ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా మృత్యువాత | Mountaineer Nirmal Nims Purja Killed In Avalanche On PoK Peak | Sakshi
Sakshi News home page

ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా మృత్యువాత

Aug 1 2026 6:17 PM | Updated on Aug 1 2026 7:15 PM

Mountaineer Nirmal Nims Purja Killed In Avalanche On PoK Peak

న్యూఢిల్లీ: ఎన్నో రికార్డులను అవలీలగా తన ఖాతాలో వేసుకుని పర్వతారోహణలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా అనూహ్య ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. పీవోకేలో బ్రాడ్‌వీక్‌ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో భారీ హిమపాతంలో చిక్కుకుని మరణించారు. 

ఈ విషయాన్ని శనివారం ఆయనకు చెందిన అడ్వెంచర్ సంస్థ ఎలైట్‌ ఎక్స్‌పెడ్‌ అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రమాదంలో ఆయనతో వెళ్లిన మరో ఐదుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయినట్లు సదరు సంస్థ వెల్లడించింది. ఇంకా ఐదుగురి ఆచూకీ లభించకపోవడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

2026 జూలై 30(గురువారం) మధ్యాహ్నం సమయంలో నిర్మల్‌ నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ బృందం క్యాంప్‌-2 నుండి క్యాంప్‌-3కి వెళ్తుండగా దాదాపు 7 వేల మీటర్ల ఎత్తులో భారీ హిమపాతం విరుచుకుపడింది.  ఈ ప్రమాదంలో నిర్మల్‌తో పాటు అమెరికా, ఒమన్, నేపాల్‌కు చెందిన పర్వతారోహకులు, గైడ్‌లు అందరూ మరణించారు. నిర్మల్‌  భౌతికకాయాన్ని ఈరోజు(శనివారం, ఆగస్టు 1వ తేదీ) వెలికితీశారు.

Mountaineer Nirmal Purja: పాక్ మంచు కొండల్లో విషాదం

ముఖ్యమైన విజయాలు

  • ప్రపంచంలోని 14 అత్యంత ఎత్తైన 8,000 మీటర్ల శిఖరాలను అతి తక్కువ సమయంలో (6 నెలల 6 రోజుల్లో) అధిరోహించిన ఘనత నిర్మల్‌ నిమ్స్‌ది.
  • 8,000 మీటర్ల కంటే ఎత్తైన శిఖరాలను ప్రపంచంలోనే అత్యధిక సార్లు (దాదాపు 57 సార్లు) అధిరోహించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు
  • సప్లిమెంటల్ ఆక్సిజన్ (కృత్రిమ ఆక్సిజన్) సహాయం లేకుండానే 8,000 మీటర్ల శిఖరాలను అత్యధిక సార్లు విజయవంతంగా అధిరోహించిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది.
  • బ్రిటిష్ సైన్యంలోని గూర్ఖా బ్రిగేడ్ మరియు స్పెషల్ బోట్ సర్వీస్ (SBS) ప్రత్యేక బలగాలలో సేవలందించారు.
  • శీతాకాలంలో మొదటిసారిగా K2 శిఖరాన్ని అధిరోహించిన బృందంలో సభ్యులు
  • 2021 జనవరిలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 'కే2' (K2) పర్వతాన్ని శీతాకాలంలో అధిరోహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి 10 మంది బృందానికి ఆయన నాయకత్వం వహించారు. అప్పటివరకు వింటర్ సీజన్‌లో K2 పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేకపోయారు
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాలైన ఎవరెస్ట్, లోట్సే మరియు మకాలు శిఖరాలను కేవలం 48 గంటల్లో అధిరోహించిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు
  • ఈ ఏడాది మే నెలలో పుర్జా అదనపు ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ మరియు లోట్సేలను అత్యంత వేగంగా దాటిన తన స్వంత ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు.
  • ఆయన కేవలం 13 గంటల్లో ఎవరెస్ట్ శిఖరం నుండి లోట్సే శిఖరానికి చేరుకున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement