పశ్చిమాసియా సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది. మూడు నెలలుగా జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్దం ముగిసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు.. ఇటు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
లెబనాన్ సహా అన్ని సరిహద్దు ఫ్రంట్లలో తక్షణమే సైనిక చర్యలు నిలిపివేయాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. ఈ అంగీకారంతో 60 రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఈ కాలంలో ఇరు దేశాలు మరిన్ని శాంతి చర్చలు నిర్వహించి దీర్ఘకాలిక పరిష్కారానికి మార్గం సుగమం చేయనున్నాయి. అయితే ఈ డీల్ తాలుకా మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే ఈ ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది.
డీల్ కుదిరిన నేపథ్యంలో.. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకా దళ దిగ్భంధనం తక్షణమే రద్దు కానుంది. శాంతి ఒప్పందం పూర్తైందని.. ఇరాన్పై ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. హర్ముజ్ను వెంటనే తెరవాలంటూ సోషల్ మీడియాలో ఆయనో పోస్ట్ చేశారు. ప్రపంచంలోని నౌకలు హర్ముజ్లో ఇంజిన్లు ప్రారంభించాలని.. తమ ప్రయాణాలను తిరిగి ప్రారంభించాలని.. చమురు సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలని ట్రంప్ పేర్కొన్నారు.
ఇటు ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.
ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే(జూన్ 14) డీల్ కుదరడం విశేషమంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వ్యాఖ్యానించారు.
భారీ మూల్యం
అయితే ఈ మూడు నెలల యుద్ధం ఇరు దేశాలనే కాదు.. పలు దేశాల్ని సైతం భారీ మూల్యం చెల్లించుకునేలా చేసింది. అమెరికా వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఇరాన్లోని పలు సైనిక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలు, కీలక మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. హర్ముజ్లో అమెరికా బ్లాకేడ్ వల్ల వాణిజ్య నౌకలు ఆగిపోయాయి. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్ల దాడుల కారణంగా అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ సంపత్తి నాశనం అయ్యాయి. ఇరువైపులా తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది.

యుద్ధ ప్రభావంతో పశ్చిమాసియాలోని అనేక ప్రాంతాల్లో సాధారణ జీవనం అస్తవ్యస్తమైంది. వేలాది మంది ప్రజలు తమ నివాస ప్రాంతాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. హర్ముజ్ జలసంధి మూతపడే ప్రమాదం నెలకొనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. సముద్ర రవాణా వ్యయాలు పెరగడంతో.. ప్రపంచ వాణిజ్యంపై కూడా ప్రభావం పడింది. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా వ్యవస్థలపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


