కీవ్ : ఉక్రెయిన్పై రష్యా బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకపడింది. గగనతలం మిసైళ్ల మోతతో దద్దరిల్లింది. ఈ రోజు శనివారం ఉదయం రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడిలో కనీసం తొమ్మిదిమంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఈ వారంలో కీవ్పై రష్యా దాడి చేయడం ఇది రెండోసారి.
ఇటీవల రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. రష్యా వరుసగా కీవ్పై మిసైళ్లతో విరుచుకపడడంతో పెద్దఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ సైతం విరుచుకపడుతుంది.రష్యాలోని చమురు రిఫైనరీలు, ఇంధన డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తోంది. నల్లసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలు, సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి కీవ్పై రష్యా బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకపడింది. ఈ దాడుల్లో కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు పిల్లలతో సహా 28 మంది గాయపడ్డారు. ఈ వివరాలను కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో స్వయంగా వెల్లడించారు.ఈ దాడులతో కీవ్లోని వివిధ ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
కాగా కీవ్పై ఈ వారంలో ఇలాంటి పెద్ద దాడి జరగడం ఇది రెండోసారి. గత గురువారం జరిగిన దాడిలో క్రివాయ్ రిగ్ సమీపంలోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సహా తొమ్మిది మంది మరణించారు.ఈ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా మరోసారి దాడి చేసింది. రష్యా దాడులు ఉదృతమవుతున్న నేపథ్యంలో తమ దేశానికి మరిన్ని రక్షణ వ్యవస్థలు కావాలని జెలెన్స్కీ పశ్చిమ దేశాలను కోరుతున్నారు. మిత్రులను కోరుతున్నారు. స్వయంగా పాట్రియాట్ క్షిపణులను తయారు చేసుకునేందుకు అమెరికా నుంచి లైసెన్స్ పొందడానికి ఆయన చర్చలు జరుపుతున్నారు.
కాగా ఈ విషయమై ట్రంప్ మాట్లాడినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. "ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ ఇంకా దీనికి అంగీకరించలేదుఎవరికైనా అలాంటి సాంకేతికతను ఇవ్వడం చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే మనం ఎవరికైతే ఆ టెక్నాలజీ ఇస్తామో, వారు భవిష్యత్తులో మనపైనే తిరగబడవచ్చు" అని ట్రంప్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి.


