. పాక్తో గత అనుభవాల దృష్ట్యా ఆ దేశం నేర్చుకున్నట్టు చెబుతున్న గుణపాఠాల పట్ల భారత్కు అనుమానాలు సహజమే. అయితే, అనాలోచితంగా శాంతి ప్రతిపాదనకు అడ్డం కొట్టాల్సిన పని లేదు. దౌత్య, వాణిజ్యపరంగా ముందుగా చేయాల్సినవీ చాలానే ఉన్నాయి. 2019 ఆగస్ట్ పరిణామాల తర్వాత ఇరుదేశాల రాజధానుల్లోనూ హైకమిషనర్లు లేరు. కింది సిబ్బందే బండి నడుపుతున్నారు. పరస్పర విశ్వాసం పాదుగొల్పే చర్యల్లో భాగంగా రెండుచోట్లా హైకమిషనర్ల నియామకం జరగాలి. వీసాలపై షరతుల్ని సడలించాలి. సాంస్కృతిక, క్రీడా సంరంభాలను పునరుద్ధరించాలి. ముఖ్యంగా తీవ్రవాదానికి కొమ్ము కాయబోమని పాక్ నమ్మకం కలిగించాలి. శాంతి పథంలో సాగాలంటే అది అతి ముఖ్యం. అందుకు పాక్ రెండడుగులు ముందుకు వేస్తే, నాలుగడుగులు వేయడానికి శాంతికాముక భారతావని సదా సిద్ధంగానే ఉంటుంది. -
Russia-Ukraine War: చర్చలకు చరమగీతం
వాషింగ్టన్: మారియుపోల్లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మారియుపోల్లో మిగిలిన ఉక్రేనియులను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అయితే మారియుపోల్లో రష్యా విధ్వంసం దరిమిలా ఇకపై ఆ నగరం గతంలోలాగా ఉండకపోవచ్చని వాపోయారు. ఇటీవల కాలంలో రష్యాతో శాంతి కోసం చర్చలు జరిపామని, కానీ తాజా ఘటనలు చర్చలకు చరమగీతం పాడతాయని హెచ్చరించారు. ప్రస్తుతం మారియుపోల్ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు తెలుస్తోంది. కానీ అజోవస్టాల్ స్టీల్ మిల్ ప్రాంతంలో మిగిలిన ఉక్రెయిన్ సైనికులు ప్రతిఘటన కొనసాగిస్తున్నారు. వీరంతా ఆయుధాలు వదిలి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని రష్యా సైన్యం ప్రకటించింది. మారియుపోల్లో ఉన్నవారి రక్షణ గురించి బ్రిటన్, స్వీడన్ నేతలతో మాట్లాడినట్లు జెలెన్స్కీ చెప్పారు. యుద్ధంలో రష్యాకు చెందిన మేజర్ జనరల్ వ్లాదిమిర్ ఫ్రోలోవ్ మరణించారు. మారియుపోల్లో తుదిదాకా పోరాడతామని ఉక్రెయిన్ ప్రధాని షైమ్హల్ ప్రకటించారు. బాంబింగ్ ఉధృతి పెరిగింది మాస్క్వా మునక తర్వాత రష్యా తన మిసైల్ దాడులను మరింత ముమ్మరం చేసింది. ఖార్కివ్ నగరంపై దాడుల్లో ఐదుగురు మరణించారు. రష్యా సేనల దురాగతాలను ఖండించాలని అంతర్జాతీయ సమాజాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. తమకు మరిన్ని ఆయుధాలందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్వివ్ నగరంపై రష్యా జరిపిన మిసైల్ దాడిలో ఏడుగురు పౌరులు మరణించారని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్పటివరకు ఈ నగరంతో సహా దేశ పశ్చిమభాగంపై రష్యా దాడులు పెద్దగా జరపలేదు. దీంతో చాలామంది ప్రజలు ఇక్కడ తలదాచుకున్నారు. కానీ తాజాగా ఈ నగరంపై కూడా రష్యా దాడుల ఉధృతి పెరిగింది. నగరంలోని మిలటరీ స్థావరాలు, ఆటోమెకానిక్ షాపుపై రష్యా దాడులు జరిపినట్లు నగర మేయర్ ఆండ్రీ చెప్పారు. దాడుల్లో ఒక హోటల్ తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. కీవ్కు దక్షిణాన ఉన్న వాసైల్కివ్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఈ నగరంలో ఒక మిలటరీ బేస్ ఉంది. ఉక్రెయిన్లోని ఆయుధ స్థావరాలను, రైల్వే తదితర మౌలికసదుపాయాలను రష్యా లక్ష్యంగా చేసుకొని దాడులు ముమ్మరం చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు డోన్బాస్లో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాదన్నది రష్యా ఆలోచనగా చెబుతున్నారు. రష్యా సైతం తాము పలు మిలటరీ టార్గెట్లపై దాడులు జరిపినట్లు ప్రకటించింది. మానవీయ కారిడార్లపై రష్యా దాడి చేస్తున్నందున పౌరుల తరలింపును నిలిపివేశామని ఉక్రెయిన్ పేర్కొంది. డోన్బాస్ నుంచి పారిపోతున్న నలుగురు పౌరులను రష్యా సేనలు కాల్చిచంపాయని ఆరోపించింది. ఆయా నగరాల నుంచి పౌరుల తరలింపునకు సహకరించాలని రష్యాను కోరింది. కీవ్ ముట్టడి విఫలమైన దరిమిలా డోన్బాస్పై పట్టుకు రష్యా తీవ్రంగా యత్నిస్తోంది. మారియుపోల్ ఆక్రమణ ఈ దిశగా కీలక ముందడుగని నిపుణులు పేర్కొన్నారు. నగరంపై దాడిలో దాదాపు 21వేల మంది చనిపోయిఉంటారని ఉక్రెయిన్ తెలిపింది. ప్రస్తుతం అక్కడ దాదాపు లక్షమంది ప్రజలు ఉన్నట్లు అంచనా. సిద్ధమవుతున్న సిరియా ఫైటర్లు ఉక్రెయిన్లో రష్యా తరఫున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారు. సుహైల్ ఆల్ హసన్ డివిజన్కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రష్యా యుద్ధనీతి మారుతుందంటున్నారు. జనరల్ అలెగ్జాండర్ను ఉక్రెయిన్పై యుద్ధ దళపతిగా పుతిన్ నియమించిన సంగతి తెలిసిందే! గతంలో ఈయనకు సిరియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతవరకు దాదాపు 40వేలమంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. అయితే సిరియా ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను ఖండించింది. -
బలగాలు వెనక్కి.. ఆ వెంటనే ట్విస్ట్ ఇచ్చిన రష్యా
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి 30 రోజులకు పైగా దాటింది. ఈ క్రమంలో ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా మంగళవారం టర్కీలో జరిగిన శాంతి చర్చల ద్వారా ఇరుదేశాలు మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకుంటే ఇప్పటికే పలు మార్లు శాంతి కోసం చర్చలు జరిగినా, సూమారు నెలరోజుల తర్వాత ఇరుదేశాల చర్చల్లో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో పురోగతి.. కీవ్, చెర్నిహివ్ నుంచి తమ బలగాలు ఉపసంహరించేందుకు రష్యా అంగీకరించినట్లు తెలుస్తోంది. కీవ్, చెర్నిహివ్ చుట్టూ మోహరించిన బలగాలను వెనక్కి పిలిపిస్తామని శాంతి చర్చల్లో పాల్గొన్న రష్యా ప్రతినిధి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సమస్యకు పూర్తిగా పరిష్యారం దొరికే వరకు కాల్పుల విరమణ ఉండబోదని అందుకోసం మరింత చర్చించాలని ఆయన తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కోసం తాము మరింత దూరం ప్రయాణించాలని ఆయన చెప్పారు. దీంతో రష్యా బలగాల దాడులు ఉక్రెయిన్లో కొనసాగుతూ ఉన్నాయి. చర్చలు జరుపుతున్న సమయంలోనూ కొనసాగిన దాడులు ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతుండగా పశ్చిమ, దక్షిణ ఉక్రెయిన్లో పలు ప్రాంతాలపై రష్యా తమ దాడులను కొనసాగిస్తూనే ఉంది. మంగళవారం ఓ వైపు చర్చలు జరుగుతున్నప్పటికీ పశ్చిమ ప్రాంతంలోని ఓ ఇంధనాగారంపై భారీగా క్షిపణి దాడులు జరిగాయి. దక్షిణాదిన రేవు పట్టణం మైకోలేవ్లో 9 అంతస్తుల పాలనా భవనంపై రష్యన్ బలగాలు క్షిపణులతో విరుచుకుపడ్డారు. -
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక ముందడుగు
ఇస్తాంబుల్: ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునేందుకు నెల రోజులుగా రష్యా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడమనేది అనుకున్నంత సులభం కాదని రష్యా నిర్ధారణకొచ్చినట్లు తెలుస్తోంది. అయినా పట్టువీడకుండా అత్యాధునిక ఆయుధాలను సైతం రష్యా ఉపయోగిస్తోంది. అయితే ఇదంతా ఒకవైపు కొనసాగుతుంటే.. మరోవైపు మంగళవారం రోజున ఇస్తాంబుల్లో జరిగిన ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. శాంతి చర్చల్లో విశ్వాసాన్ని పెంచడానికి కీవ్, చెర్నీవ్ నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటామని రష్యా ప్రకటించింది. పరస్పర విశ్వాసం, తదుపరి చర్చలు జరగడానికి అవసరమైన పరిస్థితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. రష్యా ప్రతినిధి బృందం మాస్కోకు తిరిగొచ్చిన తర్వాత ఇస్తాంబుల్లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలను మరింత విపులంగా వెల్లడిస్తామని రష్యా జనరల్ స్టాఫ్ ఫోమిన్ చెప్పారు. చదవండి: (రష్యా సైనికుల దురాగతం... ఉక్రెయిన్ మహిళపై అత్యాచారం) యుద్ధం మొదలై నెలరోజులు దాటిపోయిన వేళ.. ఉక్రెయిన్, రష్యా మధ్య మరోసారి శాంతి చర్చలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ఇస్తాంబుల్ చేరుకున్న ఇరుదేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా దీనికి హాజరయ్యారు. తమ ప్రాథమిక లక్ష్యాలను ఈ చర్చల ద్వారా సాధిస్తామని రష్యా విదేశాంగమంత్రి సెర్గె లవ్రోవ్ వెల్లడించారు. యుద్ధం మొదలైన తర్వాత ఇరువర్గాల మధ్య బెలారస్, పొలాండ్ సరిహద్దుల్లో మూడు దఫాలు చర్చలు జరిగాయి. అయితే శాంతి దిశగా ఎలాంటి ముందడుగూ పడలేదు. -
జెలెన్స్కీ తగ్గినా..! పుతిన్ తగ్గట్లేదా?
-
అనూహ్యం.. వెనక్కి తగ్గిన జెలెన్స్కీ! పుతిన్ తగ్గట్లేదా?
టర్కీలో రష్యా-ఉక్రెయిన్ ప్రతినిధుల శాంతి చర్చలు జరుగుతాయనే ప్రచారం నడుమ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆసక్తికర ప్రకటనకు తెర లేపాడు. యుద్ధ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా ఆయన ప్రకటన ఉండడం విశేషం. ఆదివారం రాత్రి నేరుగా రష్యా జర్నలిస్టులను ఉద్దేశించి వీడియో కాల్లో మాట్లాడిన జెలెన్స్కీ.. తటస్థ వైఖరిని అవలంభించేందుకు ఉక్రెయిన్ సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశాడు. మూడో పార్టీ సమక్షంలో తప్పనిసరి ఒప్పందం, రెఫరెండానికి సైతం సిద్ధమంటూ పేర్కొన్నాడు జెలెన్స్కీ. శాంతి ఒప్పందంలో భాగంగా.. తూర్పు డోనాబాస్ ప్రాంతం విషయంలో తటస్థంగా ఉండడంతో పాటు వెనక్కి తగ్గేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆదివారం రష్యా జర్నలిస్టుల సమక్షంలో ప్రకటించాడు జెలెన్స్కీ. ‘‘ఉక్రెయిన్కు భద్రతా హామీలు, తటస్థత, అణు రహిత స్థితి.. ఈ అంశాలపై శాంతి చర్చలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం’’ అంటూ రష్యన్ భాషలోనే జెలెన్స్కీ ప్రసంగించడం విశేషం. జెలెన్స్కీ ప్రసంగాలు, ఉక్రెయిన్ పరిణామాలపై కథనాలు ప్రసారం చేయకూడదని రష్యా జర్నలిస్టులకు రష్యా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయినప్పటికీ శాంతి కోరే దిశగా కీలక ప్రకటన కావడంతో వాళ్లు ఆ కథనం టెలికాస్ట్ చేయడం గమనార్హం!. అయితే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేసిన వేళ.. ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి కైర్య్లో బుడానోవ్ మాత్రం విరుద్ధమైన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ తూర్పు భాగాన్ని ఆక్రమించే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నాడంటూ బుడానోవ్ వ్యాఖ్యానించారు. ‘‘కొరియాను విడగొట్టినట్లే.. ఉక్రెయిన్ను విడగొట్టాలనే దురాలోచనలు ఉన్నాయి కొందరికి. ఇది ఆపడానికి ఇప్పటికే మా దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. పాశ్చాత్యదేశాలను యుద్ధట్యాంకులు, విమానాలు, మిస్సైల్స్ పంపాలని కోరారు’’ అంటూ ఆదివారం ఒక విరుద్ధ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఆదివారం.. పుతిన్, టర్కీ అధ్యక్షుడు టాయిప్ ఎర్డోగాన్ మధ్య చర్చలు జరిగాయి. రష్యా-ఉక్రెయిన్ నడుమ కాల్పుల విరమణ, పౌరుల సురక్షిత తరలింపు అంశాలు ఎజెండాగా ఇస్తాంబుల్ మధ్యవర్తిత్వం వహించేందుకు టాయిప్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఎప్పుడైనా.. రష్యా-ఉక్రెయిన్ అధికారుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. శనివారం పోల్యాండ్ పర్యటన సందర్భంగా పుతిన్ ఇక అధికారంలో ఉండడంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యాఖ్యలపై అమెరికా భద్రతా ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం ఒక స్పష్టత ఇచ్చారు. ‘‘పుతిన్ను గద్దె దించడమా? రష్యా సార్వభౌమ అధికారంలో తలదూర్చడం మాకేం పని? ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకునే ఉద్దేశం అమెరికా లేదు’’ అని పేర్కొన్నారు బ్లింకెన్. చదవండి: ఈయూ దేశాల్ని ఇరకాటంలో పెట్టిన పుతిన్ -
Ukraine Crisis: రష్యాకు బిగ్ షాక్.. పుతిన్కు మరో దెబ్బ!
Ukraine War Live Updates: ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను మరింతగా రెచ్చగొడుతోంది అమెరికా. ఒకవైపు యుద్ధం ఆపాలంటూ పిలుపు ఇస్తూనే.. మరోవైపు ఆంక్షలు విధిస్తూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో రష్యా బలగాలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. యుద్ధం 14వ రోజు కూడా కొనసాగుతోంది. మరోవైపు ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రష్యా-ఉక్రెయిన్ ప్రజలు. పిల్లల ఆసుపత్రిపై బాంబు దాడి.. ►ఉక్రెయిన్లో మారియూపోల్ నగరంలోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బలగాలు బాంబు దాడికి పాల్పడ్డాయి. ఈ బాంబు దాడుల వల్ల ఆసుపత్రి ధ్వంసమైందని స్థానిక కౌన్సిల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. రష్యా చేతిలో బందీలుగా 4 లక్షల మంది ఉక్రేనియన్లు.. ► ఉక్రెయిన్లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. ఉక్రెయిన్లోని మరియూపోల్లో 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బందించినట్టు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి డిమిట్రో కులేబా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రష్యా దాడుల కారణంగా 3 వేల మంది నవజాత శిశువులకు సరైన వైద్యం, మెడిసిన్ అందక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రష్యాను ఉక్రెయిన్ పౌరులు, పిల్లలపై దాడులు ఆపాలంటూ ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. Russia continues holding hostage over 400.000 people in Mariupol, blocks humanitarian aid and evacuation. Indiscriminate shelling continues. Almost 3.000 newborn babies lack medicine and food. I urge the world to act! Force Russia to stop its barbaric war on civilians and babies! — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 రష్యాకు బిగ్ షాక్.. ► ఉక్రెయిన్పై దాడుల నేపథ్యంలో రష్యాకు మరో బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన సంస్థలతో ఉన్న అన్ని సంబంధాలను స్తంభింపజేస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ఆంక్షలకు అనుగుణంగా ఆంక్షల జాబితాలో ఉన్నవారికి దావోస్లో జరిగే వార్షిక సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. ప్రమాదంలో చెర్నోబిల్ న్యూ క్లియర్ ప్లాంట్.. ► ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆపేసిందని బిగ్ బాంబ్ పేల్చారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్కు అందిన సమాచారం ప్రకారం.. చెర్నోబిల్లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లకు కేవలం 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉందని వెల్లడించారు. ప్లాంట్కు విద్యుత్ సరఫరా లేకపోతే.. న్యూక్లియర్ మెటీరియల్ను చల్లార్చే వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ క్రమంలో రేడియేషన్ను నియంత్రించడం కష్టమవుతుందన్నారు. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా దాడుల కారణంగానే చెర్నోబిల్కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. రష్యా కాల్పుల విరమణ పాటిస్తేనే గ్రిడ్కు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందన్నారు. Reserve diesel generators have a 48-hour capacity to power the Chornobyl NPP. After that, cooling systems of the storage facility for spent nuclear fuel will stop, making radiation leaks imminent. Putin’s barbaric war puts entire Europe in danger. He must stop it immediately! 2/2 — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడం మా టార్గెట్ కాదు.. ► రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడో రౌండ్లో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చర్చల్లో రెండు దేశాల బృందాలు కొంత పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని జెలెన్స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రష్యా ప్రయత్నించడంలేదని తెలిపింది. దేశాన్ని వీడుతున్న ప్రేయసి.. లవ్ ప్రపోజ్ చేసిన ఉక్రెయిన్ సైనికుడు ► యుద్ధం కారణంగా దేశాన్ని వీడుతున్న తన ప్రేయసికి ఉక్రెయిన్ సైనికుడు లవ్ ప్రపోజ్ చేశాడు. సడెన్గా ఇలా ప్రియుడిని చూసిన ఆనందంలో ఆమె ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యింది. క్షణాల వ్యవధిలో ఆమె.. అతడిని హగ్ చేసుకొని తాను పెళ్లి రెడీ అన్న సంకేతంతో ముద్దుపెట్టింది. అనంతరం అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు ఆ జంటకు అభినందనలు తెలిపారు. #Watch#Ukraine️ pic.twitter.com/4DeRtEgivM — Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) March 7, 2022 సుమీ నుంచి రైళ్లలో భారతీయుల తరలింపు.. ► ఉక్రెయిన్లోని సుమీలో రష్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికారుల సాయంతో సుమీ నుంచి భారతీయులను రైళ్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉక్రెయిన్లోని భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ క్రమంలోనే భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించడమే తమ కర్తవ్యమని ఎంబసీ తెలిపింది. 🇮🇳n students from Sumy on board the special train organised with assistance of 🇺🇦n authorities. Mission will continue to facilitate their movement westwards. Bringing back our students safely and securely will remain our priority. Be Safe Be Strong pic.twitter.com/lGNnHsfRs7 — India in Ukraine (@IndiainUkraine) March 9, 2022 రష్యా, బెలారస్పై ఈయూ మరిన్ని కఠిన ఆంక్షలు ► ఉక్రెయిన్పై దాడుల నేపథ్యంలో ఇప్పటికే రష్యాపై పలు దేశాలు, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాడుల వేళ రష్యాకు సహకరిస్తున్న కారణంగా బెలారస్పై, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్లోని సభ్య దేశాలు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 12వేల మంది రష్యా సైనికులు హతం.. ఉక్రెయిన్ ► ఉక్రెయిన్పై చేపట్టిన యుద్ధంలో ఇప్పటివరకు 12,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యాకు చెందిన 303 యుద్ధ ట్యాంకులు, 1036 సాయుధ వాహనాలు, 120 శతఘ్నులు, 27 యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ వార్ఫేర్ సిస్టమ్స్, 48 యుద్ధ విమానాలు, 80 హెలికాప్టర్లు, 60 ఇంధన ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మోదీజీ మీ సాయానికి థ్యాంక్స్.. బంగ్లా ప్రధాని ► ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ గంగా కొనసాగుతోంది. ఆపరేషన్ గంగాలో భాగంగా కేవలం భారతీయులే కాకుండా బంగ్లాదేశీయులు, నేపాలీలు, పాకిస్తానీలు, ట్యూనీషియన్లు కూడా ప్రత్యేక విమానాల ద్వారా భారత్ చేరుకుని ఇక్కడి నుంచి తమ స్వదేశాలను వెళ్తున్నారు. కాగా, తొమ్మిది మంది బంగ్లాదేశ్ ప్రజలు.. ఆపరేషన్ గంగాతో ఇండియా నుంచి తమ దేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తమ దేశ పౌరులను యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించినందుకు మోదీకి ఆమె థ్యాంక్స్.. అంటూ వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్పై ప్రకటన ► ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) చెర్నోబిల్ గురించి కీలక ప్రకటన చేసింది. చెర్నోబిల్తో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించింది. రెండు వారాలుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. రష్యా బలగాలు చెర్నోబిల్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అక్కడి స్టాఫ్ పరిస్థితి మీద కూడా ఎలాంటి అప్డేట్ లేదు అని తెలిపింది. ఇదిలా ఉండగా.. 210 మంది టెక్నీషియన్ల సరిపడా ఆహారం, మందులు ఉన్నప్పటికీ.. పరిస్థితి విషమిస్తోందని అటామిక్ ఏజెన్సీకి ఉక్రెయిన్ ఒక నివేదిక ఇచ్చింది. IAEA says it has lost contact with Chernobyl nuclear data systems. The Chernobyl nuclear power plant is no longer transmitting data to the UN watchdog, the agency says, voicing concern for staff working under Russian guard at the Ukrainian facilityhttps://t.co/rzgZhLjAij pic.twitter.com/kaZvsTN7bn — AFP News Agency (@AFP) March 9, 2022 ► మరోసారి రష్యా కాల్పుల విరమణ. బుధవారం కూడా సేఫ్ కారిడార్ల నుంచి పౌరుల తరలింపునకు అనుమతి. ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు ముమ్మరం. అయినా రష్యా బలగాలు ఉల్లంఘనలతో దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపణ. రష్యా చేతిలోకి కీవ్! ► మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపానికి రష్యా దళాలు చేరుకున్నాయి. వాటి దూకుడు చూస్తుంటే మరికొన్ని గంటల్లో కీవ్ రష్యా సేనల చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ► ఉక్రెయిన్ నగరమైన సుమీపై రష్యన్ సేనలు బాంబు దాడులకు దిగిన తర్వాత ఆ నగరం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మందిని తరలించారు. రష్యన్ దళాల దాడిలో పలువురు మరణించినట్టు అధికారులు తెలిపారు. ► రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 14వ రోజుకు చేరుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 మిలియన్ల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టారు. అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ► ఒకవైపు నాటో ప్రతికూల ప్రకటన, రష్యాతో సంధి కోసం పిలుపు ఇచ్చినట్లే ఇచ్చి.. యుద్ధం ఆపేదేలేదంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా దాడిని ప్రతిఘటిస్తూనే ఉండాలని తమ పౌరులకు పిలుపునిచ్చారు. ► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అలాగే, కోకా-కోలా, పెప్సీ కూడా రష్యాలో అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. తమ ఆదాయంలో ఒకటి నుంచి రెండు శాతం రష్యా, ఉక్రెయిన్ నుంచే వస్తున్నట్టు కోకా-కోలా తెలిపింది. ► ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా తూర్పు, సెంట్రల్ రీజియన్లో రష్యన్ యుద్ధ విమానాలు రాత్రంతా బాంబుల వర్షం కురిపించాయి. -
ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
యుద్ధం వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వరం మారింది. నాటో సభ్యత్వం విషయంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నాటో సభ్యత్వం కోసం ఇకపై కూటమిపై ఎలాంటి ఒత్తిడి చేయబోనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు రష్యాతో శాంతియుత చర్చల కోసమే తాను సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నాడు. ఏబీసీ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలాకాలం తర్వాత విషయం ఏంటో నాకు అర్థం అయ్యింది. ఉక్రెయిన్ కోసం నాటో సిద్ధంగా లేదు. మిత్రపక్షాలు (Eastern European country) వివాదాస్పద అంశాల జోలికి పోయేందుకు భయపడుతున్నాయి. ముఖ్యంగా రష్యాను ఎదుర్కొనేందుకు అవి సిద్ధంగా లేవు. ఇది గుర్తించడం కాస్త ఆలస్యమైంది. ఈ తరుణంలో నేనే చల్లబడడం మంచిది అనిపించింది. నాటో కోసం నేనింక బతిమాల దల్చుకోవడం లేదు. మోకాళ్లపై కూర్చుని అడుక్కుకోవాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్ కంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. ఈ దేశాన్ని(ఉక్రెయిన్ను) అలా చూడాలనుకోవడం లేదు. అలాంటి దేశానికి నేను అధ్యక్షుడిగా ఉండాలనుకోవడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు జెలెన్స్కీ. అంతేకాదు రష్యా స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన ఉక్రెయిన్ రెబల్స్ విషయంలోనూ కాంప్రమైజ్ కావాలని నిర్ణయించుకున్నట్లు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్లో భాగం కావాలనుకునే వ్యక్తులు అక్కడ ఎలా జీవిస్తారన్నది నాకు ముఖ్యం. రష్యన్ ఫెడరేషన్ యొక్క పౌరులుగా తమను తాము చూసే వారి అభిప్రాయంపై నాకు ఆసక్తి ఉంది. అయితే, ఈ సమస్య గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకు నేను సిద్ధం’’ అంటూ ప్రకటించాడు. దీంతో రష్యాతో శాంతియుతంగా సమస్య పరిష్కారానికి జెలెన్స్కీ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు పంపినట్లయ్యింది. మరి రష్యా నుంచి బదులు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రష్యా ఆయిల్పై అమెరికా దిగుమతి ఆంక్షలు విధించింది. ఈ తరుణంలో అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న పుతిన్.. మరింత రెచ్చిపోతాడా? శాంతిస్తాడా?.. నేడు మూడో దఫా చర్చలపైనే(జరగొచ్చనే ఆశాభావం) ఆసక్తి నెలకొంది. 2008లో ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అభ్యంతరాలతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్పై మిలిటరీ చర్యకు దిగాడు. ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున నాలుగు నుంచి ఏడు వేల మధ్య సైనికులు చనిపోయినట్లు అంచనా. అలాగే ఉక్రెయిన్ తరపు నుంచి నష్టంపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. సంబంధిత వార్త: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్స్కీ డబుల్ గేమ్! -
War Updates: ఉక్రెయిన్కు బ్రిటన్ సాయం.. 400 మిలియన్ పౌండ్లు..
Russia-Ukraine war Live Updates: యుద్ధ వాతావరణం నడుమే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది రష్యా. మరోవైపు తామేమీ తగ్గబోమంటూ ప్రకటించిన ఉక్రెయిన్ సైతం చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో యుద్ధం 12వ రోజు కొనసాగుతుండగా.. చర్చలూ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో.. ►ఉక్రెయిన్కు బ్రిటన్ దేశం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మానవతా దృక్పథంతో 175 మిలియన్ల పౌండ్లను అందజేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ బ్రిటన్ 400 మిలియన్ పౌండ్లను ఉక్రెయిన్కు సాయంగా అందించింది. ►ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాల ద్వారా సోమవారం 7 విమానాల ద్వారా మొత్తం 1,31 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు పౌరవిమనయానశాఖ తెలిపింది. ►రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్లో 406 మంది పౌరుల మరణించినట్లు ధృవీకరించినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. ఆదివారం నాటికి మరో 801 మంది గాయపడినట్లు వెల్లడించింది. ►ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరించినట్లయితే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా పేర్కొంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్మాట్లాడుతూ..కైవ్ తన షరతులను నెరవేర్చినట్లయితే తక్షణం సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉక్రెయిన్ ఏ కూటమిలో చేరకుండా ఉండేందుకు వారు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు. ►ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాల నుంచి మైకోలాయివ్ ప్రాంతీయ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని స్థానిక గవర్నర్ విటాలి కిమ్ సోమవారం తెలిపారు. ►ఉక్రెయిన్లో చిక్కుకున్న 400 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు రొమేనియా నుంచి మంగళవారం రెండు విమానాలను నడపనున్నట్లు పౌర విమానయానశాఖ పేర్కొంది. ►రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్కు సమీపంలోని గోస్టోమెల్ మేయర్ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. గోస్టోమెల్ మేయర్ యూరి ఇల్లిచ్ ప్రైలిప్కో స్థానికంగా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని,యు రోగులకు మందులు పంపిణీ చేస్తున్నప్పుడు ఆయనతోపాటు మరో ఇద్దరిని కాల్చిచంపారని పేర్కొన్నారు.అని అది పేర్కొంది. ఆయన తన ప్రజల కోసం, గోస్టోమెల్ కోసం హీరోగా ప్రాణాలు విడిచాడని తెలిపారు. ►రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పరోక్షంగా నష్టపోతున్న ప్రపంచ దేశాల స్థితిగతులపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. 21వ శతాబ్దంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధానికి స్వాగతం చెబుతూ.. రష్యా - ఉక్రెయిన్ తోపాటు మిగిలిన ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. ►ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రతినిధు బృంధం నేడు బెలారస్కు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ►రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ పరిస్థితులపై 50 నిమిషాలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్తో చర్చల వివరాలను పుతిన్ మోదీకి వివరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడాలని పుతిన్ను మోదీ కోరారు. ఉక్రెయిన్లో నగరాలు, సుమీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేసి మానవతా కారిడార్ను ఏర్పాటు చేయడంపై పుతిన్కు మోదీ అభినందనలు తెలిపారు. ►తమ దేశంపై రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించాలని కోరుతూ ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనపై అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల విచారణను సోమవారం ప్రారంభించింది. ఈ మేరకు ఐసీజే ప్రధాన కార్యాలయం పీస్ ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ తన వాదలను నేడు కోర్టు ముందు ఉంచనుంది. రష్య మంగళవారం స్పందించే అవకాశం ఉంది. ►భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలు చేసినందుకు, ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయనఅధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ►రష్యా-చైనా మధ్య స్నేహం ఇప్పటికీ చాలా ధృడంగా ఉన్నట్లు చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యూ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు ఇరు దేశాల శాంతి పునరుద్ధర కోసం మధ్యవర్తిత్వంపై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నన నేపథ్యంలో చైనా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా మానవతా సహాయాన్ని ఉక్రెయిన్కు అందిస్తున్నామని వాంగ్ తెలిపారు. ►ఉక్రెయిన్లో బాంబుల మోత మోగుతుంటే తన ప్రాణాలకు ఏమైనా ఫర్వాలేదు కానీ కొడుకు క్షేమంగా ఉండాలని రైలులో ఒంటరిగా పంపించింది ఓ తల్లి. తన 11 ఏళ్ల కొడుకుకి ధైర్యం చెప్పి..తినటానికి తిండి తాగటానికి నీళ్లు అన్నీ బ్యాగులో సర్ది.. చేతిపై ఫోన్ నెంబర్ రాసి ‘క్షేమంగా..జాగ్రత్తగా వెళ్లు నాన్నా’అంటూ కొడుకును పంపించింది. అమ్మ చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్న ఆ పిల్లాడు బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యుక్రెయిన్లోని జపోరిజియా ప్రాంతం నుంచి స్లొవేకియా దేశానికి చేరుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా అనుకున్న గమ్యానికి చేరుకున్నాడని తెలిసిన ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ► రష్యా మా బంధం బలంగానే ఉంది: చైనా రష్యా తమకు మిత్రదేశమని, బంధం ఇంకా బలంగానే ఉందని చైనా ప్రకటించుకంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మరోసారి ‘అవసరమైతే ఉక్రెయిన్-రష్యా సంధిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమ’ని స్పష్టమైన ప్రకటన చేశారు. ► ఆపరేషన్ గంగలో భాగంగా.. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు స్పెషల్ విమానాల్లో భారత్కు చేరుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ ముగించాలని భారత్ భావిస్తోంది. #WATCH | Tears of joy and some sweets at Delhi airport, as a mother breaks down on seeing her daughter Saloni, who has arrived from war-torn #Ukraine "Can't be expressed in words how happy I feel to see my child back home with me," the mother said pic.twitter.com/V2xUzXgHLG — ANI (@ANI) March 7, 2022 ► రష్యాపై ఆంక్షలు మాత్రమే సరిపోవని, యుద్ధం ఆపేలా చేయడానికి తీవ్ర చర్యలకు దిగాల్సిందేనని పశ్చిమ దేశాలతో జెలెన్స్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ► రష్యా సెంట్రల్ బ్యాంక్తో లావాదేవీలను నిలిపివేసిన సౌత్ కొరియా. ► జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్దరి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో సాయం పట్ల జెలెన్ స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ కొందరు భారత పౌరులు ఉక్రెయిన్లోనే ఉండడంతో భారత పౌరుల తరలింపులో నిరంతరం సహకారం ఉండాలని మోదీ కోరారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీకి జెలెన్ స్కీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, ఖార్కీవ్, మరియూపోల్, సుమీ నగరాల్లో మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల నుంచి కాల్పుల విరమణ మొదలవుతుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని పలు న్యూస్ ఏజెన్సీలు సైతం ధృవీకరించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ వ్యక్తిగత రిక్వెస్ట్ మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విరమణ ఎంత సేపు ఉంటుందనేది మాత్రం పేర్కొనలేదు. ఈ లోపు కారిడార్ల ద్వారా పౌరులను తరలించనున్నారు. ►ఉక్రెయిన్లోని క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది.వాయుసేన జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని ఉక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ తెలిపింది. Russian military declares ceasefire in Ukraine from 0700 GMT to open humanitarian corridors at French President Emmanuel Macron's request: Sputnik — ANI (@ANI) March 7, 2022 ఇంకోపక్క సుమీలో భారతీయ విద్యార్థుల తరలింపు కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మధ్యాహ్నాం ఫోన్లో సంప్రదించనున్నట్లు పీఎంవో వెల్లడించింది. ► ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఈ ఘటనలో పైలట్ చనిపోయినట్టు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. కులినిచివ్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది. పైలట్కు తప్పించుకునే సమయం కూడా లేకపోయిందని, ఘటనా స్థలంలోనే ఆయన చనిపోయారని పేర్కొంది. ► బాంబులతో దద్దరిల్లుతున్న మికోలాయివ్ పోర్టు నగరం మికోలాయివ్ బాంబులతో దద్దరిల్లుతోంది. ప్రధాన నగరాలకు వశపర్చుకునే క్రమంలో రష్యా బలగాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దాడులు ఉదృతం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి పిలుపు ఇచ్చాడు. Russian forces appear to have launched a heavy artillery barrage against Mykolaiv, a day after Ukrainian troops pushed them from the city and recaptured the airport. From my vantage, I could see flashes from the attack lighting up the night sky along a large swath of the city. pic.twitter.com/cm4E0cNtN3 — Michael Schwirtz (@mschwirtz) March 7, 2022 ► రష్యాపై ఆంక్షల పర్వం రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా, మిత్రపక్షాలు రష్యా ఆయిల్పైనా బ్యాన్ విధించే యోచనలో ఉన్నాయి. ► అంతర్జాతీయ న్యాయస్థానంలో.. మారణహోమం దావాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ మరియు రష్యాలు తలపడనున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో జరుగుతున్న దారుణాల నేపథ్యంలోనే ప్రత్యేక మిలిటరీ చర్యలకు దిగినట్లు రష్యా.. ఆధారాల్లేకుండా ఆరోపణలపై ఉక్రెయిన్ పరస్పరం వాదించనున్నాయి. ► జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్! ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఫోన్లో మాట్లాడుకోనున్న ఇరు దేశాల నేతలు. మరోసారి భారత్ సాయం కోరనున్న జెలెన్స్కీ. భారత విద్యార్థుల తరలింపుపైనే ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీసే అవకాశం. PM Narendra Modi to speak to Ukrainian President Zelenskyy on the phone today: GoI sources (file photos) pic.twitter.com/PuWuCv2Fqw — ANI (@ANI) March 7, 2022 ► అత్యాధునిక ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మానవ సంక్షోభంగా ఉకక్రెయిన్ యుద్ధం నిలిచిపోనుందనే ఆందోళన ఐరాస వ్యక్తం చేస్తోంది. సుమారు 70 లక్షల మంది ఉకక్రెయిన్ను వీడొచ్చని అంచనా వేస్తోంది. ► ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో నేడు(సోమవారం).. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నాటో ఎంట్రీ ► నాటో దళాల ఎంట్రీని ఖంచిస్తున్న రష్యా. ఇది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిహెచ్చరిక. ► ఉక్రెయిన్కు మద్దతుగా రంగంలోకి దిగిన నాటో దేశాలు. జెలెన్స్కీ సాయం కోరిన తర్వాత అమెరికా చొవరతో నాటో దేశాల్లో కదలిక. రొమేనియాకు 40 వేల మంది సైనికులు. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలు, 4 పైటర్జెట్లు. పోలాండ్కు చేరుకున్న బ్రిటన్ రాయల్ ఎయిర్ఫోర్స్. ► ఫలించిన జెలెన్స్కీ విజ్ఞప్తి. నాటోకు అమెరికా గ్రీన్ సిగ్నల్. పోలాండ్కు సాయం తరలింపు. ► యుద్ధంతో నన్ను చంపేస్తే.. ఉక్రెయిన్కు సాయం చేయాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ► ఉక్రెయిన్పై రష్యా యుద్ధం12వ రోజూ కొనసాగుతోంది. మిస్సైల్స్తో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మికోలాయివ్ దగ్గర హోరాహోరీ పోరు. ► యుద్ధ భయంతో ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస వెళ్లిపోయారు: ఐరాస This horrific 500-kg Russian bomb fell on a residential building in Chernihiv and didn’t explode. Many other did, killing innocent men, women and children. Help us protect our people from Russian barbarians! Help us close the sky. Provide us with combat aircraft. Do something! pic.twitter.com/3Re0jlaKEL — Dmytro Kuleba (@DmytroKuleba) March 6, 2022 ► పౌరుల తరలింపునకు సహకరిస్తామని ప్రకటించిన రష్యా.. యుద్ధం ఆపట్లేదు. దీంతో ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు కష్టతరంగా మారింది ఉక్రెయిన్కు. ముఖ్యంగా మరియూపోల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకవైపు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యా.. పవర్, వాటర్ను కట్ చేసి పడేసింది నగరానికి. ► రష్యా దాడులతో మధ్య ఉక్రెయిన్లోని విన్నిట్సియా ఎయిర్పోర్ట్ సర్వనాశనం అయ్యింది. ► ఉక్రెయిన్లోని పౌరులపై రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నాయని అమెరికా భద్రత ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపిస్తున్నారు. ► ఇర్పిన్ నగరాన్ని వీడాలని ప్రయత్నిస్తున్న పౌరులు.. రష్యా దాడుల భయంతో, సైనికుల తుపాకీ బెదిరింపులతో వెనక్కి మళ్లుతున్నారు. ► ఓటీటీ కంపెనీ నెట్ఫ్లిక్స్తో పాటు కేపీఎంజీ, పీడబ్ల్యూసీ లాంటి అకౌంటింగ్ సంస్థలు, అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి ఫైనాన్షియల్ కంపెనీలు రష్యాతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నట్లు ప్రకటించాయి. ► ఉక్రెయిన్కు మద్ధతుగా రష్యాలో కొనసాగుతున్న నిరసనలు. 4,500 మంది నిరసనకారులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ► అయితే సంధి లేకుంటే సమరం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఉక్రెయిన్తో తేల్చి చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. -
Sakshi Cartoon: శాంతి చర్చలు కొనసాగుతుండగానే..
ఐక్యరాజ్య సమితి శాంతి చర్చలు కొనసాగుతుండగానే ఉక్రెయిన్పై రష్యా దాడి -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. పుతిన్తో చర్చలకు బైడెన్ ఓకే
వాషింగ్టన్: యూరప్లో యుద్ధ భయాల నడుమ చివరి ఆశగా శాంతి యత్నాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై అమెరికా, రష్యా అధ్యక్షులు జో బైడెన్, వ్లాదిమిర్ పుతిన్ మరోసారి చర్చలు జరిపే సూచనలు కని్పస్తున్నాయి. సంక్షోభాన్ని చల్లార్చేందుకు పుతిన్తో భేటీకి బైడెన్ సూత్రప్రాయంగా అంగీకరించారని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలన్నదే ముందునుంచీ తమ వైఖరి అన్నారు. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, సెర్గీ లవ్రోవ్ ఈ వారం భేటీ కానున్నారని గుర్తు చేశారు. అయితే ఈ రెండు భేటీలూ ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగని పక్షంలో మాత్రమే జరుగుతాయన్నారు. దీనిపై రష్యా ఆచితూచి స్పందించింది. అధ్యక్షుల సమావేశం జరిగే ఆస్కారముందన్న పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్, ‘‘అయితే అవి ఎప్పుడు, ఎలా జరుగుతాయన్న దానిపై ఈ దశలో మాట్లాడటం తొందరపాటే అవుతుంది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘భేటీ జరగడం మంచిదేనని అధ్యక్షులిద్దరూ భావిస్తేనే జరుగుతుంది. విదేశాంగ మంత్రుల స్థాయిలో చర్చలు కొనసాగించాల్సిన అవసరముందన్న వరకూ మాత్రం ప్రస్తుతానికి స్పష్టత ఉంది’’ అన్నారు. చర్చలకు తామెప్పుడూ సిద్ధమేనని, కాదని యుద్ధానికే దిగితే దీటుగా స్పందించేందుకు రెడీగా ఉన్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అన్నారు. జోరుగా రష్యా సైనిక విన్యాసాలు రెబెల్స్ ముసుగులో ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాపైకి కవి్వంపు చర్యలకు దిగి, ఆ సాకుతో దాడి చేయడం పుతిన్ వ్యూహమని అమెరికా ఆరోపిస్తూ వస్తోంది. శనివారం నాటి అణు పరీక్షలకు కొనసాగింపుగా బెలారుస్తో రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు సోమవారమూ పెద్ద ఎత్తున జరిగాయి. తూర్పు ఉక్రెయిన్లో కాల్పులు, బాంబుల మోతలు మరింతగా పెరిగాయి. ఇవన్నీ పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. బెలారుస్ సరిహద్దుల నుంచి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా విరుచుకుపడుతుందని నాటో అనుమానిస్తోంది. విన్యాసాల పేరిట 30 వేల దాకా సైన్యాన్ని బెలారుస్కు ఇప్పటికే తరలించిందని ఆరోపిస్తోంది. ఉక్రెయిన్కు మూడువైపులా మోహరించిన దాదాపు రెండు లక్షల సైన్యం నెమ్మదిగా ముందుకే కదులుతోందని అమెరికా, పశి్చమ దేశాలు ఆరోపిస్తున్నాయి. దాడికి దిగితే రష్యాపై విధించాల్సిన కఠినమైన ఆంక్షల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్టు యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. మాక్రాన్ మధ్యవర్తిత్వం బైడెన్, పుతిన్ తాజా భేటీ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్యవర్తిత్వం వహించారు. బైడెన్, పుతిన్తో ఆయన మాట్లాడారని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ‘‘అధ్యక్షుల భేటీలో చర్చించాల్సిన అంశాలను అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు గురువారం సమావేశమై ఖరారు చేస్తారు. వీటితో పాటు ఉక్రెయిన్ విషయమై ఇరు దేశాల మధ్య ఇతర స్థాయిల్లో కూడా చర్చలు కొనసాగుతాయి’’ అని వివరించింది. ఈలోగా ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగకూడదన్నదే ఈ చర్చలన్నింటికీ ఏకైక షరతని వెల్లడించింది. -
కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
Ukraine president Volodymyr Zelenskiy: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్ దళాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. అయితే ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనూహ్యంగా ఆ ప్రాంతంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. ఈ మేరకు త్రైపాక్షిక బృంద సమావేశంలో రష్యా, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో-ఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్ఈ)లతో పాటు ఉక్రెయిన్ కూడా శాంతిచర్చలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని జెలెన్స్కీ ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఉక్రెయిన్ వీడి భారత్కు రండి.. ఎంబసీ కీలక ప్రకటన) -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు చల్లార్చే యత్నాలు
మాస్కో: ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు సోమవారం అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చర్చలు జరపగా, జర్మన్ చాన్స్లర్ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో మాక్రాన్ సోమవారం పుతిన్తో సమావేశమవుతున్నారు. అనంతరం ఆయన ఉక్రెయిన్కు వెళ్లి చర్చలు జరుపుతారు. రష్యాతో చర్చలు జరిపి ఉద్రిక్తతలు నివారించడమే తన ప్రాధాన్యాంశమని మాక్రాన్ పలుమార్లు చెప్పారు. పుతిన్తో సమావేశానికి ముందు ఆదివారం ఆయన బైడెన్తో ఫోన్లో మాట్లాడారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చలు సాగాయని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడడంపై రాజీ లేదని, ఇదే సమయంలో రష్యాకు స్వీయ రక్షణపై ఉన్న సందేహాలు తీర్చాల్సిందేనని మాక్రాన్ చెప్పారు. మరోవైపు అమెరికాలో బైడెన్తో చర్చించిన అనంతరం జర్మన్ చాన్స్లర్ షుల్జ్ ఈ నెల 14– 15లో రష్యా, ఉక్రెయిన్లో పర్యటిస్తారు. అప్పట్లో కూడా ఆ రెండే క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్, జర్మనీల దౌత్యం ఎంతమేర ఫలిస్తుందో చూడాలని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా
US Talibans Face To Face Meeting: అమెరికా సైనిక దళాల ఉపసంహరణ వల్లే తాలిబన్ల దురాక్రమణకు మార్గం సుగమం అయ్యిందనే విమర్శ ఉంది. అంతేకాదు అఫ్గనిస్తాన్ నుంచి చాలా దేశాలకు వర్తకవాణిజ్యాలు నిలిచిపోవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధపడడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 31తో ఆఫ్గన్ నుంచి బలగాల్ని ఉపసంహరించుకున్న అగ్రరాజ్యం.. ఆ తర్వాత అక్కడి పరిణామాల్లో తలదూర్చలేదు. కానీ, అక్కడి పౌర హక్కుల ఉల్లంఘనపై మాత్రం తాలిబన్లను నిలదీస్తూ వస్తోంది. మరోవైపు తాలిబన్ల చేష్టల్ని ఓ కంటకనిపెడుతున్న అమెరికా.. ఇప్పుడు ప్రత్యక్ష చర్చలకు సిద్ధపడుతుండడం విశేషం. ప్రపంచంతో వర్తకవాణిజ్యాల పునరుద్దరణ ప్రధాన ఎజెండాగా ముఖాముఖి చర్చలకు రెడీ అయ్యింది. ఈ చర్చల్లోనే తాలిబన్లకు పలు షరతులు విధించాలని భావిస్తోంది. ఆ ఒక్కటి తప్ప.. అయితే ఆశ్చర్యకరరీతిలో చర్చలకు సిద్ధపడిన బైడెన్ ప్రభుత్వం.. తాలిబన్లకు మాత్రం గట్టి ఝలకే ఇచ్చింది. ఇలా చర్చలు జరిపినంత మాత్రానా తాలిబన్లను అఫ్గనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధులుగా గుర్తించబోమని (తాలిబన్ ప్రభుత్వంగా గుర్తించమని పరోక్షంగా) ప్రకటన విడుదల చేసింది. ‘‘తాలిబన్లు ఇప్పటికీ ఉగ్రవాద అనుబంధ సంస్థగానే ఉన్నారు. అమెరికాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజం నుంచి వాళ్లు(తాలిబన్లు) మారారనే నమ్మకం కలిగినప్పుడే ప్రభుత్వ గుర్తింపు అంశం పరిశీలిస్తాం’ అని అమెరికా తరపు ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు. అమెరికా తరపున ప్రతినిధులు శనివారం నేరుగా తాలిబన్లతో సమావేశమై చర్చలు జరపబోతున్నారు. వాణిజ్య అంశాలతో పాటు ఎగుమతులు-దిగుమతుల కొనసాగింపు, సుంకాల విధింపు-సడలింపులు తదితర విషయాలపై చర్చించనున్నారు. వీటితో పాటే మానవ హక్కులు.. ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల్ని పరిరక్షించాలనే డిమాండ్ను సైతం తాలిబన్ల ముందు ఉంచాలని అమెరికా భావిస్తోందట. అంతేకాదు ఈ సంక్షోభ-విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దేశాలను, సహాయక బృందాలను అఫ్గనిస్తాన్లోకి అనుమతించాలని సైతం కోరనుంది. చదవండి: ప్రపంచ దేశాల ఆందోళన.. అఫ్గాన్పై మాస్కోలో సదస్సు -
Panjshir Valley: తాలిబన్లతో మాటలా? తూటాలా?
తాలిబన్ల ఆక్రమణ తర్వాత అఫ్గన్ పరిణామాలు.. అంతర్యుద్ధం దిశగా దారి తీశాయి. ఆఫ్గన్ రెబల్స్ చేతుల్లోకి వెళ్లిన ప్రాంతాలను.. తిరిగి చేజిక్కిచ్చుకునేందుకు చర్చలతో ముందుకెళ్తోంది తాలిబన్ గ్రూప్. అయితే దేశంలో చాలా భాగాలు తిరిగి తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చినప్పటికీ.. పంజ్ షీర్ లోయ మాత్రం ఇంకా ప్రతిఘటన దళాల స్వాధీనంలోనే ఉండడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు చర్చల ప్రస్తావన వినిపిస్తున్నప్పటికీ.. మరోవైపు సమరానికి సై అంటూ పంజ్షీర్ దళం ప్రకటన ఇవ్వడం గందరగోళానికి దారితీస్తోంది. మేజర్ అమీర్ అక్మల్.. పంజ్షీర్ ప్రతిఘటన దళ సభ్యుడు. చిట్టచివరి అవుట్పోస్ట్ని సమర్థవంతంగా నడిపిస్తున్న కమాండర్. తాలిబన్ల గందరగోళ ప్రకటనల నేపథ్యంలో.. పోరుకే సిద్ధమని బహిరంగంగా ప్రకటించాడు. ‘మా దళంలో యువతే ఎక్కువగా ఉంది. సైనికులు.. మాజీ జిహాదీ కమాండర్ల అనుభవం మాకు కలిసి వస్తుంది. అందరికీ ఆమోద యోగ్యమైన వ్యవస్థకే మేం లోబడి ఉన్నాం. దేశాన్ని(అఫ్గనిస్థాన్)ను మళ్లీ నరకంలోకి దించం. సమరానికి మేం సిద్ధం. యుద్ధానికి కావాల్సిన సైన్యం, సరంజామా సరిపడా మాకు ఉంది’ అని ప్రకటించాడు అమీర్. పటిష్టమైన పద్మవ్యూహం హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో పంజ్షిర్ లోయ ఉంది. పంజ్షిర్(పంజ్షేర్) అంటే ఐదు సింహాలు అని అర్థం. ఇక్కడి జనాభా లక్షకు పైనే. చుట్టూ కొండలు, ఇరుకైన పర్వత శ్రేణులు, పంజ్షిర్ నదీ ప్రవహిస్తుంటాయి. ఈ లోయలోనే తజిక్ యుద్ధవీరులు ఉంటారు. చొరుబాటుదారుల్ని చంపి పాతరేస్తారు ఇక్కడ. అహ్మద్ షా మసూద్ లాంటి తజిక్ పోరాటయోధుల ఆధ్వర్యంలో సోవియట్ సైన్యాన్ని, తాలిబన్లను సైతం నిలవరించగలిగింది ఈ దళం. భీకర యోధులుగా వీళ్లకు పేరుంది. అయితే పాక్ వెన్నుదన్నులతో నడిచే తాలిబన్లను వీళ్లు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరు. అందుకే ఇప్పుడు అఫ్గన్ సైన్యం నుంచి భారీగా ఈ దళంలోకి చేరికలు వస్తున్నాయి. సుమారు తొమ్మిదివేల మంది ప్రస్తుతం ఈ దళంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లలో స్థానిక మిలిటెంట్లు, స్టాఫ్ ఉన్నారు. ‘‘ఆర్మీతో మేం సాధించింది ఏం లేదు. ఇప్పుడు మా మాతృభూమిని తాలిబన్ల చెర నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాం’ అని తజిక్ ప్రకటించింది. లొంగుబాటు కథనాలు పంజ్ షీర్ లీడర్ అహ్మద్ మసూద్ గౌరవపూర్వకంగా లొంగిపోవాలనుకుంటున్నారని, ఈ మేరకు తాలిబన్లతో చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ‘‘40 మందితో కూడిన తాలిబన్ల బృందం.. డిమాండ్లు అంగీకరించడమా? లేదా తిరుగుబాటును ఎదుర్కోవడమా? అనే రెండు ఆప్షన్లతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక నియంతృత్వానికి వ్యతిరేకమని ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్(ఉపాధ్యక్షుడు).. చర్చలు సానుకూలంగా సాగితే తిరుగుబాటు దళాలు దేనికైనా సిద్ధంగా ఉంటాయ’ని ఆ కథనం ప్రచురించింది. మరోవైపు ఈ కథనాలను మసూద్ కొట్టిపడేశాడు. నిజంగా ఆక్రమించారా? మంగళవారం తాలిబన్లు దక్షిణ్ ప్రావిన్స్కు ఆనుకుని ఉండే అంజుమాన్ పాస్ గుండా పంజ్ షీర్ లోయలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, తిరుగుబాటు దళాలు వారిని అడ్డుకున్నాయని, పంజ్ షీర్ బలగాల్లో చేరిన ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ కమాండో వజీర్ అక్బర్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయ్యింది. అయితే అది నిజం కాదని తాలిబన్ కమాండర్ ముల్లా ఖాక్సర్ ప్రకటన వెలువరించాడు. ‘మాకింకా స్పష్టమైన ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే పంజ్షిర్లో అడుగుపెడతాం. మేమేం అతివాదులం కాదు. సామరస్యంగా సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం. చర్చలకే మా మొగ్గు’ అని ఖాక్సర్ ప్రకటనలో ఉంది. చదవండి: భారత్.. మరి తాలిబన్లు ఏమంటారో? -
ఇరాన్తో చర్చలు ఫలవంతం
టెహ్రాన్: ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ హటామితో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం, ప్రాంతీయ భద్రతతోపాటు అఫ్గానిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. పలు అంశాలపై పరస్పరం అభి ప్రాయాలు పంచుకున్నామని, ఈ చర్చలు ఫలవంతమయ్యా యని రాజ్ నాథ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాజ్నాథ్ రష్యాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని అక్కడి నుంచి శనివారం ఇరాన్కు వచ్చారు. ఇరాన్ రక్షణ మంత్రి వినతి మేరకే ఈ భేటీ జరిగిందని రక్షణ శాఖ తెలిపింది. ఇరువురు నేతలు సాంస్కృతిక, భాషా, పౌర సంబంధాలు తదితర అంశాలపై సుహృ ద్భావ వాతావరణంలో చర్చలు జరిపారని చెప్పింది. ప్రాంతీయ భద్ర త, శాంతి పరిరక్షణ కోసం ఇరు దేశాల అధికారులు పరస్పరం సం ప్రదింపులు జరుపుతూనే ఉన్నారంది. ‘ఈ రీజియన్లోని దేశాలతో భా రత్ స్నేహ సంబంధాలను కోరుకుంటుంది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు , ద్వైపాక్షిక సంబంధాల్లో ఇతరుల జో క్యం నివారణకు కృషి చేస్తాం’అని రాజ్నాథ్ చెప్పారు. అంతర్యుద్ధం తో అతలా కుతలమవుతున్న అఫ్గానిస్తాన్లో పరిస్థితిపై భారత్ ఆం దోళ న వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ మంత్రితో భేటీ ప్రాధాన్యం సంత రించుకుంది. తాలిబాన్లు అమెరికాతో శాంతి ఒప్పందం కుదు ర్చు కు న్న తర్వాత రాజకీయ సుస్థిరత ఏర్పాటుపై భారత్ మరింత దృష్టిసారించింది. -
దోహా చేరుకున్న తాలిబన్ నేతలు
ఇస్లామాబాద్: అఫ్గాన్ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తాలిబన్ నేతల బృందం ఖతార్ రాజధాని దోహాకు చేరుకుంది. ఫిబ్రవరిలో దోహాలో అమెరికా– తాలిబన్ల మధ్య జరిగిన శాంతి ఒప్పందానికి ఈ చర్చలు కొనసాగింపు. ఈ చర్చల కోసం అమెరికా అటు అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్లపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. చర్చల సారాంశం ఆధారంగా అఫ్గాన్ భవితవ్యం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలు, మైనార్టీల హక్కుల పరిరక్షణ, మిలిషియాలను నిరాయుధులను చేయడం, పునరావాసం కల్పించడం వంటి అనేక కీలకాంశాలు ఈ చర్చలపై ఆధారపడి ఉన్నాయి. గత వారం చర్చల కొనసాగింపునకు సంబంధించి అఫ్గాన్ అధ్యక్షుడితో యూఎస్ సెక్యూరిటీ సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్ మంతనాలు జరిపారు. మరోవైపు తాలిబన్లను చర్చలకు ఒప్పించేందుకు పాకిస్తాన్ వైపు నుంచి ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే ఈ చర్చలు జరగాల్సిఉండగా, ఖైదీల విడుదలపై ఎటూ తేలకపోవడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. చర్చలకు ముందే ఇరుపక్షాలు హింసను విడనాడాలని యూఎస్, అఫ్గాన్ ప్రభుత్వాలు చెబుతుండగా, తర్వాతే కాల్పుల విరమణపై సంప్రదింపులు జరపాలని తాలిబన్లు అంటున్నారు. -
తాలిబాన్ దాడిలో 47 మంది పోలీసుల మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్లో పోలీసు బలగాలే లక్ష్యంగా తాలిబాన్ దాడులు ముమ్మరం చేశారు. గత రెండు రోజులుగా జరిపిన వేర్వేరు దాడుల్లో 47 మంది పోలీసులతో సహా మొత్తం 57 మందిని పొట్టనబెట్టుకున్నారు. దేశంలో అంతర్యుద్ధం సమసిపోయేందుకు మాస్కోలో చర్చలు ప్రారంభమైన తరుణంలోనే తాలిబాన్ రెచ్చిపోవడం గమనార్హం. ప్రావిన్షియల్ రాజధాని కుందుజ్ సెక్యూరిటీ పోస్ట్పై మంగళవారం వేకువజామున విరుచుకుపడ్డ తాలిబన్లు 23 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు సహా 26 మందిని చంపేశారు. అంతకుముందు ఉత్తర బఘ్లాన్ ప్రావిన్స్ బఘ్లానీ మర్కాజీ జిల్లాలోని పోలీసు ఔట్పోస్ట్పై తాలిబన్లు జరిపిన దాడిలో 11 మంది పోలీసులతోపాటు మొత్తం 21 మంది చనిపోయారు. మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. అదేవిధంగా ఉత్తర సమంగన్ ప్రావిన్సులో గ్రామ రక్షక దళానికి చెందిన 10 మందిని తాలిబన్లు చంపేశారు. అఫ్గానిస్తాన్లో అంతర్యుద్ధం సమసిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రష్యా మధ్యవర్తిత్వంతో మాస్కోలో తాలిబాన్, అఫ్గాన్ ప్రముఖులు, ప్రతిపక్షాల నేతలు, గిరిజన పెద్దలతో సమావేశం ప్రారంభం కానుండగానే తాలిబాన్ ఈ దాడులకు తెగబడటం గమనార్హం. ఈ సమావేశానికి ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదు. అయితే, దేశంలో శాంతి స్థాపన సాధనకు జరిగే ఎలాంటి ప్రయత్నమైనా అఫ్గాన్ ప్రభుత్వమే కేంద్రంగా ఉండాలని కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లా పేర్కొన్నారు. -
ఇండో పాక్ యుద్ధంపై ఇమ్రాన్ వ్యాఖ్యలు
ఇస్లామాబాద్ : శాంతి ప్రక్రియ కోసం తాను చేసిన ప్రతిపాదనలపై భారత్ స్పందించడం లేదని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే అది ఆత్మహత్యాసదృశ్యమేనని హెచ్చరించారు. భారత్తో చర్చలకు పాక్ సంసిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రయోజనాలకు కోల్డ్ వార్ సైతం వాంఛనీయం కాదని టర్కీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఇరు దేశాలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. చర్చల ప్రతిపాదనను భారత్ పలుమార్లు తోసిపుచ్చిందన్నారు. కశ్మీరీ ప్రజల హక్కులను భారత్ ఎన్నడూ అణిచివేయలేదన్నారు. కాగా 2016లో భారత్లో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరిపిన దాడి దరిమిలా పాక్ భూభాగంలో భారత్ మెరుపు దాడులు చేపట్టిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. -
యథా మోదీ తథా ఇమ్రాన్ ఖాన్!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ఎన్నికల్లో విజయం తనదేనని భావించిన ఇమ్రాన్ ఖాన్ గురువారం నాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి, తాను భారత్తో శాంతియుత సంబంధాలు కోరుకుంటున్నానని, కశ్మీర్పై చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్తో పాక్ సైన్యం, ఐఎస్ఐ కుమ్మక్కయిందని, ఇమ్రాన్ ఖాన్ ఆ దేశానికి ప్రధాని అయితే భారత్కు ముప్పేనంటూ విశ్లేషణలు వెల్లువెత్తిన నేపథ్యంతో అనూహ్యంగా ఆయన నుంచి శాంతి చర్చల మాట వెలువడడం ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ అదొక వ్యూహం. ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల ప్రచారమంతా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు. అహ్మది తెగ బహిష్కరణను తీవ్రంగా సమర్థించిన విషయాన్ని ఎలా మరచిపోతారు (అహ్మది తెగవారు ముస్లింలు కాదంటూ 1973లో జుల్ఫీకర్ అలీ భుట్టో నిషేధం విధించగా, జనరల్ జియా ఉల్ హక్ ఏకంగా 1984లో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు) మైనారిటీలను చిత్ర హింసలకు గురిచేస్తున్న మత విద్రోహ రాక్షస చట్టాన్ని ఇమ్రాన్ వెనకేసుకొస్తున్న విషయాన్ని, తాలిబన్ గ్రూపులకు మద్దతు ఇవ్వడం ద్వారా తాలిబన్ ఖాన్గా ముద్రపడిన విషయాన్ని ఎవరు మరచిపోతారు! ఇప్పుడు చర్చలకు సిద్ధమంటే ఎవరు నమ్ముతారు!! అంతా ఒక వ్యూహం. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అనుసరించిన వ్యూహమే అది. పాకిస్థాన్ బూచిని చూపించి దేశభక్తి పేరిట ఓట్లు దండుకోవడమే ఆ వ్యూహం. ఇప్పటికీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ పాక్ పేరునే జపిస్తుంది. వ్యూహానికి ప్రతి వ్యూహంగా నరేంద్ర మోదీని విమర్శించే అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని నవాజ్ షరీఫ్కు ప్రియమిత్రుడని కాంగ్రెస్ పార్టీ సంబోధిస్తోంది. 2015లో మోదీ అనూహ్యంగా పాక్ వెళ్లి నవాజ్ షరీఫ్ను కలుసుకున్న విషయం తెల్సిందే. బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏ వ్యూహాన్ని అనుసరించిందో ఇమ్రాన్ ఖాన్ కూడా తన ఎన్నికల ప్రచారంలో అదే వ్యూహాన్ని అనుసరిస్తూ భారత్ను తిడుతూ వచ్చారు. ఎన్నికలు ముగిశాయి. ఇక ఆ అవసరం లేదు. భారత్ను నిజంగా ఇరుకున పెట్టాలంటే చర్చల ప్రక్రియను ముందుకు తీసుకరావడమే. పైగా అంతర్జాతీయ సమాజం ముందు మంచి మార్కులు కొట్టేయవచ్చు. అందుకనే చర్చల ప్రతిపాదన చేశారు. అందుకు స్పందించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ లబ్ధి పొందాలంటే పాకిస్తాన్తో వియ్యానికి బదులు కయ్యానికి కాలుదువ్వాలి. అందుకు కశ్మీర్ భారత్కు ఎప్పుడూ ఆయుధమే! -
దక్షిణ సిరియాపై ముప్పేట దాడి
దరా: తిరుగుబాటుదారుల అధీనంలోని దక్షిణ సిరియా వైమానిక దాడులతో దద్దరిల్లింది. రెండు వారాలుగా కొనసాగుతున్న దాడులను ప్రభుత్వ అనుకూల బలగాలు గురువారం తీవ్రతరం చేశాయి. రష్యా మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలు బుధవారం విఫలమయ్యాయి. ఫలితంగా జరిగిన తాజా దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందారని, వేల మంది స్వస్థలాలు విడిచి వెళ్తున్నారని వార్తలు వెలువడ్డాయి. సాయిదా పట్టణంలో మహిళ, నలుగురు పిల్లలు సహా ఆరుగురు మృతిచెందినట్లు తెలి సింది. సిరియా, రష్యా బలగాలు ఉమ్మడిగా ఈ ఆప రేషన్ను నిర్వహిస్తున్నాయి. దరా ప్రావిన్స్లోని టఫా స్, జోర్డాన్ సరిహద్దుల్లోని ప్రాంతాల్లో బుధ వారం రాత్రి నుంచి శక్తిమంతమైన క్షిపణులు, క్రూడ్ బ్యారె ల్ బాంబులతో దాడులు చేస్తున్నారని సిరియా లో సేవలందిస్తున్న మానవ హక్కుల సంస్థ పేర్కొంది. -
వాళ్లు కలవటం మాటేమోగానీ...
సింగపూర్ సిటీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్లు తటస్థ వేదికగా సమావేశం కావటాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకించింది. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా కారాలు-మిరియాలు నూరుకుంటూ.. అసభ్యంగా తిట్టుకున్న వీరిద్దరూ... ఇప్పుడు ఆప్యాయంగా పలకరించుకున్న వైనం ఆకట్టుకుంది. ఆపై అనువాదకుల సాయంతో వారిద్దరూ తమ సమావేశాన్ని వారిద్దరూ కొనసాగించారు. అయితే వారి కలయిక సోషల్ మీడియా ట్రెండింగ్లో కొనసాగగా.. అదే స్థాయిలో ట్రోలింగ్.. మెమెలతో పలువురు విరుచుకుపడ్డారు. చారిత్రాత్మక భేటీని హిల్లేరియస్ పోస్టులతో మార్చి పడేస్తున్నారు. వాటిలో కొన్ని మీకోసం... “Kim, it is finally great to meet someone who has a worst hairstyle than me” ~ Trump#TrumpKimSummit pic.twitter.com/0ZCFm2A4MG — Rashi Kakkar (@rashi_kakkar) 12 June 2018 BREAKING: Tiny little dictator with a funny haircut meets Kim Jong Un in Singapore. #TrumpKimSummit RT to spread the truth! pic.twitter.com/4Oa2167tHr — Travis Allen 🌊 (@TravisAllen02) 12 June 2018 History is made.#TrumpKimSummit pic.twitter.com/NNBormKSUN — 9GAG (@9GAG) 12 June 2018 Did We Just Become Good Friends?!@realDonaldTrump and Kim Jung Un!#TrumpKimSummit pic.twitter.com/sbMqtS7hnj — mad-liberals (@mad_liberals) 12 June 2018 BREAKING: President Trump and Kim Jong Un take part in the traditional Hair Swap during their historical Summit in Singapore. Who looks better?#TrumpKimSummit pic.twitter.com/VfSldDXlYq — Travis Allen 🌊 (@TravisAllen02) 12 June 2018 Hillary Clinton spotted in Singapore just before #TrumpKimSummit pic.twitter.com/pdWVx2W3RI — Mark Dice (@MarkDice) 12 June 2018 "Donald Trump y Kim Jong-un" pic.twitter.com/oNFuT1FOUw — (#Gabriel) ♓ (@G4briel_8) 12 June 2018 The guy off The Apprentice is the president... Kim Kardashian is successfully discussing justice reform... & Denis Rodman is brokering peace between America and North Korea. ... Welcome to 2018 people!#TrumpKimSummit #TrumpKim #DennisRodman pic.twitter.com/xgeSgKCgA7 — Samantha Quek (@SamanthaQuek) 12 June 2018 Observations from the #TrumpKimSummit: 1. Trump is scared 2. Possible worst combination of haircuts in the history of this planet 3. Hand size appears to be the same 4. Kim Jong Un wearing a special version of his dictator outfit 5. Trump and Kim are a match made in heaven ❤️ — Travis Allen 🌊 (@TravisAllen02) 12 June 2018 You are entering another dimension. Welcome to The Twilight Zone. #TrumpKimSummit pic.twitter.com/8gaYAbFgIX — Cameron Grant (@coolcam101) 12 June 2018 Thanks for making North Korea great, again, you shambolic choad. #TrumpKimSummit pic.twitter.com/TqtS7UFWVH — Holly Figueroa O'Reilly 🌊 BWCS (@AynRandPaulRyan) 12 June 2018 When #PlayStationE3 is more important than the #TrumpKimSummit pic.twitter.com/kAQGTkhziU — Alex🌴 (@FloTownx) 12 June 2018 The historic accord #KimJongUn#TrumpMeetsKim #TrumpAndKim #KimTrumpSummit pic.twitter.com/NQvBrAuwV9 — Piotr Van Gogh 🇵🇱🇪🇺 (@PiotrVanGogh) 12 June 2018 సోమవారం సింగపూర్లో నిరాయుధీకరణే ప్రధాన ఏజెండాగా సాగిన భేటీ చివరకు విజయవంతంగా పూర్తయినట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ఒప్పంద పత్రాల ప్రతుల ఫోటోలు, వాటిపై అమెరికా-డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర) అధ్యక్షుల సంతకాలు వైరల్ అవుతున్నాయి. JUST IN: Here's the full text of the document that Donald Trump and Kim Jong Un signed https://t.co/7Z77s8JNpj #TrumpKim pic.twitter.com/6D9Yw15jXx — Bloomberg (@business) 12 June 2018 -
ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్
సింగపూర్ సిటీ: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సింగపూర్ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. సోమవారం రాత్రి తాను బస చేసిన సెయింట్ రెజిస్ హోటల్ నుంచి బయటకు వచ్చి వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టారు. ఆయన్ని అలా చూసే సరికి ప్రజలంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అణ్వాయుధాలతో అగ్రరాజ్యాన్ని సైతం వణికించిన కిమ్.. సరదాగా నవ్వుతూ తమ మధ్య తిరగటాన్ని ప్రజలు ఆస్వాదించారు. ఆయనతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దారి పొడవునా కిమ్ కిమ్.. అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట సోదరి కిమ్ యో జోంగ్, ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యోంగ్ హో, ఇంకా పలువురు రిపోర్టర్లు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్తో కూడా దౌత్య సంబంధాలు మెరుగుపడే దిశగా కిమ్ చర్చలు జరపటం విశేషం. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ కిమ్తో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కాగా, భారత కాల మానం ప్రకారం ఈ వేకువ ఝామున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ భేటీ కాగా.. చర్చలు ఫలవంతమైనట్లు ట్రంప్ ప్రకటించారు. మరికాసేపట్లో ఇద్దరు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
కిమ్తో భేటీ రద్దు: ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్తో తన భేటీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా రద్దు చేశారు. జూన్ 12న సింగపూర్లో జరగాల్సి ఉన్న తమ భేటీ జరగబోవడం లేదని తేల్చిచెప్పారు. ‘కిమ్తో భేటీ జరగొచ్చు. జరగకపోవచ్చు’ అంటూ బుధవారం ట్రంప్ వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా గురువారం ఆ భేటీ జరగడం లేదంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు కిమ్కు ఓ లేఖ రాశారు. ‘ఒకవైపు చర్చలు అంటూ.. మరోవైపు తీవ్ర విద్వేషాన్ని, బహిరంగంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు’ అంటూ ఆ లేఖలో ఆరోపించారు. అణుపరీక్ష కేంద్రాన్ని ఉత్తర కొరియా ధ్వంసం చేసిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘మీతో చర్చల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూశాను. అయితే ఇటీవల మీ మాటల తీరు, ప్రకటనల్లోని భాష చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు అనవసరం అనిపిస్తోంది. మీరు మీ అణు సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు’ అని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ‘మన మధ్య చర్చలు గొప్పగా కొనసాగుతాయని భావించాను. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మన మధ్య చర్చలు జరుగుతాయనే ఆశిస్తున్నాను’ అని కిమ్తో చర్చలకు ద్వారాలు తెరిచే ఉంటాయనే భావాన్ని ట్రంప్ వెల్లడించారు. ‘ఈ అత్యంత కీలమైన సదస్సు విషయంలో మీరు మనసు మార్చుకున్నట్లయితే నాతో మాట్లాడేందుకు సంకోచించవద్దు’ అని రాశారు. ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసినందుకు కిమ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా తాము ఎట్టి పరిస్థితుల్లోను అణ్వాయుధాల్ని వదిలేది లేదని, మరింత ఒత్తిడి తెస్తే చర్చల ప్రక్రియ నుంచి వైదొలుగుతామని ఇటీవల ఉత్తర కొరియా హెచ్చరించింది. అణు పరీక్ష కేంద్రాల ధ్వంసం అణు పరీక్ష కేంద్రాల్ని ధ్వంసం చేస్తామని ప్రకటించిన విధంగానే ఉత్తర కొరియా తన మాట నిలబెట్టుకుంది. గురువారం విదేశీ జర్నలిస్టుల సమక్షంలో పంగ్యేరీ ప్రాంతంలో కొండల మధ్య ఉన్న మూడు సొరంగాలు, పలు పర్యవేక్షక కేంద్రాల్ని పేల్చివేసింది. ట్రంప్, కిమ్ భేటీ రద్దు కావటంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెర్రస్ విచారం వ్యక్తం చేశారు. -
కిమ్తో భేటీ రద్దు: ట్రంప్
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్తో తన భేటీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా రద్దు చేశారు. జూన్ 12న సింగపూర్లో జరగాల్సి ఉన్న తమ భేటీ జరగబోవడం లేదని తేల్చిచెప్పారు. ‘కిమ్తో భేటీ జరగొచ్చు. జరగకపోవచ్చు’ అంటూ బుధవారం ట్రంప్ వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా గురువారం ఆ భేటీ జరగడం లేదంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు కిమ్కు ఓ లేఖ రాశారు. ‘ఒకవైపు చర్చలు అంటూ.. మరోవైపు తీవ్ర విద్వేషాన్ని, బహిరంగంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు’ అంటూ ఆ లేఖలో ఆరోపించారు. అణుపరీక్ష కేంద్రాన్ని ఉత్తర కొరియా ధ్వంసం చేసిన కొద్ది గంటలకే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘మీతో చర్చల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురుచూశాను. అయితే ఇటీవల మీ మాటల తీరు, ప్రకటనల్లోని భాష చూస్తుంటే ప్రస్తుత పరిస్థితుల్లో చర్చలు అనవసరం అనిపిస్తోంది. మీరు మీ అణు సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు’ అని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. ‘మన మధ్య చర్చలు గొప్పగా కొనసాగుతాయని భావించాను. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మన మధ్య చర్చలు జరుగుతాయనే ఆశిస్తున్నాను’ అని కిమ్తో చర్చలకు ద్వారాలు తెరిచే ఉంటాయనే భావాన్ని ట్రంప్ వెల్లడించారు. ‘ఈ అత్యంత కీలమైన సదస్సు విషయంలో మీరు మనసు మార్చుకున్నట్లయితే నాతో మాట్లాడేందుకు సంకోచించవద్దు’ అని రాశారు. ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసినందుకు కిమ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా తాము ఎట్టి పరిస్థితుల్లోను అణ్వాయుధాల్ని వదిలేది లేదని, మరింత ఒత్తిడి తెస్తే చర్చల ప్రక్రియ నుంచి వైదొలుగుతామని ఇటీవల ఉత్తర కొరియా హెచ్చరించింది. అణు పరీక్ష కేంద్రాల ధ్వంసం అణు పరీక్ష కేంద్రాల్ని ధ్వంసం చేస్తామని ప్రకటించిన విధంగానే ఉత్తర కొరియా తన మాట నిలబెట్టుకుంది. గురువారం విదేశీ జర్నలిస్టుల సమక్షంలో పంగ్యేరీ ప్రాంతంలో కొండల మధ్య ఉన్న మూడు సొరంగాలు, పలు పర్యవేక్షక కేంద్రాల్ని పేల్చివేసింది. ట్రంప్, కిమ్ భేటీ రద్దు కావటంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెర్రస్ విచారం వ్యక్తం చేశారు. -
కిమ్ కర్తవ్యం?
సాక్షి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య తిట్లు, శాపనార్ధాలతో ఏడాదిగా సాగిన ‘బంధం’ త్వరలో వారిద్దరి శిగరాగ్ర సమావేశంతో ఎలా మారుతుంది? అనే ప్రశ్న ఎన్నెన్నో ఊహాగానాలకు అవకాశమిస్తోంది. బుల్లి రాకెట్ మనిషి అని తనను ట్రంప్ అంటే, బుర్ర పనిచేయని మదుసలి అని ట్రంప్ను కిమ్ నిందించిన చరిత్ర ఇప్పటిదే. ట్విటర్ ద్వారా ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రపంచానికి వినోదం పంచారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ వేసవిలో జరిపే భేటీ తన ఘనతేనని ట్రంప్ భావిస్తుంటే, కిమ్ తన తొలి ప్రతిపాదనతోనే ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోందని సంబరపడుతున్నారు. కిమ్ ప్రతిపాదనను ట్రంప్ ముందుంచిన దక్షిణ కొరియా తన ‘మధ్యవర్తిత్వం’ వల్లే ఇద్దరు పొగరుబోతు నేతల మధ్య సమావేశం సాధ్యమైందని అనుకుంటోంది. 1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధం ముగిసినాగాని సాంకేతికంగా ఇంకా ఆగలేదు. దశాబ్దాలుగా ఉద్రిక్తత కొరియా ద్వీపకల్పాన్ని పీడిస్తోంది. చైనా వంటి కొన్ని మిత్ర దేశాలు మినహా ఇతర ప్రపంచంతో సంబంధం లేని ఉత్తర కొరియాను ‘ఏకాకి’గా భావిస్తారు. అణ్వాయుధాల తయారీనే ఆత్మరక్షణకు మార్గంగా ఎంచుకున్న ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇచ్చి, దాని దారి నుంచి మళ్లించడానికి ఉపకరిస్తే ఈ సమావేశం విజయవంతమైందని పరిగణించవచ్చు. అయితే, ఈ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు వెనుక చెప్పుకోదగ్గ కృషి లేకపోవడంతో అది సత్ఫలితాలిస్తందనే ఆశ పెద్దగా లేదు. అణ్వాయుధాల తొలగింపే లక్ష్యం! కొరియా ద్వీపకల్పం నుంచి అణ్యాయుధాలు పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని అమెరికా, ఉత్తర కొరియా అగ్రనేతలు చెబుతున్నారు. కిమ్ ఏకపక్షంగా ట్రంప్ చెప్పినట్టు నిరాయుధీకరణ అమలు చేయాలని అమెరికా కోరుతోంది. అమెరికా తన శత్రు వైఖరి విడనాడాలని, దక్షిణ కొరియాను అణ్వాయుధాల దాడి నుంచి కాపాడడానికి అగ్రరాజ్యం ఏర్పాటు చేసిన అణ్వాయుధ నిరోధక గొడుగును తొలగించాలని ఉత్తర కొరియా డిమాండ్ చేస్తోంది. ఇదంతా జరిగేది సమీప భవిష్యత్తులో ఈ భేటీలో సాధ్యమైతేనే. ట్రంప్తో భేటీకి కిమ్ లిఖితపూర్వకంగా ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. సోమవారం ఉత్తర కొరియా రాజధానిలో కిమ్ను కలిసిన దక్షిణ కొరియా జాతీయ భద్రతా డైరెక్టర్ చుంగ్ యూ-యాంగ్ చర్చల ఫలితంగా ఇద్దరు నేతల సమావేశంపై ప్రతిపాదన ముందుకు సాగింది. ట్రంప్తో జరిపే సమావేశం నుంచి తాను ఏమి ఆశిస్తున్నదీ కిమ్ వెల్లడించలేదు. మరో పక్క ట్రంప్ కూడా కొన్ని షరతులు పెడుతున్నారు. భేటీ సమయంలో కిమ్ క్షిపణి పరీక్షలు జరపకూడదనీ, ఈ భేటీలో ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే ఉత్తర కొరియాపై ఆంక్షలు తొలగిస్తామని ట్రంప్ తెగేసి చెప్పారు. మొండి ఘటాల మీటింగ్ ఎక్కడ? ఎలా? ట్రంప్-కిమ్ తొలి సమావేశంలో ఏం మాట్లాడతారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. భేటీకి సమయం, వేదిక నిర్ణయించలేదని వైట్హౌస్ ప్రకటించింది. 1972లో బీజింగ్లో చైనా నేత మావో జెడాంగ్, అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ సమావేశం, 1985లో జెనీవాలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, సోవియెట్ యూనియన్ నేత మిహాయిల్ గోర్బోచేవ్ జరిపిన శిఖరాగ్ర భేటీతో ట్రంప్-కిమ్ తొలి సమావేశాన్ని పోల్చడం విశేషం. ఇద్దరు దుందుడుకు నేతల భేటీ నిర్వహించడానికి అవసరమైన అధ్యయనం, సామర్ధ్యం ట్రంప్ సర్కారుకు ఉన్నాయా? అనేది కీలక ప్రశ్న. ట్రంప్ పోకడలు నచ్చని అనుభవజ్ఞులైన కొరియా నిపుణులు వైట్హౌస్ నుంచి వెళ్లిపోయారు. అమెరికా విదేశాంగ శాఖతో సంబంధం లేకుండా ఇంతటి కీలక భేటీపై చర్చలు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆఫ్రికా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిలర్సన్కి ట్రంప్-కిమ్ సమావేశం గురించి చెప్పినట్టు కూడా కనిపించడం లేదు. ఉత్తర కొరియాతో సంప్రదింపులకు ఇప్పట్లో అవకాశం లేదని గురువారం ఆయన అన్నారంటే ఆయన పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు. రియల్ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీలకు దారితీసే ఒప్పందాలు చేసుకోవడం ట్రంప్కు నల్లేరు మీద నడకలా సాగింది. ఈ అనుభవంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో కిమ్ విషయంలో కూడా ఆయన ఎవరినీ సంప్రదించకుండా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అనేక రియల్ఎస్టేట్ ఒప్పందాలు వికటించి ఆయన కంపెనీలు ఖాయిలా పడినన సందర్భాలున్నాయనే విషయం మరిచిపోకూడదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. 2011లో అధికారంలోకి వచ్చిన కిమ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి క్షిపణి, అణు పరీక్షలతో అమెరికాను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించే అణ్వాయుధాలున్నాయంటూ బెదిరిస్తున్నారు. ఇదంతా చివరికి అమెరికా అధినేతతో సమావేశమై అగ్రరాజ్యం నుంచి రాయితీలు సాధించడానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి లక్ష్యం నెరవేరుతుందో మే నెలలో జరిగే శిఖరాగ్ర సమావేశం నిర్ణయిస్తుంది. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
'వస్తే రండి.. లేదంటే మూల్యం తప్పదు'
ఇస్లామాబాద్: అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వంతో శాంతియుత చర్చలకు హాజరుకాకపోవడంతో తాలిబన్లపై పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శాంతియుత చర్చలకు హాజరుకావాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నెల ప్రారంభంలో తాలిబన్లు ఆపరేషన్ ఒమారి (తాలిబన్ ఫౌండర్ ముల్లా మహమ్మద్ ఒమర్) పేరిట అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాన్ని దించేయాలని నిర్ణయించింది. అయితే, గత డిసెంబర్లో పాక్, అఫ్ఘానిస్తాన్, చైనా, యూఎస్లు చేసుకున్న నాలుగుదేశాల ద్వైపాక్షిక ఒప్పందం(క్యూసీజీ)కి తాలిబన్ల ప్రకటన వ్యతిరేకంగా ఉండటంతో శాంతి చర్చలు చేపట్టాలని పాక్ ప్రభుత్వం తాలిబన్లకు సూచించింది. సంప్రదింపులను వ్యతిరేకిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు 600 మంది అప్ఘాన్ పౌరులు, 161 మంది పిల్లలు తాలిబన్ల దాడిలో మరణించారు. -
యుద్ధానికైనా, శాంతికైనా సిద్ధం: పాక్ తాలిబన్లు
పాకిస్థాన్తో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని, కానీ తమమీద ఏమైనా చర్యలు చేపడితే మాత్రం పూర్తిస్థాయి యుద్ధానికి తెగబడతామని పాకిస్థానీ తాలిబన్లు తెలిపారు. ప్రభుత్వం కావాలనుకుంటే చర్చలకు సిద్ధమేనని, కానీ వాళ్లు యుద్ధమే కావాలనుకుంటే తాము కూడా దాన్నే ఎంచుకుంటామని తెహరిక్ - ఎ - తాలిబన్ పాకిస్థాన్ రాజకీయ కమిషన్ సీనియర్ సభ్యుడు ఇహ్సానుల్లా ఇహ్సాన్ తెలిపారు. తాలిబన్లు శాంతి చర్చలకు ముందుకొచ్చారని, ఇక పాక్ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని చెప్పినట్లు ద ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ప్రభుత్వం శాంతికి, సమరానికి కూడా సిద్ధమేనన్న పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇహ్సాన్ స్పందించారు. నిసార్ అలీఖాన్ యుద్ధానికి సిద్ధమతే తాము కూడా నూరుశాతం ఆ సవాలు స్వీకరించేందుకు సిద్ధమేనని చెప్పారు. గతంలో పీఎంఎల్-ఎన్ ప్రభుత్వం శాంతిమంత్రం జపించిందని, ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా చర్చలకు సిద్ధమనే చెప్పారని అన్నారు. గతంలో పీపీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా షరతులతో కూడిన చర్చల కోసం తాలిబన్లు ముందుకొచ్చారు. కానీ, పీపీపీ సర్కారు దాన్ని పట్టించుకోకుండా, ఆయుధాలు దించి వస్తేనే ఎలాంటి చర్చలకైనా అంగీకరిస్తామని తెలిపింది. మే 11న పాకిస్థాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తాలిబన్లు తమ దాడుల ఉధృతిని పెంచారు. రెండు నెలల్లో దాదాపు 400 మందిని హతమార్చారు.