breaking news
Ukraine
-
రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు
కీవ్: రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణుల దాడిని కొనసాగిస్తోంది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయిన కొన్నిగంటలకే రష్యాపై ఉక్రెయిన్ దాడులను ఉధృతంచేయడం గమనార్హం. రష్యాలోని పెర్మ్ రీజియన్లోని లూక్ఆయిల్ రిఫైనరీ, రియాజన్లోని మరో చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ దాడులు చేసింది. ఈ రెండు రిఫైనరీల ఉమ్మడి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 3 కోట్ల టన్నులుకావడం గమనార్హం. ఇంతటి భారీ రిఫైనరీలపై దాడి చేసి ఇన్నాళ్లూ యుద్ధంలో రష్యా సాయుధరంగ ఇంధన అవసరాలు, దేశ ఖజానాకు నష్టం చేకూర్చామని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్, జనరల్ స్టాఫ్ విభాగం ప్రకటించింది. అయితే తమ రిఫైనరీలకు ఎలాంటి నష్టం జరగలేదని, పారిశ్రామిక వాడల్లో డ్రోన్ల దాడుల్లో గాయపడిన ఆరుగురికి ఆస్పత్రుల్లో చేరి్పంచామని రష్యాలోని రియాజన్ గవర్నర్ పావెల్ మాల్కోవ్ తెలిపారు. -
పుతిన్కు ఉచ్చు బిగిస్తున్న అమెరికా.. రష్యాకు డబుల్ స్ట్రైక్
వాషింగ్టన్: ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ తొలి ఆమోదం తెలిపింది. బిల్లును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు నిర్వహించిన విధానపరమైన (ప్రొసీజరల్) ఓటింగ్లో 86-12 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందింది. దీంతో ఈ బిల్లుపై సెనేట్లో పూర్తి స్థాయి చర్చకు మార్గం సుగమమైంది.ఈ కీలక ఓటింగ్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అమెరికా క్యాపిటల్ భవనానికి హాజరయ్యారు. ఇటీవల మరణించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీ, ఓటింగ్కు ముందు పలువురు రిపబ్లికన్, డెమోక్రాటిక్ సెనేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం సెనేట్ గ్యాలరీలో కూర్చొని ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు.సెనేటర్లతో సమావేశంలో జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ప్రస్తుతం కీలక పురోగతి సాధిస్తోందని, అయితే విజయం సాధించాలంటే అమెరికా నుంచి మరింత సైనిక, ఆర్థిక, రాజకీయ మద్దతు అవసరమని తెలిపారు. ఈ ఆంక్షల బిల్లు ఉక్రెయిన్ ప్రజలకు నైతిక బలాన్ని ఇవ్వడమే కాకుండా, రష్యాపై అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచుతుందని ఆయన పేర్కొన్నట్లు సమావేశానికి హాజరైన సెనేటర్లు వెల్లడించారు. కాగా, ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ సంయుక్తంగా రూపొందించారు. జూలై 10న వైట్ హౌస్తో ఈ బిల్లుపై ఒప్పందానికి వచ్చిన మరుసటి రోజే గ్రాహమ్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణానికి ముందు ఉక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీతో కూడా సమావేశమయ్యారు. ఈ బిల్లు గ్రాహమ్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన వారసత్వంగా నిలుస్తుందని బ్లూమెంథల్ పేర్కొన్నారు.బిల్లులోని ముఖ్యాంశాలు:రష్యా నుంచి చమురు, సహజ వాయువు, ఇతర ఎగుమతులను కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశం.పుతిన్తో పాటు రష్యా ఉన్నత రాజకీయ, సైనిక నాయకులు, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపై కొత్త ఆంక్షలు.ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న పాత చమురు ట్యాంకర్లపై కూడా చర్యలు.జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా మినహాయించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించే నిబంధన.అయితే అధ్యక్షుడికి అదనపు టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రాటిక్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సవరణలపై చర్చ అనంతరం బిల్లుపై అమెరికా సెనేట్లో తుది ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా యుద్ధ ఆర్థిక వనరులపై గట్టి దెబ్బ పడటంతో పాటు, ఉక్రెయిన్కు అమెరికా మద్దతు మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
బ్లాక్సీలో చిక్కుకున్న భారతీయ నావికులు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి భారతీయ నావికుల భద్రతపై ఆందోళన పెంచుతోంది. ఉక్రెయిన్లోని చోర్నోమోర్స్క్ పోర్టులో ఓ కార్గో నౌకలో 13 మంది భారతీయ నావికులు చిక్కుకుపోయారు. బ్లాక్సీ ప్రాంతంలో కొనసాగుతున్న డ్రోన్, క్షిపణి దాడుల మధ్య వారు ప్రాణభయంతో ఉన్నట్లు ఫార్వర్డ్ సీమన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) తెలిపింది.‘ఎంవీ అమీర్1’ అనే కార్గో నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉండగా.. అందులో 13 మంది భారతీయులేనని యూనియన్ వెల్లడించింది. నౌక చాలా రోజులుగా పోర్టులో నిలిచిపోయిందని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా డ్రోన్, మిసైల్ దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల నడుమ.. నౌకలోని సిబ్బంది నిరంతరం భయంతో జీవిస్తున్నారని FSUI తెలిపింది. ఎప్పుడైనా నౌకపై నేరుగా దాడి జరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే భారత ప్రభుత్వం, నౌక యజమానులు, సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని వారిని సురక్షితంగా తరలించాలని కోరింది.వరుస దాడులతో బ్లాక్సీ ప్రమాదకరంఇటీవల ఉక్రెయిన్ తీర ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఓడెసా సమీపంలో ‘ఎంవీ ఓమోర్ఫీ’ నౌకపై జరిగిన దాడిలో ఓ భారతీయ నావికుడు మృతి చెందాడు. మరో ఘటనలో ‘ఎంవీ ఏజీఎన్ రాగ్నర్’ నౌకపై దాడి జరగగా.. కొందరు సిబ్బంది గల్లంతయ్యారు.భారతీయ నావికుల భద్రతపై ఆందోళనబ్లాక్సీ ప్రాంతం ప్రస్తుతం వాణిజ్య నౌకలకు అత్యంత ప్రమాదకరంగా మారింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు ఈ ప్రాంతాల్లో పనిచేసే ముందు భద్రతను అంచనా వేసుకోవాలని విదేశాంగ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేసింది. -
ఉక్రెయిన్లో నౌకపై దాడి
లండన్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయంలో ఉన్న ఓ వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు గల్లంతయ్యారు. ‘ఎంవీ ఏజీఎన్ రగ్నార్’ నౌకలో ఉన్న మరో ఇద్దరు భారతీయ నావికులు మాత్రం దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారని కీవ్ నగరంలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. శనివారం జరిగిన ఈ ఘటనలో గల్లంతైన భారతీయుల ఆచూకీ కనుగొనేందుకు ఉక్రెయిన్ అధికారులతో సంప్రతింపులు జరుపుతున్నామని ఎంబసీ వివరించింది. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో తరచూ రష్యా నల్ల సముద్ర తీరంలోని ఒడెసా పోర్టుపై క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతోంది. అయితే, తాజా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. ఈ ప్రాంతంలో ఏప్రిల్ నుంచి వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు కనీసం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అప్రమత్తంగా ఉండండి: విదేశాంగ శాఖ నల్ల సముద్ర ప్రాంతం వంటి సంక్షోభాలు కొనసాగుతున్న చోట్ల విధులు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం భారతీయ నావికులు, సిబ్బందిని కోరింది. ఈ మేరకు ఆదివారం ఒక అడ్వైజరీ జారీ చేసింది. అటువంటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని, భద్రతా పరిస్థితులను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలని సూచించింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా నల్ల సముద్రం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని హెచ్చరించింది. -
జెలెన్స్కీకి ఇరాన్ వార్నింగ్.. మూల్యం చెల్లించుకుంటావ్
ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చారు. కాస్పియన్ సముద్రంలో ఇరాన్కు చెందిన వాణిజ్య నౌకపై జరిగిన దాడికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీయే వ్యక్తిగతంగా కారణమని తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనకు జెలెన్స్కీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.ఇటీవల కాస్పియన్ సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక నావికుడు మరణించగా, మరోకరు గాయపడ్డారు. ఇరాన్ తాజాగా దీనిని జెలెన్స్కీ స్వయంగా ధృవీకరించారు. ఉక్రెయిన్ బలగాలు (ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ / సెక్యూరిటీ సర్వీసెస్) ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై అబ్బాస్ అరాఘ్చీ ఎక్స్ వేదికగా స్పందించారు. " జెలెన్ స్కీ ఒక ఇరాన్ వాణిజ్య నౌకపై దాడి చేసి, ఒక నావికుడిని చంపారు. ఐరోపాను తమ యుద్ధంలోకి లాగడానికి ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు చేసిన ఈ చర్య, ఐక్యరాజ్యసమితి చార్టర్ను బహిరంగంగా ఉల్లంఘించడమే. ఈయూ ఉన్నత ప్రతినిధి కల్లాస్, విదేశాంగ మంత్రి లావ్రోవ్లతో జరిపిన సంభాషణలలో, కీవ్లోని ఆ ఉచిత భోజనప్రియుడు చేసిన దానికి జవాబు చెప్పకుండా ఉండలేమని స్పష్టం చేశారు".కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సౌదీ అరేబియాతో వ్యూహాత్మక, దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, డ్రోన్ రక్షణ వ్యవస్థలు, సాంకేతికత బదిలీ, ఆహార భద్రత, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తన యుద్ధ అనుభవాన్ని, ముఖ్యంగా డ్రోన్లను తిప్పికొట్టే సాంకేతికతను సౌదీ అరేబియాతో పంచుకోవడం పట్ల ఇరాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్యం చేస్తోంది. -
కీవ్పై భీకర దాడి..10 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై శుక్రవారం రష్యా భీకర క్షిపణి దాడికి పాల్పడింది. ఘటనలో కనీసం 10 మంది చనిపోగా, మరో 100 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ కీవ్కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ రక్షణ ఉత్పత్తిదారుల ప్రతినిధుల సమావేశంపై ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. దాడి తీవ్రతకు చుట్టుపక్కలున్న 27 ఇళ్లు, 44 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయన్నారు. ఇతర వివరాలను తెలిపేందుకు నిరాకరించారు. ప్రభుత్వం కూడా దాడి మీడియా కవరేజీపై ఆంక్షలు విధించింది. కాగా, రష్యా దాడుల భయమున్న విషయం తెలిసీ ఆ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేయడంపై ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ రుస్లాన్ క్రవ్చెంకో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై వేరుగా క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ఇలా ఉండగా, సరిహద్దులకు 1,350 కిలోమీటర్ల దూరంలోని రష్యాలో ని కిరోవ్లో ఉన్న ఆయిల్ డిపోతోపాటు, మిలటరీ ప్లాంట్పైనా తాము డ్రోన్ దాడులు చేపట్టినట్లు జెలెన్స్కీ చెప్పారు. దాడిలో ఆరుగురు చనిపోగా, 26 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, రష్యాలోనే అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్కు చెందిన సెయింట్పీటర్స్బర్గ్లోని గోదాముపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. గోదాము నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. రేథియాన్తో జెలెన్స్కీ భేటీ రష్యా క్షిపణి దాడులను తట్టుకునే గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్యలను వేగవంతం చేశారు. గురువారం కీవ్లో జెలెన్స్కీని రేథియాన్ కంపెనీ ప్రతినిధి బృందం కలిసింది. ఉక్రెయిన్తో కలిసి పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను ఉత్పత్తి చేసేందుకు గల అవకాశాలపై వీరు చర్చించారు. రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు, ఇంటర్సెప్టార్ క్షిపణులు ఈ వ్యవస్థల్లో ఉంటాయి. ప్రభుత్వ రంగంలో లేదా ప్రైవేట్ రంగంలో పేట్రియాట్ వ్య వస్థలను సమకూర్చుకునేందుకు తా ము సిద్ధంగా ఉన్నామంటూ అనంతరం జెలెన్స్కీ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే, ఈ వ్యవహారం అంతసులువుగా కార్యాచరణలోకి వచ్చే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. ఉత్పత్తి దశకు చేరుకునేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. -
ఉక్రెయిన్లో నిరసనల వేళ జెలెన్స్కీ కీలక నిర్ణయం
కీవ్: రష్యాతో యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఒలెక్సాండర్ సిర్స్కీని పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే రక్షణ మంత్రి తొలగింపుతో చెలరేగిన రాజకీయ సంక్షోభం తర్వాత ఆర్మీ చీఫ్ను తొలగిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.మిలిటరీని ఆధునీకరించే తన సంస్కరణలను అడ్డుకున్నారని, తనను పదవి నుంచి తొలగించేలా చేశారని ఫెడోరోవ్ , ఆర్మీ చీఫ్పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంతటా నిరసనలు చెలరేగాయి. ఈ వివాదం తీవ్రం కావడంతో జెలెన్స్కీ సిర్స్కీపై వేటు వేశారు.ఆయన స్థానంలో నూతన కమాండర్-ఇన్-చీఫ్గా మైఖైలో డ్రాపతీని నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. జెలెన్స్కీ మాట్లాడుతూ "ఉక్రెయిన్ సాయుధ దళాల నూతన కమాండర్-ఇన్-చీఫ్గా మైఖైలో డ్రాపతీని నియమించాలని నేను నిర్ణయించుకున్నాను. ఉక్రెయిన్ బలమైన ఫ్రంట్లైన్ స్థానాల కోసం ఒలెక్సాండర్ సిర్స్కీకి మన ప్రతీ యోధుడికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను." అని జెలెన్స్కీ పేర్కొన్నారుకేవలం ఆరు నెలల క్రితమే రక్షణ మంత్రిగా నియమితులైన, ఎంతో ప్రాచుర్యం పొందిన ఫెడోరోవ్ను జెలెన్స్కీ గత వారం అకస్మాత్తుగా తొలగించడంతో సిర్స్కీ భవిష్యత్తుపై ప్రశ్నలు మొదలయ్యాయి.35 ఏళ్ల ఫెడోరోవ్ ఉక్రెయిన్ సైన్యాన్ని ఆధునీకరించడానికి చేసిన ప్రయత్నాలు సైనిక నాయకత్వంతో విభేదాలకు దారితీశాయి. సిర్స్కీ తన ఆలోచనలను అడ్డుకున్నారని, తనను తొలగించేలా జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చారని ఫెడోరోవ్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సిర్స్కీ ఖండించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సిర్క్సీపై సైతం వేటు పడింది. -
కార్గో షిప్ పై రష్యా దాడి..నలుగురు భారతీయుల మృతి
-
కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి
ఉక్రెయిన్లోని ఒడెసా పోర్టు దగ్గర కార్గో నౌకపై దాడి జరిగింది. నలుగురు భారతీయులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్లోని ఒడెసా పోర్టు నుంచి కార్గో నౌకలో ధాన్యం తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిపై భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ గోల్డెన్ లియో నౌక జులై 19 సాయంత్రం ఒడెసా నుంచి బయలుదేరిన వెంటనే దాడికి గురైంది. ఆ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు."ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. నలుగురు భారతీయులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తూ, బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించే ప్రయత్నం చేస్తోందని భారత్ తెలిపింది. "మృతి చెందిన భారతీయుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన భారతీయుడు త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నల్ల సముద్రం ప్రాంతంలో తాజాగా పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల తర్వాత భారతీయ నావికులు ఎదుర్కొన్న అత్యంత ప్రాణాంతక ఘటనల్లో ఇది ఒకటి.వాణిజ్య నౌకలపై దాడులు సరికాదు: భారత్ ఈ ఘటనపై స్పందించిన భారత్.. పౌర నౌకలపై దాడులను ఖండించింది. యుద్ధ పరిస్థితుల్లోనూ సముద్ర రాకపోకల స్వేచ్ఛకు రక్షణ ఉండాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. "వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ముప్పు తేవడం, సముద్ర రాకపోకలు, వాణిజ్యానికి ఆటంకం కలిగించడం ఖండించదగ్గ విషయం. అలాంటి చర్యలు నివారించాలి" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆ ప్రకటనలో రష్యా పేరు నేరుగా ప్రస్తావించలేదు. అయితే ఈ దాడికి రష్యాదే బాధ్యతని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలు, దౌత్య మార్గం ద్వారానే పరిష్కారం లభించాలని భారత్ పలుమార్లు పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, పౌరుల ప్రాణాలకు ముప్పు తెచ్చే దాడులు చేయవద్దని అన్ని పక్షాలను కోరింది. -
రష్యాకు డబుల్ ట్రబుల్.. పుతిన్కు కొత్త సవాల్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక దశలోకి అడుగుపెడుతోంది. యుద్ధభూమిలో పేలుళ్లు కొనసాగుతుండగా.. ఆ ప్రభావం ఇప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పెరుగుతున్న యుద్ధ ఖర్చులు, మరోవైపు ఉక్రెయిన్ దాడులు.. ఈ రెండు పరిణామాలు రష్యాకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తుపై ఆందోళనతో కొంతమంది రష్యన్లు తమ పొదుపులను బ్యాంకుల్లో ఉంచడం కంటే చేతిలో నగదుగా ఉంచుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అన్న అనిశ్చితి ప్రజల్లో పెరుగుతోందని తెలుస్తోంది.భవిష్యత్తుపై భయం.. నగదు వైపు రష్యన్లు..బ్యాంకింగ్ వ్యవస్థపై పూర్తిస్థాయి నమ్మకం తగ్గిందని చెప్పలేకపోయినా.. సంక్షోభ సమయాల్లో అందుబాటులో నగదు ఉండటం మంచిదనే ఆలోచన కొంతమందిలో పెరుగుతోంది. గతంలో ఆర్థిక సంక్షోభాలు ఎదురైన సందర్భాల్లోనూ ఇలాంటి ధోరణులు కనిపించాయి. ఇప్పటికే రష్యా ఆర్థిక వ్యవస్థ పలు ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, భారీగా పెరిగిన రక్షణ వ్యయం, ద్రవ్యోల్బణ ప్రభావం, కార్మికుల కొరత వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి సవాళ్లుగా మారుతున్నాయి. యుద్ధ అవసరాల కోసం ప్రభుత్వ వ్యయం భారీగా రక్షణ రంగం వైపు మళ్లడంతో ఇతర రంగాలపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే రష్యా ప్రభుత్వం మాత్రం తమ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని, ఆంక్షలను ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి ఉందని చెబుతోంది.రష్యా వాణిజ్య నాడిపై దాడులుఇదే సమయంలో ఉక్రెయిన్ దాడుల పరిధి కూడా విస్తరిస్తోంది. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ రిటైల్ సంస్థలకు చెందిన భారీ గోదాములు దాడులకు గురైనట్లు సమాచారం. ఈ గోదాములు కేవలం నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు.. వేలాది ఆన్లైన్ ఆర్డర్లకు కేంద్రాలుగా పనిచేసే కీలక వాణిజ్య వ్యవస్థలు. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు వంటి అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ నిల్వ ఉంటాయి. ఇలాంటి మౌలిక సదుపాయాలు దెబ్బతింటే సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దాడుల్లో ప్రాణనష్టం, గాయాలపై స్థానిక వర్గాలు సమాచారం ఇచ్చినప్పటికీ.. పూర్తి వివరాలపై రష్యా, ఉక్రెయిన్ వర్గాల ప్రకటనల్లో వ్యత్యాసాలు ఉన్నాయి.మారుతున్న యుద్ధ వ్యూహం?యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరుదేశాలు ప్రధానంగా సైనిక స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ ఇప్పుడు వాణిజ్య రంగంపై కూడా దాడుల ప్రభావం కనిపించడం కొత్త ఆందోళనలకు కారణమవుతోంది. ఉక్రెయిన్ లక్ష్యం రష్యా యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరచడమేనని చెబుతుండగా.. రష్యా మాత్రం ఇలాంటి దాడులను ఖండిస్తూ ప్రతీకార చర్యలు కొనసాగిస్తోంది.Russian fuel stations are being put up for sale en masse due to huge financial losses.The Moscow Stock Exchange has fallen 18 straight weeks, the most since the 1990s.A half trillion rubles were withdrawn from banks in 2 weeks by panicked Russians.Worse is yet to come.🍿🍿 pic.twitter.com/DQqX1jxM2R— Maria Drutska 🇺🇦 (@maria_drutska) July 18, 2026యుద్ధం.. ప్రజల జీవితాలపై ప్రభావంఒకవైపు సరిహద్దుల్లో యుద్ధ శబ్దాలు.. మరోవైపు ఆర్థిక ఒత్తిళ్లు.. ఈ రెండు పరిణామాలు సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగినప్పుడు ప్రజలు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక పరిస్థితికి సంకేతాలుగా మారుతాయి. ప్రస్తుతం రష్యా ముందు ఉన్న సవాలు కేవలం యుద్ధంలో ఆధిపత్యం సాధించడం మాత్రమే కాదు.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధ భారాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఎదుర్కోవాలన్నదీ కీలక ప్రశ్నగా మారింది. ఒకవైపు ఆకాశంలో యుద్ధ విమానాల గర్జన.. మరోవైపు బ్యాంకుల నుంచి బయటకు వస్తున్న నగదు.. రష్యా ఇప్పుడు యుద్ధభూమితో పాటు ఆర్థిక రంగంలోనూ అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. యుద్ధంలో గెలుపు కోసం సైనిక బలం ఎంత ముఖ్యమో.. ఆర్థిక స్థిరత్వం కూడా అంతే కీలకం. రష్యా ఈ రెండు రంగాల్లోనూ ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ.. ఈ పోరు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.Wildberries is a key source of supplies for the Russian front, as many "Z-channels" note."A vast quantity of military goods and dual-use items is sold on WB. Consequently, attacks on the warehouses would deal a severe blow to front-line supplies."Tens of thousands of Russians… https://t.co/pYZXP8ivLT pic.twitter.com/vg2ucDfSy9— Jürgen Nauditt 🇩🇪🇺🇦 (@jurgen_nauditt) July 18, 2026 -
రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు
మాస్కో: ఉక్రెయిన్ తన లాంగ్ రేంజ్ డ్రోన్ల సత్తాను రష్యాకు రుచి చూపింది. శుక్రవారం రాత్రి రాజధాని మాస్కో తదితర ప్రాంతాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 9 మంది చనిపోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఇంధన, సైనిక లక్ష్యాలపై జరిగిన ఈ దాడుల్లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టాంబోవ్ ప్రాంతంలోని కొటొవ్స్క్ , మాస్కోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలక్ట్రోస్టాల్ నగరంలోని గోదాములు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ రెండూ ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ వైల్డ్బెర్రీస్కు చెందినవని అధికారులు తెలిపారు. కొటొవ్స్క్ ఘటనలో ఏడుగురు చనిపోగా, 25 మంది గాయపడ్డారు. మాస్కో ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా, 37 మంది గాయపడినట్లు గవర్నర్ తెలిపారు. ఎలక్ట్రోస్టాల్లోని గోదాములో దాడితో ఒకరు చనిపోయారు. ఇక్కడ ప్రమాద తీవ్రత కారణంగా పొరుగునే ఉన్న ఒక నివాస భవనాన్ని, ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయించారు. ఈ రెండు గోదాముల్లోనూ డ్రోన్ల తయారీకి సంబంధించిన నిషేధిత సామగ్రి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. -
రష్యాపై ఉక్రెయిన్ దాడులు.. ఏడుగురి మృతి, 51 మందికి గాయాలు
రష్యాలో శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. మరో 51 మంది గాయపడ్డారు. గోదాములు, చమురు నిల్వ కేంద్రం, ఓ నివాస భవనంపై ఈ దాడులు జరిగాయి. పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుందని రష్యా అధికారులు తెలిపారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. మాస్కో, టాంబోవ్ ప్రాంతాల్లోని రెండు కీలక లాజిస్టిక్ కేంద్రాలపై దాడులు చేపట్టినట్టు తెలిపారు. "డ్రోన్లు, నావిగేషన్ పరికరాల తయారీకి ఆంక్షలు ఎదుర్కొంటున్న విడిభాగాలను సరఫరా చేసేందుకు ఈ కేంద్రాలను ఉపయోగిస్తున్నారు. ఓ చమురు కేంద్రంపై కూడా దాడి చేశాం" అని టెలిగ్రామ్లో పేర్కొన్నారు. అజోవ్ సముద్రం, రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఆపరేషన్ దళాలు లక్ష్యాలపై దాడులు చేశాయని చెప్పారు.రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ రిటైల్ సంస్థ వైల్డ్బెరీస్కు చెందిన రెండు భారీ గోదాములపై గత రాత్రి దాడులు జరిగాయి. వైల్డ్బెరీస్ అంటే రష్యాలో ప్రముఖ ఆన్లైన్ వస్తువుల విక్రయ సంస్థ. ఒకటి ఉక్రెయిన్ సరిహద్దు నుంచి దాదాపు 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంబోవ్ ప్రాంతంలోని కోటోవ్స్క్లో ఉంది. ఇంకొకటి మాస్కోకు తూర్పున దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలెక్ట్రోస్టాల్లో ఉంది.మృతులంతా విధుల్లో ఉన్న కార్మికులే.. టాంబోవ్ ప్రాంత గవర్నర్ యెవ్గెనీ పెర్విషోవ్ మాట్లాడుతూ.. కోటోవ్స్క్ గోదాంలో రాత్రి విధుల్లో ఉన్న ఏడుగురు కార్మికులు మరణించారని, మరో 25 మంది గాయపడ్డారని తెలిపారు. మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రే వొరోబ్యోవ్ మాట్లాడుతూ.. ఎలెక్ట్రోస్టాల్లో 24 మంది గాయపడ్డారని చెప్పారు. ఎలెక్ట్రోస్టాల్కు ఉత్తరాన ఉన్న నొగిన్స్క్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడి తర్వాత చమురు నిల్వ కేంద్రానికి మంటలు అంటుకున్నాయని, అక్కడ మరో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని ప్రసూతి ఆసుపత్రి, ఓ నివాస భవనాన్ని ఖాళీ చేయించారు.మాస్కోకు తూర్పున దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లాదిమిర్లో ఉక్రెయిన్ డ్రోన్ ఓ నివాస భవనాన్ని ఢీకొనడంతో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని గవర్నర్ అలెగ్జాండర్ అవ్దేయేవ్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని చెప్పారు.రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 19 రష్యా ప్రాంతాలు, క్రిమియా, అజోవ్ సముద్రం, నల్ల సముద్రం ప్రాంతాలపై వచ్చిన 379 ఉక్రెయిన్ డ్రోన్లను రాత్రి సమయంలో వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది.రాత్రి జరిగిన ఈ దాడుల్లో టాంబోవ్, మాస్కో ప్రాంతాల్లో ప్రాణనష్టం చోటుచేసుకుంది. గోదాములు, చమురు నిల్వ కేంద్రం వంటి కీలక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వ్లాదిమిర్లోని ఓ నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. రష్యా సైనిక సరఫరాలకు అనుబంధంగా ఉన్న కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు చేయడంతో నెక్ట్స్ రష్యా ఏం చేస్తుందోనన్న ఆందోళన నెలకొంది. -
జెలెన్స్కీ సంచలన నిర్ణయం
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన రక్షణశాఖ మంత్రి ఫెదోరోవ్ ను ఆపదవి నుంచి తప్పించారు. రక్షణమంత్రితో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జెలెన్ స్కీ నిర్ణయంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. కాగా ఫెదోరవ్ రష్యాపై దాడుల సమయంసలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.ఉక్రెయిన్ టాప్ మిలిటరీ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ, ఫెదోరోవ్ మధ్య వ్యూహాత్మక విభేదాలు వచ్చాయి. తాను ప్రతిపాదించిన సైనిక సంస్కరణలను సిర్స్కీ కావాలనే అడ్డుకున్నారని తనతో చర్చించడానికి సైతం నిరాకరించారని ఫెదోరోవ్ స్వయంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలగింపు జరిగింది.కాగా ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కీవ్, ఖార్కివ్ సహా పలు నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి విజయాలు సాధించిన ఫెడోరోవ్ను తొలగించడం సరికాదని, ఆయనపై రాజకీయ కక్షలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.ఫెదోరవ్ ఈ ఆరునెలల కాలంలో సాధించిన విజయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రష్యా సైన్యానికి స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందకుండా పూర్తిగా నిలిపివేయడం, డ్రోన్ల సహాయంతో రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంలోని రవాణా వ్యవస్థను దెబ్బతీయడం, రష్యా ఇంధన క్షేత్రాలపై డ్రోన్ దాడులు చేయడం విజయాలుగా అభివర్ణించారు.నాటో ప్రమాణాలకు అనుగుణంగా రక్షణ శాఖను పూర్తిగా మార్చలేకపోవడం, సైనిక కొనుగోళ్లలో అవినీతి పాత పద్ధతులను పూర్తిగా నిర్మూలించలేకపోవడం వైఫల్యాలుగా చెప్పుకున్నారు. -
ఉక్రెయిన్ నూతన ప్రధానిగా సెర్హీ కోరెట్స్కీ
రష్యాతో యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ నూతన ప్రధానమంత్రిగా ఇంధన రంగ నిపుణుడు సెర్హీ కోరెట్స్కీని నియమించింది. ఆయన నియామకానికి ఉక్రెయిన్ పార్లమెంట్ గురువారం ఆమోదం తెలిపింది. రష్యా దాడుల వల్ల దెబ్బతిన్న దేశ ఇంధన రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యతను సెర్హీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అప్పగించారు.కాగా 48 ఏళ్ల సెర్హీ కోరెట్స్కీకి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఇంధన రంగంలో మాత్రం అపార అనుభవం ఉంది. ఆయన గతంలో ఉక్రెయిన్ అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ సంస్థలైన 'ఉకర్నాఫ్టా', 'నాఫ్టోగాజ్' సంస్థలకు సీఈఓగా వ్యవహరించారు.జెలెన్స్కీ ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని యూలియా స్విరిడెంకో తన పదవికి రాజీనామా చేశారు. ఆమె స్ధానంలోనే సెర్హీ కోరెట్స్కీ ఎంపికయ్యారు. 2022లో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా కోరెట్స్కీ నిలిచారు. -
పాత దోస్తీకి కొత్త పరీక్ష.. భారత్ సాయం కోరిన రష్యా
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు శుద్ధి చేసిన ఇంధనం కోసం భారత్ వైపు చూస్తోంది. ఉక్రెయిన్ దాడులతో రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో దేశీయ పెట్రోల్ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో అదనపు పెట్రోల్ సరఫరా కోసం భారతీయ రిఫైనరీలను రష్యా సంప్రదించినట్లు సమాచారం.ఇది అంతర్జాతీయ ఇంధన రంగంలో ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు రష్యా ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే శక్తివంతమైన దేశంగా ఉంది. ముఖ్యంగా భారత్కు భారీగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసిన రష్యా.. ఇప్పుడు అదే భారత్ నుంచి శుద్ధి చేసిన పెట్రోల్ కొనుగోలు చేసే పరిస్థితిని ఎదుర్కొంటోంది.ఈ పరిణామానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ చేపడుతున్న డ్రోన్ దాడులు. రష్యాలోని చమురు రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరగడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంధన ఉత్పత్తి తగ్గినట్లు సమాచారం. రిఫైనరీల్లో మరమ్మతులు, ఉత్పత్తి అంతరాయాల కారణంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్ సరఫరాను స్థిరంగా ఉంచడం రష్యాకు సవాల్గా మారింది. రష్యా ప్రభుత్వం దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంధన సరఫరాను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లభ్యతపై ఒత్తిడి పెరగడంతో దిగుమతుల ద్వారా లోటును భర్తీ చేసే మార్గాలను మాస్కో పరిశీలిస్తోంది.ఈ క్రమంలో రష్యా సంస్థలు భారతీయ రిఫైనరీ కంపెనీలను సంప్రదించినట్లు సమాచారం. భారత్కు ప్రపంచ స్థాయి భారీ చమురు శుద్ధి సామర్థ్యం ఉంది. ముఖ్యంగా భారత రిఫైనరీలు దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులుగా మార్చి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంటాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత కొన్నేళ్లుగా భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా చమురుకు ప్రత్యామ్నాయ మార్కెట్లు అవసరమయ్యాయి. ఆ సమయంలో భారత్ పెద్ద కొనుగోలుదారుగా మారింది. ఇప్పుడు అదే ఇంధన సంబంధాలు మరో రూపంలో కనిపిస్తున్నాయి.భారత్కు ఒక అవకాశం.. అయితే ఈ పెట్రోల్ సరఫరా వ్యవహారం కేవలం వ్యాపార అంశం మాత్రమే కాదు. దీనికి అంతర్జాతీయ రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు పెరగడం ప్రపంచ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతోంది. భారత్కు ఇది ఒక అవకాశంగా కూడా మారవచ్చు. ప్రపంచ స్థాయి రిఫైనింగ్ సామర్థ్యం కారణంగా భారత ఇంధన కంపెనీలకు కొత్త మార్కెట్లు లభించే అవకాశం ఉంది. అయితే దేశీయ అవసరాలు, ఎగుమతి విధానాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు ప్రపంచానికి చమురు సరఫరా చేసిన రష్యానే ఇప్పుడు పెట్రోల్ కోసం ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కేవలం యుద్ధభూమికే పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన సమీకరణాలను ఎలా మార్చుతోందో ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది. -
ట్రెంపరితనం తెచ్చిన తంటా!
అగ్రరాజ్యం అమెరికా ఏకాకి అవుతోందా? మిత్రులు ముఖం చాటేస్తున్నారా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆర్థికంగా గుదిబండలవుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అంటున్నారు జాన్ ఫైనర్. న్యూయార్క్టైమ్స్ పత్రికలో ఈయన రాసిన కథనం ప్రకారం అధ్యక్షుడి తెంపరితనం కాస్తా పౌరులకు వందల కోట్ల డాలర్ల నష్టం తీసుకొచ్చింది. మిత్రదేశాలనూ వదలకుండా చేస్తున్న హెచ్చరికలు అంతర్జాతీయంగా అమెరికా ఒంటరయ్యేందుకు కారణమవుతోందని విశ్లేషిస్తున్నారు.అధ్యక్షుడిగానే కాదు.. అంతకుముందు కూడా డొనాల్డ్ జే ట్రంప్ వైఖరి వివాదాస్పదమే. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం కావచ్చు. వివాహం, అక్రమసంబంధాలు, పన్నులు ఎగ్గొట్టడం.. ఇలా బోలెడన్నిసార్లు అంతర్జాతీయంగా చర్చల్లో నిలిచారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన తరువాత ఈ వివాదాల జోరు మరింత పెరిగిందేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్(మాగా) నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించాక అక్రమ వలసదారులు, టారిఫ్లు, వీసాల వంటి విషయాల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పలుమార్లు విమర్శలకు గురయ్యాయి.ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ జాన్ ఫైనర్ ఈ తెంపరి నిర్ణయాల తాలూకూ ఆర్థిక భారంపై వివరణాత్మక విశ్లేషణ ఒకటి చేశారు. దాని ప్రకారం ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాలో ఇప్పటికే పెట్రోలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సుమారు 15 శాతం వరకూ పెరగ్గా, యూరియా ధర ఏకంగా యాభై శాతం ఎక్కువైంది. డీఏపీ కోసం 27 శాతం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ పెంపు కాస్తా అమెరికన్లపై ఇప్పటికే సుమారు 13,200 కోట్ల డాలర్ల ఆర్థిక భారం మోపిందని అంచనా. తగ్గిన పర్యాటకులు, విద్యార్థులు... కఠిన వీసా నిబంధనలు అమలు చేయడం, యుద్ధభయం వంటి కారణాలతో అమెరికాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే 2025లో అమెరికాకు వచ్చిన పర్యాటకుల సంఖ్య సుమారు 40 లక్షలు తక్కువ. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు 800 కోట్ల డాలర్ల నష్టం జరిగిందని లెక్కలేస్తున్నారు. వీసాల విషయంలో తీసుకొస్తున్న మార్పుల కారణంగా భారత్తోపాటు అనేక ఇతర దేశాల విద్యార్థులు అమెరికాకు కాకుండా ఇతర యూరోపియన్ దేశాలకు మళ్లుతూండటం గమనార్హం. ఫలితంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులు 2024తో పోలిస్తే 2025లో 17 శాతం తక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2026కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యం కాలేదు కానీ ఈ ఏడాది తగ్గుదల సుమారు 10 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. ఫలితంగా ఏటా కనీసం వంద కోట్ల డాలర్ల నష్టం ఉండొచ్చని తెలుస్తోంది. యూరప్తో మిలటరీ సంబంధాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనే అమెరికా, నాటోల మధ్య విపరీతమైన అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి. ట్రంప్ ఒంటెత్తు పోకడను పలు దేశాలు బహిరంగంగానే విమర్శించాయి. దీని ఫలితం సుస్పష్టం. 2025లో యూరోపియన్ దేశాలు మిలటరీపై పెట్టిన ఖర్చులు 14 శాతం వరకూ అంటే సుమారు 86,400 కోట్ల డాలర్లకు చేరినా అమెరికా కంపెనీల నుంచి చేసిన కొనుగోళ్లు సగానికి తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో అమెరికా పొరుగున ఉన్న కెనడా 15,000 కోట్ల డాలర్లతో యూరోపియన్ డిఫెన్స్ ఫండ్లోకి చేరిపోయింది.చైనాతో తన సంబంధాలను సుదృఢం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. ఆసియా దేశాల్లో జపాన్ తన మిలటరీ సామర్థ్యాన్ని పదును పెట్టుకుంటోంది. ఇందులో అమెరికా కంపెనీల స్థానంలో దక్షిణ కొరియా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. భారత్ కూడా ఏఐ వంటి కీలక టెక్నాలజీల విషయంలో దేశీ కంపెనీలు లేదంటే చైనీస్ కంపెనీల్లో మెరుగైన వాటిని వెతుక్కుంటున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమెరికాకు దూరంగా జరుగుతున్నట్లు, ఇందుకు ట్రంప్ తీరు, అమెరికా ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, వాణిజ్య వైరాలు, కృత్రిమ మేధ విషయంలో అస్పష్ట వైఖరి, విధానాలు కారణమని కాలమిస్ట్ ఫైనర్ విశ్లేషించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్ని, మోదీ ఆపకుంటే.. పోలండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పోలండ్ మంత్రి భారత ప్రధానిని ప్రశంసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో ప్రపంచాన్ని ఒక పెద్ద ముప్పు నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ కాపాడన్నారు. 2022 చివర్లో రష్యా వ్యూహాత్మక అణు ఆయుధాలను ఉపయోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒప్పించడంలో పీఎం మోదీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పోలాండ్ విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ థియోఫిల్ బార్టోస్జెవ్స్కీ ANIతో మాట్లాడుతూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో సుప్రసిద్ధ, అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞుడు. అలీన దేశంగా భారతదేశానికి రష్యన్ ఫెడరేషన్తో, అంతకుముందు సోవియట్ యూనియన్తో చాలాకాలంగా సంబంధాలు ఉన్నాయి. అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి మోదీ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. 2022 చివరిలో ఉక్రెయిన్లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా పుతిన్ను ఆపడంలో ప్రధానమంత్రి మోదీ పోషించిన పాత్ర గురించి నేను ప్రస్తావించాను. కానీ ఇది నిజం, అధ్యక్షుడు పుతిన్పై కొంత ఒత్తిడిని, ప్రభావాన్ని చూపగల కొద్దిమంది వ్యక్తులలో ప్రధానమంత్రి మోదీ ఒకరు." అని అన్నారు.రష్యా తనను శత్రువుగా భావించని దేశాల నుండి వచ్చే శాంతి విజ్ఞప్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పోలండ్ మంత్రి తెలిపారు. యుద్ధం మరింత పెరగకుండా చూడటంలో భారత్తో పాటు చైనా (షీ జిన్పింగ్) పాత్ర కూడా ముఖ్యమైనదని, అయితే ఈ సంక్షోభాన్ని ముగించడంలో భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారిందని ఆయన అన్నారు. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై మారిన పోలండ్ వైఖరిభారత్ రష్యా నుండి రాయితీపై ముడి చమురు కొనుగోలు చేయడంపై గతంలో పోలండ్ చేసిన విమర్శలపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు.రష్యా నుండి చౌకగా లభించే చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా మద్దతు ఇస్తోందని తాము గతంలో భావించామని, అయితే మార్కెట్ ధర కంటే 40% తక్కువకు చమురు లభిస్తున్నందున ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ అంశం రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.#WATCH | Delhi: On the Russia-Ukraine conflict, Secretary of State of the Polish Minister of Foreign Affairs, Władysław Teofil Bartoszewski, says, "Prime Minister Narendra Modi is a very well-known world statesman, who is very respected, and India has a long-standing relationship… pic.twitter.com/R38wQurE9u— ANI (@ANI) July 14, 2026 -
ట్రంప్ ‘ట్రంప్కార్డ్’ ఇక లేరు.. గ్రాహం మృతిపై అనుమానాల కలకలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఇక లేరు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన శనివారం కన్నుమూశారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.గ్రాహం కార్యాలయం తొలుత దీనిని ‘‘ఆకస్మిక అనారోగ్యం’’గా పేర్కొంది. అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక.. మరణంపై మరో ప్రకటన చేసింది. గుండెకు అనుసంధానమైన ప్రధాన ధమని ఏఓర్టాలో చీలిక (aortic dissection) కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపింది. తన సన్నిహితుడు గ్రాహం మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత నమ్మకమైన మిత్రుల్లో ఒకరిని కోల్పోయానని పేర్కొన్నారు.‘‘లిండ్సే గ్రాహం గొప్ప వ్యక్తి, గొప్ప సెనేటర్. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు. నిజమైన అమెరికన్ దేశభక్తుడు’’ అంటూ ట్రంప్ నివాళులర్పించారు. మరణానికి ముందు రోజు రాత్రి కూడా గ్రాహం తనతో మాట్లాడారని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ పర్యటన గురించి వివరించారని, సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిపోయినట్లు చెప్పారని వెల్లడించారు.భారత్పై ద్వేషం.. అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రాహం పేరు ఇటీవల భారత్ విషయంలో ఎక్కువగా వినిపించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ సహా ఆ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. ‘‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఊతమిస్తే.. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది’’ అంటూ గతంలో గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్కు కీలక వారధిలిండ్సే గ్రాహం అమెరికా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన నేత. 2002లో సెనేట్కు ఎన్నికైన ఆయన.. రక్షణ, విదేశాంగ విధానాల్లో రిపబ్లికన్ పార్టీకి కీలక స్వరంగా ఎదిగారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో విమర్శకుడిగా ఉన్నప్పటికీ.. తర్వాత ఆయనకు అత్యంత సన్నిహిత మద్దతుదారుల్లో ఒకరిగా మారారు. ట్రంప్ ‘‘అమెరికా ఫస్ట్’’ విధానానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం కొనసాగాలని గ్రాహం బలంగా నమ్మేవారు.ట్రంప్ శిబిరానికి భారీ లోటులిండ్సే గ్రాహం మరణం ట్రంప్ రాజకీయ శిబిరానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సెనేట్లో ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలిచే కీలక గొంతుకల్లో ఒకటి ఇప్పుడు లేకుండా పోయింది. ఉక్రెయిన్ పర్యటన తర్వాతే మృతి.. అనుమానాల కలకలంమరణానికి ముందు రోజు గ్రాహం ఉక్రెయిన్లో పర్యటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశమై.. రష్యాపై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్కు మద్దతు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన మరణంపై కొన్ని MAGA వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా లేదంటే ఇరాన్ ప్రమేయం ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. మరికొందరు.. ఉక్రెయిన్ పర్యటన, రష్యాపై ఆంక్షల పిలుపు, గతంలో వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అధికారులు కూడా ఎలాంటి కుట్ర కోణాన్ని నిర్ధారించలేదు. గ్రాహం కుటుంబంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉందని కూడా సమాచారం.ఇరాన్పై కఠిన వైఖరి.. ఇజ్రాయెల్కు మద్దతుగ్రాహం ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్కు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై మధ్యప్రాచ్యంలో విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. గ్రాహంను ‘‘ఇజ్రాయెల్కు గొప్ప మిత్రుడు’’గా అభివర్ణించారు.ఇక గ్రాహం స్థానంలో ఎవరు?గ్రాహం మృతితో దక్షిణ కరోలినా సెనేట్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతానికి ఆయన స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసే అధికారం రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్మాస్టర్కు ఉంది. ఆయన తాత్కాలిక సెనేటర్ను నియమించనున్నారు. ఈ రేసులో నాన్సీ మేస్ (Nancy Mace)(దక్షిణ కరోలినా ప్రతినిధుల సభ సభ్యురాలు), రిపబ్లికన్ హౌస్ సభ్యుడు రస్సెల్ ఫ్రై (Russell Fry), లెఫ్టినెంట్ గవర్నర్పామెలా ఎవెట్ (Pamela Evette).. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. గ్రాహం ఈ ఏడాది తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నందున.. ప్రత్యేక రిపబ్లికన్ ప్రైమరీ నిర్వహించి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ సాధారణ ఎన్నికల్లో తుది పోటీ జరుగుతుంది. -
పుతిన్ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని తెలుస్తోంది. పైగా యుద్ధాన్ని ముగించే దిశగా చర్చల కంటే.. మరింత తీవ్రతరం చేసే వ్యూహాలపైనే మాస్కో దృష్టి పెట్టినట్లు సమాచారం. క్రెమ్లిన్కు సన్నిహితంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు రాయిటర్స్కు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న నెలల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ ఇటీవల పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలతో వేర్వేరుగా ఫోన్ సంభాషణలు జరిపారు. యుద్ధానికి పరిష్కారం అనుకున్నదానికంటే దగ్గరలోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పుతిన్ మాత్రం ప్రస్తుత యుద్ధ లక్ష్యాలను సాధించే వరకు వెనక్కి తగ్గే పరిస్థితిలో లేరని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి.డాన్బాస్పై పట్టు కోసం..రష్యా అధ్యక్షుడి ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమేనని సమాచారం. ఈ ప్రాంతంపై నియంత్రణ సాధిస్తేనే యుద్ధంలో విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నారని పుతిన్కు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు. కాల్పుల విరమణతో ప్రస్తుత యుద్ధ రేఖలను కొనసాగించే ప్రతిపాదనలను పుతిన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డాన్బాస్లో మిగిలిన ప్రాంతాలను కూడా త్వరలోనే తమ బలగాలు స్వాధీనం చేసుకుంటాయని రష్యా అధ్యక్షుడు నమ్ముతున్నారని సమాచారం.చమురు కేంద్రాలపై దాడులతో ఒత్తిళ్లుఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, పోర్టులు, నిల్వ కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా రష్యాలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ దాడులు పుతిన్ను మరింత ఆగ్రహానికి గురిచేశాయని, ప్రతిగా ఉక్రెయిన్పై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఇటీవల రష్యా కీవ్తో పాటు పలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడులు చేసింది. ఇందులో పలువురు పౌరులు మృతి చెందారు.డాన్బాస్ దాటి కొత్త భూభాగాలపై కన్ను?ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్ ఇటీవల రష్యా సైనిక అధికారులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వీటిని భద్రతా ప్రాంతాలుగా మార్చాలన్నది రష్యా ఉద్దేశమని ఆయన సంకేతాలిచ్చారు. ఉక్రెయిన్ మాత్రం తమ నిఘా నివేదికల ప్రకారం పుతిన్ శాంతి కోసం కాకుండా యుద్ధాన్ని కొనసాగించేందుకు కొత్త ఆపరేషన్లకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తోంది. అవసరమైతే ఉక్రెయిన్ వెలుపల ఉన్న యూరప్ దేశాలపై కూడా రష్యా దృష్టి పెట్టే అవకాశం ఉందని కీవ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.నాటోతో ప్రత్యక్ష ఘర్షణకు అవకాశంరష్యా సైనిక వర్గాల్లో ఇటీవల యుద్ధాన్ని మరింత విస్తరించే అంశంపై చర్చలు పెరిగాయి. ముఖ్యంగా బాల్టిక్ దేశాల్లోని నాటో స్థావరాలపై దాడుల అవకాశాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. అలాంటి చర్యలు జరిగితే అమెరికా నేతృత్వంలోని నాటో కూటమితో రష్యాకు ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే రష్యా నేరుగా నాటోతో యుద్ధం కోరుకోకపోయినా.. కూటమిలో విభేదాలు సృష్టించే లక్ష్యంతో చిన్నచిన్న దాడులకు పాల్పడే అవకాశం ఉందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.యుద్ధానికి పెరుగుతున్న మూల్యం2022లో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది సైనికులు మృతి చెందడం, గాయపడటం లేదా కనిపించకుండా పోవడం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ రష్యా దళాలు డాన్బాస్ ప్రాంతంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ల వినియోగం రష్యా సంఖ్యాబలానికి సవాల్గా మారింది. దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవైన యుద్ధ రేఖపై పురోగతి సాధించేందుకు రష్యా భారీగా శ్రమిస్తోంది.పుతిన్కు విజయం అవసరంక్రెమ్లిన్కు సన్నిహితంగా ఉన్న వర్గాల ప్రకారం.. పుతిన్ ఈ యుద్ధంలో ఏదో ఒక స్పష్టమైన విజయాన్ని చూపించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా డాన్బాస్పై పూర్తి ఆధిపత్యం సాధించడం ఆయన రాజకీయంగా కీలక విజయంగా చూస్తున్నట్లు సమాచారం. అందుకే అమెరికా శాంతి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రష్యా ఇప్పట్లో యుద్ధం నుంచి వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రష్యా అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు ఫ్రంట్లో రష్యాకు చెందిన అత్యాధునిక Su-35 మల్టీరోల్ ఫైటర్ జెట్ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. "ఈ రోజు మరో రష్యన్ వైమానిక ఉగ్రవాదిని నేలకూల్చాం" అంటూ టెలిగ్రామ్లో వెల్లడించిన ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్, ఘటన జరిగిన ప్రాంతాన్ని మాత్రమే వెల్లడించగా.. దాడి ఎలా నిర్వహించారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రకటనపై రష్యా అధికారికంగా స్పందించలేదు. స్వతంత్ర వర్గాలు కూడా ఈ ఘటనను పూర్తిగా ధ్రువీకరించలేదు.Su-35 (నాటో కోడ్నేమ్ Flanker-E) రష్యా వైమానిక దళంలోని అత్యంత శక్తివంతమైన నాలుగో తరం మల్టీరోల్ యుద్ధ విమానాల్లో ఒకటి. గగనతల ఆధిపత్యం సాధించడం, దీర్ఘదూర క్షిపణి దాడులు, భూ లక్ష్యాలపై బాంబుదాడులు వంటి కీలక ఆపరేషన్లలో ఈ విమానాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అధునాతన రాడార్, శక్తివంతమైన ఇంజిన్లు, దీర్ఘశ్రేణి ఆయుధ వ్యవస్థలు దీనికి ప్రత్యేకత.ఇటీవలే జూన్ 26న రష్యా ఆక్రమిత క్రిమియాలోని బెల్బెక్ ఎయిర్బేస్పై నిర్వహించిన దాడిలో రష్యా మిగ్-29 యుద్ధ విమానం ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ సైనిక గూఢచారి సంస్థ (HUR) వెల్లడించింది. ఆ ఘటనతో రష్యాకు కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ అంచనా వేసింది.ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఇప్పటివరకు 436 యుద్ధ విమానాలు, 353 హెలికాప్టర్లను కోల్పోయినట్లు పేర్కొంది. అయితే ఈ గణాంకాలను రష్యా అంగీకరించలేదు. స్వతంత్రంగా కూడా నిర్ధారణ కాలేదు. -
ఉక్రెయిన్ పై రష్యా దాడి వెనుక ప్లాన్ ?
-
కీవ్పై మిసైళ్ల వర్షం..11 మంది మృతి
కీవ్:ఉక్రెయిన్ రష్యా యుద్ధం మెుదలై దాదాపు నాలుగేళ్లు గడుస్తోన్నా ఇంకా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా (సోమవారం) మిసైళ్లతో విరుచుకపడింది. ఈ దాడులలో 11మంది ఉక్రెయిన్ పౌరులు దుర్మరణం చెందగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.కీవ్ టార్గెట్గా 68 మిసైళ్లు, 361 పైగా డ్రోన్లతో రష్యా దాడులు చేసినట్లు రాయిటర్స్ కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడులలో కీవ్లో దాదాపుగా 10 మందికి పైగా నగరంలో మృతి చెందగా మరో 45 మంది గాయపడినట్లు కథనాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది టర్కీలో నాటో శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాగా ఇటీవలే కీవ్పై రష్యా దాడులతో విరుచుకపడుతోంది. గత గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ఏకధాటిగా 11 గంటల పాటు జరిగాయి. ఈ అటాక్స్లో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 90 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ఇటీవల తమ చమురుశుద్ధి కేంద్రాలపై జరిపిన దాడులకు ఈ దాడులు ప్రతీకారమని రష్యా స్పష్టం చేసింది. అధికారుల ముందస్తు హెచ్చరికతో స్థానికులు చాలావరకూ సబ్వే స్టేషన్లలో తలదాచుకోవడంతో ప్రాణనష్టం తగ్గింది.దాడులు ఎందుకు తీవ్రతరమయ్యాయిఉక్రెయిన్ ‘నలభై రోజుల నుంచి మెరుపుదాడి’ప్రణాళికలో భాగంగా రష్యా మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఫలితంగా రష్యాలో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇందుకు ప్రతీకారంగా తాము దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా దాడి కోసం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి ఆయుధాలు, డ్రోన్లు వినియోగించినట్లు వివరించింది. దీనికి ప్రతికారంగా రష్యా, కీవ్పై దాడులు చేస్తోంది. -
ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!!
నాలుగేళ్ల క్రితం.. 2022 ఫిబ్రవరి 24న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక సంచలన మలుపు తిరిగింది. ఒకప్పుడు ఉక్రెయిన్ను కేవలం మూడు రోజుల్లో లొంగదీసుకుంటామని భావించిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు, ఇప్పుడు 2026లో కోలుకోలేని షాక్ తగిలిందా? ఐదో ఏట అడుగుపెట్టిన ఈ యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తోందా? రష్యా సైనిక వ్యవస్థతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే స్థితికి చేరుకుందా?రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ వేసినట్లు 2026 చివరి నాటికి డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఆ దారులు ఏంటి? ఉక్రెయిన్ భారీ గ్రౌండ్ అటాక్స్కు బదులుగా ఏ కొత్త యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తోంది? ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థలో ఏ ప్రధాన రంగం ఎక్కువగా దెబ్బతింది? మొదటగా రష్యా సాధించిన పురోగతిని ఒక్కసారి గమనిస్తే.. 2014లో మొదటి విడతగా రష్యా కేవలం 7 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత 2022లో పూర్తిస్థాయి దండయాత్ర మొదలుపెట్టినప్పుడు.. గరిష్టంగా 27 శాతం భూభాగాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. కానీ, ఉక్రెయిన్ ఎదురుదాడితో అది 18 శాతానికి పడిపోయింది. అయితే, గత మూడున్నరేళ్లుగా రష్యా సాధించింది ఏంటో తెలుసా? కేవలం ఒకటిన్నర శాతం (1.5%) అదనపు భూభాగం మాత్రమే! వినడానికి ఇది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న ముక్క కోసం రష్యా చెల్లించిన మూల్యం ఎంతో తెలిస్తే మీ గుండె గుభేల్ మంటుంది. గత మూడున్నరేళ్లలో ఈ 1.5 శాతం భూమిని గెలవడానికి దాదాపు 5 లక్షల మంది మరణించినట్లు.. మరో 7 లక్షల మంది తీవ్రంగా లేదా పాక్షికంగా గాయాలపాలైనట్లు అంతర్జాతీయ నిఘా వర్గాల విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 10 లక్షలకు పైనే ఉంటుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ కంటే చిన్నదైన ఈ భూభాగం కోసం రష్యా ఇంతటి రక్తపాతాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంటే రష్యాలోని మొత్తం పోరాడే వయసున్న యువకుల్లో 3 శాతం మంది ఈ యుద్ధంలో తుడిచిపెట్టుకుపోయారు. 21వ శతాబ్దంలో ఇంతటి ఘోరమైన గణాంకాలు బహుశా ఏ దేశానికీ లేవు.అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. రష్యా సైనికుల మరణాల రేటు 2026లో విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం రష్యా నెలకు సగటున 35 వేల మంది సైనికులను నష్టపోతోంది. రష్యా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల యువకులకు సాధారణ జీతం కంటే 7 నుంచి 8 రెట్లు ఎక్కువ డబ్బులు, ఉచిత భూములు, రుణాల మాఫీ ఆశ చూపి సైన్యంలో చేర్చుకున్నప్పటికీ.. ఇప్పుడు చనిపోతున్న వారి సంఖ్యతో పోలిస్తే కొత్తగా చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే, రష్యాకు ఇప్పుడు 'మ్యాన్పవర్' కొరత స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా దాదాపు 6 లక్షల మంది సైనికులను కోల్పోయింది. జనాభా పరంగా చూస్తే ఉక్రెయిన్కు ఇది 7 శాతం నష్టం. అందుకే ఉక్రెయిన్ తన పాత వ్యూహాన్ని మార్చింది. రష్యా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైనికులను పంపే భారీ గ్రౌండ్ అటాక్స్ పద్ధతిని పక్కన పెట్టి.. 'అసిమెట్రిక్ వార్ఫేర్' అంటే డ్రోన్ల ద్వారా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది.అవును, ఉక్రెయిన్ ఇప్పుడు సరిహద్దుల పొడవునా వందల కిలోమీటర్ల మేర ఒక 'డ్రోన్ గోడ' నిర్మించింది. దాదాపు 150కి పైగా స్థానిక కంపెనీలతో మిలియన్ల కొద్దీ FPV డ్రోన్లను తయారు చేయిస్తోంది. ఈ డ్రోన్ల నిఘా వల్ల రష్యా సైన్యం కదలడమే కష్టంగా మారింది. గాయపడిన సైనికులను కాపాడటానికి హెలికాప్టర్లు కూడా రాలేకపోతున్నాయి. ఫలితంగా ఒకప్పుడు రష్యా వైపు గాయపడిన 10 మందిలో ఒకరు చనిపోతే, ఇప్పుడు ప్రతీ నలుగురిలో ఒకరు చనిపోతున్నారు. అంతేకాదు, ఉక్రెయిన్ ఏకంగా 1,750 కిలోమీటర్ల దూరం ప్రయాణించే లాంగ్-రేంజ్ డ్రోన్లతో రష్యా లోపలికి చొచ్చుకుపోతోంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరైన ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై ఉక్రెయిన్ 'కైనెటిక్ శాంక్షన్స్' పేరిట విరుచుకుపడుతోంది. మొన్న ఏప్రిల్, మే నెలల్లోనే దాదాపు 20 రష్యన్ ఆయిల్ రిఫైనరీలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం రష్యా ఆయిల్ ఎగుమతులు రోజుకు 3 లక్షల బారెళ్లకు పడిపోయాయి. 2009 తర్వాత రష్యాలో ఇంత తక్కువ ఆయిల్ ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారి.రష్యాకు తగులుతున్న షాక్లు ఇక్కడితో అయిపోలేదు. అంతరిక్షంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా వాడుతున్న స్టార్లింక్ ఇంటర్నెట్ టెర్మినల్స్ను స్పేస్ ఎక్స్ సంస్థ బ్లాక్ చేసింది. దీనివల్ల రష్యా సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. అలాగే రష్యా ప్రభుత్వం దేశంలో టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేయడం వల్ల వారి సొంత కమ్యూనికేషన్స్ కూడా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా చూస్తే రష్యా పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. రష్యా తన ద్రవ్యోల్బణం కేవలం 5 శాతమే అని చెబుతున్నా, స్వీడన్ నిఘా వర్గాల ప్రకారం అది నిజానికి 15 శాతానికి పైనే ఉంది. రష్యా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఏకంగా 21 శాతానికి పెంచడమే దీనికి నిదర్శనం. యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటంతో రష్యా ప్రజల్లో పుతిన్ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఒకప్పుడు 77 శాతం ఉన్న పుతిన్ అప్రూవల్ రేటింగ్ ఇప్పుడు 65 శాతానికి పడిపోయింది. బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి రష్యా తలప్రాణం తోకకు వస్తోంది. కానీ ఉక్రెయిన్ కథ వేరు. ఐరోపా సమాఖ్య నుంచి ఉక్రెయిన్కు 90 బిలియన్ యూరోల వడ్డీ లేని భారీ రుణం మంజూరైంది. విశేషం ఏంటంటే.. ఈ అప్పును రష్యా చెల్లించాల్సిన యుద్ధ నష్టపరిహారం నుంచే వసూలు చేయాలని ఐరోపా సమాఖ్య భావిస్తోంది. జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్ వంటి దేశాలు నేరుగా ఉక్రెయిన్తో కలిసి డ్రోన్లు, రాకెట్ ఇంధనాన్ని తయారు చేస్తున్నాయి.ఇవన్నీ గమనిస్తుంటే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ వేసినట్లు 2026 చివరి నాటికి డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి.. అవమానాన్ని భరిస్తూనే యుద్ధాన్ని ఆపేసి సీజ్ఫైర్ (Ceasefire) ప్రకటించడం. రెండు.. మరో 2 లక్షల మందిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకుంటూ రెండో విడత జనరల్ మొబిలైజేషన్ ప్రకటించడం. కానీ రెండో దారి ఎంచుకుంటే రష్యా ప్రజల నుండి తీవ్ర తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా, 2026 సంవత్సరం ఉక్రెయిన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి రష్యా ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుంది? పుతిన్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. :: హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
పుతిన్కు ట్రంప్ ఫోన్.. ఉక్రెయిన్ వార్పై కీలక నిర్ణయం?
వాషింగ్టన్/మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శనివారం రాత్రి దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘ టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన ఈ చర్చలు అత్యంత స్పష్టంగా, సూటిగా సాగాయని క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే జరగనున్న ‘నాటో’ సదస్సుకు ముందే ట్రంప్ ఈ కీలక అడుగు వేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్తో మాట్లాడటానికి ముందే ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ సంప్రదింపులు జరిపారు.ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరితగతిన ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని రష్యా అధినేతకు ట్రంప్ ప్రతిపాదించినట్లు క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ ఆదివారం ఉదయం ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ముందడుగు పడటంతో, గత కొన్నేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి త్వరలోనే తెరపడనుందనే ఆశలు చిగురిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నాటో కూటమి దేశాలు కూడా ఈ చర్చలపై తీవ్రంగా దృష్టి సారించాయి. -
రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు
నాలుగేళ్లుగా సాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఒకరోజు క్రితం కీప్పై రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడులు జరపగా.. శుక్రవారం కూడా ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించాయి. తాజా దాడుల్లో ఇరు దేశాల్లో కలిపి కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా రాత్రికి రాత్రే 2 క్షిపణులు, 105 డ్రోన్లతో దాడులు చేసింది. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ.. ఉక్రెయిన్ ప్రయోగించిన 155 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రష్యా భూభాగంతో పాటు ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పం మీద కూల్చివేసినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్లోని రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలో జరిగిన ఉక్రెయిన్ దాడిలో స్థానిక మార్కెట్ లక్ష్యంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతి చెందగా మరో మూడు వేర్వేరు దాడుల్లో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ ప్రాంతానికి రష్యా నియమించిన గవర్నర్ యెన్గెనీ బాలిట్స్కీ తెలిపారు. షాపింగ్ చేస్తున్న సాధారణ ప్రజలనే ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.రష్యాలోని బెల్గారోడ్ ప్రాంతంలో ఒకరు, పొరుగున ఉన్న బ్రయాన్క్ ప్రాంతంలో మరో వ్యక్తి ఉక్రెయిన్ దాడుల్లో మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ ఈశాన్యంలోని సుమీ ప్రాంతంలో రష్యా దాడి ఓ నివాస ప్రాంతాన్ని తాకింది. ఇల్లు మంటల్లో చిక్కుకోవడంతో రెండేళ్లలోపు చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారి తల్లి, మరో మహిళ, వృద్ధుడు ఉన్నట్లు గవర్నర్ ఒలెహ్ హ్రిహొరోవ్ తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అలాగే డ్నిప్రోపెట్రోవ్స్ ప్రాంతంలో జరిగిన మరో రష్యా దాడిలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. “యుద్ధాన్ని ఆపకుండా కొనసాగించేందుకు రష్యా దగ్గర మిగిలింది ఉగ్రవాదమే. కావాలనే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటోంది.” అని ఆరోపించారు. అయితే రష్యా -రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఉక్రెయిన్ సైనిక పరిశ్రమలు, ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకున్నామని.. -ఇది ఉక్రెయిన్ దాడులకు ప్రతీకార చర్య అని పేర్కొంది. -
ఉక్రెయిన్పై రష్యా వైమానిక దాడి.. ‘కీవ్’ అతలాకుతలం
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా అర్థరాత్రి అకస్మాత్తుగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులకు తెగబడింది. నగరమంతటా శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. పలు నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజధానిపై రష్యా పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరిగింది. ఎయిర్-రైడ్ సైరన్లు మోగడంతో భయాందోళనకు గురైన వేలాది మంది స్థానికులు భూగర్భ మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందారు. Kyiv city has been hell for a few hours now. - 13 cruise missiles have struck the city- Several Geran-3/4/5 - Several ballistic missiles- The lack of air defense is real sadlyAttack is not over pic.twitter.com/oGpsCWDl71— kim høvik (@kimhvik2) July 2, 2026ఈ దాడిలో ఒక తొమ్మిది అంతస్తుల నివాస భవనం పాక్షికంగా కూలిపోగా, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక హోటల్తో పాటు పలు నివాస ప్రాంతాలలో భారీగా మంటలు చెలరేగడంతో సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. కీవ్ మేయర్ విటాలీ క్లిట్చ్కో తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య సిబ్బంది గాయపడ్డారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇటీవలి కాలంలో రష్యా ఇంధన మౌలిక సదుపాయాలు, మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ లాంగ్-రేంజ్ డ్రోన్ దాడులను పెంచిన నేపథ్యంలో రష్యా ఈ ప్రతీకార చర్యకు దిగింది. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని ఐర్లాండ్ పర్యటనలోవున్న జెలెన్స్కీ పిలుపునిచ్చారు. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా అందిస్తున్న సైనిక సహాయం ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి ఊహించని పరిణామాలకు దారితీస్తుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఇప్పటికే హెచ్చరించారు. -
ఉక్రెయిన్ దాడులు.. రష్యాలో ఇంధన సంక్షోభం
రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొనసాగుతున్న వేళ దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ జోక్యం అవసరమని పేర్కొన్నది. మరోవైపు వేసవి ప్రయాణాలు, పంట కోతల తరుణంలో గ్యాసోలైన్, డీజిల్కు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో ఇంధనం గురించి ఆందోళన అక్కర్లేదన్న ప్రకటన నుంచి ఇంధన సరఫరాలో సంక్షో భం ఉందని దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించే స్థాయికి పరిస్థితి దిగజారింది. రాజధాని మాస్కోలోనూ ఇంధన కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో గతవారం ప్రభుత్వ, చమురు కంపెనీల ఉన్నతాధికారులతో పుతిన్ సమావేశమై పరిష్కారం గురించి చర్చించారు. -
ఉక్రెయిన్పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో కనీసం ఎనిమిది మంది మరణించగా, మరో 34 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ ఖండించారు. యుద్ధరంగం నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రమైన ద్నీప్రో నగరంపై రష్యా దళాలు తరచూ దాడులు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే చనిపోయిన బాధితుల్లో ఒకరు 13 ఏళ్ల బాలిక అని ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ హంజా టెలిగ్రామ్ సందేశంలో తెలిపారు. పగిలిన కిటికీలతో ఉన్న ఒక భవనం చిత్రాలను, మెట్ల దగ్గర పడి ఉన్న మృతదేహం అస్పష్టమైన ఫోటోను ఆయన పంచుకున్నారు.ఇక జపోరిజ్జియాపై జరిగిన డ్రోన్ దాడిలో కనీసం ముగ్గురు మరణించగా, ఒక చిన్నారితో సహా మరో ఆరుగురు గాయపడ్డారని జెలెనెస్కీ తెలిపారు. సుమీ, ఒడెసా, చెర్నిహివ్, ఖేర్సన్, ఖార్కివ్ ప్రాంతాలలో కూడా రష్యా దాడులు నిర్వహించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. 2024లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మాస్కో తమవని చెప్పుకుంటున్న నాలుగు ప్రాంతాల నుంచి కీవ్ బలగాలు వైదొలగాలని, అలాగే నాటోలో చేరాలన్న తమ ప్రణాళికలను బహిరంగంగా విరమించుకోవాలని చెప్పినప్పటి నుంచి శాంతి ఒప్పందంపై రష్యా వైఖరి మారలేదని క్రెమ్లిన్ సోమవారం తెలిపింది. పోరాటాన్ని తగ్గించాలన్న ఉక్రెయిన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ఆ ప్రాంతాలపై పూర్తి నియంత్రణ సాధించాలన్న లక్ష్యంతో రష్యా ముందుకు సాగుతుందని వారాంతంలో ఒక టెలివిజన్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ పేర్కొన్నారు. సుదూర దాడులను పరస్పరం నిలిపివేయాలని, పోరాటాన్ని డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, పోరిజ్జియా అనే నాలుగు ప్రాంతాలకే పరిమితం చేయాలని కీవ్ ప్రతిపాదించిందని పుతిన్ చెప్పారు. -
పుతిన్కు భారీ షాక్.. రష్యాకు కొత్త టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొత్త దశకు చేరుకుంది. యుద్ధభూమిలో పోరాటంతో పాటు ఒకరి ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాలను మరొకరు లక్ష్యంగా చేసుకుంటున్న తరుణంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యా చమురు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ వరుసగా నిర్వహిస్తున్న దీర్ఘశ్రేణి డ్రోన్ దాడులతో రష్యాలోని పలు కీలక చమురు రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు, ఆయిల్ డిపోలు దెబ్బతిన్నాయి. దీంతో దేశీయ ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం.ఈ పరిస్థితుల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశంలో ఇంధన కొరత, సరఫరా సమస్యలు ఉన్నాయని అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఇంధన సరఫరాను నిర్ధారించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.రిఫైనరీలపై వరుస దాడులుఉక్రెయిన్ తన స్వదేశంలో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా భూభాగంలో వందల కిలోమీటర్ల లోతులో ఉన్న చమురు రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ దాడుల్లో కొన్ని రిఫైనరీలలో మంటలు చెలరేగగా, మరికొన్ని చోట్ల ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దెబ్బతిన్న యంత్రాంగాన్ని పునరుద్ధరించేందుకు సమయం పడుతుండటంతో ఇంధన ఉత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు సమాచారం.Our warriors began Ukraine’s Constitution Day with great accuracy. Last night, our long-range sanctions reached two oil refineries in Russia. The Slavyansk oil refinery in the Krasnodar region was hit – about 300 kilometers from the frontline. We also reached a refinery in the… pic.twitter.com/MiKOSjszFF— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 28, 2026ఎందుకు రిఫైనరీలే లక్ష్యం?రష్యా యుద్ధ యంత్రాంగానికి ఇంధనం అత్యంత కీలకం. సైనిక వాహనాలు, యుద్ధ ట్యాంకులు, విమానాలు, నౌకలు, లాజిస్టిక్స్ వ్యవస్థ మొత్తం పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే ఉక్రెయిన్ నేరుగా యుద్ధరంగంపై కాకుండా, రష్యా చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన నిల్వలు, సరఫరా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీని ద్వారా రష్యా సైనిక కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించడంతో పాటు ఆర్థిక ఒత్తిడిని కూడా పెంచాలనేది ఉక్రెయిన్ వ్యూహంగా ఉంది. దీంతో యుద్ధం కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాకుండా రెండు దేశాల అంతర్భాగాలకూ విస్తరించింది.ఇంధన సరఫరాపై ప్రభావంరిఫైనరీల ఉత్పత్తి తగ్గడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ప్రభావం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత తలెత్తే అవకాశం ఉండటంతో ప్రభుత్వం సరఫరాను సమతుల్యం చేసేందుకు చర్యలు చేపడుతోంది. అవసరమైతే ఎగుమతులపై పరిమితులు విధించడం, దేశీయ మార్కెట్కు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలను కూడా రష్యా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల్లో రష్యా ఒకటి. చమురు, సహజ వాయువు విక్రయాల ద్వారానే రష్యా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభిస్తుంది. రిఫైనరీలు దెబ్బతినడం వల్ల శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తుల ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపడమే కాకుండా యుద్ధ వ్యయాలను భరించే సామర్థ్యంపైనా ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.అంతర్జాతీయ ఆందోళనరష్యా ఇంధన రంగంపై కొనసాగుతున్న దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్పైనా ప్రభావం చూపే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు ఉత్పత్తి, సరఫరాలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. యుద్ధం మరింత తీవ్రతరం అయితే ప్రపంచ ఇంధన భద్రత, సరఫరా గొలుసులపై కూడా దీని ప్రభావం కనిపించే అవకాశముంది. -
రష్యాపై భారీ డ్రోన్ దాడులు
కీవ్: ఉక్రెయిన్ మరోసారి తన లాంగ్రేంజ్ కిల్లర్ డ్రోన్ల సత్తాను రష్యాకు చూపింది. ఆక్రమిత క్రిమియా సహా డజనుకు పైగా ప్రాంతాల్లో గురువారం రాత్రి భీకర దాడులకు పాల్పడింది. నాలుగేళ్ల క్రితం రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఉక్రెయిన్ చేపట్టిన భారీ దాడుల్లో ఇదొకటని చెబుతున్నారు. వాటిల్లిన నష్టాన్ని అధికారికంగా రష్యా ప్రకటించనప్పటికీ, స్వతంత్ర వార్తా సంస్థలు మాత్రం నొవొమొస్కోవ్స్క్ లోని రసాయన కర్మాగారం, జలవిద్యుత్ ప్లాంట్లలో పేలుళ్లు సంభవించినట్లు తెలిపాయి. క్రిమియాలోని కీలకమైన నౌకాశ్రయం కెర్చ్లోని గగనతల రక్షణ వ్యవస్థలతోపాటు రష్యా యుద్ధ నౌకలపై డ్రోన్ దాడి జరిపినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. దాడులతో నౌకల్లో భారీగా మంటలు చెలరేగినట్లు వెల్లడించింది. రాజధాని మాస్కో దిశగా దూసుకొచ్చిన 47 డ్రోన్లను కూల్చివేశామని అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యక్షమైన 660 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. జెలెన్స్కీ 40 రోజుల ఆపరేషన్ శాంతి చర్చల దిశగా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తన 40 రోజుల ఆపరేషన్ను ప్రకటించిన కొద్ది గంటల్లోనే రష్యాపై డ్రోన్ దండును వదలడం గమనార్హం. రష్యా లోతట్లు ప్రాంతాల్లో ఉన్న ఇంధన, చమురు కేంద్రాలే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన దాడులు తీవ్ర ప్రభావం చూపాయి. -
యుద్ధ ఖైదీలైన కిమ్ సైనికులకు కొత్త జీవితం?
వాళ్లంతా నార్త్ కొరియా నియాంతాధ్యక్షుడు కిమ్కు చెందిన సైనికులు. రష్యా కోసం తుపాకీ పట్టారు.. ఉక్రెయిన్కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. ఇప్పుడు వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు యుద్ధ చెర, మరోవైపు స్వదేశానికి తిరిగి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన. ఇలాంటి సమయంలో వారికి అనూహ్యంగా దాయాది దేశమైన దక్షిణ కొరియా చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. స్వచ్ఛందంగా రావాలనుకుంటే ఆశ్రయం కల్పిస్తామని సియోల్(దక్షిణ కొరియా రాజధాని) ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుద్ధ ఖైదీలను వారి ఇష్టానికి విరుద్ధంగా తిరిగి ఉత్తర కొరియా లేదంటే రష్యాకు పంపడం సరైంది కాదని పేర్కొంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, యుద్ధ ఖైదీల హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా వివరించింది. విదేశాంగ శాఖ జూన్ 23న విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అంశం ప్రస్తుతం సియోల్, కీవ్ల మధ్య దౌత్య చర్చల్లో కీలకంగా మారింది. వచ్చే వారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా(Andrii Sybiha) సియోల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్(Cho Hyun)తో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ సైన్యానికి చిక్కిన ఉత్తర కొరియా సైనికుల భవిష్యత్తు, దక్షిణ కొరియాకు రావాలనుకునే వారి పరిస్థితిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.కొన్నేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో.. ఉత్తర కొరియా ప్రమేయం గత కొంతకాలంగా అంతర్జాతీయ చర్చకు దారితీస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, పశ్చిమ దేశాల అంచనాల ప్రకారం.. ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలతో పాటు వేలాది మంది సైనికులను కూడా పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రష్యాలోని కుర్సుక్ ఒబ్లాస్ట్ (Kursk Oblast) ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులను ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా దళాలను వినియోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.దక్షిణ కొరియా గూఢచారి సంస్థల అంచనాల ప్రకారం.. ఉత్తర కొరియా సుమారు 10 వేల నుంచి 15 వేల మంది వరకు సైనికులను రష్యాకు పంపినట్లు గతంలో వెల్లడైంది. వీరిలో కొందరు యుద్ధంలో మరణించగా, మరికొందరు గాయపడ్డారని, కొందరు ఉక్రెయిన్ సైన్యానికి ఖైదీలుగా చిక్కినట్లు సమాచారం. ఈ ఖైదీల్లో కొందరు ఉత్తర కొరియాకు తిరిగి వెళ్లాలనే ఆసక్తి చూపడం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా చేసిన తాజా ప్రకటనకు రాజకీయ, దౌత్యపరంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తర కొరియా నుంచి పారిపోయే వారికి గతంలో కూడా దక్షిణ కొరియా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు యుద్ధ ఖైదీల విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది.ఒకవేళ ఉక్రెయిన్ చెరలో ఉన్న ఉత్తర కొరియా సైనికులు దక్షిణ కొరియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే, అది కేవలం మానవతా అంశంగానే కాకుండా ఉత్తర కొరియా-రష్యా సంబంధాలు, కొరియా ద్వీపకల్ప రాజకీయాలపై కూడా ప్రభావం చూపే పరిణామంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రష్యాపై ఉక్రెయిన్ భారీ ప్రతీకార దాడి
ఉక్రెయిన్ సైన్యం గురువారం మాస్కోపై భారీ ప్రతీకార దాడికి పాల్పడింది. రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అతి భారీ డ్రోన్ దాడి ఇదే. ఈ దాడిలో మాస్కోలోని కీలకమైన Kapotnya Oil Refinery తగలబడిపోయింది. ఈ రిఫైనరీ మాస్కోకు ఆయువుపట్టు లాంటిది.ఈ దాడిలో రిఫైనరీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రిఫైనరీ మాస్కో పెట్రోల్ అవసరాల్లో దాదాపు 40 శాతం, డీజిల్ అవసరాల్లో 50 శాతం వాటా కలిగి ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో రిఫైనరీ వద్ద భారీగా పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని సమర్థిస్తూ, ఇటీవల రష్యా కీవ్లోని చారిత్రక మఠ సముదాయంపై జరిపిన క్షిపణి దాడికి ప్రతీకార చర్యగా ప్రకటించారు. "ఉక్రెయిన్ కాలిపోతే మాస్కో కూడా కాలుతుంది. యుద్ధం ముగిసే సమయం వచ్చింది" అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ దాడిపై రష్యా విదేశాంగ మంతి సెర్గీ లవ్రోవ్ స్పందిస్తూ, ఇకపై ఉక్రెయిన్పై క్రమం తప్పకుండా భారీ సమూహ దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.మరోవైపు రష్యా రాత్రికిరాత్రే దేశవ్యాప్తంగా 555 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించింది. అయితే కనీసం కొన్ని డ్రోన్లు రక్షణ వ్యవస్థలను దాటుకుని లక్ష్యాలను తాకినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోని పలు విమానాశ్రయాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.ఇదే సమయంలో రష్యా కూడా ఉక్రెయిన్పై 200కు పైగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఎదురుదాడులు కొనసాగించింది. దీంతో రెండు దేశాల మధ్య వైమానిక యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. -
మంటల్లో మాస్కో రష్యాపై అతిపెద్ద డ్రోన్ల దాడి..
-
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
ఉక్రెయిన్పై రష్యా మరోసారి భారీ క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్తో పాటు పలు నగరాలపై ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగిన దాడుల్లో కనీసం 11 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు.ఈ దాడుల్లో చారిత్రక డార్మిషన్ కేథడ్రల్ భారీగా దెబ్బతింది. డ్రోన్ నేరుగా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 11వ శతాబ్దానికి చెందిన ఈ కేథడ్రల్ ఉక్రెయిన్ ఆర్థడాక్స్ క్రైస్తవ సంప్రదాయానికి అత్యంత పవిత్రమైన కేంద్రంగా భావిస్తారు.ఈ దాడులపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. యుద్ధాన్ని కొనసాగించాలన్న రష్యా ఉద్దేశాన్ని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, ఉక్రెయిన్కు అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను అందించాలని జీ-7 దేశాలను కోరారు.ఈ దాడుల అనంతరం జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేర్వేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. శాంతి చర్చలు, యుద్ధ విరమణ అవకాశాలపై చర్చించినట్లు ఉక్రెయిన్, రష్యా వర్గాలు వెల్లడించాయి. -
ప్రపంచ యుద్ధాన్ని దాటేసి..1,569 రోజులుగా ఆగని మారణహోమం
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం సరికొత్త రికార్డులకు దారితీసింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దళాలు ఉక్రెయిన్పైకి దూసుకెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఘర్షణ 1,569 రోజులకు చేరుకుంది. ఇది 1914 నుండి 1918 వరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మొదటి ప్రపంచ యుద్ధం (ది గ్రేట్ వార్) కాల వ్యవధిని కూడా దాటేసింది. కొద్ది రోజుల్లోనే ఉక్రెయిన్ను లొంగదీసుకోవచ్చన్న క్రెమ్లిన్ ఆశలు అడియాసలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో అత్యంత సుదీర్ఘమైన, అత్యంత ఘోరమైన రక్తపాతంగా ఈ యుద్ధం చరిత్రకెక్కింది.ఆధునిక సాంకేతికత.. సరికొత్త వ్యూహాలుమొదటి ప్రపంచ యుద్ధంలో అనేక ప్రపంచ అగ్రరాజ్యాలు నేరుగా పాల్గొనగా, ప్రస్తుత యుద్ధం ప్రధానంగా రెండు దేశాల మధ్యే సాగుతోంది. అయినప్పటికీ డ్రోన్లు, లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల వంటి అత్యాధునిక సైనిక సాంకేతికత వాడకం ఈ యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు రెడ్ కార్పెట్ పరిచి, దశాబ్ద కాలంలో మొదటిసారి అమెరికా గడ్డపై ద్వైపాక్షిక చర్చలు జరిపినప్పటికీ, శాంతి ప్రయత్నాలు ఒకపట్టాన ఫలించలేదు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాశ్చాత్య దేశాల నుంచి నిధులు, ఆయుధాల కోసం నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉన్నారు.మొదటి ప్రపంచ యుద్ధ ఛాయలుప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటి ట్రెంచ్ వార్ఫేర్ (బంకర్ల యుద్ధం), భారీ ప్రాణనష్టం, భూభాగాల కోసం సాగుతున్న హోరాహోరీ పోరు ఇందుకు నిదర్శనం. నాడు మెషిన్ గన్లు, ట్యాంకులు రణరంగాన్ని శాసిస్తే.. నేడు డిజిటల్ నిఘా, డ్రోన్ దాడులు వ్యూహాలను మారుస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రజల దృష్టిలో ఈ యుద్ధం 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచే మొదలై, ఒక దశాబ్ద కాలంగా సాగుతోంది. నాటోలో సభ్యత్వం లేకపోయినా, అణ్వాయుధాలు లేకపోయినా ఉక్రెయిన్ ఇంతకాలం రష్యాను ప్రతిఘటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.వర్సాలీస్ పాఠాలు.. అస్పష్టంగానే శాంతి ప్రక్రియప్రస్తుతం ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతూ తమ బలాన్ని నిరూపించుకుంటున్నాయి. అయినప్పటికీ పుతిన్ చర్చలకు సిద్ధంగా లేరని ‘ది ఎకనామిస్ట్’ పేర్కొంది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిన 1919 నాటి ‘వర్సాలీస్ సంధి’ సృష్టించిన అసంతృప్తులే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఇప్పుడు కూడా కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడం కాకుండా, భవిష్యత్తులో శాంతి భద్రతలకు గ్యారెంటీ ఇచ్చేలా ఒప్పందాలు జరగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల సైనిక అంచనాలను తలకిందులు చేస్తూ, యుద్ధాలు ఎప్పుడూ వాటి గడువుల ప్రకారం ముగియవని ఈ సుదీర్ఘ పోరు నిరూపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘ఇండియాలో నరకం’.. అమెరికా రిటర్న్ టెక్కీ రచ్చ! -
ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం
నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బహిరంగ లేఖ రాశారు. యుద్ధాన్ని ముఖాముఖి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. అయితే అదే సమయంలో యుద్ధానికి పూర్తి బాధ్యత పుతిన్దేనని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ జెలెన్స్కీ రాసిన ఈ ఓపెన్ లెటర్ అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూన్ 4న విడుదల చేసిన ఈ లేఖలో ఆయన పుతిన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాటో, భౌగోళిక రాజకీయాలు, రష్యన్ భాష వంటి అంశాలను కారణాలుగా చూపుతున్నప్పటికీ, అసలు ఈ యుద్ధం పుతిన్ వ్యక్తిగత నిర్ణయమేనని పేర్కొన్నారు.గత 26 ఏళ్లలో పుతిన్ పాలనలో రష్యా–ఉక్రెయిన్ సంబంధాలు పూర్తిగా మారిపోయాయని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు వాణిజ్యం, పౌర సహకారం గురించి మాట్లాడుకునే దేశాలు ఇప్పుడు క్షిపణి దాడులు, మరణాలు, విధ్వంసం గురించే చర్చించాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రష్యాలో యుద్ధ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందని జెలెన్స్కీ అన్నారు. పెరుగుతున్న ధరలు, ఇంధన కొరత, ఆంక్షలు, నిరంతర సైనిక నియామకాలతో సాధారణ రష్యన్లు అసంతృప్తికి గురవుతున్నారని పేర్కొన్నారు. యుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా రాజకీయ, ఆర్థిక వనరులు క్రమంగా బలహీనపడుతున్నాయని కూడా వ్యాఖ్యానించారు. యుద్ధభూమిలో రష్యా భారీ నష్టాలు చవిచూస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. మే నెలలోనే 30 వేల మందికిపైగా రష్యన్ సైనికులు మరణించారని లేదా తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. ముఖ్యంగా డోనెట్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలన్న రష్యా లక్ష్యం ఇప్పటికీ నెరవేరలేదని, ఈ ఏడాది కూడా అది సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు, ఉక్రెయిన్ త్వరగా కుప్పకూలిపోతుందని భావించిన రష్యా అంచనాలు తప్పాయని జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ ప్రజల ప్రతిఘటనతో పాటు అమెరికా, యూరప్ దేశాల మద్దతు తమకు బలంగా నిలిచిందన్నారు. "మాకు మద్దతు వస్తోంది.. మీకు ఆంక్షలు వస్తున్నాయి" అంటూ పుతిన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అంతర్జాతీయంగా రష్యా ఒంటరి అవుతోందని కూడా జెలెన్స్కీ పేర్కొన్నారు. ఉత్తర కొరియా సహాయం కోరిన తొలి రష్యా పాలకుడు పుతిన్ అని పేర్కొంటూ, ప్రస్తుతం చైనాపై కూడా రష్యా అధికంగా ఆధారపడుతోందన్నారు. రష్యాకు పరోక్షంగా సహకరిస్తున్న దేశాలు కూడా యుద్ధంపై విసుగు చెందుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇంత విమర్శల మధ్యలోనే జెలెన్స్కీ శాంతి ప్రతిపాదనను ముందుంచారు. స్విట్జర్లాండ్, టర్కీ లేదా ఏదైనా అరబ్ దేశంలో పుతిన్తో ముఖాముఖి సమావేశానికి సిద్ధమని ప్రకటించారు. దేశాల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయాలు నాయకులే తీసుకోవాలని, అందుకే ప్రత్యక్ష చర్చలు అవసరమని పేర్కొన్నారు. ఈ చర్చల సమయంలో పూర్తిస్థాయి కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే ఇరు దేశాల యుద్ధ ఖైదీలను పూర్తిగా పరస్పరం విడుదల చేసుకోవడం, యుద్ధ సమయంలో తరలించిన పౌరులు, పిల్లలను తిరిగి పంపించడం వంటి చర్యలను ప్రతిపాదించారు.అమెరికా, యూరప్ దేశాలు కూడా శాంతి ప్రక్రియలో భాగస్వాములు కావాలని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భద్రతా హామీలు, కొత్త ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటుకు పాశ్చాత్య దేశాల పాత్ర కీలకమని అన్నారు. చివరగా పుతిన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. "ఈ యుద్ధాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని మీరు స్వయంగా నిర్ణయించుకోకపోతే.. ఉక్రెయిన్ తన ఉనికి కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి మీ చేతుల్లోనే ఉంది" అంటూ తన లేఖను ముగించారు. ఈ బహిరంగ లేఖ రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త మలుపుకు సంకేతమా? లేక మరో రాజకీయ ఒత్తిడి వ్యూహమా? అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.కీలకాంశాలు:🔹 పుతిన్కు జెలెన్స్కీ బహిరంగ లేఖ.. ప్రత్యక్ష చర్చలకు ఆహ్వానం.🔹 యుద్ధానికి పూర్తి బాధ్యత పుతిన్దేనని తీవ్ర విమర్శలు.🔹 రష్యా భారీ సైనిక, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటోందని వ్యాఖ్య.🔹 స్విట్జర్లాండ్ లేదా టర్కీలో ముఖాముఖి భేటీకి సిద్ధమన్న జెలెన్స్కీ.🔹 చర్చల సమయంలో కాల్పుల విరమణ, ఖైదీల మార్పిడికి ప్రతిపాదన.🔹 చర్చలు విఫలమైతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక. -
రష్యాపైకి ఉక్రెయిన్ డ్రోన్ల దండు
కీవ్: దురాక్రమణ జెండా ఎగరేసి తమ భూభాగాలను ఆక్రమిస్తున్న రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దండును పంపి దాడికి తెగబడింది. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని కీలక చమురు టర్మినల్పై డ్రోన్లు దాడిచేశాయి. దీంతో నౌకాశ్రయం సమీప టర్మినల్ నుంచి అగ్నికీలలు ఎగసిపడి దట్టంగా నల్లటి పొగ వెలువడుతున్న వీడియోలను అంతర్జాతీయ మీడియా ప్రసారంచేసింది. ఉక్రెయిన్పై భీకరంగా రష్యా దాడి చేసి 22 మంది పౌరులను చంపేసి, 138 మందిని గాయపరిచిన ఘటన జరిగిన 24 గంటలకే రష్యాపై ఉక్రెయిన్ ప్రతిదాడులుచేయడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్ తాను పుట్టిపెరిగిన సెయింట్ పీటర్స్బర్గ్లో స్వంతంగా శుక్రవారం అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు సంసిద్ధమవుతున్న వేళ ఈ దాడిజరిగింది. వేయి కిలోమీటర్ల ప్రయాణించి మరీ తమ డ్రోన్లు రష్యాలో విధ్వంసం సృష్టించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం తన సోషల్మీడియా ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. దాడి దెబ్బకు నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపేశారు. దాడి జరిగిన నష్టవివరాలను రష్యా ప్రభుత్వం బయటపెట్టలేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రష్యా సొంతంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఏటా స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుండగా పుతిన్ సారథ్యంలో జరిగేదానిని రష్యా దావోస్గా పిలుస్తుంటారు. మరోవైపు ఇరాన్ యుద్ధంతో సొంతంగా పాట్రియోట్ గగనతల రక్షణ వ్యవస్థను అమెరికా విచ్చలవిడిగా వాడేస్తుండటంతో మిత్రదేశమైన ఉక్రెయిన్కు వాటిని గతంలోమాదిరి సరఫరా చేసే పరిస్థితిలేదు. దీంతో ఉక్రెయిన్లో ఇప్పుడు వీటి కొరత ఎక్కువైంది. రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడులను ఎదుర్కొనే సత్తా తగ్గిపోయిందని, యూరప్ దేశాలు ఇతోధికంగా సాయం చేయల్సిన అవసరం ఏర్పడిందని ఉక్రెయిన్ పేర్కొంది. బుధవారమే కీవ్లో పర్యటించిన నాటో చీఫ్ మార్క్ ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సమావేశంకానున్నారు. నౌకాస్థావరంపైనా.. కోల్టీన్ ద్వీపం సమీపంలోని రష్యా క్రోన్స్టార్డ్ నౌకాస్థావరం పైనా ఉక్రెయిన్ డ్రోన్లు దాడిచేశాయి. రష్యా బాల్టీక్ విభాగ నౌకాస్థావరం, ఆయుధాగారం సైతం ఇక్కడే ఉన్నాయి. దాడికి తెగించిన 354 డ్రోన్లను కూల్చేశామని రష్యా తెలిపింది. మరోవైపు రష్యా ఆక్రమించిన డోనెట్సషేక్లోని బస్సుపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో ఏడుగురు చనిపోయారు. 11 మంది గాయపడ్డారని క్రిమ్లిన్ నియమించిన డోనెట్సషేక్ ప్రాంత చీఫ్ డెనిస్ పుషిలిన్ వెల్లడించారు. -
ఉక్రెయిన్ డ్రోన్ దాడి: రష్యా బస్సు ధ్వంసం.. ఏడుగురు మృతి!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి భీకర రూపం దాల్చింది. ఉక్రెయిన్ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో రష్యా ఆధీనంలోని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక సివిలియన్ బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ దారుణ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా ఇటీవల ఉక్రెయిన్ మౌలిక వసతులే లక్ష్యంగా క్షిపణి దాడులు చేసిన మరుసటి రోజే ఈ ప్రతీకార దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.బస్సు సరిహద్దుల్లోకి రాగానే..మాస్కో నుండి క్రిమియా ద్వీపకల్పంలోని సింఫెరోపోల్కు బయలుదేరిన ఒక ప్యాసింజర్ బస్సు డొనెట్స్క్ సరిహద్దుల్లోకి రాగానే ఉక్రెయిన్ డ్రోన్ దాడికి గురైంది. ఈ దాడి తీవ్రతకు బస్సు పూర్తిగా తునాతునకలయ్యింది. డొనెట్స్క్ ప్రాంత రష్యా గవర్నర్ డెనిస్ పుషిలిన్ టెలిగ్రామ్ వేదికగా స్పందిస్తూ, ఎనకీవ్ సమీపంలో జరిగిన ఈ యూఏవీ దాడిలో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని, గాయపడిన 11 మందికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.ముంచెత్తిన 354 డ్రోన్లుమరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సరిహద్దులు దాటి వచ్చిన ఉక్రెయిన్ వైమానిక దళం ఒకే రాత్రిలో రష్యాపైకి భారీగా డ్రోన్లను ప్రయోగించింది. అయితే రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమై సరిహద్దు ప్రాంతాలైన బెల్గోరోడ్, కుర్స్క్, మాస్కో పరిసర ప్రాంతాలు, అజోవ్ సముద్ర తీరంలో మొత్తం 354 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా పేర్కొంది. ఇరు దేశాల మధ్య 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఈ స్థాయిలో పరస్పర వైమానిక దాడులు జరగడం ఇదే మొదటిసారి.రష్యాలోనూ ఎదురుదెబ్బఈ సుదీర్ఘ పోరులో ఉక్రెయిన్లోని ఖేర్సన్ ప్రాంతంపై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో 86 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక సైనిక యంత్రాంగం తెలిపింది. అంతకుముందు రోజు రష్యా ఏకంగా 73 క్షిపణులు, 656 డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్, ద్నిప్రో నగరాలపై భారీ దాడికి పాల్పడింది. ఈ దాడి ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను తాత్కాలికంగా నిర్వీర్యం చేయడమే కాకుండా, ఉక్రెయిన్ ప్రతీకార దాడులను మరింత తీవ్రతరం చేయడానికి కారణంగా నిలిచింది. -
ఉక్రెయిన్పై మరోసారి భీకర దాడులు
కీవ్: రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్లోని పలు నగరాలపై రష్యా మరోసారి డజన్ల కొద్దీ క్షిపణులు, వందలాది డ్రోన్లతో చెలరేగిపో యింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కొనసాగిన ఈ దాడులతో నివాస భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇద్దరు చిన్నారులు సహా కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయాలపాలయ్యారు. కీవ్ లో డజనుకు పైగా భారీ పేలుళ్లు సంభవించాయి. భారీగా మంటలు చెలరేగాయి. దాడు ల్లో ఐదు ఆస్పత్రులు, పలు నివాస భవనా లు, వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నా యి. శిథిలాల్లో కూరుకుపోయిన ప్రజలను కాపాడేందుకు అగ్ని మాపక, సహాయక సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కీవ్లో రాత్రంతా సైరన్లు మోగుతూనే ఉన్నా యి.అండర్గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో 41 వేల మందికి పైగా తలదాచుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇంతమంది మెట్రో రైల్వే స్టేషన్లలో ఆశ్రయం పొందడం ఇదే మొదటి సారని అధికారులు తెలిపారు. తీవ్రస్థాయిలో గగనతల దాడులకు పాల్పడతాం, కీవ్ను విడిచి వెళ్లిపొమ్మంటూ కొన్ని రోజుల క్రితం రష్యా చేసిన హెచ్చరికలను విదేశీ దౌత్యాధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. భవన శిథిలాల్లో చిక్కుకుని కీవ్లో ఆరుగురు చనిపోగా, 67 మంది వరకు గాయపడినట్లు ఎమర్జెన్సీ సిబ్బంది తెలిపారు. నీప్రోలో ఇద్దరు చిన్నారులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా ప్రయోగించిన 73 మిస్సైళ్లు, 656 డ్రోన్లకుగాను 40 క్షిపణులు, 602 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.ప్రధానంగా కీవ్, నీప్రోలతోపాటు పొల్టావా, ఖర్కీవ్, జపొరిఝియాలపైనే రష్యా దాడులు జరిగాయంది. కాగా, సైనిక పరిశ్రమ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. కనీసం 30 బాలిస్టిక్ మిస్సైళ్లు, 3 క్రూయిజ్ మిస్సైళ్లు, 33 డ్రోన్లు 38 ప్రాంతాల్లో లక్ష్యాలను ఛేదించాయంది. రష్యా ఆక్రమిత లుహాన్స్క్లోని కాలేజీ హాస్టల్పై మే 22వ తేదీన జరిగిన డ్రోన్ దాడిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇందుకుగాను ఉక్రెయిన్పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని, ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయని మంగళవారం అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం గమనార్హం. యుద్ధక్షేత్రంలో రష్యా సరఫరా వ్యవస్థలను ఉక్రెయిన్ డ్రోన్లు చిందరవందర చేయడం, కీలక ఆదాయ వనరుగా ఉన్న చమురు వసతులను ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీయడంతో నిస్పృహతోనే అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు. మే మొదటివారంలో రష్యా ఇదే రీతిన చేపట్టిన దాడుల్లో కనీసం 21 మంది చనిపోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. -
బూమ్.. రష్యా కొత్త వెపన్ అదుర్స్
-
యుద్ధం: విషాదంతో పాటు విషం
యుద్ధం విషాదాన్నే కాదు.. విషాన్ని మిగులుస్తుంది. ప్రాణనష్టంతో మొదలై ప్రజలను నిరాశ్రయులను చేయడంతోపాటు మొత్తంగా పరిసరాల విధ్వంసానికి దారి తీస్తుంది. కానీ ఈ క్రమంలో తరచూ విస్మరించే మరో పరిణామం యుద్ధం మిగిల్చే కాలుష్యం. పై నష్టాలన్నీ యుద్ధం జరుగుతుండగా, జరిగిన వెంటనే తెలిస్తే.. కాలుష్యం ప్రభావం మాత్రం సంఘర్షణ ముగిసిన తర్వాత కూడా చాలా కాలం కొనసాగుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు పట్టొచ్చు. యుద్ధంలో తీవ్ర ప్రమాదాకానికి గురయ్యేవి మండే ఇంధనాలు, ప్రమాదకరమైన రసాయనాలుండే ఇంధన వ్యవస్థలు. దాడులు చమురు డిపోలు, రిఫైనరీలు, పైప్లైన్లలో మంటలను రాజేస్తాయి. ఈ మంటల వల్ల విష వాయువులు, క్యాన్సర్ కారక కణాలు, అవశేషాలు విడుదలై, చుట్టుపక్కల భూమి, నీరు సంవత్సరాల తరబడి కలుషితమవుతుంది. ఇరాన్ యుద్ధం విషయంలో ఇదే జరిగింది. ఇరాన్, గల్ఫ్లో ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన బాంబు దాడులు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి.మండుతున్న ఇంధన ట్యాంకులు విషపూరిత కణాలను గాలిలోకి పంపుతుండగా, వాటి శిథిలాలు, ప్రవాహాలు, చమురు అవశేషాలు గల్ఫ్ అంతటా తీరప్రాంత జలాలను, సముద్ర జీవావరణ వ్యవస్థలను భయపెడుతున్నాయి. ఈ కాలుష్య దాడి ప్రస్తుతం ఇక్కడికే పరిమితమైనా, తర్వాతి కాలంలో వ్యాప్తి విస్తృతంగా ఉంటుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని కూడా అంచనా వేయలేం. పారిశ్రామిక అగ్నిప్రమాదాలుటెహ్రాన్ సమీపంలోని పలు చమురు డిపోలపై జరిగిన దాడులు, దాదాపు కోటి జనాభా ఉన్న పట్టణ ప్రాంతంపై దట్టమైన నల్లటి పొగను వ్యాపింపజేశాయి. చమురు మండటం వల్ల వెలువడే దట్టమైన పొగను ఇప్పుడు ఇరాన్లో చిన్నపిల్లలతో సహా ప్రజలు నేరుగా పీలుస్తున్నారు. ఈ పొగలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, ఇతర సూక్ష్మ కణ పదార్థాలు ఉంటాయి.ఇవి శ్వాసకోశంలోకి లోతుగా చొచ్చుకుపోయి, శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులను తీవ్రతరం చేస్తాయి. ఇది ఎక్కువకాలంపాటు కొనసాగితే ఈ ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. క్యాన్సర్ల ప్రమాదం పెరగడంతో పాటు, కొన్ని నాడీ సంబంధిత రుగ్మతలు వస్తాయి. ఇరాన్లో వాయు నాణ్యత ఇప్పటికే ప్రధాన పర్యావరణ సమస్యల్లో ఒకటిగా ఉంది. ఇక ఈ పారిశ్రామిక మంటలు లక్షలాది మంది ప్రజలు వాయు కాలుష్యం బారిన పడటానికి కారణమవుతాయి. నేల కాలుష్యం, విషపూరిత శిధిలాలు మందుగుండు సామగ్రి, సైనిక శిధిలాల పేలుడు దీర్ఘకాలిక నేల కాలుష్యానికి దారితీస్తుంది. బాంబు దాడికి గురైన ప్రాంతాల్లో సీసం, కాడ్మియం, నికెల్ లేదా క్రోమియం వంటి భారీ లోహాలు పేరుకుపోతున్నాయి. ఈ కాలుష్య కారకాలు నేలల్లో నిలిచిపోయి క్రమంగా ఆహార గొలుసులలోకి ప్రవేశిస్తాయి. కాలుష్యానికి మరో ప్రధాన కారణం ఆస్బెస్టాస్, పారిశ్రామిక రసాయనాలు, పేలని ఆయుధాల అవశేషాల శిథిలాలు, పట్టణ విధ్వంసం.సంఘర్షణానంతర కాలంలో ఈ పదార్థాల నిర్వహణ ప్రధాన పర్యావరణ సవాళ్లలో ఒకటిగా ఉంటుంది. ఉక్రెయిన్లో, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రాంతాలపై జరిగిన బాంబు దాడుల వల్ల అనేక కాలుష్య కారకాలు పర్యావరణంలోకి వ్యాపించాయి. గాజా స్ట్రిప్లో, భవనాలు, మౌలిక సదుపాయాల భారీ విధ్వంసం వల్ల లక్షలాది టన్నుల శిథిలాలు పేరుకుపోయాయి. ఇవి కాలుష్య నిర్మూలన, పునరి్నర్మాణ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. ధ్వంసమైన నగరాలను పునర్నిర్మించడం వాతావరణంపై అదనపు భారం పడుతుంది. మరింత నీటి సంక్షోభంయుద్ధం నీటి భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆనకట్టలు, కీలకమైన మౌలిక నీటి సదుపాయాలను ధ్వంసం చేసి జనాభాను నియంత్రించడానికి ప్రత్యర్థి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సంక్షోభాలకు దారితీస్తున్నాయి. కరువులు, వ్యవసాయంలో అధిక వినియోగం, వివాదాస్పద నీటి నిర్వహణ విధానాలతో ఇప్పటికే ఇరాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం వల్ల ఏర్పడే కాలుష్యం నీటి నాణ్యతను దీర్ఘకాలికంగా ప్రభావితం చేయనుంది.పేలుళ్లు, అగ్నిప్రమాదాల కారణంగా హైడ్రోకార్బన్లు పట్టణ మురుగునీటి వ్యవస్థలలోకి, కొన్ని జలమార్గాల్లోకి ప్రవహించి, నేలలను, భూగర్భ జలాలను కలుషితం చేశాయి. ఇక విద్యుత్ గ్రిడ్లు, శుద్ధి కర్మాగారాలపై బాంబు దాడులు చేయడం వల్ల కీలకమైన నీటి శుద్ధి ప్రక్రియ నిలిచిపోతుంది. శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల ప్రజలు తక్షణమే వ్యాధుల బారిన పడుతున్నారు. 1980లలో జరిగిన ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో గల్ఫ్లో సముద్రం పాలైన చమురు, ఆ ప్రాంతంలోని హాక్స్బిల్ సముద్ర తాబేళ్లు అంతరించడానికి, అక్కడి గ్రీన్ తాబేళ్ల వినాశనానికి కారణమైంది.అంతరించనున్న అడవులుసంఘర్షణ అటవీ నిర్మూలనకు దారి తీస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి, ఇంధన కొరత ఏర్పడినప్పుడు, బొగ్గు, వంటచెరుకు వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది. ఫలితంగా అడవులు అంతరించపోతాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలు కనుమరుగైన చోట అడవుల నరికివేత పెరుగుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సూడాన్. 2023లో ఇక్కడ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖార్టూమ్, ఇతర పట్టణ ప్రాంతాల్లో చెట్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు2022లో ప్రపంచవ్యాప్త గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 5.5 శాతానికి సైనిక దళాలదే. ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరిగేకొద్దీ, దాని వల్ల ఏర్పడే కర్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి. 26 దేశాలు ఏడాది పొడవునా విడుదల చేసే ఉద్గారాల కంటే గాజా సంఘర్షణలో మొదటి 120 రోజుల్లోనే ఎక్కువ ఉద్గారాలు వెలువడ్డాయని ఒక పరిశోధనలో తేలింది. ఇరాన్ యుద్ధంలో జలాంతర్గామి కార్యకలాపాలు, సుదూర బాంబర్ దాడులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటివల్ల వెలువడే ఉద్గారాల భారం చాలా ఎక్కువ. గల్ఫ్ యుద్ధంలోనూఈ ప్రాంతం గతంలోనూ యుద్ధ కాలుష్యాన్ని చూసింది. 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో, ఇరాకీ దళాలు 600 కంటే ఎక్కువ కువైట్ చమురు బావులకు నిప్పంటించాయి. నెలల తరబడి, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. దీంతో గల్ఫ్ అంతటా వాయు కాలుష్యం, నేల, భూగర్భ జలాల కాలుష్యం విస్తృతమైంది. అది అనేక అనారోగ్య సమస్యలకూ కారణమైంది. ఇందుకుగాను ఐక్యరాజ్యసమితి పరిహార కమిషన్కు నష్టపరిహారంగా ఇరాక్ 50 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించింది.ఉక్రెయిన్లోనూమరో భయంకరమైన తాజా ఉదాహరణ ఉక్రెయిన్. యుద్ధం ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించింది. ఇక్కడ ఇంధన డిపోలు, పారిశ్రామిక ప్రాంతాలు, రసాయన గిడ్డంగులు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి, నదులు, వ్యవసాయ భూములను కలుషితం చేశాయి. చమురు కేంద్రాల్లో మంటలు, అటవీ నిర్మూలన, దెబ్బతిన్న పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడిన కాలుష్యం నీటి వ్యవస్థల పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించింది. -
రష్యా ఆర్మీలో 217 మంది భారతీయులు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో చిక్కుకొని, రష్యా ఆర్మీలో చేరిన భారతీయుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పలు వివరాలు సమర్పించింది. సుమారు 217 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరగా, అందులో 49 మంది యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో ఆరుగురు ఆచూకీ తెలియకుండా పోగా, మొత్తం 139 మందిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయం కృషి చేస్తోందని కేంద్రం తెలిపింది.రష్యా వల: ఆశచూపి.. బలిపశువులుగారష్యా తమ సైన్యంలో చేర్చుకునేందుకు విదేశీయులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ప్రలోభపెట్టింది. నెలకు సుమారు 2,500 డాలర్ల జీతం, 5,000 డాలర్ల సైనింగ్ బోనస్, రష్యా పౌరసత్వం, మరణిస్తే 1,68,000 డాలర్ల పరిహారం ఇస్తామని నమ్మబలికింది. ఈ ఆశతోనే చాలా మంది భారతీయులు రష్యా సైన్యంతో స్వచ్ఛందంగా ఒప్పందాలు చేసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరు తమ శిక్ష నుంచి విముక్తి పొందాలనే ఆశతోనే రష్యా ఆర్మీలో చేరడం గమనార్హం.ప్రభుత్వ ప్రయత్నాలు- సవాళ్లుప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం రష్యాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకు 48 మందికి విమాన టిక్కెట్లను ప్రభుత్వం అందించింది. అయితే, యుద్ధ పరిస్థితుల దృష్ట్యా మృతదేహాలను గుర్తించడం, స్వదేశానికి తరలించడం అత్యంత క్లిష్టంగా మారిందని రష్యా అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల డిఎన్ఏ నివేదికలను ఇప్పటికే సేకరించి, రష్యన్ అధికారులకు అందజేశామని, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేశామని ప్రభుత్వం తెలిపింది.కోర్టు ముందు వాస్తవాలుసుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్రం కీలక విషయాలను బయటపెట్టింది. పిటిషన్లో పేర్కొన్న 26 మందిలో ఇప్పటికే 14 మంది మరణించగా, 11 మంది ఆచూకీ తెలియలేదు. ఒక వ్యక్తి వేధింపుల కేసులో రష్యాలో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సంచలనం చేయవద్దని కోరిన కేంద్రం, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపింది. -
మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్ భేటీ
న్యూఢిల్లీ: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా పరిణామాలతోపాటు పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. వివాదాలు, సంఘర్షణల పరిష్కారానికి సంప్రదింపులు, దౌత్య మార్గాలకే భారత్ స్థిరంగా కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లావ్రోవ్ను నందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాల పురోగతిపై తాజా సమాచారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశానని వెల్లడించారు. రష్యా అధినేత పుతిన్కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని లావ్రోవ్ను మోదీ కోరారు. మోదీని కలిసిన ‘బ్రిక్స్’విదేశాంగ మంత్రులు బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీని కలిశారు. ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చారు. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, బ్రెజిల్ మంత్రి మౌరో, ఇండోనేíÙయా మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా మంత్రి రోనాల్డ్ లామోలా ఉమ్మడిగా మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు బ్రిక్స్దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సు గురువారం ప్రారంభమైంది. -
మాది న్యాయబద్ధమైన యుద్ధం
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విక్టరీ డే పరేడ్ వేదికగా నాటో కూటమిపై మండిపడ్డారు. ఉకెయ్రిన్ను దురాక్రమణ దారుగా అభివర్ణించారు. తాము చేస్తున్నది న్యాయబద్ధమైన యుద్ధమంటూ ప్రకటించుకున్నారు. శనివారం రాజధాని మాస్కోలోని ప్రసిద్ధ రెడ్ స్క్వేర్లో జరిగిన వేడుకల్లో వందలాది మంది సైనికులను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ‘అప్పటి విజేతలు సాధించిన గొప్ప విజయం, నేడు ప్రత్యేక సైనిక చర్య లక్ష్యాలను నెరవేరుస్తున్న సైనికులకు స్ఫూర్తినిస్తోంది’ అంటూ ఉక్రెయిన్తో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ‘నాటో కూటమి మొత్తం ఆయుధాలను అందిస్తూ మద్దతు ఇస్తున్న ఒక దురాక్రమణ శక్తిని మన సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. మన హీరోలు ముందుకు సాగుతున్నారు’అని పుతిన్ పేర్కొన్నారు. సైనిక వ్యూహాలు ఎలా మారినప్పటికీ దేశ భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలేనని ఆయన వ్యాఖ్యానించారు. నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ఈ ఉత్సవాన్ని రష్యా దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 25 ఏళ్లుగా అధికారం చెలాయిస్తున్న పుతిన్ విక్టరీ డేను దేశ ఆయుధ పాటవాన్ని ప్రదర్శించే వేదికగా మార్చుకున్నారు. అయితే, ఈసారి అటువంటివేమీ లేకుండా పరేడ్ సాదాసీదాగా సాగింది. ఉక్రెయిన్ దాడుల భయంతోనే భారీగా భద్రతా ఏర్పాట్లు సైతం చేపట్టారు. పెద్ద సంఖ్యలో సైనికులు రెడ్ స్క్వేర్లో కవాతు చేపట్టారు. వీరితో ఉత్తర కొరియా బలగాలు కలిసి పాల్గొనడం గమనార్హం. యుద్ధంలో బిజీగా ఉండటం వల్లే సైనికులు కవాతులో పెద్ద సంఖ్యలో పాల్గొనలేదని ప్రభుత్వం తెలిపింది. క్రెమ్లిన్లో జరిగిన వేడుకకు అతిథులుగా బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో, మలేసియా రాజు సుల్తాన్ ఇబ్రహీం, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్, స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో హాజరయ్యారు. విక్టరీ డే వేడుకలు సుదూరంగా మాస్కోకు 9 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లాడివొస్టొక్తోపాటు సైబీరియాలోని క్రాస్నోయార్క్స్, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల్లోనూ జరిగాయి. -
వేల సంఖ్యలో ఉత్తర కొరియా సైనికులు మృతి
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై బీబీసీ సంచలన నివేదిక విడుదల చేసింది. ఈ మారణహోమంలో ఇప్పటి వరకూ దాదాపు 2,300 మంది ఉత్తర కొరియా సైనికులు మృతిచెందినట్లు కథనాలు ప్రచురించింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయింది. అయినప్పటికీ యుద్ధ విరమణ విషయమై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి ఫలితాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దం నేపథ్యంలో ఆ అవకాశాలు లేకుండా పోయాయి.కాగా గత సంవత్సరం ఉక్రెయిన్ ఆకస్మిక దాడిలో నియంత్రణ కోల్పోయిన కుర్స్క్ ప్రాంతంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యా తమ సహాయం కోరిందని అందుకు సైనిక్ దళాలను పంపించామని ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ తెలిపారు. తాజాగా ఆ సేనలో 2,300 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో సహాయం కోసం రష్యాకు దాదాపు 11 వేల మంది సైనికులను పంపినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రెండు రోజుల పాటు మే 8-9 (విక్టరీ డే) సందర్భంగా రష్యా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించగా, ఉక్రెయిన్ మే 5-6 తేదీల్లో తన వంతుగా విరమణ ప్రకటించింది. అయితే, ఒకరి ప్రకటనలను మరొకరు గౌరవించడం లేదని, దాడులు కొనసాగుతున్నాయని ఇరు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రష్యా- ఉక్రెయిన్ రెండు పక్షాలు కలిపి దాదాపు లక్షల సంఖ్యలో సైనికులు మృతి చెందారని కథనాలు పేర్కొన్నాయి. -
ప్రపంచానికే నష్టం.. ట్రంప్నకు పుతిన్ హెచ్చరిక
మాస్కో: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతల వేళ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ ఉత్కంఠకు తెరలేపింది. వీరిద్దరూ దాదాపు 90 నిమిషాలు మాట్లాడుకున్నారని రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ముఖ్యంగా ఇరాన్, ఉక్రెయిన్ గురించి జరిగినట్టు తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్పై మరోసారి సైనిక చర్చ వద్దని ట్రంప్ను పుతిన్ హెచ్చరించినట్టు సమాచారం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఘర్షణ, మరియు తాత్కాలిక కాల్పుల విరమణ అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పుతిన్.. ఇరాన్పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ సైనిక చర్య ప్రభావం ఇరాన్ దాని పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని పుతిన్ హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు.ఈ మేరకు వారిద్దరి సంభాషణ జరిగినట్టు క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషాకోవ్ వెల్లడించారు. ట్రంప్-పుతిన్ ఫోన్ సంభాషణలో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం, ఉక్రెయిన్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్లోని ప్రస్తుత పరిస్థితులను, రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతిని పుతిన్ వివరించారని చెప్పారు. ఐరోపా దేశాల మద్దతుతో జెలెన్స్కీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని పొడిగిస్తోందని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉషాకోవ్ తెలిపారు. ఈ ఫోన్ కాల్ రష్యా చొరవతోనే జరగ్గా, సంభాషణ ఫలప్రదంగా సాగిందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. రష్యా సైన్యం డోన్బాస్ ప్రాంతంలో ఇరుక్కుపోయింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని పుతిన్కు ట్రంప్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో మే 9వ తేదీన రష్యా విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్పై తాత్కాలిక కాల్పులు విరమణపై పుతిన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ట్రంప్ వల్లే యుద్ధం ఆగలేదు.. యూఎస్ రాయబారుల రాజీనామా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో బిగ్ షాక్ తగిలింది. ఉక్రెయిన్లో అమెరికా రాయబారుల పదవీ విరమణలు, మార్పుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ విధానాల వల్లే తాము రాజీనామాలు చేస్తున్నట్టు సదరు వ్యక్తులు ఆరోపించడం గమనార్హం. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్.. పుతిన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపణలు చేయడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. అందుకే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగడంలేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్లో అమెరికా రాయబారుల పదవీ మార్పులు తరచూ జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిడ్జెట్ బ్రింక్ (2022–2025) అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆమె తరువాత బాధ్యతలు చేపట్టిన జూలీ డేవిస్ కూడా 2026 జూన్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ మార్పులు అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల్లో అస్థిరతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయబారులు ఇద్దరూ ట్రంప్ విధానాలను వ్యతిరేకించడం సంచలనంగా మారింది.I resigned as U.S. Ambassador Ukraine when Trump kept siding with Putin over our democratic partner. Now, my successor is doing the same.I knew I had to speak out and run for office because siding with dictators is just not who we are. https://t.co/j1cGvub4Bf— Bridget Brink (@AmbBridgetBrink) April 29, 2026బ్రిడ్జెట్ బ్రింక్ 2022 నుండి 2025 వరకు కీవ్లో పనిచేశారు. తాజాగా ఆమె.. మిచిగాన్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పదేపదే అనుకూలంగా వ్యవహరించడం వల్లే తాను తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. నియంతల పక్షం వహించడం మన నైజం కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. మన ప్రజాస్వామ్య భాగస్వామి కంటే పుతిన్కు ట్రంప్ పదేపదే వత్తాసు పలుకుతున్నప్పుడు నేను ఉక్రెయిన్ యూఎస్ రాయబారి పదవికి రాజీనామా చేశాను అన్నారు. ఈ పదవిలో ఏడాది లోపే పనిచేసిన తన వారసురాలు జూలీ డేవిస్ కూడా ఇలాంటి కారణాలతోనే వైదొలుగుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా, డేవిస్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలిగి, మూడు దశాబ్దాల దౌత్య వృత్తికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేస్తారని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.ట్రంప్ పరిపాలనలో ఉక్రెయిన్ విధానానికి వ్యతిరేకంగా మే 2025లో రాజీనామా చేసిన బ్రింక్ స్థానంలో, డేవిస్ గత ఏడాది మేలో తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు స్వీకరించారు. ఆమె కూడా.. పుతిన్కు ట్రంప్ మద్దతు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్పై వీరిద్దరూ విమర్శలు చేయడాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఖండించారు. ఇదంతా నిజం కాదన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు రాయబారి డేవిస్ గట్టి మద్దతుదారుగా ఉన్నారని కామెంట్స్ చేశారు. -
ప్రపంచవ్యాప్తంగా మరింత ముదరనున్న చమురు సంక్షోభం..?
ఇరాన్- అమెరికా యుద్ధంతో అసలే ప్రపంచమంతా చమురు సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా చమురు స్థావరాలే టార్గెట్గా ఉక్రెయిన్ వరుసగా డ్రోన్స్లతో దాడులకు తెగబడుతుంది. దీంతో 24కు పైగా ముడి చమురు నిల్వ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు రష్యా ప్రకటించింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్రూడాయిల్.. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో క్రూడాయిల్ సరఫరాకు ఆటంకం తలెత్తి తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నయ మార్గంగా రష్యాపై కొన్ని దేశాలు దృష్టిసారించాయి. అయితే ఇప్పుడు రష్యా చమురు స్థావరాలు సైతం దాడులకు గురి కావడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.వరుసగా చమురు స్థావరాలపై దాడులు నిన్న( బుధవారం) తుయాప్సే నగరంలోని రష్యా చమురు స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల ప్రభావంతో యాసిడ్ వర్షం కురవడంతో పాటు గాలిలో బెంజీన్, గ్జైలీన్ వంటి విషవాయువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని తీర ప్రాంతంలో చేపలు, పక్షులు చనిపోయి పడి ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ గడిచిన 15రోజుల్లో రష్యా చమురు స్థావరాలే లక్షంగా మూడుసార్లకు పైగా దాడులు చేసినట్లు రష్యా పేర్కొంది. తొలిసారిగా ఏప్రిల్16న దాడులు జరుపగా మరోసారి ఏప్రిల్ 20 తేదీన దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇప్పటికే 24 చమురు నిల్వ ట్యాంకులు ధ్వంసమయ్యాయని పేర్కొంది.రష్యాకు ఈ రిఫైనరీ ఎంతో కీలకంకీవ్ నగరానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుయాప్సే రిఫైనరీ రష్యా చమురు ఎగుమతులకు అత్యంత ప్రధానమైనది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 12 మిలియన్ మెట్రిక్ టన్నులు సరాసరిన రోజుకు 240,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. రష్యా మొత్తం ఇంధన ఎగుమతి సామర్థ్యంలో సుమారు 12 శాతం వాటాను కలిగి ఉంది. ఇది రష్యాలోని టాప్ 10 రిఫైనరీలలో ఒకటి .చమురు సంక్షోభం మరింత ముదిరే అవకాశంరష్యా బడ్జెట్లో చమురు ఎగుమతులది సింహభాగం. దీనికి తోడు హర్ముజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచం చూపు రష్యా చమురు వైపు మళ్లుతోంది. దీనివల్ల రష్యాకు ఊహించని లాభాలు కూడా చేకూరాయి. అల్ జజీరా ప్రకారం, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆకాశాన్నంటుతున్న ప్రపంచ చమురు ధరల కారణంగా, యుద్ధం మొదలైన మొదటి రెండు వారాల్లోనే రష్యా చమురు అమ్మకాల ద్వారా అదనంగా 672 మిలియన్ యూరోలు ($777 మిలియన్లు) సంపాదించిందని 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్' అంచనా వేసింది .ఎగుమతి కోసం ఉద్దేశించిన చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలని ఉక్రెయిన్ భావిస్తోన్నట్లు విశ్లేషకుల అంచనా. అయితే ఈ దాడులతో దీనివల్ల ప్రపంచ చమురు కొరతను మరింత తీవ్రతరం చేస్తోందని రష్యా ఆరోపణలు చేస్తుంది. -
చరిత్రలో చెరగని అణు విలయం..
సరిగ్గా నలభై ఏళ్ల కిందట. 1986, ఏప్రిల్ 26 అర్ధరాత్రి దాటింది. అప్పటి సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్లోని ‘ప్రిప్యాత్’ నగరం గాఢ నిద్రలో ఉంది. ఆ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో నంబరు యూనిట్లో నిపుణులు ఒక ప్రమాదకరమైన ప్రయోగానికి తెరలేపారు. ఆ ప్రయోగమే ఆధునిక మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన అణు విపత్తుకు దారితీస్తుందని వారెవరూ ఊహించలేదు.విద్యుత్ సరఫరా నిలిచిపోతే, టర్బైన్లు తిరిగే వేగంతో రక్షణ వ్యవస్థలను ఎంతసేపు నడపవచ్చో చూడటమే ఈ పరీక్ష ఉద్దేశం. ఏప్రిల్ 25 తెల్లవారుజాము నుండే దీనికి సన్నాహాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 2:00 గంటలకు అత్యవసర కోర్ కూలింగ్ వ్యవస్థను నిలిపివేశారు. అయితే, స్థానిక గ్రిడ్ నుండి విద్యుత్ డిమాండ్ రావడంతో ప్రయోగాన్ని తొమ్మిది గంటల పాటు వాయిదా వేశారు. ఈ విరామంలో రియాక్టర్ అస్థిరంగా మారింది. రాత్రి 11:00 గంటల తర్వాత మళ్ళీ ప్రయోగాన్ని మొదలుపెట్టారు. రియాక్టరును కేవలం 7 శాతం తక్కువ విద్యుత్తుతో నడిపారు. ఇదో పొరపాటుగా పరిణమించింది. పవర్ సామర్థ్యం పడిపోవడంతో దానిని పెంచడానికి ఆపరేటర్లు కంట్రోల్ రాడ్స్ను రియాక్టర్ కోర్ నుండి బయటకు తీశారు. ఇలా చేయడం వల్ల రియాక్టర్ అదుపు తప్పే ప్రమాదమున్నా పట్టించుకోలేదు.విస్ఫోటనం ఏప్రిల్ 26 తెల్లవారుజామున 1:23 గంటలకు ప్రయోగం అసలు దశకు చేరుకుంది. ఆపరేటర్లు టర్బై¯Œ కు వెళ్లే ఆవిరిని నిలిపివేశారు. ఫలితంగా సర్క్యులేషన్ పంపులు నిదానమవ్వడంతో రియాక్టర్ను చల్లబరచే వ్యవస్థ క్షీణించింది. దీనివల్ల రియాక్టర్లోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన సూపర్వైజర్, రియాక్టర్ను ఆపివేయడానికి ‘స్క్రామ్’ ఆదేశాన్ని ఇచ్చాడు. దీని ప్రకారం కంట్రోల్ రాడ్స్ అన్నింటినీ ఒకేసారి కోర్లోకి పంపాలి. కానీ, అప్పటికే రియాక్టర్ విపరీతంగా వేడెక్కడం వల్ల ఆ కడ్డీలు లోపలికి వెళ్లలేకపోయాయి. కేవలం మూడు సెకన్లలోనే రియాక్టర్ పవర్ అసాధారణంగా పెరిగింది.లోపల ఏర్పడిన భారీ ఆవిరి పీడనం వల్ల వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ధాటికి రియాక్టర్కు ఉన్న వెయ్యి టన్నుల బరువున్న స్టీల్, కాంక్రీట్ మూత గాలిలోకి ఎగిరిపడింది. భవనం పైకప్పు కుప్పకూలిపోయింది. హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల కంటే వందల రెట్లు ఎక్కువ రేడియేషన్ గాలిలో కలిసింది. మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ ప్రాణాంతకమైన రేడియేషన్ ఉందని తెలియదు. ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా పనిచేశారు. ఫలితంగా వారిలో చాలామంది తీవ్రమైన రేడియేషన్కు గురై కొద్ది రోజుల్లోనే ప్రాణాలు విడిచారు.ఈ విషపూరిత మేఘాలు గాలి దిశను బట్టి వ్యాపించాయి. సుమారు 1,50,000 చదరపు కిలోమీటర్ల మేర భూమి కలుషితమైంది. స్వీడన్లోని అణు పర్యవేక్షణ కేంద్రాలు తమ దేశంలో రేడియేషన్ స్థాయి పెరగడాన్ని గమనించి నిలదీసేవరకు సోవియట్ ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 27న ప్రిప్యాత్ నగరంలోని 30,000 మంది ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయించారు. సుమారు 84 లక్షల ప్రజలు రేడియేషన్ బారిన పడ్డారు. వేల సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడ్డారు. లక్షలాది ఎకరాల అడవులు, వ్యవసాయ భూములు విషపూరితంగా మారాయి.పశువులు అంగవైకల్యంతో పుట్టడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పట్టింది. ఆ ప్రాంతంలోని అడవి చెట్లు రేడియేషన్ వల్ల ఎర్రగా మారిపోవడంతో దానికి ‘రెడ్ ఫారెస్ట్’ అని పేరు వచ్చింది. ప్రస్తుతం చెర్నోబిల్, ప్రిప్యాత్ పరిమిత టూరిస్టు కేంద్రాలుగా మారాయి. చెర్నోబిల్ ఉదంతం తరువాత ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అనుమానపు నీడలు ముసురుకున్నాయి. అయినా ఎన్నో కొత్త కేంద్రాలు ప్రారంభించి మానవాళి జాగరూకతతో ముందుకు పోతూనే ఉంది.-ఎడిటోరియల్ టీమ్. -
భారీగా బంగారం అమ్మేసిన రష్యా!
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగిపోతుంటే.. ప్రపంచంలోని చాలా దేశాలు మరింత ఎక్కువ గోల్డ్ కొనుగోలు చేయడానికికి పూనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో రష్యా ఏకంగా 22 టన్నుల బంగారం విక్రయించింది.2026 ప్రారంభం నుంచి రష్యా సుమారు 22,000 కేజీల గోల్డ్ విక్రయించింది. దీంతో ఏప్రిల్ 1 నాటికి దేశంలోని బంగారు నిల్వలు 0.7 మిలియన్ ట్రాయ్ ఔన్సులు తగ్గి 74.1 మిలియన్ ట్రాయ్ ఔన్సులకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విక్రయానికి ప్రధాన కారణం దేశ ఆర్థిక పరిస్థితి.పాశ్చాత్య దేశాల ఆంక్షలురష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ముఖ్యంగా చమురు.. గ్యాస్ రంగం తీవ్ర ప్రభావం ఎదుర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోవడంతో బడ్జెట్ లోటు భారీగా పెరిగింది.లోటు బడ్జెట్!2026 మార్చి నెలాఖరు నాటికి రష్యా బడ్జెట్ లోటు 61.2 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 5.8 లక్షల కోట్లు) పెరిగిన నేపథ్యంలో బంగారం విక్రయించాల్సి వచ్చింది. బడ్జెట్ లోటు సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం లోటుకంటే కూడా చాలా ఎక్కువ. ఈ లోటును తగ్గించడానికి ప్రభుత్వం బంగారాన్ని అమ్మడం ప్రారంభించింది. అయితే.. రష్యా బంగారం అమ్మినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల దేశ బంగారు నిల్వల మొత్తం విలువ పెరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. అంటే పరిమాణం తగ్గినా, విలువ పెరగడం జరిగింది.ఏటా 300 టన్నుల బంగారం ఉత్పత్తిప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో.. రష్యా కూడా ఒకటి. ప్రతి ఏటా ఈ దేశం 300 టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అయితే ప్రస్తుతం ఆ దేశ ఆర్ధిక పరిస్థితిలో జరిగిన మార్పుల కారణంగా.. రష్యా 22 టన్నుల బంగారం విక్రయించాల్సి వచ్చిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: దశాబ్దాల చరిత్ర.. రూ.221 కోట్లకు అమ్ముడైన బంగ్లా! -
రష్యా-ఉక్రెయిన్ షాకింగ్ డీల్.. ఆనందంలో సైనికులు
వాషింగ్టన్: బద్ధ శత్రువులైన రష్యా, ఉక్రెయిన్ దేశాలు అనూహ్యంగా ఒక అంగీకారానికి వచ్చాయి. అమెరికా, యూఏఈ దేశాల సంయుక్త మధ్యవర్తిత్వంతో 386 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకున్నాయి. శాంతి చర్చలు పూర్తిగా నిలిచిపోయిన ఈ తరుణంలో జరిగిన ఈ హఠాత్పరిణామం, భీకర యుద్ధ వాతావరణంలో సరికొత్త ఆశలను చిగురింపజేసింది.సుదీర్ఘ చర్చల ఫలితంరష్యా, ఉక్రెయిన్ దేశాలు చెరో 193 మంది పట్టుబడిన సైనికులను శుక్రవారం సురక్షితంగా విడుదల చేశాయి. ఈ నెలలో ఖైదీలను ఇలా మార్చుకోవడం ఇది రెండవసారి. ఉక్రెయిన్ అధ్యక్షులు వొలోదిమిర్ జెలెన్స్కీ ఈ అరుదైన విషయాన్ని ధృవీకరిస్తూ, తమ యోధులను స్వదేశానికి రప్పించడానికి అనునిత్యం శ్రమిస్తున్నామని ప్రకటించారు. పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులను రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ ప్రాంతంలో బంధించారని, కొన్ని నెలల పాటు జరిగిన చర్చల అనంతరం వారి విడుదల సాధ్యమైందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.కన్నీటి పర్యంతమైన యోధులుఉత్తర ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్న సైనికుల పరిస్థితి అందరినీ కలచివేసింది. సుదీర్ఘకాలం రష్యా చెరలో ఉండి, ముఖాలు పాలిపోయినప్పటికీ, స్వదేశంలో అడుగుపెట్టగానే వారి కళ్లలో చెప్పలేనంత ఆనందం, ఉపశమనం కనిపించాయి. బస్సుల నుంచి దిగుతూనే తమ జాతీయ జెండాలను కప్పుకుని, తోటి సైనికులను భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నారు. ఫోన్లలో తమ వారితో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. విడుదలైన వారిలో 24 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు. ఇద్దరు సైనికులు తమ పుట్టినరోజు నాడే విడుదల కావడం గమనార్హం.అమెరికా, యూఏఈ కీలక పాత్రఈ చారిత్రక ఖైదీల మార్పిడిలో అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు కీలకమైన మానవతా దృక్పథంతో దౌత్యం నెరపాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్వదేశానికి చేరుకున్న తమ రష్యన్ సైనికులకు మిత్రదేశమైన బెలారస్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు నిలిచిపోయినప్పటికీ, ఈ పరిణామం ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న అతికొద్ది సహకార మార్గాలలో ఒకటిగా నిలిచింది.ఇది కూడా చదవండి: ఎండకు పగపట్టిన పాములు .. ఇళ్లలోకి చొరబడి.. -
ఉక్రెయిన్లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కాల్పుల్లో దుండగుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా పది మంది వరకు గాయపడ్డారు. హొలొసివ్స్కీ ప్రాంతంలోని ఓ మాల్లో ఉన్న సూపర్మార్కెట్లో శనివారం ఓ దుండగుడు హఠాత్తుగా తుపాకీతో కాల్పులకు దిగాడు.ఇక, ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోగా మరో 10 మంది గాయపడ్డారు. అనంతరం కొందరిని అతడు నిర్బంధంలోకి తీసుకున్నాడు. వారిని కాపాడేందుకు వెళ్లిన పోలీసులపైకి కాల్పులకు దిగాడు. నలుగురు బందీలను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో అతడు చనిపోయాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. -
రష్యా యుద్ధంలో భారతీయులు..?
ఉక్రెయిన్తో జరిగే యుద్ధంలో రష్యా భారతీయులను బలవంతంగా వాడుకుంటుందని నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ దీనిని తీవ్ర ఆందోళన విషయంగా పేర్కొన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్దం మెుదలై దాదాపు నాలుగేళ్లు పూర్తైంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోగా ఎంతో ఆస్తి నష్టం సంభవించింది. కాగా ఈ యుద్ధంలోకి బలవంతంగా భారతీయులను లాగారనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ మేరకు బాధితులకు సంబంధించిన 26 కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.ఈ తరహా కేసులు రష్యాలో వందల సంఖ్యలో జరుగుతున్నాయని కేంద్రం వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితుల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల నుంచి మోసపోయిన భారతీయులు బలవంతంగా యుద్ధంలోకి నెట్టివేయబడ్డారని ఆరోపించారు. 2025 సెప్టెంబర్- అక్టోబర్ కాలంలో వ్యక్తులు కుప్యాన్స్క్, సెలిడోవ్, మాకివ్కా మరియు చెలియాబిన్స్క్ వంటి సున్నిత ప్రదేశాలలో వారిని మోహరించారని తెలిపారు. వారి క్షేమ సమాచారంపై ఇప్పటి వరకూ ఏలాంటి సమాచారం లేదని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే వారి సమాచారంపై మాస్కోలోని రాయభార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఏలాంటి స్పందన లేదని తెలిపారు.ఈ కేసు పూర్వాపరాలను పరీశీలించిన సుప్రీంకోర్టు దీనిని అత్యంత ఆందోళన కలిగించే విషయంగా పేర్కొంది. ఈ మేరకు ఈ పిటిషన్లకు వెంటనే వివరణ ఇవ్వాలని విదేశాంగ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తరపున హాజరైన తుషార్ మోహతా ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఆదేశాలు ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు.కాగా రష్యాకు భారత్కు ద్వైపాక్షిక సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. ఇరు దేశాలు మంచి స్నేహ సంబంధం గలవి. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ భారతీయులలో కొంత ఆందోళన రేకేత్తిస్తుంది. -
గల్ఫ్కు అండగా ఉన్నాం.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
గల్ఫ్ దేశాలకు మద్దతుగా ఉక్రెయిన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ సాయం కోరే దేశం మాత్రమే కాదని ఇతరులకు సాయం శక్తి తమ దేశానికి ఉందని స్పష్టం చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దుబాయిలో పర్యటనకు వెళ్లారు. ఖతార్తో 10 ఏళ్ల పాటు రక్షణ సహాకార ఒప్పందంపై ఆయన సంతకం చేశారు. ఇటీవలే గల్ఫ్ దేశాలకు సహాయంగా వెళ్లిన ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలో యుఏఈ, ఉక్రెయిన్ ఉమ్మడి సహకారంతో ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.కాగా ఈ పర్యటనలో జెలెన్స్కీతో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సమావేశమయ్యారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో పలు రక్షణ అంశాలపై ఇరు దేశాధినేతలు కీలక చర్చలు జరిపారు. ఇరాన్ తమ దేశంలోని ప్రజలు, సంపదనే లక్షంగా చేసుకొని దాడులు జరుపుతుందని యుఏఈ అధ్యక్షుడు ఆరోపించారు. అయితే ఇటీవల ఇరాన్ దాడులను ఎదుర్కొవడానికి ఉక్రెయిన్ సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై టెహ్రాన్ జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్పై నేరుగా దాడి చేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన సాయం అందిస్తోంది. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
ఉక్రెయిన్పై రష్యా దళాలు జరిపిన తాజా దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో నాలుగు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దక్షిణ నగరం జపోరిజ్జియాలో శనివారం ఒక నివాస గృహంపై డ్రోన్ దాడి జరగగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది గాయపడ్డారు.సమీపంలోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. తూర్పు డోనెత్స్క్ మరియు దక్షిణ ఖెర్సన్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ దాడులు జరుగుతున్న సమయంలో అమెరికా–ఉక్రెయిన్ ప్రతినిధులు ఫ్లోరిడాలో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత రష్యా ఉక్రెయిన్పై విస్తృత దాడులు జరపడం ఇదే మొదటిసారి. కాగా, పశ్చియాసియాలో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతు పలకగా.. రష్యా ఇరాన్ పక్షాన ఉంది. 2022లో మొదలై నేటికీ కొనసాగుతుంది..!రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం 2022లో మొదలై, నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ అనూహ్య ప్రతిఘటనతో ఇటీవలికాలంలో రష్యా దాడులను కాస్త తగ్గించింది. ఉక్రెయిన్ను ఆక్రమించాలనే ఉద్దేశంతో రష్యా ఈ యుద్దాన్ని మొదలుపెట్టింది. -
పశ్చిమాసియా మరింత ఉద్రిక్తం
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలకు రక్షణగా ఉక్రెయిన్ నేరుగా రంగంలోకి దిగింది. ఆ దేశానికి చెందిన 200 మందికి పైగా నిపుణుల బృందాన్ని సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యుఏఈ దేశాలకు పంపింది. త్వరలోనే మరికొంత మందిని అక్కడికి పంపుతామని జెలెన్ స్కీ ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ను ఇరాన్కు చెందిన షాహిద్ డ్రోన్లు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. 30$ఖర్చుతో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా దాదాపు 3.7 $ మిలియన్లు ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన అతితక్కువ ఖరీదైన డ్రోన్లతో వీటిని అడ్డుకుంది. ఈనేపథ్యంలో కీవ్ సాయం కోసం గల్ఫ్ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ" ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న యుద్ధం మాకు దూరమైందేమి కాదు. రష్యా, ఇరాన్కు సహకరిస్తున్నందున ఈ యుద్ధంలో ఉదాసీనంగా ఉండే హక్కు మాకుందని మేము భావించడం లేదు. అని కొద్దిరోజుల క్రితం లండన్ పార్లమెంటులో జెలెన్స్కీ మాట్లాడారు. కాగా అంతకు ముందే ఉక్రెయిన్పై ఇరాన్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ శత్రు దేశాలకు సహకరిస్తోన్న ఉక్రెయిన్ పై నేరుగా దాడి చేస్తామని హెచ్చరించింది. అమెరికాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించింది. అయితే వీటిని జెలెన్స్కీ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది.షాహిద్ డ్రోన్ల ప్రత్యేకతషాహిద్ డ్రోన్లను ఇరాన్ తయారు చేస్తుంది. ఆ దేశానికి చెందిన 'షాహిద్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ ,ఇరాన్ విమానయాన పరిశ్రమల సంస్థ (HESA) వీటిని సంయుక్తంగా వీటిని రూపొందిస్తాయి. 'సూసైడ్' డ్రోన్లుగా ఇవి ప్రసిద్ధి చెందిన ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. లక్ష్యాన్ని చేరుకున్నాక వాటంతట అవే పేలిపోతాయి.అయితే రష్యా సైతం ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో ఇదే తరహా డ్లోన్లను రూపొందించింది. దీంతో వీటిని అడ్డుకునేలా ఉక్రెయిన్ తన సాంకేతికతను ఏర్పాటు చేసుకుంది. ఇదివరకూ ఉక్రెయిన్ 44,700కు పైగా షాహెద్ తరహా డ్రోన్లను కూల్చివేసింది. కేవలం గత నెలలోనే దాదాపు 3,238 షాహెద్ తరహా డ్రోన్లను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డ్రోన్ల దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న గల్ఫ్ దేశాలని రక్షించడానికి ఉక్రెయిన్ ఒప్పుకుంది. అయితే వీటికోసం జెలెన్స్కీ తగిన మెుత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. -
బాంబుల మోత.. భయం లేకుండా విద్యార్థులకు పాఠాలు ఇలా..
ఖార్కివ్: పైన క్షిపణుల మోత.. కింద పిల్లల అక్షరాల పాట.. రష్యా సరిహద్దుకు కూతవేటు దూరంలోని ఉక్రెయిన్ నగరం ఖార్కివ్లో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ఇదే. నిత్యం బాంబు దాడులు, డ్రోన్ల ముప్పుతో వణికిపోతున్న ఈ నగరంలో చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఏకంగా మెట్రో రైలు స్టేషన్లనే తరగతి గదులుగా మార్చివేసింది.పాతాళంలో పాఠశాలలురష్యా సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్కివ్ నగరంపై నిత్యం బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్న 184 పాఠశాలల్లో 134 ధ్వంసమయ్యాయి. దీంతో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూనే, వారికి చదువును అందించేందుకు ఎనిమిది మెట్రో స్టేషన్లను పాఠశాలలుగా మార్చారు. ప్రస్తుతం సుమారు 20 వేల మంది విద్యార్థులు భూగర్భ మెట్రో స్టేషన్లు, బంకర్లలో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో చదువుకుంటున్నారు.ట్రైన్ల పక్కనే పాఠాలుఒకప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడే మెట్రో స్టేషన్ హాల్స్ ఇప్పుడు క్లాస్ రూమ్లుగా మారిపోయాయి. ఒలెక్సాండర్ మాసెల్స్కీ మెట్రో స్టేషన్లో సుమారు 2,000 మంది చిన్నారులు షిఫ్టుల వారీగా చదువుకుంటున్నారు. ‘ఇక్కడ యుద్ధం గురించి ఆలోచించాల్సిన పనిలేదు, ఇది చాలా సురక్షితమైన ప్రదేశం. మా దృష్టి అంతా పిల్లలకు పాఠాలు చెప్పడంపైనే ఉంటుంది’ అని ఇంగ్లీష్ టీచర్ మాక్సిమ్ త్రిస్తాప్షోన్ తెలిపారు.భయం నీడలో భద్రతబయట పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. బస్టాపుల్లో నిలబడితే ఎప్పుడు డ్రోన్ దాడులు జరుగుతాయో తెలియదు. అందుకే పిల్లలను బస్సుల ద్వారా నేరుగా స్టేషన్ లోపలికే తీసుకొస్తారు. ‘నాకు ఇక్కడ చదువుకోవడం ఇష్టం, ఎందుకంటే ఇక్కడ బాంబుల భయం ఉండదు’ అని తొమ్మిదేళ్ల అలీసా అనే విద్యార్థిని చెప్పడం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు పోషక విలువల కోసం ‘ఉజ్వర్’ అనే పానీయాన్ని కూడా అందిస్తున్నారు.సంస్కృతిని కాపాడుకుంటూ..ఈ మెట్రో పాఠశాలలు కేవలం అక్షరాలు నేర్పడమే కాదు, ఉక్రెయిన్ సంస్కృతిని కాపాడే వేదికలుగా కూడా మారాయి. రష్యన్ భాషా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నగరంలో, పిల్లలు ఇప్పుడు పాఠశాలల ద్వారా ఉక్రేనియన్ భాషను నేర్చుకుంటున్నారు. యుద్ధం తమ గతాన్ని, చరిత్రను తుడిచివేయాలని చూస్తోందని అధ్యక్షుడు జెలెన్ స్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా యుద్ధం మిగిల్చిన గాయాల మధ్య, క్షిపణి దాడుల భయం లేకుండా ప్రశాంతంగా చదువులు సాగించడం ఈ పిల్లలకు అతిపెద్ద ఊరటగా మారింది. ఖార్కివ్ మెట్రో స్టేషన్లు ఇప్పుడు కేవలం ప్రయాణ ప్రాంగణాలు మాత్రమే కాదు, విజ్ఞాన దేవాలయాలుగా మారాయంటున్నారు స్థానికులు.ఇది కూడా చదవండి: ముంబై నిద్రపోదు.. ఢిల్లీ త్వరగా లేవదు.. మన భాగ్యనగరం? -
ఇరాన్-రష్యా రెండూ ఒకటే.. 'ద్వేష సోదరులు': జెలెన్స్కీ
ఇరాన్, రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ యుద్ధం వల్ల కలిగే ప్రమాదాలపై లండన్లోని వెస్ట్ మినిస్టర్లో మాట్లాడుతూ.. ఇరాన్-రష్యా ప్రభుత్వాలను ద్వేషంలో సోదరులుగా అభివర్ణించారు. ఇరాన్ తయారు చేసిన షాహెడ్ ‘కామికాజే’ డ్రోన్లు రష్యాకు విక్రయించబడుతున్నాయని, అవి ఉక్రెయిన్పై దాడుల్లో ఉపయోగించబడుతున్నాయని వివరించారు. రష్యా చమురుపై ఆంక్షలను సడలించడం ప్రమాదకరమని, మాస్కోపై ఒత్తిడి కొనసాగించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. జెలెన్స్కీ తన ప్రసంగంలో మధ్యప్రాచ్య యుద్ధాన్ని ఉక్రెయిన్లో జరుగుతున్న దీర్ఘకాలిక యుద్ధంతో అనుసంధానిస్తూ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఆధునిక యుద్ధంలో పయనీకులుగా మారిందని, తమ అనుభవాన్ని మిత్రదేశాలతో పంచుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ చౌకగా తయారయ్యే ఇంటర్సెప్టర్ డ్రోన్లను ఉపయోగించి రష్యా దాడులను ఎదుర్కొంటోందని తెలిపారు.ప్రస్తుతం 201 మంది ఉక్రెయిన్ సైనిక నిపుణులు మధ్యప్రాచ్యంలో ఉన్నారని, మరో 44 మంది అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరంతా ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొనే విధానాలను మిత్రదేశాలకు బోధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, రక్షణ మంత్రి జాన్ హీలీ, ప్రతిపక్ష నాయకులు, 60 మంది ఎంపీలు, లార్డులు పాల్గొన్నారు. -
సహయం చేస్తాం.. కానీ డబ్బులు కావాలి: జెలెన్స్కీ
ఇరాన్ ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్లను కూల్చివేయడానికి అమెరికా ఉక్కిరిబిక్కిరవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షాహిద్ డ్రోన్ల కూల్చివేతకు సాంకేతికంగా సహయం అందేజేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అయితే దానికి ప్రతిగా తమకు డబ్బులివ్వాలని కోరారుపశ్చిమాసియా యుద్ధంలో అమెరికా,ఇజ్రాయెల్ను ఇరాన్కు చెందిన షాహిద్ డ్రోన్లు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. 30$ఖర్చుతో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా దాదాపు 3.7 $ మిలియన్లు ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన అతితక్కువ ఖరీదైన డ్రోన్లతో వీటిని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో టెహ్రాన్ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ శత్రు దేశాలకు సహకరిస్తోన్న ఉక్రెయిన్ పై నేరుగా దాడి చేస్తామని హెచ్చరించింది. అమెరికాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది.కాగా ఈ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ఇరాన్ను డ్రోన్ దాడులను ఎదుర్కొవడానికి కావాల్సిన సహాయం చేస్తామని దానికి ప్రతీగా తమకు తగిన మెుత్తంలో డబ్బులివ్వాలని కోరారు. ఈనేపథ్యంలోనే డ్రోన్ దాడులు వాటిని ఎలా ఎదుర్కొవాలే అనే అంశం అంచనా వేయడానికి మూడు నిపుణుల బృందాలను పశ్చిమాసియా దేశాలకు పంపారు. అయితే తాము ఇరాన్తో యుద్ధం చేయడం లేదని ఇప్పుడు తమ దేశానికి డబ్బు అవసరం కనుక సాంకేతిక సాయం చేస్తున్నామని జెలెన్స్కీ స్పష్టం చేశారు. -
ఇరాన్ వెనుక రష్యా.. అమెరికా కోసం రంగంలోకి ఉక్రెయిన్
-
పేరు మాయని మనిషి
అసలైన సాహిత్యజీవికి వర్తమానం ఎలాంటి కిరీటమూ పెట్టకపోవచ్చు, కానీ చరిత్ర అతడిని తగిన విధంగా ఆశీర్వదిస్తుందనడానికి ఐజాక్ బేబెల్ జీవితమే ఉదాహరణ. అయితే ఆ వర్తమానపు విషాదం చరిత్ర ఎప్పటికీ తుడుచుకోలేని మచ్చ. ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగమైన ఉక్రెయిన్లో జన్మించిన ఈ యూదు తన మాతృభాష యిడ్డిష్ను కాదని రష్యన్ను రచనా భాషగా ఎంచుకున్నాడు. సోవియట్ రష్యా ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచాడు. పోలిష్–సోవియట్ యుద్ధ సమయంలో రచయిత గోర్కీ సూచన మీద పాత్రికేయుడిగా పనిచేసిన బేబెల్ ఆ యుద్ధం తాలూకు చీకటి, బీభత్సాల చేదు వాస్తవికతను ‘రెడ్ కావల్రీ’ కథలుగా అందించాడు. 1926లో తొలిసారి ప్రచురితమైన ఈ కథలకు ఇది శతాబ్ది సంవత్సరం.అత్యంత సంక్షిప్తంగా రాయడం, ఉన్నట్టుండి కథను మరో తలంలోకి కొనిపోవడం, ‘సాల్ట్’ కథ గురించి బోర్హెస్ అన్నట్టు– కవిత్వానికే సాధ్యమై మననానికి వీలుండే లయను కథలో సాధించడం బేబెల్ గొప్పతనం. రెడ్ కావల్రీ, తను పుట్టి పెరిగిన ఒడెస్సా పట్టణం నేపథ్యంలో ‘ఒడెస్సా స్టోరీస్’, ఇంకా రెండు నాటకాలు, ఒక సినిమాకు స్క్రీన్ప్లే మాత్రమే రాసిన బేబెల్(1894–1940) వచనంలో కరుణ, కాఠిన్యం కలగలసి మనసును మెలిపెడతాయి. యుద్ధభూమి తాలూకు బహుముఖ పార్శా్వలనూ, అత్యంత సున్నితమైన మనిషి కూడా అనూహ్య కార్యాలకు సిద్ధమయ్యే విపరిణామాలనూ ఆయన చిత్రించాడు. సాధారణ జీవితం గడపాలని కోరుకుంటూ రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న నిస్సహాయ మానవులు అందులో కనబడతారు. చావు వాసన వేసే కథలు ఆయనవి! యుద్ధం అనేది యుద్ధ క్షేత్రానికే పరిమితమై ఉండదని కూడా ఈ కథలు చెబతాయి.కమ్యూనిస్టు వ్యతిరేకి కాకపోయినా బేబెల్ ప్రాపగాండా వ్యతిరేకి. దాంతో విమర్శను తట్టుకోలేని రాజ్యం ఆయన్ని సోవియట్ యూనియన్లో ‘నాన్–పర్సన్’ చేయడానికి పూనుకుంది. 1933 నుంచే ఆయన పుస్తకాలను ఉపసంహరించడం మొదలైంది. స్టాలిన్ హయాంలోని ‘సామ్యవాద వాస్తవికత’కు తగ్గట్టుగా రచయితలు తమ పాత రచనలను తిరగరాస్తున్న వేళ, తనను తాను సరిచేసుకోవడం ఇష్టంలేని బేబెల్ మౌనం అనే కొత్త సాహిత్య ప్రక్రియలో రాణిస్తున్నానని చెప్పుకొన్నాడు. ఇక ‘ప్రజా శత్రువు’గా అరెస్టయిన తర్వాత బేబెల్ మీద ట్రాట్స్కీయిస్టు, ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి కేసులు పెట్టారు. ఆయన పేరును సాహిత్య నిఘంటువుల్లోంచీ, ఎన్సైక్లోపీడియాలోంచీ తొలగించారు. ఆయన గురించి ఏ సాహిత్య కార్యక్రమంలోనూ ఎత్తడానికి లేదు. బేబెల్ అనే మనిషి లేనట్టుగానే వ్యవహరించారు. ఆధునిక సోషల్ మీడియా యుగంలో జడలు విప్పిన ‘క్యాన్సిల్ కల్చర్’ అనేదానికి ఆ కాలంలో బీజాలున్నాయి. 1940 జనవరి 16న పార్టీకీ, సోవియట్ ప్రభుత్వానికీ శత్రువులైన 457 మంది జాబితా స్టాలిన్కు అందింది. అందులో బేబెల్ సహా 346 మందిని కాల్చేయాలన్న సిఫారసు ఉంది. జనవరి 27న మధ్యాహ్నం 1:30కు 45 ఏళ్ల బేబెల్కు కాల్చివేత శిక్ష అమలైంది. బేబెల్ సమగ్ర రచనలను ఆంగ్లంలోకి అనువదించిన పీటర్ కాన్స్టంటీన్ ఈ మరణ శిక్షను ‘ఇరవయ్యో శతాబ్ద సాహిత్యపు అతి దారుణ విషాదాల్లో ఒకటి’గా అభివర్ణించారు. 1954లో కృశ్చేవ్ పాలనలో బేబెల్ను నిరపరాధిగా ప్రకటించిన తర్వాతగానీ ఆయన రచనలు మళ్లీ వెలుగు చూడలేదు.రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ తన గతాన్ని పునఃసమీక్షించుకుంటూ, కొత్త చరిత్రను లిఖించకుంటున్న వేళ, అక్కడి మేధావర్గంలో బేబెల్ మీద సంక్లిష్ట స్పందన ఉంది. కానీ ’(ఉక్రెయిన్) అంధత్వం, అశక్తత, ఆ ఆశక్తత లోంచి పుట్టిన తెలియని కఠినత్వం’ గురించి రాసిన బేబెల్ సృజన విస్మరించలేనిదని పొలిటికల్ సైంటిస్ట్ వాలెంటీన్ బుషాన్స్కీ అంటారు. ఒక దిశ లేకుండా పుస్తకాలు చదువుతున్న భార్య ఆంటోనినా పీరుష్కోవాకు అనవసర పుస్తకాల మీద సమయం వృథా చేసుకోకుండా ముఖ్యమైన క్లాసిక్స్ ఏవి చదవాలో ఒక జాబితా ఇస్తాడు బేబెల్. చదవడం ఎంత ముఖ్యమో, ఏవి చదవాలో తెలియడం అంతకన్నా ముఖ్యం. ఆ జాబితాలో మనం బేబెల్ను కలుపుకోవచ్చు. -
"నేను మంచి తండ్రిని కాలేకపోయా"
ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఇతరులు యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా పురోగతి కనిపించడం లేదు. అయితే నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగ ప్రకటన చేశారు. తను ఒక మంచి తండ్రిగా ఉండలేక పోయానన్నారు.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మెుదలయ్యి నాలుగేళ్లు గడిచింది. ఈ సంగ్రామంలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ‘సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్(సీఎస్ఐఎస్)’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. అయితే ఈ యుద్ధం ముగింపుకోసం ఎన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సహా పలు దేశాలు అంతర్జాతీయ సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావోద్వేగ ప్రకటన చేశారు.ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ " ఈ యుద్ధ సమయంలో నేను మంచి తండ్రిగా ఉండలేకపోయా, ఎందుకంటే నాపిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోయా, ఎందుకంటే నేను ఉక్రెయిన్ అధ్యక్షున్ని, నామెుదటి ఎంపిక ఎప్పుడూ దేశమే" అని జెలెన్స్కీ ఉద్వేగభరితంగా మాట్లాడారు. మా ప్రజలు ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.అయితే రష్యా దాడులతో దేశంలో ఎలక్ట్రిసిటీ లేక దేశ ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని జెలెన్స్కీ తెలిపారు. పగలు రాత్రి తేడా లేకుండా వాతావరణం మైనస్ 30 డిగ్రీలకు చేరుకుందని దీంతో ప్రజలంతా అవస్థలు పడుతున్నారన్నారు. అయితే యుద్ధం వల్ల పాడైపోయిన విద్యుత్ వ్యవస్థ తిరిగి పునరుద్దరిద్దామంటే రష్యా దాడులతో అది సాధ్యపడడం లేదన్నారు.ట్రంప్కు థ్యాంక్స్కొద్దిరోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో మాట్లాడానని శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు ధన్యవాదాలని తెలిపారు. అయితే తమ దేశానికి చెందిన భూభాగాలని రష్యా తమదని ప్రచారం చేసుకోవడంతో విభేదాలు సాగుతున్నాయని తెలిపారు. అయితే రష్యా అధ్యక్షుడితో ముఖాముఖీ సమావేశం ఏర్పాటు చేయాలని జెలెన్స్కీ కోరుతున్నారు. అయితే రష్యా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. దాని బదులు జెలెన్స్కీని మాస్కోకు రావాలని ఆహ్వానించగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒప్పుకోలేదు. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మరోసారి భీకరంగా మారింది. నిన్న గురువారం రాత్రి ఆ దేశంపై పెద్ద ఎత్తున డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకపడినట్లు తెలుస్తోంది. ఈ దాడులలో ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డట్లు సమాచారం.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ పరిస్థితులు సద్ధుమణగడం లేదు. ఇరు దేశాల మధ్య ఓ వైపు శాంతి చర్చలకు అవకాశం ఉందంటూనే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా మరోసారి విరుచుకపడింది. ఆదేశంలోని రైల్వే, ఎనర్జీ సెక్టార్ లక్షంగా దాడులు జరిపింది. ఈ అటాక్స్లో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా పెద్ద ఎత్తున భవనాలు నెలకొరిగాయి.అయితే దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. తమ దేశంపై 420 డ్రోన్లు, 39 మిస్సైల్స్, 11 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందన్నారు. వాటిలో 374 డ్రోన్లను, 32 మిస్సైల్స్ను, 5 క్షిపణులను గాలిలోనే ధ్వంసం చేశామని పేర్కొన్నారు. అయితే కొన్ని ఉక్రెయిన్ భూభాగాలను తాకాయన్నారు. రష్యా జరిపిన దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని వారిలో పిల్లలు అధికంగా ఉన్నారని జెలెన్స్కీ పేర్కొన్నారు. -
ఉక్రెయిన్కు అణ్వాయుధాలు.. ఆ రెండు దేశాలపై రష్యా ఆరోపణలు
మాస్కో: ఉక్రెయిన్కు గుట్టుచప్పుడు కాకుండా అణ్వాయుధాలను బదలాయించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మంగళవారంతో ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశీ నిఘా విభాగం (ఎస్వీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. ఇది చాలా ప్రమాదకర పరిణామమంటూ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ ఆందోళన వెలిబుచ్చారు. యుద్ధానికి తెర దించేందుకు జరుగుతున్న చర్చల్లో తాము విధించిన ప్రధాన షరతుల్లో ఉక్రెయిన్ అణ్వస్త్రరహిత దేశంగా ఉండటం అతి ముఖ్యమైనదని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి నాలుగేళ్లు నిండాయి. ఇరువైపులా లక్షలాది మంది సైనికులు సమరంలో సమిధలుగా నేలకూలినా రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ దాహం తీరడం లేదంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహిస్తున్నాయి. కానీ ఈ పోరును ఆపలేక చేష్టలుడిగి చూస్తున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి విఫలమై చోద్యం చూస్తోంది. ఉక్రెయిన్ రణక్షేత్రంలో రక్తధారాలు ఆగి శాంతి కపోతం ఎగురుతుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఎవరూ బదులు చెప్పలేని పరిస్థితి!ఉక్రెయిన్పై తక్షణం యుద్ధం ఆపకపోతే రష్యాపై మరిన్ని అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. అందుకు జూన్ దాకా గడువు విధించారు. ఆలోపు పుతిన్ వైఖరి మారేనా? యుద్ధానికి తెర దించేందుకు అంగీకరిస్తారా? బదులుగా ఉక్రెయిన్లోని కీలక డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకునేందుకు అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తారా? ఇవి ప్రస్తుతానికి ట్రిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలాయి.2022 ఫిబ్రవరి 24న మొదలు... 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకున్నాక కూడా రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ఏకపక్షంగా దండెత్తింది. నాటి నుంచీ పోరాడుతున్నా ఉక్రెయిన్ నుంచి 20 శాతం భూభాగాన్ని మాత్రం ఆక్రమించుకోగలిగింది. ఈ క్రమంలో ఇరువైపులా ఏకంగా 20 లక్షల మంది సైనికులు చనిపోయారని వార్తలొచ్చాయి! అయితే 3,25,000 మంది రష్యా సైనికులు చనిపోయారని, మొత్తంగా 12 లక్షల మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ ప్రకటించింది.ఉక్రెయిన్ వైపు 140,000 మంది సైనికులు చనిపోయారని, 6 లక్షల మంది గాయపడ్డారని తెలిపింది. రష్యా ఆక్రమణ వేగం నత్త కన్నా మెల్లగా ఉందని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే ఎద్దేవా చేశారు. ఐరోపా దేశాల ఆయుధ, ఆర్థికబలంతో రష్యాపై ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతోంది. అందుకే నాలుగేళ్లలో డోనెట్స్క్ ప్రాంతంలో రష్యా కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ముందుకు రాగలిగిందని అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇటీవల తాము ఆక్రమించిన నాలుగు ప్రాంతాలపై ఉక్రెయిన్ హక్కులు వదలుకోవాలని, ముఖ్యంగా కీలక డోన్బాస్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అందుకు జెలెన్స్కీ ససేమిరా అంటున్నారు. -
రష్యా-ఉక్రెయిన్: ఐరాసలో భారత్ తటస్థం
న్యూయార్క్: ఐదేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంక్షోభంలో శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (UNGA)లో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. రష్యా దళాలు తక్షణమే ఉక్రెయిన్ నుంచి తప్పుకోవాలని, తద్వారా శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాలంటూ ఉక్రెయిన్ ప్రతిపాదించిన ‘సపోర్టింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ ఇన్ ఉక్రెయిన్’ తీర్మానంపై మంగళవారం జరిగిన ఓటింగ్లో భారత్ తటస్థ వైఖరిని అవలంబించింది.మొత్తం 107 దేశాలు ఈ తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా, 12 దేశాలు దీనిని వ్యతిరేకించాయి. భారత్తో పాటు చైనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, అమెరికా తదితర 50 దేశాలు ఓటింగ్లో పాల్గొనకుండా దూరంగా ఉండటం గమనార్హం. కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరితో ఐదో ఏట అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ తీర్మానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.. ఈ పోరాటాన్ని సామూహిక మనస్సాక్షిపై ఒక మచ్చగా అభివర్ణించారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి, ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ శాంతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.2025లో పౌర మరణాలు గరిష్ట స్థాయికి చేరడంపై గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని పట్టుబట్టారు. మరోవైపు ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్మానం ఆమోదం పొందడం శాశ్వత శాంతికి అవసరమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురైనప్పటికీ, లొంగిపోయే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. జూన్ నాటికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అమెరికా గడువు విధించిన నేపథ్యంలో, తదుపరి దశ చర్చలు మయామిలో జరిగే అవకాశం ఉందని సమాచారం. తాజాగా మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయడం, ఫలితంగా రష్యాలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయడం లాంటి పరిణామాలు ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నాయి.ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ వార్నింగ్: విశ్లేషకులపై కఠిన చర్యలు -
ముడవప్రపంచ యుద్ధం.. జెలెన్స్కీ ఏమన్నారంటే?
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడవ ప్రపంచ యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రారంభించారన్నారు. మాస్కో దండయాత్రను అడ్డుకోవడం ద్యారా ఉక్రెయిన్ పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధాన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.ఉక్రెయన్- రష్యా యుద్ధం ప్రారంభమై ఇటీవలే నాలుగు సంవత్సరాలు పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ యుద్ధం మూలంగా ఇప్పటికే పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ యుద్ధాన్ని నిరోధించడానికి పెద్ద ఎత్తున యత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీకి జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు.యుద్ధం ముగించడానికి అమెరికా అధ్యక్షుని నుంచి స్పష్టమైన హామీలు ఆశిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. కేవలం అధ్యక్షుని మాట పూర్వక హామీ కాకుండా దానికి రాజ్యాంగ పరమైన అనుమతి ఉండాలని కోరారు. 1991లో ఉక్రెయిన్ స్వాతంత్రం పొందినప్పుడు ఉన్న సరిహద్దులే తమ అంతిమ లక్షమని అయితే ఇప్పుడు రష్యా సైనిక పరంగా ఎంతో బలంగా ఉన్నందున అది సాధ్యం కాదని జెలెన్స్కీ ఒప్పుకున్నారు.అయితే రష్యా తమ భూభాగం నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని విషయం తనకు తెలుసన్నారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని రష్యా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని జెలెన్స్కీ తన అభిప్రాయాలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు. -
ఇరాన్పై కయ్యానికి సై
గాజా ఇంకా తల్లడిల్లుతూనే ఉంది. ఉక్రెయిన్ వాసులు ఎప్పుడేమి ఉపద్రవం ముంచు కొస్తుందో తెలియక భయం భయంగా బతుకీడుస్తున్నారు. ఇవి సద్దుమణగకుండానే ఇరాన్పై సైనిక దురాక్రమణకు దిగి పశ్చిమాసియాలో మరో యుద్ధక్షేత్రాన్ని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. మరో పదిరోజుల్లో యుద్ధం తప్పదని బెదిరిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ను పశ్చిమాసియా దిశగా తరలిస్తున్నారు. ఇది 75 యుద్ధ విమానాలతో, అయిదువేలమంది బలగాలతో మధ్యశ్రేణి క్షిపణుల్ని ప్రయోగించటానికి అనువుగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే అరేబియా సముద్ర జలాల్లోని ఒమన్ తీరంలో మరో నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇరాన్ వైపు క్షిపణులు గురిపెట్టిసిద్ధంగా ఉంది. అమెరికాను ప్రతిఘటించటానికి ఆర్నెల్ల నుంచే ఇరాన్ సన్నాహాలు చేసు కుంటోంది. ఈ యుద్ధం దీర్ఘకాలంగా సాగటానికి అంచెలంచెల వ్యూహాన్ని సిద్ధం చేసిఉంచింది. ప్రపంచం దీన్నంతటినీ మౌనంగా వీక్షిస్తూ ఉండగలదా? ఇది అమెరికా సొంత వ్యవ హారం కాదు. యుద్ధం వల్ల నష్టపడేది కేవలం ఇరాన్ ఒక్కటే కాదు. యుద్ధానికి అమెరికా చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇరాన్ దగ్గర అణ్వాయుధానికి తోడ్పడే శుద్ధి చేసిన యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నది అందులో ఒకటి. ఇది ప్రపంచ శాంతికి ముప్పు తెస్తుందని అమెరికా వాదన. ఇజ్రాయెల్ దగ్గర అమెరికా మోహరించిన అణ్వాయుధాలున్నాయి. అది ఇరుగు పొరుగు దేశాలపై కోరుకున్నప్పు డల్లా దాడులు చేస్తోంది. గాజాను వల్లకాడు చేసింది చాలక, అక్కడి వార్తలు బయటి ప్రపంచానికి తెలియకుండా వందల సంఖ్యలో పాత్రికేయులను హతమార్చింది. అందుకే అక్కడేం జరుగుతున్నదో ప్రస్తుతం తెలియటం లేదు. ఇరాన్ వల్ల కనీసం గత పదేళ్లుగా పశ్చిమాసియాలోని ఏయే దేశాలకు ముప్పు వాటిల్లిందో, అదే కాలంలో ఇజ్రాయెల్ ఏమేం చేసిందో అమెరికా వెల్లడించాలి. ఇక మానవ హక్కుల ఉల్లంఘన సాకు అర్థరహిత మైంది. తాను అక్రమ వలసదారుల పేరిట నిత్యం మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, వేరెవరో ఆ పని చేస్తున్నారనే నైతిక హక్కు ఎక్కడిది? తన చెప్పుచేతల్లోని సౌదీ, యూఏఈ, ఖతార్ వంటి దేశాల మాటేమిటి? అక్కడ ప్రజాస్వామిక వ్యవస్థలు ఉనికిలో ఉన్నాయా? ఆ సంగతలా ఉంచి ఆ సాకుతో జోక్యం చేసుకోవటానికి అమెరికాకున్న అధి కారం ఎక్కడిది? ఇరాన్ ప్రజలు యాభయ్యేళ్ల క్రితమే మహ్మద్ రెజాపెహ్లవీ వంటి నియంతను కూలదోసిన చరిత్ర గలవారు. ప్రస్తుత ఖమేనీ పైనా తిరగబడగల సత్తా ఉన్నవారు.జెనీవాలో ఒకపక్క ఒప్పందం కోసం ఇరాన్తో చర్చలు సాగిస్తూ బలగాల మోహరింపు నీతిమాలినతనం. అలా చేస్తే పాదాక్రాంతమవుతుందని ట్రంప్ భ్రమపడు తున్నారు. నిత్యం యుద్ధాల్లో, ఆంక్షల్లో బతుకీడుస్తున్న ఇరాన్ కొత్తగా భయపడేదేమీఉండదు. గత ఏడాది 12 రోజుల యుద్ధంలో తేటతెల్లమైంది ఇదే. చివరకు అమెరికాయే కాల్పుల విరమణకు సిద్ధపడాల్సి వచ్చింది. యుద్ధమంటూ జరిగితే, అది దీర్ఘకాలం కొనసాగేలా ఇరాన్ చూస్తే ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి. హోర్ముజ్ జలసంధి మూతపడితే బ్యారెల్ చమురు ధర ఒక్కసారిగా 80 డాలర్ల నుంచి దాదాపు 200 డాలర్లకు చేరువై, ప్రపంచ దేశాలన్నీ అధిక దరలతో సతమతమవుతాయి. చమురు ఉత్పత్తులపై ఆధారపడే ప్లాస్టిక్, ఎరు వులు, ఫార్మా రంగాల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. స్టాక్ మార్కెట్ల పతనం సరేసరి. ఇరాన్పై దాడులకు తన సైనిక స్థావరం వాడుకోవద్దని బ్రిటన్ చెప్పింది. గల్ఫ్ దేశాలు, వేరే దేశాలు సైతం ఆ మాటే చెప్పాలి. రష్యా, చైనాలు సైతం ఇరాన్కు అనుకూలంగా ఈ వివాదంలోకి దిగితే మున్ముందు ఇది ప్రపంచయుద్ధంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే అమెరికా ప్రతినిధుల సభ మౌనం వహించ కూడదు. దాని అనుమతి లేనిదే ట్రంప్ అడుగు ముందుకేయలేరు గనుక ఇది చాలా అవసరం. కాగల కార్యం ట్రంప్ నెరవేరుస్తారని కలగంటున్న డెమాక్రాట్లు మౌనం వీడకపోతే చరిత్ర క్షమించదు. -
రష్యా సైనిక నిఘా అధికారిపై కాల్పులు
మాస్కో: రష్యాలో కీలక సైనికాధికారులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇందుకు ఉక్రెయిన్ కారణమని రష్యా ఆరోపిస్తోంది. శుక్రవారం రష్యా సైనిక నిఘా సంస్థ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ అలెక్సేయెవ్(64)పై గుర్తు తెలియని దుండగుడు పలురౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో అలెక్సేయెవ్ తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ఈ కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. అలెక్సేయెవ్ ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. ఇంట్లో ఉండగా డెలివరీ బాయ్ రూపంలో వచి్చన దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన వెనుక సూత్రధారులు ఎవరన్నది అధికారులు ఇంకా గుర్తించలేదు. 2011 నుంచి రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘జీఆర్యూ’డిప్యూటీ చీఫ్గా అలెక్సేయెవ్ సేవలందిస్తున్నారు. సిరియాలో రష్యా సైనిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు ‘హీరో ఆఫ్ రష్యా’మెడల్ కూడా అందుకున్నారు. ఇదిలా ఉండగా, అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబీలో రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండు రోజులపాటు జరిగిన చర్చలు శుక్రవారమే ముగిశాయి. అదేరోజు రష్యాలో సైనికాధికారిపై కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చల్లో అలెక్సేయేవ్ పై అధికారి అయిన మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అడ్మిరల్ ఇగోర్ కోస్టియుకోవ్ రష్యా తరఫున పాల్గొన్నారు. అలెక్సేయెవ్పై కాల్పుల గురించి అధికారులు రష్యా అధినేత పుతిన్కు సమాచారం అందించారు. ఈ దాడి గురించి ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. అలెక్సేయెవ్పై కాల్పుల ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. శాంతి చర్చలను పక్కదారి పట్టించడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం ఉగ్రవాదులను పురిగొలి్ప, ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు. -
ఉక్రెయిన్ బస్సుపై డ్రోన్ దాడి.. మైనర్లతో సహా భారీగా మృతులు
రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో రష్యా మరోసారి ఉక్రెయిన్పై దాడి చేసింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకపడింది. ఈ దాడుల్లో 15 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎంతకీ కొలిక్కి రావడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. అయితే యుద్ధాన్ని ముగించడం కోసం ఇరు దేశాలు చర్చలు జరిపినా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అయితే రెండు దేశాల మధ్య త్వరలో మూడోసారి చర్చలు జరగనున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని రష్యా చర్చలకోసం మాస్కోకి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఇకనైనా యుద్ధానికి ముగింపు దొరుకుతుందా అని అంతా అనుకున్నారు. అయితే మరోసారి సీన్ రివర్స్ అయ్యింది. తాజాగా రష్యా, ఉక్రెయిన్పై మరోసారి డ్రోన్లతో విరుచుకపడింది.ఉక్రెయిన్లోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ డీటీఈకే టార్గెట్గా డ్రోన్ దాడులు జరిపిందని అధికారులు తెలిపారు. కార్మికులు ఫ్యాక్టరీలో పనులు ముగించుకొని బస్సులో తిరిగి వెళుతుండగా బస్సుపై డ్రోన్ దాడి జరిపిందన్నారు. ఈ దాడిలో 15 మంది అక్కడికక్కడే మరణించారని పేర్కొన్నారు. మరణించిన వారిలో మైనర్లు ఉన్నారన్నారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాలలో దాదాపు 90 కిపైగా డ్రోన్లతో తమ దేశంపై దాడి చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడులను రష్యా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయతే రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని జెలెన్స్కీ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. -
ప్యాసింజర్ రైలుపై రష్యా దాడి.. షాకింగ్ వీడియో..
కీవ్: ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసి రష్యా సైన్యం దాడులకు పాల్పడుతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా డ్రోన్ల సాయంతో ఉక్రెయిన్పై విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్లో ప్యాసింజర్ రైలుపై జరిగిన రష్యా దాడిలో నలుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రష్యా సైన్యం దాడులకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. రష్యన్ దళాలు మంగళవారం రాత్రి ఉక్రెయిన్ అంతటా వరుస దాడులు ప్రారంభించాయి. ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలోని ప్యాసింజర్ రైలుతో సహా పౌర మౌలిక సదుపాయాలను నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. దాదాపు 200 మందితో ప్రయాణిస్తున్న ఇంటర్సిటీ ప్యాసింజర్ రైలు టార్గెట్గా రష్యా సైన్యం డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. This is the Aftermath of Russia striking a civilian Train. Civilians…. pic.twitter.com/rFLpuddg22— Bricktop_NAFO (@Bricktop_NAFO) January 27, 2026 దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెసా నగరంపై రష్యా జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు పిల్లలు, ఒక గర్భిణి సహా 23 మంది గాయపడ్డారని అధికారులు మంగళవారం తెలియజేశారు. ఈ దాడికి 50 డ్రోన్లను ఉపయోగించారని వెల్లడించారు. ఉక్రెయిన్లోని పవర్గ్రిడ్ లక్ష్యంగా ఈ దాడి జరిగిందని వివరించారు. రష్యా దాడిలో ఐదు అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. మొత్తంగా గత కొద్ది రోజులుగా రష్యా దాడుల కారణంగా 12 మంది మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు.Россия точечно атаковала вагон с военными в пассажирском поезде. Партизаны работают. pic.twitter.com/J2VicOAOaI— Intoleranter💙 (@koelnnemez) January 28, 2026తాజాగా రష్యా దాడులపై జెలెన్స్కీ స్పందిస్తూ.. రష్యా దాడిని పూర్తిగా ఉగ్రవాద దాడి అని అభివర్ణించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. ఏ దేశంలోనైనా, పౌర రైలుపై డ్రోన్ దాడిని సరిగ్గా అదే విధంగా పరిగణిస్తారు.. పూర్తిగా ఉగ్రవాదంగా పరిగణిస్తారు. ఇందులో ఎటువంటి సైనిక ఉద్దేశ్యం లేదు.. ఉండకూడదు అని టెలిగ్రామ్లో పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించడానికి మాస్కోపై ప్రపంచ ఒత్తిడిని తీవ్రతరం చేయాలని ఆయన కోరారు. భవనాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని అపార్ట్మెంట్ శిథిలాల కింద చిక్కుకున్నవారి పరిస్థితి తెలియాల్సి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. యుద్ధాన్ని నిలిపేందుకు ప్రయత్నాలను అమెరికా వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.Russians attacked residential building with guided missile #CrimesAgainstHumanity #ukraine pic.twitter.com/BZKvokrwIV— Hope For Ukraine (@hopeforukraine) January 28, 2026 -
ఉక్రెయిన్లో 2 లక్షల ఇళ్లకు కరెంట్ కట్
కీవ్: రష్యా ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్లోని వేలాది నివాసాల్లో ఆదివారం చీకట్లు అలుముకున్నాయి. మైనస్ ఉష్ణోగ్రతలతో తీవ్ర శీతల వాతావరణంలో హీటింగ్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో జనం అల్లాడుతున్నారు. విద్యుత్ సరఫరా లైన్లే లక్ష్యంగా ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల కారణంగా జపొరిఝియా ప్రాంతంలోని 400 గ్రామాల్లోని 2 లక్షలకు పైగా నివాసాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. మరోవైపు, సుమీ, ఖర్కీవ్, ఒడెసా, నీప్రోపెట్రోవిస్క్ ప్రాంతాలపై శనివారం రాత్రి విద్యుత్ పవర్ గ్రిడ్పై రష్యా డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ యంత్రాంగం తెలిపింది. -
జెలెన్స్కీ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్లో ఎమర్జెన్సీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం, దేశంలో శీతాకాల పరిస్థితులు తదితర కారణాల రీత్యా దేశంలో ఇందన రంగంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రకటించారు.2022లో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ఎనర్జీ సెక్టార్ తీవ్రంగా దెబ్బతింది. రష్యా జరిపిన దాడులలో ఉక్రెయిన్ విద్యుత్ ప్లాంట్లు పెద్దమెుత్తంలో దెబ్బత్నిన్నాయి. అంతేకాకుండా అత్యధిక శాతం చమురు యుద్ధానికి అవసరం అవడంతో ఆదేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో శీతాకాలంలో ఆ దేశంలో పెద్ద ఎత్తున కరెంట్ కోతలతో పాటు నీటి సరఫరాలకు అంతరాయం తదితరమైనవి ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆదేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు.దేశంలో ఇందన ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో నెలకొన్న ఎమర్జెన్సీ పరిస్థితులను పరిష్కరించడానికి, సరఫరా అంతరాయాలను పరిష్కరించడానికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ కార్యాలయం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత కీలకమైన సేవలను తిరిగి పునరుద్ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెలెన్స్కీ ఆదేశించారు. -
ఉక్రెయిన్ రాజధానిలో.. ఇజ్రాయెల్ రాయబారుల ‘గజగజ’..!
కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్లో ఇజ్రాయెల్ రాయబారులు గజగజ వణికిపోతున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారిక వార్తాసంస్థ ‘యెదువోత్ అహ్రోనోత్’ స్వయంగా పేర్కొంది. ప్రస్తుతం కీవ్లో మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రష్యా భారీ దాడులతో అక్కడ వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అంతేకాదు.. మూడ్రోజులుగా ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. దీంతో.. ఇజ్రాయెల్ రాయబారులు చలికి గజగజ వణికిపోతున్నారు.ఇజ్రాయెల్ రాయబారి మైఖేల్ బ్రాడ్స్కీ ఈ సందర్భంగా వైనెట్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘కీవ్ ఇప్పుడు ఘోస్ట్ సిటీగా మారిపోతోంది. విద్యుత్తు లేకపోవడంతో.. హీటర్లు పనిచేయక ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో.. పరిసర నగరాలకు తరలిపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. యుద్ధం కొనసాగుతున్నా.. తాము రాయబార కార్యాలయ విధులకు ఆటంకం కలిగించడం లేదని, అయితే.. మౌలిక సదుపాయాలు మృగ్యమవ్వడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు. ‘మేము ఉంటున్న అపార్ట్ మెంట్లలో విద్యుత్తు లేదు. బయట మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దాంతో వెచ్చని కోట్లు ధరించి గడపాల్సి వస్తోంది. శీతాకాలం చలికి తోడు.. రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్లో ఉంటున్న ఇజ్రాయెలీలకు రక్షణ కల్పించేందుకు మేము మా వంతు కృషి చేస్తున్నాం’ అని ఆయన వివరించారు.దీనిపై కీవ్ మేయర్ మాట్లాడుతూ రష్యా దాడులతో వేల మంది పౌరులు చీకట్లో మగ్గిపోతున్నారని, చలికి వణుకుతున్నారని వాపోయారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కాగా.. రష్యా ప్రయోగించిన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఓర్ష్నిక్’ కారణంగా కీవ్లోని విద్యుత్తు వ్యవస్థ చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే.. పౌరులకు ఇబ్బందులు కలగకుండా జనరేటర్లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
3 వేల అపార్ట్మెంట్లు… ఒకే భవంతిలో ఊరు!
నిర్మాణపరంగా అది ఒక భవంతి మాత్రమే! అయితే, దాని పరిమాణం ఒక ఊరంత ఉంటుంది. ఈ భవంతి పొడవు దాదాపుగా మూడు కిలోమీటర్లు. కచ్చితంగా చెప్పాలంటే, 2.75 కిలోమీటర్లు. ఇందులో ఒక చివరి నుంచి మరో చివరకు నడవాలంటే, కనీసం అరగంట పడుతుంది. ప్రపంచంలోనే అతి పొడవాటి నివాస భవనంగా పేరు పొందిన ఈ భవంతిలో దాదాపు పదివేల మంది నివాసం ఉంటారు. ఈ అరుదైన భవంతి ఉక్రెయిన్లోని లత్స్క్ నగరంలో ఉంది. ఉక్రెయిన్ ఇదివరకు సోవియట్ యూనియన్లో అంతర్భాగంగా ఉన్న కాలంలో ఆర్.జి.మెతెల్నిత్స్కీ, వి.కె.మలోవిత్సా అనే ఆర్కిటెక్ట్లు ఈ సుదీర్ఘ భవంతి నిర్మాణానికి రూపకల్పన చేశారు. ప్రపంచంలోనే అతి పొడవాటి చైనాగోడ స్ఫూర్తితో ఈ ఆర్కిటెక్ట్లు ఈ భవంతిని 1969లో నిర్మించారు. ఇందులో మూడువేల అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ భవంతి లోపలికి అడుగు పెడితే, ఒక చిన్న పట్టణంలోకి అడుగుపెట్టినట్లుగానే ఉంటుంది. ఇప్పటికీ దీనికి పోటీవచ్చే మరో కట్టడమేదీ ప్రపంచంలో లేకపోవడం విశేషం. -
పుతిన్ నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదు
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చెందిన నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి దిగిందంటూ వచ్చిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. రష్యా అధ్యక్షుడి నివాసాన్ని ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోలేదని చెప్పారు. పుతిన్ నివాసానికి సమీపంలో ఏదో జరిగిందని, అయితే అది పుతిన్ను లక్ష్యంగా చేసుకుని జరిగింది కాదని తమ అధికారులు చెప్పారన్నారు. ఫ్లోరిడాలోని మార్ ఎ లాగో నివాసంలో రెండు వారాల విశ్రాంతి ముగించుకున్న ట్రంప్ సోమవారం వాషింగ్టన్కు వస్తూ తన ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. ‘మొదట్లో ఉక్రెయిన్ దాడి విషయం మేం కూడా నమ్మాం. కానీ, ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. అలాంటి దాడి ఏదీ జరగలేదని నిర్ధారణ అయింది’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ ప్రతిపాదిత రష్యా–ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అమెరికాలో చర్చలు జరుగుతున్న వేళ..పుతిన్ తనతో ఫోన్లో మాట్లాడారని, డ్రోన్ దాడి జరిగినట్లు చెప్పడంతో తనకు చాలా కోపం వచ్చిందని సోమవారం ట్రంప్ తెలపడం తెల్సిందే. అనంతరం, శాంతి చర్చలను తప్పుదోవ పట్టించేందుకే రష్యా ఈ అబద్ధం చెప్పిందటూ న్యూయార్క్ పోస్ట్లో వచ్చిన కథనాన్ని బుధవారం ఆయన షేర్ చేశారు. శాంతి చర్చలు పురోగతిలో ఉన్నట్లు ట్రంప్, జెలెన్స్కీ ప్రకటించినా రష్యా మాత్రం తన డిమాండ్లపై వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్లోని పారిశ్రామిక డోన్బాస్ ప్రాంతం మొత్తం తనకే చెందాలని, యుద్ధానంతరం ఆ దేశం పరిమితంగా సైన్యాన్ని ఉంచుకోవాలని షరతులు విధిస్తోంది. -
రష్యా డ్రోన్ దాడిలో.. 24 మంది మృతి
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్లోని ఖేర్సన్ రీజియన్లో ఉన్న ఓ కేఫ్ అండ్ హోటల్పై భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 24 మంది చనిపోయారు. కొత్త సంవత్సర వేడుకల్లో పౌరులు ఉండగా ఈ దాడి చోటుచేసుకున్నట్లు ఖేర్సన్ గవర్నర్ తెలిపారు.ఖోర్లీ గ్రామంలో ఉన్న ఆ హోటల్పై మూడు డ్రోన్లతో దాడి జరిగింది. ఘటనలో 24 మంది మరణించగా, 50 మంది గాయపడ్డారని అధికారులు టెలిగ్రామ్ చానెల్ ద్వారా వెల్లడించారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు.ఒకవైపు ట్రంప్ తన మధ్యవర్తిత్వంతో ఈ యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుతిన్తో ఓసారి.. జెలెన్స్కీతో మూడుసార్లు భేటీ అయ్యారు. తాజాగా 90 శాతం శాంతి ప్రణాళిక ఖరారైనట్లేనని, ఏక్షణమైనా యుద్ధం ఆగిపోతుందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే.. శాంతి చర్చల వేళ ఇరు దేశాలు మాత్రం డ్రోన్లతో పరస్పరం దాడులు జరుపుకుంటున్నాయి.. తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరగ్గా.. సైన్యం దానిని తిప్పి కొట్టింది. ఇది ఉక్రెయిన్ పనేనని మాస్కో ఆరోపిస్తుండగా.. కీవ్ మాత్రం అవి ఆరోపణలేనని తోసిపుచ్చింది. ఈ క్రమంలో.. ఆధారాలంటూ కొన్ని వీడియోలను బయటపెట్టింది రష్యా. -
పుతిన్ ఇంటికే గురిపెట్టారుగా!
ఉక్రెయిన్ సంక్షోభం ఈ ఫిబ్రవరితో నాలుగేళ్లు పూర్తి కానుంది. ఒకవైపు యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నా.. మరోవైపు ఇరుదేశాల కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపైనే డ్రోన్ దాడి జరగడం కలకలం రేపగా.. అమెరికా సహా పలు దేశాల అనుమానాల నేపథ్యంలో ఆ దాడులకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుతిన్ నివాసంపై డ్రోన్ దాడి జరిగిందనే.. ఇది ఉక్రెయిన్ సైన్యం పనేనని రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. ఆ దాడి తమ పని కాదని.. ఇది రష్యా ఆడుతున్న నాటకమని.. అసలు అలాంటి దాడేం జరగలేదని.. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలకు దిగింది అని ఉక్రెయిన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. రష్యా అధినేత నివాసంపై దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అదే సమయంలో అలాంటి దాడి జరగకపోయి ఉండొచ్చంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. అనూహ్యంగా.. మాస్కోతో పాటు క్రిమియాలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయంటూ రష్యా కొన్ని వీడియోలను రిలీజ్ చేసింది. అందులో.. క్రెమ్లిన్(రష్యా అధ్యక్ష కార్యాలయం) సమీపంలో నిర్వీర్యం చేసిన ఓ డ్రోన్కు ఆరు కేజీల పేలుడు పదార్థాలు అమర్చి ఉన్నాయి. దీంతో 24 గంటల్లో దాడికి సంబంధించిన ఆధారాలు చూపించాలన్న ఉక్రెయిన్కు గట్టి కౌంటర్ ఇచ్చినట్లైంది. Downed UAV with a 6kg explosive charge — Russian MOD publishes VIDEO PROOF of Ukrainian attack on Putin’s residenceThe attempt was carried out on the night of December 28 to 29WATCH report by the unit who took down 41 of the 91 drones sent by Kiev https://t.co/J9Tgd8yAJx pic.twitter.com/b7Yv55OlxP— RT (@RT_com) December 31, 2025ఈ వీడియోలు వెలుగులోకి రాకముందే.. పుతిన్ ఇంటిపై జరిగిన డ్రోన్ దాడుల్ని పలు దేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ‘‘శాంతి స్థాపనకు కొనసాగుతున్న ప్రయత్నాలకు భంగం కలిగించవద్దు’’ అంటూ రష్యా-ఉక్రెయిన్లను కోరారు. ఒక్క ఫ్రాన్స్ మాత్రం సరైన ఆధారాల్లేకుండా ఉక్రెయిన్ను నిందించడానికి వీల్లేదంటూ మద్దతు ప్రకటించింది. అయితే.. తాజా దాడుల వీడియోలపై కీవ్ వర్గాలు, జెలెన్స్కీ.. అసలు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సుమారు 91 డ్రోన్లు.. నోవ్గోరోడ్ రీజియన్లోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చాయని.. అయితే మాస్కో-సెయింట్ పీటర్స్బర్గ్లో వాటిని తమ సైన్యం నేల్చకూల్చిందని రష్యా విదేశాంగ మంతరి సెర్గె లావ్రోవ్ ప్రకటించారు. అయితే.. ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ పనేనని ఆరోపిస్తున్నారాయన. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై దాడులను రష్యా ఆపడం లేదు. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెసా నగరంపై తాజాగా డ్రోన్లతో మాస్కో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక అపార్ట్మెంట్లు, విద్యుత్ గ్రిడ్లు ధ్వంసమయ్యాయి. ఓ శిశువు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు గాయపడ్డారు. శాంతి చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని భావించేలోపే.. రష్యా ఉక్రెయిన్పై దీర్ఘశ్రేణి దాడుల్ని తీవ్రం చేయడం గమనార్హం. -
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు దిశగా కీలక అడుగు పడింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం విషయంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిపిన భేటీ ఫలవంతంగా ముగిసింది. తుది ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇద్దరు దేశాధినేతలు చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. కానీ..ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో నివాసంలో సుమారు మూడు గంటలపాటు ట్రంప్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి 90-95 శాతం ఆమోదం లభించిందని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే కీలకమైన సరిహద్దు అంశంపైనే ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఇద్దరి మాటల్లో వెల్లడి అయ్యింది.ఉక్రెయిన్కు భద్రత కల్పించే అంశాలపై 95 శాతం చర్చలు పూర్తయ్యాయని ట్రంప్ అన్నారు. అయితే.. తూర్పు భాగంలోని సరిహద్దుల అంశమే ఎటూ తేలడం లేదని మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చాలా అంశాలపై చర్చించాం. దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే అనుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఫలితం. మరికొన్ని వారాల్లోనే ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ చర్చలకు డెడ్లైన్ అంటూ ఏదీ లేదని గమనించాలి. కాబట్టి సరైన సమయంలో.. అదీ అమెరికా సమక్షంలో రష్యా-ఉక్రెయిన్లు ఈ యుధ్దానికి ముగింపు పలుకుతాయి’’ అని అన్నారాయన. ఇక ట్రంప్కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసిన జెలెన్స్కీ.. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో ఇరువైపులా సంబంధించిన అంశాలను పొందుపరిచారని.. ఇందులో 90 శాతం ఆమోదయోగ్యంగానే ఉన్నాయన్నారు. అయితే అంతిమంగా.. శాశ్వత శాంతి సాధనలో భద్రతా హామీలే కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. మిగిలిన అంశాలపై యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతామని.. జనవరిలో వాషింగ్టన్లో మరిన్ని చర్చలు జరుగుతాయని.. త్వరలోనే ట్రంప్ పీస్ ప్లాన్కు తుది రూపం ఇవ్వనున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి తాత్కాలికంగా ఆపేందుకు సుముఖంగా లేరు. అందుకే ఆయన కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఉక్రెయిన్లో పర్యటించాలని, అక్కడి పార్లమెంట్లో ప్రసంగించాలని తాను కోరుకుంటున్నప్పటికీ.. ముందుగా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావాలని జెలెన్స్కీ ఆకాంక్షిస్తున్నారని, ఆ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తాను అని అన్నారు.అసలు చిక్కల్లా అక్కడే.. డోన్బాస్ (Donbas) అనేది తూర్పు ఉక్రెయిన్లోని ఒక చారిత్రక.. ఆర్థిక ప్రాంతం. డొనెట్స్క్ (Donetsk), లుహాన్స్క్ (Luhansk) ప్రాంతాల కలయిక. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేంద్ర బిందువుగా మారింది. రష్యా అనుకూల వేర్పాటువాదులకు, ఉక్రెయిన్కు మధ్య ఈ ప్రాంతంపై పట్టు కోసం తీవ్ర పోరాటం జరుగుతోంది. వ్యూహాత్మకంగా భావిస్తుండడంతో.. రష్యా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుంటోంది. అందుకే శాంతి చర్చలలో కీలక అంశంగా మారింది. అయితే.. ఈ అంశంపైనా చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని ట్రంప్ ఇప్పుడు చెబుతుండగా, డోన్బాస్పై ఉక్రెయిన్ వైఖరి స్పష్టంగా ఉందని.. అది రష్యా అభిప్రాయానికి భిన్నమని వ్యాఖ్యానించడం కొసమెరుపు. భేటీకి ముందు.. జెలెన్స్కీతో భేటీకి ముందు మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. తుది గడువు ఏమీ లేదని, యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. దౌత్య ప్రయత్నాలు తుది దశకు వచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ ఫోన్లో మాట్లాడానని.. ఆయనతో ఫలితం సాధించే దిశగా చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు.‘‘రష్యా, ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటున్నాయి. నేను జెలెన్స్కీతో జరుపుతున్న సమావేశంపై పుతిన్ చిత్తశుద్ధితో ఉన్నారు. తుది గడువు ఏమీ లేదు.. యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులపై పుతిన్, జెలెన్స్కీ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను.. ఇదీ చాలా క్టిష్టమైనది. ఫ్లోరిడాలో సమావేశం కోసం జెలెన్స్కీ చాలా కృషి చేశారు. ఆయన, ఉక్రెయిన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. రష్యా, ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చలు కొనసాగిస్తుంటాం. చర్చలు చివరి దశలో ఉన్నాయి.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ట్రంప్ అన్నారు.ట్రంప్తో జరిగే సమావేశంలో ఉక్రెయిన్కు కల్పించాల్సిన భద్రతా హామీల అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఇది వరకే జెలెన్స్కీ వెల్లడించారు. ముఖ్యంగా 20సూత్రాల ప్రణాళికపై చర్చిస్తామని, ఇది దాదాపుగా(90 శాతం) సిద్ధమైందని తెలిపారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాకుండా యూరప్ దేశాలూ పాలుపంచుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ముగింపుకు ట్రంప్ పిలుపు
వాష్టింగన్: కొనసాగుతున్న ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపాలని, అందుకు సమయం వృదా చేయాల్సిన అవసరం లేదని’ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిగిన భేటీలో ట్రంప్ పైవిధంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ప్రధానంగా ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధానికి శాంతి పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించింది. ట్రంప్ తన శైలిలో యుద్ధాన్ని త్వరగా ముగించగలమని నమ్మకం వ్యక్తం చేయగా.. జెలెన్ స్కీ అమెరికా మద్దతు ఉక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.ఈ చర్చల్లో సైనిక సహాయం, ఆర్థిక మద్దతు, రాజకీయ వ్యూహాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. జెలెన్ స్కీ ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి, అమెరికా సహాయం కొనసాగాలని కోరారు. ట్రంప్, తన పదవీకాలంలో ప్రత్యేక శాంతి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది.యూరోపియన్ నాయకులు, ట్రంప్- జెలెన్స్కీల మధ్య చర్చలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి కొత్త మార్గం చూపవచ్చని భావిస్తున్నారు. అయితే, విశ్లేషకులు ట్రంప్ ప్రతిపాదించే శాంతి ప్రణాళికలో రష్యా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఈ సమావేశం ఉక్రెయిన్ భవిష్యత్తుకు కీలక మలుపు కావచ్చు. ట్రంప్ త్వరిత పరిష్కారం వాగ్దానం చేస్తున్నప్పటికీ జెలెన్ స్కీ మాత్రం ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, భూభాగ సమగ్రతపై రాజీ పడరాదని స్పష్టం చేస్తున్నారు. -
మోదీ ప్రభుత్వమే నన్ను కాపాడాలి
మోర్బి: రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని ఉక్రెయిన్ బలగాలకు చిక్కిన గుజరాత్ వాసి తనను కాపాడాలంటూ భారత పభ్రుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఈ మేరకు అతడు తన కుటుంబసభ్యులకు ఒక వీడియో పంపించాడు. గుజరాత్లోని మోర్బి పట్టణానికి చెందిన సాహిల్ మహ్మద్ హుస్సేన్ మజోతి(22) రష్యాలో చదువుకునేందుకు వెళ్లాడు. అక్కడ అతడు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని, జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత రష్యా సైన్యంలో చేరి, ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్లాడు. అక్కడ ఉక్రెయిన్ సేనలకు లొంగిపోయాడు. ప్రస్తుతం ఉక్రెయిన్లో నిర్బంధంలో ఉన్నాడు. రెండు రోజుల క్రితం మోర్బిలో ఉంటున్న తన తల్లి హసీనా బెన్ సెల్ఫోన్కు ఒక వీడియో పంపాడు. అందులో తను పడుతున్న కష్టాలను వివరించాడు. తనే తప్పూ చేయకున్నా రష్యా అధికారులు తనను అక్రమ డ్రగ్స్ రవాణా కేసులో ఇరికించారని వాపోయాడు. జైలు పాలు చేసి, ఆపై మాయమాటలు చెప్పి, సైన్యంలో చేరేలా కాంటాక్ట్రు ఒప్పందంపై సంతకం చేయించారని చెప్పాడు. యుద్ధానికి వెళ్లి ఉక్రెయిన్ బలగాలకు లొంగిపోయినట్లు ఆ వీడియోలో వివరించాడు. చదువుకునేందుకు రష్యా వచ్చే భారతీయ యువకులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. తనను ఈ చెర నుంచి విడిపించాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. కుటుంబంతో తిరిగి కలుసుకునే అవకాశం కల్పించాలని వేడుకున్నాడు. తన కుమారుడి నిర్బంధంపై స్థానిక రాజ్యసభ ఎంపీ కేసరీదేవసిన్హ్ ఝలాకు తెలిపామని హసీనాబెన్ తెలిపారు. మోదీ ప్రభుత్వం తన కుమారుడిని సురక్షితంగా వెనక్కి తీసుకువస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సాహిల్ అంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్తో మాట్లాడినట్లు ఎంపీ చెప్పారు. దేశాల మధ్య వ్యవహారం అయినందున కొంత సమయం పడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంలో కొంత పురోగతి సాధించామని చెప్పారు. -
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. భారతీయుల పరిస్థితి విషమం
ఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా సైన్యంలో చేరిన భారతీయుల పరిస్థితి మరింత విషమంగా మారింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 50 మంది భారతీయులు రష్యా సైన్యంలో చిక్కుకుని ఉన్నారు.వారిలో ఇప్పటి వరకు 26 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు అదృశ్యమైనట్లు సమాచారం. వారి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అధికారులు తెలిపారు. మొత్తం మీద, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 200 మందికి పైగా భారతీయులు రష్యా సైన్యంలో చేరినట్లు ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.ప్రభుత్వ చర్యలుభారత ప్రభుత్వం రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రష్యా సైన్యంలో చేరిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొంతమందిని రప్పించగలిగామని, కానీ ఇంకా 50 మంది చిక్కుకుని ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.కుటుంబాల ఆందోళనయుద్ధంలో చిక్కుకున్న యువకుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ప్రాణాలు రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు కుటుంబ సభ్యులు తమ పిల్లలు మోసపూరిత వాగ్దానాలతో రష్యా సైన్యంలో చేరారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దక్షిణాసియా దేశాల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడం వల్ల చిక్కుకున్న భారతీయుల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితి భారత విదేశాంగానికి పెద్ద సవాలుగా మారింది.ముగింపురష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నంత కాలం, రష్యా సైన్యంలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రాణాలు రక్షించేందుకు భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కుటుంబాలు కోరుతున్నాయి. -
నాటోలో ఉక్రెయిన్ చేరికకు రష్యా ఓకే!
బెర్లిన్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించే ప్రయత్నాల్లో అతి పెద్ద ముందడుగు. అమెరికా, యూరప్ దేశాలతో కుడిన నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరికను అనుమతించే విషయమై యోచిస్తున్నట్టు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జర్మనీలో చర్చలు జరుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూతల బృందం సోమవారం ఈ మేరకు పేర్కొంది. రష్యా వర్గాల నుంచి తమకు ఈ మేరకు వర్తమానం వచ్చినట్టు తెలిపింది. నాటోలో ఉక్రెయిన్ చేరికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం తెలిసిందే. అలాంటి ప్రయత్నం చేస్తే మొత్తం యూరప్ నే తమ శత్రువుగా భావించి వారితో నేరుగా యుద్ధానికి దిగాల్సి వస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. మరోవైపు, అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ భద్రతకు కచ్చితమైన హామీలిస్తే నాటోలో చేరిక డిమాండ్ ను శాశ్వతంగా వదులుకుంటామని జెలెన్ స్కీ ఆదివారమే ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో ఈ విషయమై రష్యా వైఖరి ఇలా అనూహ్యంగా మారడం విశేషం! -
డొనాల్డ్ ట్రంప్లో అసహనం..
ఇటీవల కాలంలో పలు దేశాల మధ్య ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నాయకుల మధ్య మాటల దాడి హెచ్చుమీరుతోంది. ఈ పరిణామాలను చూస్తే గతంలోనే వరల్డ్ వార్-3 వచ్చే అవకాశం ఉందని చాలా మంది భావించారు. దేశాల మధ్య సఖ్యత చెదిరి, యుద్ధాలకు దారి తీస్తున్న పరిస్థితులే వీటన్నంటికీ కారణం. అటు రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలుకొని నేటి పాకిస్తాన్-ఆఫ్గాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల్ని చూస్తే ఏదో ఉపధ్రవం రాబోతుందా? అని పగటు ప్రజానీకం ఉలిక్కిపడిన సందర్భాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.ట్రంప్లో అసహనం.. మరొకవైపు ‘శాంతి-శాంతి’ అని చెప్పుకునే అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో వరల్డ్ వార్-3 అంటూ వ్యాఖ్యానించారు కూడా. మళ్లీ తాజాగా ట్రంప్ అదే హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా రష్యా-ఉక్రెయన్ల మధ్య యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆ యుద్ధం కారణంగా గత నెలలోనే సుమారు 25 వేల మంది వరకూ మృత్యువాత పడ్డారని, అందులో ప్రజలు, సైనికులు కూడా ఉన్నారన్నారు.ఆ యుద్ధాన్ని తక్షణమే ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా అది కారణం కావొచ్చని హెచ్చరించారు. ఆ ఇర దేశాల నేతాలకు ఎన్నిసార్లు చెప్పినా యుద్ధాన్ని ఏదొక రూపంలో ముందుకు తీసుకెళుతున్నారే కానీ దాన్ని ముగించాలనే ఆలోచన చేయడం లేదంటూ వైట్హౌస్ వేదికగా మీడియా సమక్షంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సంర్భంగా ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని వ్యాఖ్యానించారు ట్రంప్.ఇక మాటల్లేవ్.. అంతా యాక్షనే..!అంతకుముందు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ల యుద్ధంపై ట్రంప్ చాలా ఆందోళనగా ఉన్నారన్నారు. అది ట్రంప్కు విపరీతమైన చిరాకు తెప్పిస్తుందన్నారు. ఇరుదేశాలు ఒక సఖ్యతకు వచ్చి యుద్ధం ఆపకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందన్నారు. ఇక రష్యా- ఉక్రెయిన్లతో మాట్లాడాలని ట్రంప్ అనుకోవడం లేదని, ఇక కేవలం చర్యలతోనే ఇరు దేశాలకు సరైన సమాధానం చెప్పాలని ట్రంప్ భావిస్తున్నారన్నారు. భారత టూరిస్టులకు షాకిచ్చిన ట్రంప్.. -
క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్: రష్యా మరోసారి పేట్రేగిపోయింది. ఉక్రెయిన్పైకి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగుతూనే ఉన్నాయి. రష్యా మొత్తం 51 మిస్సైళ్లు, 653 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. వీటిలో 30 క్షిపణుల, 585 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకున్నాయంది. మిగతా డ్రోన్లు, క్షిపణులతో కనీసం 29 ప్రాంతాల్లో నష్టం వాటిల్లిందని పేర్కొంది. తమ ఇంధన మౌలిక వనరులను రష్యా లక్ష్యంగా చేసుకుందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కీవ్ ప్రాంతంలోని ఫాస్టివ్ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్ డ్రోన్ దాడితో పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. వివిధ ఘటనల్లో 8 మంది వరకు గాయాలపాలయ్యారన్నారు.ఇలా ఉండగా, నాలుగేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు, సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు అమెరికాలోని ఫ్లోరిడాలో అమెరికా, ఉక్రెయిన్ మధ్య రెండు రోజులుగా చర్చలు జరిగాయి. ఇందులో అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జెర్డ్ కుష్నర్, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఉక్రెయిన్ ప్రతినిధి రుస్తెమ్ ఉమెరోవ్, ఆండ్రీ హనటోవ్లు పాల్గొంటున్నారు. అయితే, యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా నిజంగా సిద్ధంగా ఉంటేనే ఈ సంప్రదింపులతో సరైన ఫలితం లభించినట్లవుతుందని వారంటున్నారు. మూడో రోజు శనివారం కూడా వీరి చర్చలు కొనసాగుతున్నాయి. -
ఈయూ కోరుకుంటే యుద్ధానికైనా సిద్ధం
మాస్కో: నాలుగేళ్ల యుద్ధానికి ఇకనైనా ముగిద్దామని భావిస్తుంటే యురోపియన్ యూనియన్ సభ్యదేశాలు అడ్డు తగులుతున్నాయని రష్యా( Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జరేడ్ కుష్నర్, ఆ దేశ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ల ప్రతినిధి బృందం మంగళవారం రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్లో పుతిన్తో భేటీ అయింది. ఆ తర్వాత పుతిన్ మాట్లాడారు. ‘‘ శాంతి ఒప్పందం విషయంలో ట్రంప్కు, యురోపియన్ యూనియన్ దేశాలకు మధ్య సఖ్యత లేదనుకుంటా. నిజానికి ఉక్రెయిన్(Ukraine)లో శాంతి కపోతాలు ఎగరడం ఈయూ దేశాలకు ఇష్టం లేదనుకుంటా. శాంతి చర్చలకు ఈ దేశాలే విఘాతం కల్గిస్తున్నాయి. నిజానికి ఈయూ దేశాలతో యుద్ధానికి దిగడం నాకు ఏమాత్రం ఇష్టంలేదు. కానీ వాళ్లు యుద్ధానికే మొగ్గుచూపితే రణరంగంలోకి దూకేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఈయూ దేశాలకు స్పష్టమైన శాంతి అజెండా లేదు. చూస్తుంటే వాళ్లు యుద్ధానికే మొగ్గుచూపుతున్నట్లు కని్పస్తోంది. వాళ్లు చేసిన శాంతి ఒప్పంద ప్రతిపాదనలు రష్యాకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ ప్రతిపాదనలు మొత్తం శాంతి ప్రక్రియను స్తంభింపజేసేలా ఉన్నాయి. అదే వాళ్ల లక్ష్యం అనుకుంటా’’ అని పుతిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
అంతిమంగా రష్యాకు మేలు...
రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని విరమించేందుకు 28 అంశాలతో కూడిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో యుద్ధం ఆగుతుందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగటానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఉక్రెయిన్ ‘నాటో’ సభ్యత్వం స్వీకరించకూడదనేది. అమెరికా, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్లో ‘నాటో’ స్థావరాలను స్థాపించి మాస్కో పొలిమేర్ల వరకూ అమెరికా మిలిటరీ క్షిపణుల్ని మోహరించే ప్రయత్నంలో భాగంగా ‘నాటో’లో సభ్యత్వానికి ఉక్రెయిన్ను ప్రోత్సహించాయి. దీంతో తన ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్పై యుద్ధానికి దిగింది రష్యా.ఉక్రెయిన్ తూర్పు భాగంలో 25 శాతం భూభాగాన్ని రష్యన్ సేనలు ఆక్రమించాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మిత్రులు అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు. ఉక్రెయిన్ ప్రధాన పట్టణాలను ఆక్రమించి రాజధాని కీవ్ దిశగా రష్యన్ సేనలు దూసుకెళుతున్నాయి. ‘మీరు శాంతియుతంగా లొంగకపోతే ఉక్రెయిన్ను నామరూపాలు లేకుండా చేస్తామ’ని రష్యా హెచ్చరిస్తోంది. ఈ తరుణంలో యుద్ధాన్ని ప్రోత్సహించిన అమెరికాయే ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ప్రతిపాదనలు తెరపైకి తెచ్చి, ఉక్రెయిన్ ఓటమి నుంచి బయటపడే మార్గాల్ని అన్వేషిస్తోంది. 28 శాంతి ప్రతి పాదనల్లో ప్రధానంగా 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియా ద్వీపకల్పాన్ని వాస్తవ రష్యన్ నియంత్రణ ప్రాంతంగా గుర్తించి... అమెరికా గుర్తింపుతో సహా అంతర్జాతీయ గుర్తింపును పొందేలా చూడాలి. యుద్ధంలో రష్యా వశపరచుకున్న డొనెట్స్క్ పొరుగున ఉన్న లుహాన్స్క్ ప్రాంతాలను రష్యాకు ఇవ్వాలి. రష్యా నియంత్రణలో ఉన్న ప్రాంతాల కంటే ఎక్కువ ప్రాంతాన్ని ఉక్రెయిన్ ఇవ్వాలి. అక్కడ మిగిలి ఉన్న ఉక్రెయిన్ ట్రూపులను వెనుకకు పిలవాలి. ‘నాటో సభ్యత్వాన్ని కోరను’ అని ఉక్రెయిన్ చేయాలని చెబుతున్న ప్రతిజ్ఞను ఈ శాంతి ముసాయిదాలో చేర్చారు. ఇందుకోసం ఉక్రెయిన్ రాజ్యాంగాన్ని కూడా మార్చాలి. ప్రతిఫలంగా ఉక్రెయిన్ భద్రతా హామీలను పొందుతుంది. ఉక్రెయిన్లో విదేశీ మిలిటరీ స్థావరాలు కానీ, దూరపు శ్రేణి క్షిపణులను కానీ మోహరించ కూడదు. ఉక్రెయిన్ ఆర్మీని 6 లక్షలకు మించకుండా కుదించడం, ‘నాటో’ ఇకపై రష్యా వైపు విస్తరించదనీ, రష్యా ఇకపై పొరుగు దేశాలపై దాడి చేయకూడదనీ ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఉక్రెయిన్ పారిశ్రామిక వాడలన్నీ రష్యా స్వాధీనంలో ఉన్నాయి. ఉక్రెయిన్ అణుశక్తిగా ఎన్నటికీ ఉండ కూడదు. యుద్ధ నష్టపరిహారం వంటివి ఇరువైపులా ఉండవు. రష్యాపై ఆంక్షలను ఎత్తివేసి, 2014లో తొలగించిన జీ8 దేశాల కూటమిలో సభ్యత్వం తిరిగి ఇస్తారు. ఉక్రెయిన్లో 100 రోజులలోగా అధ్యక్ష ఎన్నికలు జరగాలి. యూరోపియన్ యూనియన్ అధికారులు మాత్రం ఈ శాంతి ప్రణాళిక కోసం తమతో సంప్రదించలేదనీ, ఇది రష్యా అనుకూల ప్రణాళిక అనీ అంటున్నారు. 4 సంవత్సరాల క్రితం ఈ ప్రతిపా దనల్ని ఒప్పుకొని ఉంటే యుద్ధమే ఉండేది కాదు. ఇంత విధ్వంసమే జరిగేది కాదు. లక్షలాది మంది పశ్చిమ యూరప్కు వలసలు పోయేవారు కాదు. ఐతే బ్యాంకుల్లో స్తంభించిన 30,000 కోట్ల డాలర్ల రష్యా కరెన్సీ గురించి ఇంకా స్పష్టత రాలేదు. శాంతి ఒడంబడిక జరిగితే అంతిమ విజేతగా రష్యా నిలవనుంది. రష్యాను బలహీనపర్చి, రష్యాను విభజించి వలస దేశంగా మార్చి ఖనిజసంపదను దోచుకోవాలన్న అమెరికా, పశ్చిమ దేశాల ఆశలు అడియాసలుగా మిగిలిపోతాయి.పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ దిగజారుడులో ఉంది. పరిశ్రమలు సంక్షోభంలోకి వెళ్తూ ఐఎంఎఫ్ నుంచి ఆర్థిక సహాయానికి కూడా వెళ్లాలనే ఆలోచనలో యూకే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపటం ద్వారా అమెరికా, మిత్రదేశాలు తమ పరువును కాపాడుకొనే ప్రయత్నంలో ఉన్నాయనడం సముచితం.బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త ‘ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం’జాతీయ కార్యవర్గ సభ్యులు -
Virat: మే డే.. మే డే.. సాయం కావాలి
రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ‘విరాట్’పై నల్లసముద్రంలో దాడి జరిగింది. అందులో ఉన్న సిబ్బంది అత్యవసర సందేశాలు పంపిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ అందులో సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించుకుంది.‘‘ఇది విరాట్. సాయం కావాలి! డ్రోన్ దాడి! మేడే!’’ అని సిబ్బంది అంటున్న ఆడియో రికార్డు అయింది. అంతకుముందు శుక్రవారం రాత్రి కూడా ఈ నౌకపై దాడులు జరిగాయి. అందులోని సిబ్బంది ‘డ్రోన్ దాడి’ అంటూ రేడియోలో అత్యవసర సందేశం పంపారు. ఇటు టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.‘విరాట్’కు స్వల్ప నష్టమే జరిగిందని సమాచారం. ఆ నౌక ప్రస్తుతం స్థిరంగానే ఉందని.. సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. నల్ల సముద్ర తీరం నుంచి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. రష్యా ‘షాడో ఫ్లీట్’Shadow Fleet ట్యాంకర్లపై జరిగిన ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ నౌకల వల్లే యుద్ధం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోందని ఆరోపించింది. అందుకే వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. సీ బేబీ (Sea Baby) డ్రోన్ల ద్వారా ఈ దాడులు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. విరాట్ అనేది రష్యా షాడో ఫ్లీట్ లో భాగమైన ఆయిల్ ట్యాంకర్. షాడో ఫ్లీట్ అనేవి పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకుని రష్యా చమురు రవాణా చేసే నౌకలు.అయితే వీటిపై దాడుల వల్ల నల్ల సముద్రంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఇక సీ బేబీ (Sea Baby) డ్రోన్లు అనేవి ఉక్రెయిన్ అభివృద్ధి చేసిన అన్మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ (USVs). మనుషులు లేకుండా సముద్రంపై నడిచే చిన్న బోట్ల రూపంలో ఉండే డ్రోన్లు. ఇవి ప్రధానంగా కమికాజే దాడులు (తమను తాము పేల్చుకునే దాడులు) చేయడానికి ఉపయోగిస్తారు.Ukrainians attack two tankers of the Russian shadow fleet.According to sources, SBU Sea Baby naval drones attacked the two sanctioned oil tankers KAIRO and VIRAT in the Black Sea. It was a joint operation between the SBU's 13th Main Directorate for Military Counterintelligence… pic.twitter.com/U82scXaM5r— Jürgen Nauditt 🇩🇪🇺🇦 (@jurgen_nauditt) November 29, 2025 -
Russia-Ukraine: యుద్ధం విధ్వంసం నెత్తురోడుతున్న ఉక్రెయిన్
-
ట్రంప్, జిన్పింగ్ మాటామంతి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్ సోమవారం ఉదయం ఫోన్లో మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంతోపాటు తైవాన్, ఉక్రెయిన్ వ్యవహారాలపై వారిద్ద రూ చర్చించుకున్నట్లు అమెరికా, చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల క్రితం దక్షిణ కొరియాలోని బుసాన్లో ట్రంప్, జిన్పింగ్ కలుసుకున్నారు. ఇంతలోనే మరో సారి వారు చర్చించుకోవడం గమనార్హం. తైవాన్ విషయంలో చైనా వైఖరిని జిన్పింగ్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని సమాచారం. తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని ఆయన ట్రంప్కు స్పష్టంచేశారు. -
యూఎస్ శాంతి ప్రణాళికపై జెనీవాలో చర్చలు
జెనీవా: రష్యా దురాక్రమణకు పుల్స్టాప్ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షభవనం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ యర్మాక్ ఎక్స్లో వెల్లడించారు. ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందం పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్ను అవి కోరుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ కూడా పాలుపంచుకున్నారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొనే దిశగా అమెరికా బృందంతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని యర్మాక్ తెలిపారు. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఇప్పటికే కనీసం డజను సార్లు తిరస్కరించిన రష్యా డిమాండ్లనే ఈ ఒప్పందంతో ఆమోదించాల్సి రావడం జెలెన్స్కీకి మింగుడు పడటం లేదు. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగానికి ఎంతో కీలకమైన డోన్బాస్ను రష్యాకు వదిలేయడం, సైన్యాన్ని పరిమితం చేసుకోవడం వంటివి ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి తుది ప్రతిపాదనలు కావని, ఎలాగైనా యుద్ధాన్ని ఆపడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. అయితే, గురువారం కల్లా ఒక స్పష్టతకు రావాలని ఆయన శనివారం ఉక్రెయిన్కు గడువు విధించారు. కాగా, నల్ల సముద్రంపై ఉక్రెయిన్ స్వేచ్ఛగా ధాన్యం రవాణా చేసేందుకు ఉద్దేశించిన గత ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేలా రష్యా అధ్యక్షుడు పుతిన్తో సోమవారం మాట్లాడుతానని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. -
పశ్చిమ ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
కీవ్: ఉక్రెయిన్పై నెలలతరబడి దురాక్రమణ రంకెలేస్తున్న రష్యా బుధవారం ముప్పేటదాడి పాతిక మంది ప్రాణాలను బలితీసుకుంది. పశ్చిమాన ఉన్న టెర్నోపిల్ నగరంపై బుధవారం రష్యా జరిపిన దాడుల్లో ముగ్గురు చిన్నారులుసహా 25 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహర్ కిలిమెంకో ధ్రువీకరించారు. రష్యా ఆక్రమణలను అడ్డుకునేందుకు, దౌత్య మద్దతు కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తుర్కియేకు వచ్చిన సమయంలోనే రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. సిటీలోని రెండు బహుళ అంతస్తుల భవనలపై రష్యా ఎక్స్–101 క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది. దీంతో భవనాలు ధ్వంసమై 73 మంది తీవ్రంగా గాయపడ్డారని కిలిమెంకో వెల్లడించారు. 15 మంది చిన్నారులు రక్తమోడుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. 48 క్షిపణులు, డ్రోన్లుసహా మొత్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రిదాకా 24 గంటల్లో ఏకంగా 476 సార్లు రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది. ఇటీవలికాలంలో రష్యా ఈస్థాయిలో దాడులుచేయడం ఒకేరోజు పాతికమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. పశ్చిమదేశాలు అందించిన అత్యాధునిక ఎఫ్–16 యుద్ధవిమానాలు, మిరాజ–2000 జెట్ల సాయంతో 10 క్రూయిజ్ క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ వెల్లడించింది. మరోవైపు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్తో చర్చల ద్వారా రష్యాను ఏకాకిని చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తానని జెలెన్స్కీ చెప్పారు. -
రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..
ప్రతి శరదృతువులో పాదాల కింద చిందరవందరగా చూసే ఆ పసుపు రంగు ఆకులను చెత్తగా కాకుండా, భూమి భవిష్యత్తును రక్షించే అద్భుత ఆయుధాలుగా భావించాడు అతడు. అతడే, ఇరవై మూడేళ్ల యువ శాస్త్రవేత్త వాలెంటిన్ ఫ్రెచ్కా(Valentyn Frechka). ఉక్రెయిన్కు చెందిన ఒక పర్యావరణ ప్రేమికుడు!ప్రపంచవ్యాప్తంగా కాగితం ఉత్పత్తి కోసం కోట్లాది చెట్లను నరికేస్తున్నారు. ఈ ప్రక్రియ వలన అటవీ నాశనం, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది గమనించిన వాలెంటిన్ ఫ్రెచ్కా, ‘చెట్లను కాపాడే పేపర్ తయారు చేద్దాం!’ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. చెట్లను నరికి కాకుండా, కేవలం పడిపోయిన ఆకుల నుంచే కాగితం తయారు చేసే ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నాడు. ఈ విధానం ద్వారా ఒక టన్ను సెల్యులోజ్ తయారు చేయడానికి 17 చెట్లను కాపాడవచ్చని చెప్పినప్పుడు, ఇది ఎంత పచ్చదనాన్ని బతికిస్తోందో ఊహించండి! 2021లో ‘రీలీఫ్ పేపర్’ అనే సంస్థను స్థాపించి, నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వాడిపోయిన, ఎండిపోయిన ఆకులను సేకరించి, వాటితో బయోడీగ్రేడబుల్, రీసైకిలబుల్ పేపర్ ఉత్పత్తి చేయటం ప్రారంభించాడు. అంతేకాదు, సల్ఫేట్, సల్ఫైట్, క్లోరిన్ వంటి రసాయనాలు ఉపయోగించకుండా, కేవలం ఆవిరి, ఒత్తిడి, మెకానికల్ గ్రైండింగ్ పద్ధతితో ఆకుల నారలను వేరు చేసి పేపర్గా మలుస్తున్నాడు. ఈ పేపర్తో బ్యాగులు, బాక్సులు, కార్డ్బోర్డులు వంటి ప్యాకేజింగ్ వస్తువులు తయారు చేస్తున్నాడు. యుద్ధం మధ్యలో కూడాచిన్న గ్రామమైన సొకిర్నిట్సియాలో పుట్టిన వాలెంటిన్ , చిన్నప్పటి నుంచే ప్రకృతిపై ఆసక్తి ఎక్కువ. అందుకే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా తన సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉత్పత్తి ఆగలేదు. ఫ్రాన్స్కి వెళ్లి అక్కడ నుంచే తన కంపెనీని విస్తరించాడు. ఇప్పుడు అతని సంస్థ యూరప్ అంతటా పలు బ్రాండ్లకు ఎకోఫ్రెండ్లీ ప్యాకేజింగ్ సరఫరా చేస్తోంది. ఇందుకు గాను వాలెంటిన్ ఫ్రెచ్కా యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2024లో ‘యంగ్ ఇన్వెంటర్స్ ప్రైజ్’ ఫైనలిస్ట్గా ఎంపికయ్యాడు. వాలెంటిన్ ఇప్పుడు ఫ్రూట్ బయోవేస్ట్, అనగా అరటి, అనాస, యుకా వంటి ఆకులను కూడా పేపర్గా మార్చే పరిశోధనలో ఉన్నాడు. ‘ప్రతి ఆకు ఒక అవకాశమైతే, ప్రతి ఆవిష్కరణ అవనికి ఆశగా మారాలి’ అనే అతని మాటలు ఇప్పుడు ప్రపంచానికి పాఠంగా, కాగితం రూపంలో భూమిని రక్షిస్తున్నాయి. (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా.. జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు పలు ప్రాంతాలు లక్ష్యంగా రష్యా శుక్రవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో నలుగురు చనిపోగా, 20 మంది వరకు గాయపడ్డారు. కీవ్పై వేకువజామున జరిగిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఇద్దరు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. దాడుల్లో ఒక భవనానికి నిప్పంటుకుంది. కూల్చిన క్షిపణి శకలాలు బహిరంగ ప్రదేశంలో పడిపోవడంతో సమీపంలోని వాహనాలు, భవనాల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.నీప్రోపెట్రోవిస్క్ ప్రాంతంపై జరిగిన మరో దాడిలో ఇద్దరు చనిపోగా ఏడుగురు క్షతగాత్రులయ్యారు. పలు అపార్టుమెంట్ భవనాలు, నివాస గృహాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. రష్యా ప్రయోగించిన 9 క్షిపణులు, 63 డ్రోన్లకు గాను నాలుగు మిస్సైళ్లు, 50 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.పేట్రియాట్లు కొంటాం: జెలెన్స్కీనిత్యం భయపెడుతున్న రష్యా దాడుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు వెంటనే పేట్రియాట్ రక్షణ వ్యవస్థలను తమకు సమకూర్చాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా, యూరప్, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నగరాలకు రక్షణ కల్పించేందుకు అమెరికా నుంచి త్వరలోనే 25 పేట్రియాట్ వ్యవస్థల ను కొనుగోలు చేయనున్నామన్నారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అధ్యక్షతన లండన్లో జరుగుతున్న యూరప్ దేశాల నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక వేళ కాల్పుల విరమణ జర క్కుంటే రానున్న రోజుల్లో రష్యా దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీకి వారు హామీ ఇచ్చారు. -
రష్యా గ్యాస్ ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
కీవ్: కజఖ్స్తాన్ సరిహద్దుల్లో ఉన్న రష్యాకు చెందిన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్పై శనివారం రాత్రి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లు సంభవించడంతోపాటు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, ప్లాంట్ను మూసివేసినట్లు రష్యా, కజకిస్తాన్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాజ్ప్రోమ్ సంస్థకు చెందిన ఒరెన్బర్గ్ ప్లాంట్లో కజఖ్స్తాన్ నుంచి వచ్చే గ్యాస్ను ప్రాసెసింగ్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఒరెన్బర్గ్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 45 బిలియన్ క్యూబిక్ మీటర్లు. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్లాంట్లోని వర్క్షాప్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ప్లాంట్లో తాత్కాలికంగా గ్యాస్ ప్రాసెసింగ్ను నిలిపివేశామన్నారు. రష్యా తమపై సాగిస్తున్న యుద్ధానికి ఇంధన వనరులే కీలకమని భావిస్తున్న ఉక్రెయిన్ తరచూ ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. మరో డ్రోన్ దాడితో ఒరెన్బర్గ్ సమీపంలో నొవొకుయి బషెవ్స్క్ ఆయిల్ రిఫైనరీ ప్రధాన శుద్ధి విభాగం దెబ్బతిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇలా ఉండగా, రష్యా ఆధునీకరించిన గ్లైడ్ బాంబును ఖర్కీవ్లోని లొజావా నగరంపై శనివారం మధ్యాహ్నం ప్రయోగించిందని వెల్లడించింది. యూఎంపీబీ–5 ఆర్ అని పిలిచే రాకెట్ అమర్చిన ఈ రకం బాంబులు 130 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించిన తర్వాత సంభవించే పేలుడుతో తీవ్ర విధ్వంసం సంభవిస్తుంది. -
తూచ్ అదంతా ఉత్తినే.. జెలెన్స్కీకి ట్రంప్ ఝలక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. రష్యాను బెదిరించినట్టే వార్నింగ్ ఇచ్చి.. వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపకపోతే జెలెన్స్కీకి అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఇస్తామని ప్రకటించిన ట్రంప్.. తాజాగా అలాంటిదేమీ లేదని చేతులెత్తేశారు. దీంతో, మరోసారి అందరి ముందూ నవ్వులపాలయ్యారు.ఇక, రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఇందు కోసం ఇప్పటికే పలు రకాల ప్లాన్స్ వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో సైతం ట్రంప్ భేటీ అయ్యారు. కానీ, ఉక్రెయిన్పై రష్యా దాడులు మాత్రం ఆడగం లేదు. ఈ నేపథ్యంలో రష్యా బెదిరించేందుకు ట్రంప్ కొత్త ప్లాన్ చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను జెలెన్స్కీకి ఇవ్వాల్సి వస్తుందని రష్యాను బెదిరించారు. ఇలా అయినా పుతిన్కు దారికి తెచ్చేందుకు పైకి గంభీరంగా ప్రకటన చేశారు.🇺🇸🇺🇦 US President Trump has rejected Ukrainian President Zelensky’s request for more tomahawk missiles in a “tense” White House meeting today. @europa pic.twitter.com/O5OVZFOjA7— EUROPA (@europa) October 18, 2025అయితే, తాజాగా ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్ను జెలెన్స్కీ కలిశారు. ఈ సందర్బంగా తోమహాక్ క్షిపణులపై చర్చించారు. తమకు క్షిపణులను ఇవ్వాలని అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. కానీ, ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఊహించని షాక్ ఇచ్చారు. తోమహక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని ట్రంప్ తెగేసి చెప్పేశారు. తాజా పరిస్థితుల్లో అమెరికా నిల్వలను తగ్గించలేనని.. వాటిని సరి చూసుకోవాలని తెలిపారు. దాని కన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు.Again, Zelensky had a bath with cold water. He expected to get the Tomahawk cruise missiles to counter attacks on Russia. But Kerlmin already made a deal with President Trump. Mr. Putin is trying to delay the peace process because he doesn’t want to lose his power.— Rudra Raya (@RudraRaya) October 18, 2025 ఈ సందర్బంగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు తాను క్షిపణులను ఇవ్వలేనని చేతులెత్తేశారు. అయితే.. తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలను సీరియస్గా తీసుకునేలా చేయవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. మరోవైపు, బుడాపెస్ట్లో సమావేశం తర్వాత క్షిపణుల గురించి ఆలోచిస్తానని ట్రంప్ దానికి బదులు చెప్పారని వైట్హౌస్ అధికారులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్కు క్షిపణులను ఇస్తే అమెరికా-రష్యా సంబంధాలకు హాని కలుగుతుందని, దాని వలన యుద్ధం మరింత సీరియస్ అవుతుందే తప్ప ఏం ఉపయోగం లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. -
ఉక్రెయిన్ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్!
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్కు అమెరికా టోమాహాక్ క్షిపణులు పంపే యోచనపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం అన్ని వైపుల నుండి తీవ్ర రూపం దాల్చడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రష్యా హెచ్చరించింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు టోమాహాక్ క్షిపణులు ఇవ్వడంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్షిపణులను పంపే ముందు, యుద్ధ తీవ్రత పెరగకుండా చూసుకుంటానని తెలిపారు. ఉక్రెయిన్ వాటిని ఎలా ఉపయోగించబోతుందో ముందుగా తెలుసుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ అంశంపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.‘టోమాహాక్ల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది’అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ ప్రభుత్వ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్ని వైపుల నుండి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో అత్యంత ఘోరమైన ఉక్రెయిన్ యుద్ధం. 1962లో జరిగిన క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత, ఇప్పుడు రష్యా–పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అత్యంత తీవ్రమైన ఘర్షణగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. పశ్చిమ దేశాలతో తీవ్రమైన రాజకీయ, దౌత్య వివాదంలో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రష్యా కామెంట్స్పై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల మాట్లాడుతూ, టోమాహాక్ క్షిపణులను అమెరికా సైనికుల ప్రత్యక్ష సహకారం లేకుండా ఉపయోగించడం అసాధ్యం అని అన్నారు. అందువల్ల, ఈ క్షిపణుల సరఫరా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దశకు తీసుకెళ్తుందని హెచ్చరించారు.టోమాహాక్ క్షిపణిటోమాహాక్ క్షిపణి 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. టోమాహాక్ అనేది అమెరికా నేవీ ఐకానిక్ సబ్సెనిక్ కూయిజ్ క్షిపణి. దీనిని 1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీనిని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1,000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితంగా చేదించగలదు. వీటిలో బ్లాక్ ఐవీ (TACTOM) వెర్షన్ అత్యంత అధునాతనమైనది. ఈ సూపర్ వెపన్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడీ క్షిపణులను అమెరికా.. ఉక్రెయిన్కు ఇస్తుంటే రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటన వేళ ట్విస్ట్
మాస్కో: 2025 ఏడాదికిగానూ నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)ప్రకటన వెలువడే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తున్నట్లు రష్యా ప్రకటించింది.ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న కృషిపై రష్యా ఎప్పటికప్పుడు ప్రశంసలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బహుమతి ప్రకటనకు చివరి గంటల్లో రష్యా అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి యూరీ ఉషాకోవ్ పేరిట శుక్రవారం ఉదయం ఒక ప్రకటన వెలువడింది.మరోవైపు.. యుద్ధ విరామం జరిగితేనే తాము కూడా ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్ మద్దతు ఇవ్వనట్లే అని భావించాలి. ఇక..నోబెల్ శాంతి బహుమతి పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతులేని ఆశ పెట్టుకున్నారు. తనవల్లే ప్రపంచంలో పలు దేశాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు ఆగాయని ఒకటే ప్రకటించుకుంటున్నారు. ఒకవేళ ఈ ఏడాది శాంతి బహుమతి రాకుంటే ట్రంప్ ఏం చేస్తారనే ఉత్కంఠ ప్రపంచం మొత్తం నెలకొంది. అదే సమయంలో ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాదిలో ఆయన నోబెల్ కల తీరవచ్చనే విశ్లేషణ ఒకటి నడుస్తోంది. మరికొద్ది సేపట్లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వెలువడనుంది.ఇదీ చదవండి: అందుకే ట్రంప్కు నో నోబెల్! -
‘రష్యా.. పచ్చి అబద్ధం’: ఉక్రెయిన్ అదుపులో భారతీయుడు!?
ఉక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. రష్యా తరపున పోరాడుతున్న ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతను భారతీయుడని తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది(Is Indian Captured By Ukraine Army). ది కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. పట్టుబడిన యువకుడి పేరు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్(22). స్వస్థలం గుజరాత్ మోర్బీ. ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లి.. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా ఉక్రెయిన్కు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని స్టేట్మెంట్తో సదరు మీడియా సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన మజోత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడట. ఏడేళ్ల శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడట. అయితే.. యుద్ధంలో పోరాడితే శిక్షా కాలం తగ్గిస్తామని, ఆర్థికంగా కూడా సాయం అందిస్తామని మజోత్కు రష్యా అధికారులు ఆఫర్ చేశారట. జైల్లో ఉండడం ఇష్టం లేక అందుకు అంగీకరించానని, అయితే ఆ ఒప్పందంపై సంతకం చేసింది అక్కడి నుంచి బయటపడేందుకేనని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. రష్యాలో అంతా పచ్చి అబద్ధం. నాకు ఆర్థిక సాయం అందలేదు. తగ్గిస్తామని అధికారులు చెప్పడం, జైల్లో ఉండడం ఇష్టం లేకనే ఆ ఒప్పందం కుదుర్చుకుని రష్యా తరఫున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్(Special Military Operation)లో పాల్గొన్నానంటూ అతను చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్ స్థావరాన్ని చూడగానే తాను తన రైఫిల్ను పక్కన పెట్టి సాయం కోసం అర్థించానని చెప్పాడతను. తనకు రష్యాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని.. రష్యా జైల్లో మగిపోవడం కంటే ఇక్కడ ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవించడం ఎంతో నయంగా భావిస్తున్నట్లు చెప్పాడతను. Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4— Sidhant Sibal (@sidhant) October 7, 2025మరోవైపు ఈ కథనం తమ దృష్టికీ వచ్చిందని, అయితే ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ చెబుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దురాక్రమణను మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాల యువకులకు గాలం వేసి రష్యా సైన్యం ఉపయోగించుకుంటోందని.. ఉత్తర కొరియా, భారత్.. ఇలా పలు దేశాలకు చెందిన యువకులకు ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుందనే విమర్శ తొలి నుంచి వినిపిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే 48 దేశాలకు చెందిన 1,500 మందికి పైగా విదేశీయులను పట్టుకున్నట్లు(Foreigners Caught in Ukraine War) నివేదికలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోవడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యాలో ఉన్న భారతీయుల్లో 126 మందిని ఉక్రెయిన్ యుద్ధంలో దించారని, అందులో 12 మంది మరణించగా.. మరో 16 మంది ఆచూకీ లేకుండా పోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇదే విషయాన్ని మాస్కో వర్గాల దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ఈ యుద్దంలో చిక్కుకున్న తన పౌరులకు విముక్తి కల్పించాలని కోరింది కూడా. ప్రధాని మోదీ సైతం జోక్యం చేసుకున్న నేపథ్యంలో 96 మందిని రష్యా విడుదల చేసింది. అయితే ఇలాంటి నియామకాలు ఆపేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ నియామకాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలపై గీతా గోపినాథ్ షాకింగ్ రియాక్షన్ -
భారత్లోని జిమ్లే బాగుంటాయ్..! ఉక్రెయిన్ మహిళ మనోగతం..
విదేశీయులు మనదేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ఇష్టపడటం కొత్తేం కాదు, గానీ తాజాగా జిమ్ పరంగా కూడా భారత్నే మేటి అనే కితాబిచ్చేసింది ఓ విదేశీ మహిళ. వాస్తవానికి మనకంటే అత్యాధునిక టెక్నాలజీని అనుసరించే పాశ్చాత్య దేశాలు..ఫిట్నెస్ విషయంలో మనకంటే ముందుంటారు. అలాంటిది భారత్లోని జిమ్ సౌకర్యమే బాగుటుందని చెబుతోంది. ఇక్కడ ట్రైనర్స్ శిక్షణే బాగుంటుందని, ఈ విషయంలో యూరప్ దేశాలు భారత్ని నేర్చుకోవాలంటూ చురకలంటిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఎనిమిదేళ్లకుపైగా భారత్లోనే నివశిస్తున్న విక్టోరియా చక్రవర్తి భారత్ జిమ్లో వ్యాయామాలు చేస్తున్నట్లు పేర్కొంది. యూరోపియన్ ఫిట్నెస్ ఇండస్ట్రీ భారతీయ జిమ్ సౌకర్యం నుంచి చాలా నేర్చుకోవాలని అంటుంది. రూల్స్, సేవలు, వెసులబాటు వరకు అంతా సామాజిక వాతావరణం ఉంటుంది. ఆ పరంగా ఇరు దేశాల మధ్య జిమ్ సంస్కృతిలో చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగు పాఠాలను తప్పక నేర్చుకోవాలని అంటోంది. ఆ నాలుగు పాఠాలు.సరసమైన ధరలో జిమ్ సౌకర్యం దొరుకుతుంది. అధికంగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. అలాగే తక్కువ ధరకే పూర్తి సౌకర్యాలందించే జిమ్లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చిందికమ్యూనిటీ వెబ్: భారతీయ జిమ్లు సామాజికంగా కనిపిస్తాయి. ప్రజలు మాట్లాడుకుంటారు, చిట్కాలు పంచుకుంటారు, ఒకరినొకరు గుర్తిస్తారు, ట్రైనర్ పేరును కూడా తెలుసుకుంటారు. యూరప్లోలా ఎవరికివారుగా ఉండరు. జిమ్లు సాధ్యమైనంత త్వరితగతిన తెరుచుకుంటాయి. నెల ఇట్టే గడిచిపోతుంది. విద్యార్థులు, కొత్తగా నేర్చుకునేవారికి ప్రత్యేక నిపుణుల సూచనతో కూడిన శిక్షణా సౌకర్యం ఉంటుంది. ఈ విషయంలో యూరప్ జిమ్లో వార్షిక ఒప్పందాలు ఉంటాయి. అవి కూడా కఠిన నిబంధనలని అంటోంది విక్టోరియా. అలాగే భారత్లో ట్రైనర్ల సలహాలు సూచనలకు అధనంగా సొమ్ము చెల్లించాల్సిన పని ఉండదు. భారత్లో ఫిట్నెస్ ట్రైనర్లు తమ శిక్షకులకు స్వయంగా మార్గనిర్దేశం చేస్తారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కూడా. ఇలాంటి వ్యక్తిగత శ్రద్ధ కొరకు యూరప్లో అదనంగా చెల్లించాలని అంటోంది. ఫిట్నెస్ పరంగా భారత్ నుంచి యూరప్ చాలా నేర్చుకోవాలని, భారత్లా ఉండాలని అంటోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆమెతో ఏకభవించడమే కాదు, భారతీయ సంస్కృతిని ఇంతలా ఇష్టపడుతున్నందుకు ధన్యావాదాలు చెప్పారు పోస్టులyో. కాగా, సదరు ఇన్ఫ్లుయెన్సర్ విక్టోరియా గతంలో తనను చాలామంది భారత్కు వెళ్లవద్దని సూచించినట్లు వెల్లడించింది. అయితే ఆమె ఇక్కడకి రావడమే గాక ప్రేమలో పడటమేగాక ఇక్కడే వ్యాపారాన్ని కూడా నిర్మించిన తన విజయవంతమైన ప్రస్థానాన్ని అంతకుమునుపే పంచుకుంది కూడా. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty)(చదవండి: నలభై ఏళ్ల తల్లి వెయిట్లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..) -
ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి: జెలెన్స్కీ
యునైటెడ్ నేషన్స్: ప్రపంచ దేశాలన్నీ మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడనంతగా విధ్వంసకర ఆయుధాల రేసులో పరుగులు పెడుతున్నాయని ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ( Volodymyr Zelensky) విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరు బతికి బట్టకట్టాలన్నది ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. ఉక్రెయిన్పై సాగిస్తున్న యుద్ధాన్ని యూరప్ ఖండం అంతటికీ విస్తరించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పుతిన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చారు. యుద్ధాలు ఆపటంలో ఐరాస విఫలం ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను ఆపటంలో ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ సంస్థలన్నీ విఫలమయ్యాయని జెలెన్స్కీ ఆరోపించారు.ఉక్రెయిన్, గాజా(Gaza), సూడాన్.. ఇలా ఏ ఒక్క యుద్ధాన్ని ఆపలేకపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాలు మనుగడ సాగించటానికి అంతర్జాతీయ చట్టాలు ఏమాత్రం ఉపయోగపడటం లేదని మండిపడ్డారు. ‘స్నేహితులు, ఆయుధాలు ఉన్నవారికి తప్ప. ఇతరుల భద్రతకు ఎలాంటి హామీ లేదు’అని పేర్కొన్నారు. కలసి ఉంటే ఎంతో మార్పు తీసుకురాగలమని అన్నారు. రష్యాతో దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తమకు మద్దతుగా నిలిచిన అమెరికా, యూరప్ దేశాలకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూ వెళ్తన్న రష్యా తీరును ఐరాస సభ్యదేశాలన్నీ ఖండించాలని కోరారు.ఇది కూడా చదవండి: ఆ మూడు విధ్వంసాలపై దర్యాప్తు జరగాల్సిందే..‘రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపకపోతే.. మేము కూడా దీనిని మరింత విస్తరిస్తాం. మరింత విధ్వంసకరంగా మారుస్తాం. మొదట ఉక్రెయిన్పై దాడిచేసిన రష్యా.. ఇప్పుడు యూరప్ అంతటా తన డ్రోన్లను తిప్పుతోంది. రష్యా కార్యకలాపాలు ఎప్పుడు ఎల్లలు దాటాయి. జార్జియా, బెలారస్లాగా కాకుండా రష్యాకు జోక్యం నుంచి మాల్దోవా తనను తాను కాపాడుకుంటోంది. యూరప్ ఖండం మాల్దోవాను కూడా కోల్పోకూడదు. ఆ దేశానికి ఇప్పుడు కావాల్సింది రాజకీయపరమైన సానుభూతి కాదు. నిధులు, ఇంధన మద్దతు కావాలి’అని పేర్కొన్నారు. డ్రోన్లతోనే వేలమంది హత్య ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్లతోనే వేలమందిని ఎలా చంపాలో చూపిస్తున్నారని జెలెన్స్కీ అన్నారు. ‘ఇటీవల డ్రోన్ల కారణంగానే యూరప్లో విమానాశ్రయాలు మూసివేయాల్సి వచ్చింది. టాక్టికల్ డ్రోన్ను పరీక్షించినట్లు గత వారమే ఉత్తరకొరియా ప్రకటించింది. అతి తక్కువ వనరులు ఉన్న దేశాలు కూడా ప్రమాదకరమైన డ్రోన్లను తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం మనం మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల రేసు యుగంలో నివసిస్తున్నాం’అని పేర్కొన్నారు. -
భారత్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఇంతలా మారిపోతుందా..?
భారతీయవ్యక్తిని పెళ్లాడటంతోనే ఇంతలా మారిపోతానని అస్సలు అనుకోలేదు. ముఖ్యంగా ఈ మార్పుని అస్సలు ఊహించలేదంటోంది ఓ విదేశీ మహిళ. చాలామంది విదేశీ వనితలు భారత్ అబ్బాయిలను పెళ్లాడి, ఇక్కడి కట్టుబొట్టుకి ఆకర్షితులై తమ లైఫ్స్టైల్నే మార్చుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వ్యక్తుల కోవలోకి తాజాగా ఈ ఉక్రెయిన్ మహిళ కూడా చేరింది. ఎవరామె? అంతలా ఏం మార్చుకుందామె అంటే..ఉక్రెయిన్ మహిళ విక్టోరియా చక్రవర్తి భారతీయ కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టక ముందు, ఆ తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్చేసింది. అది నెట్టింట వైరల్గా మారి, నెటిజన్లను తెగ ఆకర్షించింది. ఆమె ఆ వీడియోలో తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి భారతీయ ఆహారం, స్థానిక పండుగల వరకు ప్రతీది ఎలా తన జీవితంల భాగమైందో తెలిపింది. అలాగే తన జీవింతంలోకి వచ్చిన ఈ మార్పులతో వెల్లివిరిసిన ఆనందం, జాయ్నెస్ గురించి కూడా చెప్పుకొచ్చింది. ప్రధానంగా ఆ మూడు మార్పులు తన జీవితంలోకి భాగమయ్యేలా స్వాగతించానని అంటోంది. అవేంటంటే..చీర నెమ్మదిగా తన వార్డ్రోబ్లో భాగమైంది. అది లేకుండా ఏ పెళ్లికి లేదా ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా ఉండటం ఊహించలేం అన్నంతగా..చేతులతో సాంప్రదాయ ఆహారాన్ని తినడం, చాలా సహజంగా అనిపిస్తుంది. ఏడాదిలో నాకు కొన్ని పండుగలు ఇష్టమైనవిగా మారిపోయాయి. వేడుకల గొప్పదనం, ఆ సంబరం కలిగించే ఆనందం తన మదిలో స్థిరంగా ఉండిపోడమే కాదు సంతోషాన్ని తెచ్చిపెట్టాయని అంటోంది. అందుకు తగ్గట్టుగా ధరించే భారతీయ దుస్తులు అదరహో అనేలా ఉంటాయిని ప్రశంసించింది. అలాగే విక్టోరియాలో భారత్లోనే గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నట్లు చెప్పుకొచ్చింది. చాలామంది తనను భారత్కి వెళ్లొద్దని సూచించారని, కానీ ఇక్కడకు రావడంతో తన జీవనశైలి మారిపోవడమే కాదు, ఎన్నో ఆనంద క్షణాలకు నెలవుగా మారిపోయిందని సంతోషంగా చెబుతోందామె. నెటిజన్లు కూడా భారతీయ దుస్తులు చాలా అందంగా కనిపిస్తున్నారని, మా సంస్కృతిని స్వీకరించినందుకు ధన్యవాదాలు. అలాగే దాన్ని ఇష్టపడతున్నందుకు మరింత సంతోషంగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, విక్టోరియా తను ఇండియాకు రావడాన్ని అందరూ వ్యతిరేకించినా..అక్కడి నుంచే మనకు కొత్త అధ్యయనం ప్రారంభమవ్వడమే కాదు, కొంగొత్త విషయాలు తెలుసుకుంటామని అంటోంది. View this post on Instagram A post shared by Foreigner In India | Influencer | Kolkata | UGC (@viktoriia.chakraborty) (చదవండి: భారత్లో పర్యటించాలనుకుంటే ఈ తప్పిదాలు చెయ్యొద్దు..! విదేశీ యువతి సూచనలు) -
క్షిపణులు, డ్రోన్లతోచెలరేగిన రష్యా
కీవ్: రష్యా మరోసారి ఉక్రెయిన్ వ్యాప్తంగా భారీ దాడులకు తెరతీసింది. శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడటంతో ముగ్గురు చనిపోగా డజన్లకొద్దీ జనం గాయపడ్డారు. రష్యా 579 డ్రోన్లు, 8 బాలిస్టిక్ మిస్సైళ్లు, 32 క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించగా 552 డ్రోన్లను, రెండు బాలిస్టిక్ క్షిపణులను, 29 క్రూయిజ్ మిస్సైళ్లను కూ ల్చివేసినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నిప్రోపెట్రోవిస్క్, మైకోలైవ్, చెర్నిహివ్, జపొరిఝియా, పొల్టావా, కీవ్, ఒడెసా, సుమీ, ఖార్కివ్.. మొత్తం 9 ప్రాంతాల్లోని మౌలికవసతులు, నివాస ప్రాంతాలు, సంస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. పౌరులను రెచ్చగొట్టి, మౌలిక వసతులను దెబ్బతీసేందుకే రష్యా ఉద్దేశపూర్వకంగా ప్రయతి్నస్తోందని ఆరోపించారు. దాడుల కారణంగా నీప్రోపెట్రోవిస్్కలో పలు బహుళ అంతస్తుల భవనాలు, నివాసాలు దెబ్బతిన్నాయని, కనీసం 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. కీవ్ ప్రాంతంలోని బుచా, బొరిస్పిల్, ఒబుఖివ్లపై దాడులు జరిగాయి. ఒక ఇల్లు, కొన్ని కార్లు దెబ్బతిన్నాయి. లివివ్ ప్రాంతంలో రెండు క్రూయిజ్ క్షిపణులను కూల్చివేశామని గవర్నర్ మాక్సిమ్ చెప్పారు. శత్రువు ప్రయోగించిన క్షిపణులను అడ్డుకోవడంలో ఎఫ్–16 యుద్ధ విమానాలు కీలకంగా మారాయన్నారు. కాగా, దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా ప్రయోగించడంతో ఉక్రెయిన్తో సరిహద్దులు పంచుకుంటున్న పోలెండ్ అప్రమత్తత ప్రకటించింది. పోలెండ్, నాటో యుద్ధ విమానాలు ఆ ప్రాంతంలో పహారాను ముమ్మరం చేశాయి. తమ గగనతలంలోకి రష్యా డ్రోన్ ప్రవేశించడంతో అడ్డుకునేందుకు రొమేనియా కూడా గత వారం ఎఫ్–16 జెట్లను పంపించింది.ఎస్టోనియా గగనతలాన్ని అతిక్రమించలేదు: రష్యా ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా శుక్రవారం రష్యాకు చెందిన మూడు యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించి, 12 నిమిషాలపాటు చక్కర్లు కొట్టాయని నాటో సభ్యదేశం ఎస్టోనియా చేసిన ఆరోపణలను రష్యా ఖండించింది. ఎస్టోనియా సరిహద్దుకు మూడు కిలోమీటర్ల దూరంలో బాలి్టక్ సముద్రంపై ఉన్న తటస్థ జోన్లోనే తమ యుద్ధ విమానాలున్నాయని రష్యా రక్షణ శాఖ వివరించింది. -
అతడికి 72, ఆమెకు 27 : జోధ్పూర్లో ఏడడుగులు వేసిన విదేశీ జంట
రాజస్థాన్ విలాసవంతమైన పెళ్ళిళ్లకు పెట్టింది పేరు. తాజాగా జోధ్పూర్లో జరిగిన ఒక రాయల్ వెడ్డింగ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. భారతదేశ సంప్రదాయాలను గౌరవిస్తూ జోధ్పూర్ను ఎంచుకునీ మరి ఒక జంట ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వీరు ఏఇండియన్ సెలబ్రటీలోఅనుకుంటే పొరబాటే. వీరు నాలుగేళ్లపాటు సహజీవనం చేసిన ఒక విదేశీ జంట. బారాత్నుంచి వధువు నుదిటిన తిలకం దిద్దడంవరకు ప్రతీ కార్యక్రమాన్ని అత్యంత సాంప్రదాయ బద్దంగా జరిపించుకోవడం విశేషం పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదవాల్సిందే. హిందూ ఆచారాలపై ప్రేమతో 72 ఏళ్ల వరుడు స్టానిస్లావ్, 27 ఏళ్ల వధువు అన్హెలినా భారతీయ ఆచారాలను స్వీకరించి, సప్తపధిని పాటించారు. వీరివురూ ఉక్రెయిన్కు చెందిన వారు. జైపూర్, ఉదయపూర్, జోధ్పూర్ వేదికలను పరిశీలించి చివరికి జోథ్పుర్లో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఉక్రెయిన్కు చెందిన ఈ జంట నాలుగేళ్లుగా కలిసి ఉంటోంది. జోధ్పూర్ ఎందుకు?రాజస్థాన్ చరిత్ర, జోధ్పూర్ నగర వైభవం, సాంస్కృతిక వారసత్వం , ఐకానిక్ మెహ్రాన్గఢ్ కోట, వారసత్వ ప్రదేశాలు ,ఉత్సాహభరితమైన మార్కెట్లు తదిరరాజ నేపథ్యం వారిని ఆకర్షించింది. ఈ వివాహ సమన్వయ కర్తలు రోహిత్, దీపక్ మాట్లాడుతూ, వధువు అన్హెలినా భారతీయ ఆచారాలకు ఆకర్షితురాలైందని ప్రతి ఆచారాన్ని ప్రామాణికతతో గౌరవించాలని పట్టుబట్టారని వివరించారు.సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన వధూవరులువధూవరులిద్దరూ భారతీయ దుస్తులు ధరించి, వివాహ వేడుకల్లో పూర్తిగా మునిగిపోయారు, సాంప్రదాయ పాటలకు ఆనందంగా నృత్యం చేశారు. వరుడు రాజ షేర్వాణి, రత్నాలు పొదిగిన కాషాయ తలపాగాతో గుర్రంపై రావడంతో వివాహ వేడుకలు ప్రారంభమైనాయి. జోధ్పూర్లోని సుందరమైన ఖాస్ బాగ్లో సాంప్రదాయ టికా వేడుక అతన్ని స్వాగతించింది. ఆపై దండలు మార్చుకున్నారు. అనంతరం వేద మంత్రాల నడుమ, జంటను పవిత్ర హోమం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి స్టానిస్లావ్ అన్హెలినా మెడలో మంగళ సూత్ర ధారణ చేశాడు. ఆమె నుదిటిపై సింధూరం దిద్ది వారి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. View this post on Instagram A post shared by Mo (@mo.of.everything) -
పింఛనుదారుల క్యూలైన్పై రష్యా దాడి
కీవ్: పింఛనుదారుల క్యూలైన్పై రష్యా జరిపిన దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. స్లొవెయాన్స్క్ నగరానికి సమీపంలోని యరోవా గ్రామంలో మంగళవారం ఉదయం పింఛను తీసుకునేందుకు క్యూలైన్లో నిల్చున్న వృద్ధులపై రష్యా యుద్ధ విమానం గ్లైడ్ బాంబును జారవిడిచింది. ఘటనలో 24 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా రిటైర్డు ఉద్యోగులని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ దారుణాన్ని వరి్ణంచడానికి మాటలు చాలవన్నారు. ఇది రష్యా పాల్పడిన క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ప్రపంచ దేశాలు మౌనంగా ఉండరాదనీ, తమపై దురాక్రమణకు పాల్పడినందుకు ప్రతిగా రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించి, ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని పిలుపునిచ్చారు. ఘటనపై రష్యా రక్షణ శాఖ స్పందించలేదు. ఘటనాప్రాంతం దృశ్యాలు, దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న పోస్టల్ శాఖ వ్యాను ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. పోస్టల్ శాఖ ఉద్యోగి సైతం గాయపడ్డారు. -
అమెరికాలో దారుణం..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమెరికాకు శరణార్థిగా వచ్చిన ఉక్రెయిన్ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న కారణంగా యుద్ధభూమిలో ఉండలేక ప్రశాంతమైన జీవితం కోసం ఉక్రెయిన్ మహిళ ఇరినా జరుత్స్కాను (23) అమెరికాకు శరణార్థిగా వచ్చారు. అయితే, ఆగస్టు 22న నార్త్ కరోలినాలోని షార్లెట్లో ఆమె రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.Look at this tragedy, Iryna Zarutska, a 23-year-old Ukrainian war refugee, brutally stabbed to death on a train in Charlotte, North Carolina. And by whom? Decarlos Brown Jr., a career criminal who’s spent his life bouncing in and out of jail like it’s a revolving door!Why on… pic.twitter.com/9CvcgzFKGb— Grim (@MadWokeNews) September 6, 2025ఆమె వెనుక కూర్చున్న నిందితుడు డెకార్లోస్ బ్రౌన్ జూనియర్.. ఇరినాను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం నిందితుడు తర్వాతి స్టాప్లో దిగిపోయాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. అతడికి నేరచరిత్ర ఉన్నట్లు వివరించారు. -
ఉక్రెయిన్పై ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నట్టు భారత్, ఫ్రాన్స్ పునరుద్ఘాటించాయి. ప్రధాని నరేంద్ర మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శనివారం ఫోన్లో సంభాషించారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై ఇరు నేతలు లోతుగా చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మాక్రాన్తో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు మోదీ తెలిపారు. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం తదితరాలను సమీక్షించినట్టు వివరించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనిపెట్టాలన్న వైఖరికే భారత్ తొలినుంచీ గట్టి మద్దతుదారుగా ఉందని పునరుద్ఘాటించారు. ప్రపంచ శాంతి, సుస్థిరతలను పెంపొందించడంలో ఇరు దేశాలు ఇకపై కూడా కీలకపాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఫిబ్రవరిలో భారత్లో జరిగే ఐఏ శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అంగీకరించినందుకు మాక్రాన్కు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తన ఇటీవలి చర్చలు ఫలప్రదంగా సాగాయని మాక్రాన్ పేర్కొన్నారు. -
ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ హత్య
కీవ్: ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ ఆండ్రీ పరుబియ్ గుర్తు తెలియని దుండగుడి కాల్పుల్లో మృతి చెందారు. నగరంలోని ఫ్రాంకివ్స్కీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. ఆండ్రీ పరుబియ్ హత్యను దారుణ ఘటనగా అధ్యక్షుడు జెలెన్స్కీ అభివర్ణించారు. హంతకుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు వెంటనే రంగంలోకి దిగాయన్నారు. 2013–14 మధ్య జరిగిన యూరో మైదాన్ ప్రజా ఉద్యమంలో ఆండ్రీ పరుబియ్ కీలకంగా వ్యవహరించారు. ప్రజా ఉద్యమాల వల్లే అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు యనుకోవిచ్ దేశం విడిచి పారిపోవడం, క్రిమియాను రష్యా ఆక్రమించుకోవడంతోపాటు రష్యా సరిహద్దు ప్రాంతాల్లో అంతర్యుద్ధం మొదలయ్యాయి. రష్యా మళ్లీ తీవ్ర దాడులు ఉక్రెయిన్పై మరోసారి రష్యా భారీ దాడులకు పాల్పడింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఏకంగా 537 డ్రోన్లు, 45 వరకు క్షిపణులను ప్రయోగించింది. జపొరిఝియా ప్రాంతంపై జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా పలువురు చిన్నారులు సహా డజన్ల కొద్దీ పౌరులు గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి.. ఎగసిపడుతున్న మంటలు
కైవ్: రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్లోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతం శనివారం తెల్లవారుజామున భీకర దాడికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. డ్నిప్రో, పావ్లోగ్రాడ్లలో కూడా దాడులు జరిగాయని పేర్కొన్నారు. ⚡#Russia 🇷🇺 #Ukraine 🇺🇦 #Dnipro in #Ukraine's #Dnipropetrovsk region is under heavy drone attack. There have been reports of massive fires after several #Russian drone attacks in the city. pic.twitter.com/rhyiDm1tVt— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) August 7, 2025‘ఈ ప్రాంతం భారీ దాడుల్లో చిక్కుకుంది. పేలుళ్లు శబ్ధాలు వినిపిస్తున్నాయి’అని గవర్నర్ సెర్గి లైసాక్ ‘టెలిగ్రామ్’లో పేర్కొన్నారు. రష్యాలోని క్రాస్నోడార్ క్రైలోని చమురు శుద్ధి కర్మాగారాన్ని ఉక్రేనియన్ డ్రోన్లు ఢీకొట్టిన అనంతరం రష్యా ఈ దాడులకు పాల్పడింది. 🇷🇺🇺🇦 As a result of a massive attack in the Dnipropetrovsk region, enterprises and infrastructure facilities were damaged. pic.twitter.com/EsqnMJWpZI— King Chelsea Ug 🇺🇬🇷🇺 (@ug_chelsea) August 7, 2025‘కైవ్ ఇండిపెండెంట్’ నివేదిక ప్రకారం, స్థానిక సమయం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయని, డ్రోన్లు ఎగురుతున్నాయని స్థానికులు తెలిపారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. చమురు శుద్ధి కర్మాగారంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది. 🇷🇺 ⚡️🇺🇦 #BreakingNews: A massive drone attack is underway in Dnipro, Dnipropetrovsk region.Many drones have impacted within the city, and massive fires have been reported. pic.twitter.com/z1lG07RIGA— #Insider (@insider_der) August 6, 2025 -
సూసైడ్ బోట్ తో ఉక్రెయిన్ నిఘా నౌకను పేల్చేసిన రష్యా
-
ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా.. అతిపెద్ద నౌక ధ్వంసం
కీవ్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి పీక్ స్టేజ్కు చేరుకుంది. తాజాగా ఉక్రెయిన్ నావికా దళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌక సింఫెరోపోల్ను రష్యా ధ్వంసం చేసింది. సముద్ర డ్రోన్ సాయంతో నౌకను రష్యా విజయవంతంగా కూల్చివేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఉక్రెయిన్ నావికాదళానికి చెందిన అతి పెద్ద నిఘా నౌక సింఫెరోపోల్ దశాబ్ద కాలంగా ఉక్రెయిన్ నేవీకి సేవలు అందిస్తోంది. ఇందులో ఉక్రెయిన్కు సంబంధించిన నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాగా, సింఫెరోపోల్ను టార్గెట్ చేసిన రష్యా నౌకను ధ్వంసం చేసింది. సముద్ర డ్రోన్ సాయంతో రష్యా దళాలు.. నౌకను ధ్వంసం చేశాయి. అయితే, సముద్ర డ్రోన్ను రష్యా విజయవంతంగా ఉపయోగించడం ఇదే తొలిసారి అని నిపుణులు చెబుతున్నారు.ఇక, నౌకపై దాడి కారణంగా అందులో ఉన్న రేడియో, ఎలక్ట్రానిక్, రాడార్, ఆప్టికల్ నిఘా విభాగానికి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు.. రష్యా దాడిని ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. ఈ దాడిలో ఒక సిబ్బంది మరణించగా, అనేక మంది గాయపడ్డారని ఉక్రేనియన్ నేవీ ప్రతినిధి చెప్పుకొచ్చారు. ఈ దాడి తర్వాత ఉక్రెయిన్ దళాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇక, రష్యాడ్రోన్ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 🚨⚡️ BREAKING: Russia Unleashes Kamikaze Sea Drones.An unmanned suicide boat from the Black Sea Fleet has just sent the Ukrainian reconnaissance ship "Simferopol" to the bottom at the mouth of the Danube.A new era of naval warfare is here.. 🇷🇺🔥 pic.twitter.com/OnOiHR0LsJ— RussiaNews 🇷🇺 (@mog_russEN) August 28, 2025 -
కైవ్పై రష్యా క్షిపణి దాడి.. 21 మంది మృతి
కైవ్: వరుస దాడులతో ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కైవ్పై రష్యా జరిపిన దాడిలో 21 మంది మృతిచెందారు. ఈ దాడిలో పలు ఆయుధ కర్మాగారాలు దెబ్బతిన్నాయి. రాత్రివేళ డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి రష్యా ఈ దాడులకు తెగబడింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్షిపణుల దాడులతో కైవ్ నగరం దద్దరిల్లింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్లోని యూరోపియన్ యూనియన్ మిషన్, బ్రిటిష్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంతో సహా కైవ్లోని మొత్తం 33 ప్రదేశాలలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఈ సైనిక ఆపరేషన్ పలు ఆయుధ కర్మాగారాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. కీవ్పై దాడులను మాస్కో ధృవీకరించింది. 🚨🇺🇦 KYIV – RUSSIAN ATTACK#BREAKING | Aug 28, 2025Russia launched a large-scale drone & missile attack on Kyiv overnight, killing more than a dozen people and wounding many, while damaging multiple buildings.📰 Source: Fox News#Ukraine #Russia #Kyiv #MissileStrike #Conflict pic.twitter.com/yMlq4oUgWY— NewsX - 24/7 (@NewsX_24_7) August 28, 2025కాగా ఉక్రెయిన్ సైన్యం ఇన్కమింగ్ డ్రోన్లను, క్షిపణులను అడ్డుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 13 ప్రదేశాలలో రష్యా విజయవంతంగా తన దాడులను కొనసాగించింది. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు దాడులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ దాడులలో ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ఉక్ర్స్పెక్సిస్టమ్స్ కార్యాలయం ధ్వంసమయ్యింది. 2014లో నెలకొల్పిన ఉక్ర్స్పెక్సిస్టమ్స్లో మానవరహిత వైమానిక వాహనాలను తయారు చేస్తుంటారు.కాగా టర్కిష్ రక్షణ సంస్థ బేరక్తర్ నిర్వహిస్తున్న కైవ్లోని ఒక ప్లాంట్ను కూడా రష్యా ధ్వంసం చేసింది. -
డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ పై దండెత్తిన రష్యా
-
ఉక్రెయిన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ యుద్ధ గాయాలను నయం చేస్తోంది
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతీసిన మానసిక వేదన నుంచి బయటపడేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రామా రిలీఫ్, ధ్యానం,శ్వాసాభ్యాస కార్యక్రమాలు వేలాది మంది సైనికులు, స్థలచ్యుతులు, పిల్లలకు కొత్త ఆశను అందిస్తున్నాయి.సైనికులకు నిర్వహించిన మొదటి శిక్షణ శిబిరాలు హృదయాన్ని కలచివేశాయి. “వారి చేతులు, కాళ్లు గాయాలతో నిండిపోయాయి. కళ్లలో భయం, ఖాళీతనం స్పష్టంగా కన్పించాయి” అని ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయుడు తెలిపారు. అయితే శ్వాసాభ్యాసాలు నేర్చుకున్న తర్వాత సైనికులు “ప్రశాంతత, భద్రత, స్థిరత్వం”ను అనుభవించినట్లు చెప్పారు.ఉక్రెయిన్ సైనిక నాయకత్వం గురుదేవ్ పనిని అధికారికంగా గుర్తించింది. బెటాలియన్ కమాండర్ స్వయంగా గురుదేవ్కు గౌరవ పురస్కారం అందజేస్తూ, “బాంబులు పడితే మేము పోరాడాము, కానీ మాలోని ఖాళీతనం, కోపం, ద్వేషం గురించి ఎవరూ మాట్లాడలేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సుల తర్వాత మా జీవితాలు మారాయి. గాయాలతో ఉన్నవారే ఇప్పుడు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తున్నారు” అని పేర్కొన్నారు.అంతేకాక, నాయకత్వ శిక్షణలు కూడా సైన్యానికి సహాయపడ్డాయి. “అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఈ శిక్షణ పెంచింది” అని సైన్యం అభినందించింది.2014 నుండి సైన్యంలో మోరల్ అండ్ సైకాలజికల్ సపోర్ట్ విభాగంలో పనిచేస్తున్న నటాలియా ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. చిన్న గుంతల్లో దాక్కున్న సైనికుల్లో ఒకరు భయంతో కదలలేకపోయిన పరిస్థితిని వివరించారు. “అప్పుడు అతనికి విజయ శ్వాస గుర్తొచ్చింది. అది అతని ప్రాణం మాత్రమే కాకుండా మరో నలుగురి ప్రాణాలను రక్షించింది” అని ఆమె తెలిపారు.2022 నుండి ఇప్పటి వరకు 8,000 మందికి పైగా సైనికులు, స్థలచ్యుతులు, ఆక్రమిత ప్రాంతాల పిల్లలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందారు. వాలంటీర్లు ప్రమాదాలను లెక్క చేయకుండా సేవ చేస్తున్నారు. “అత్యవసరంగా అవసరమైన వారికి తోడుగా ఉండటం మాకు గౌరవం” అని ఒక ఇన్స్ట్రక్టర్ చెప్పారు.యుద్ధం ఎన్నో ప్రాణాలు, కలలను తీసుకుపోయినా, గురుదేవ్ అందిస్తున్నది శాంతి, ఆశ, తిరిగి నిర్మించుకునే శక్తి. “శాంతి అంటే సంఘర్షణ లేకపోవడం కాదు, కరుణ ఉనికిలో ఉండడం” అని ఆయన అన్నారు. ఉక్రెయిన్లో చీకటి నడుమ వెలుగుకి మార్గం చూపుతున్న ఆ కరుణ ఇప్పుడు వేలాది హృదయాలకు ఆధారమవుతోంది. -
ఉక్రెయిన్కు 3,350 క్షిపణులు పంపనున్న అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. 850 మిలియన్ డాలర్ల విలువైన 3,350కి పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ఈఆర్ఏఎమ్) క్షిపణులను ఉక్రెయిన్కు అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ ఆయుధ ప్యాకేజీకి యురోపియన్దేశాలు నిధులు సమకూరుస్తున్నాయి. ఆరు వారాల్లో ఈ క్షిపణులు కీవ్కు చేరుకుంటాయి. ఇవి ఎప్పుడో ఉక్రెయిన్కు చేరాల్సి ఉండగా.. రష్యా అద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల నేపథ్యంలో కొంత ఆలస్యం అయ్యాయి. వీటిలో 240 నుంచి 450 కి.మీ. పరిధి కలిగిన ఈ ఈ ఆర్ఏఎమ్ క్షిపణులు ఉన్నాయి. -
రష్యా అణు ప్లాంట్పై దాడి
మాస్కో: రష్యాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన కస్క్ అణు విద్యుత్కేంద్రంపై శనివారం రాత్రి డ్రోన్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపించింది. దేశవ్యాప్తంగా పలు ఇంధన, విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి దాడులకు దిగిందని మండిపడింది. ‘‘కస్క్ అణు కేంద్రంపై దాడిలో ఒక ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింది. మంటలను వెంటనే ఆర్పేశాం. ఒక రియాక్టర్లో ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. అయితే అణు ధారి్మకత ముప్పేమీ లేదు’’ అని పేర్కొంది. ‘‘ఉస్త్–లుగాలోని ఇంధన ఎగుమతుల టెర్మినల్పై దాడితో మంటలు చెలరేగాయి. అక్కడ 10 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశాం. దేశవ్యాప్తంగా 95 డ్రోన్లు, మిసైళ్లను ధ్వంసం చేశాం. రష్యా ప్రయోగించిన 48 డ్రోన్లను అడ్డుకున్నాం. డొనెట్స్్కలో రెండు గ్రామాలను స్వా«దీనం చేసుకున్నాం. పశ్చిమ ఉక్రెయిన్లో భీకర పోరు కొనసాగుతోంది’’ అని పేర్కొంది. ఓడిపోబోం: జెలెన్స్కీ ‘‘ఉక్రెయిన్ బాధిత దేశం కాదు, పోరాటయోద్ధ. రష్యాతో పోరులో ఇంకా గెలవకున్నా, ఓడిపోయే ప్రసక్తి మాత్రం లేదు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. రాజధాని కీవ్లో ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఉక్రెయిన్ స్వాతంత్య్ర పరిరక్షణకు రాజీలేని పోరు కొనసాగిస్తామన్నారు. కెనడా ప్రధాని కార్నీ ఆదివారం కీవ్లో జెలెన్స్కీతో మంతనాలు జరిపారు.త్వరలో భారత్కు జెలెన్స్కీ!ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. శనివారం ఆయనతో ఫోన్ సంభాషణ సందర్భంగా ప్రధాని మోదీ ఈ మేరకు ఆహ్వానించారు. పర్యటన తేదీ త్వరలోనే ఖరారయ్యే అవకాశముందని ఉక్రెయిన్ పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ పర్యటన కీలక మైలురాయిగా మారనుందని అభిప్రాయపడింది. -
రష్యాకు రెండు వారాల గడువిస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు రెండు వారాల అల్టిమేటం ఇచ్చారు. అప్పటి వరకు తగు రీతిలో స్పందించకుంటే రష్యాపై ఆంక్షలు విధించాలా లేదా సుంకాలతో బాదాలా అనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఉక్రెయిన్లోని అమెరికాకు చెందిన ఎల్రక్టానిక్ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి దాడి నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ఇటీవల అమెరికాలోని అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయంటూ ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రష్యా దాడితో తాను సంతోషంగా లేనని, పరిస్థితిని మరోసారి సమీక్షిస్తానని ట్రంప్ అన్నారు. తదుపరి చర్యలను రెండు వారాల్లో ప్రకటిస్తానని పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ మధ్య సంక్షోభం తెలివితక్కువైంది. వారానికి 7 వేల మంది, అంతకంటే ఎక్కువ మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ పోరాటాన్ని ఆపాలనుకుంటున్నా, అయితే, ఇప్పుడది కష్టతరంగా మారింది’అని ట్రంప్ అన్నారు. -
ఆగని రష్యా, ఉక్రెయిన్ దాడులు
-
కాస్త తగ్గిన పుతిన్? ట్రంప్, జెలెన్స్కీ ‘నో’ కామెంట్స్
నాలుగేళ్ల తర్వాత అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగానే ఈ సమావేశం జరిగిందన్నది తెలిసిందే. అయితే ఆ మీటింగ్ సారాంశమేమీ ఇప్పటిదాకా బయటకు రాలేదు.ఆగస్టు 15వ తేదీన మూడు గంటలపాటు రహస్య మంతనాలు చేసిన ఈ ఇరుదేశాల నేతలు.. సంయుక్త మీడియా సమావేశంలో తాము చెప్పాలనున్నది చెప్పి తలోదారి వెళ్లిపోయారు. దీంతో భేటీ సంతృప్తికరంగా జరగలేదనే విశ్లేషణలు నడిచాయి. అయితే తాజాగా ఆ భేటీలో ఉక్రెయిన్కు పుతిన్ చేస్తున్న(అలస్కాలో చేసిన) డిమాండ్లు ఏంటో ప్రస్తావిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్ష కార్యాలయం ‘క్రెమ్లిన్’ వర్గాలు వెల్లడించిన ఆ డిమాండ్లను పరిశీలిస్తే..డోన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా అప్పగించడంనాటోలో చేరాలనే ఆలోచనను పక్కనపెట్టేయడంపశ్చిమ బలగాల మోహరింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదుఉక్రెయిన్పై ఒత్తిడి తగ్గించిన పుతిన్?వాస్తవానికి ఈ మూడు పాత డిమాండ్లే! మరి కొత్తగా పుతిన్ ఏం చెబుతున్నారంటే.. 2024 జూన్లో ఉక్రెయిన్కు పెట్టిన కఠినమైన భూభాగాల డిమాండ్లను కొంత మేర తగ్గించినట్టు రష్యా వర్గాలు అంటున్నాయి. పాత డిమాండ్లను పరిశీలిస్తే.. డోనెత్స్క్(Donetsk), లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను పూర్తిగా రష్యాకు అప్పగించాలి. నాటో సభ్యత్వాన్ని త్యజించాలి. పశ్చిమ దేశాల బలగాలు ఉక్రెయిన్లో మోహరించకూడదు.కొత్త ప్రతిపాదనల్లో.. ఉక్రెయిన్ డోన్బాస్లో తన నియంత్రణలో ఉన్న భాగాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గాలి. రష్యా జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాల్లో ప్రస్తుత యుద్ధ రేఖలను నిలిపివేస్తుంది. ఖార్కివ్, సుమీ, డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించిన చిన్న భాగాలను తిరిగి అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం.. డోన్బాస్లో 88%, జపోరిజ్జియా, ఖెర్సన్లో 73% రష్యా నియంత్రణలో ఉంది.అయితే.. నాటో విస్తరణపై నిషేధం, ఉక్రెయిన్ సైన్యంపై పరిమితులు, పశ్చిమ శాంతి బలగాల మోహరింపు నిషేధం వంటి పాత డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి. అదే సమయంలో.. 2022 ఇస్తాంబుల్ ఒప్పందాలను పునరుద్ధరించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. ఇందులో ఐరాస భద్రతా మండలి నుంచి ఉక్రెయిన్కు భద్రతా హామీలు పొందే ప్రతిపాదన ఉంది.ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. గతంలో ఈ డిమాండ్లను "సరెండర్" (లొంగిపోవడం)గా అభివర్ణించిన తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, రష్యా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వెనక్కి తగ్గే ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు.డోనెత్స్క్, లుహాన్స్క్(Donetsk) కలిపిన డోన్బాస్ ప్రాంతం ఉక్రెయిన్కు రక్షణ కోటగా పనిచేస్తుందని జెలెన్స్కీ మొదటి నుంచి చెబుతున్నారు. ‘‘తూర్పు ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం అంటే దేశం ఉనికి కోల్పోవడం’’ అని అంటున్నారాయాన. ‘‘ఇది మా శక్తివంతమైన రక్షణ రేఖల అంశం’’ అని కుండబద్దలు కొట్టారు. ఇక.. నాటో సభ్యత్వం.. రాజ్యాంగబద్ధ లక్ష్యమని చెప్పారు. పైగా దీనిని ఉక్రెయిన్కు భద్రతా హామీగా భావిస్తున్నారు. నాటో సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు రష్యాకు లేదు అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్, నాటో రష్యా కొత్త ప్రతిపాదనలపై ఇప్పటివరకైతే స్పందించలేదు.అలాస్కాలోని అంకరేజ్ నగరంలో జరిగిన అమెరికా-రష్యా అధ్యక్షులు భేటీ తర్వాత శాంతికి ఉత్తమ అవకాశాలు ఏర్పడినట్టు క్రెమ్లిన్ వర్గాలు అంటున్నాయి. అయితే.. డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం రాజకీయంగా, వ్యూహపరంగా అసాధ్యమైన విషయని పరిశీలకులు అంటున్నారు. రెండు పక్షాలకు అంగీకారయోగ్యంగా లేని షరతులతో శాంతి ప్రతిపాదనలు చేయడం.. ట్రంప్కు షో మాత్రమే కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.అస్పష్టతలు & అడ్డంకులుఉక్రెయిన్ డోన్బాస్ను అప్పగించేందుకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై రష్యాకు స్పష్టత లేదు.అమెరికా రష్యా ఆక్రమించిన భూభాగాలను గుర్తిస్తుందా? అనే ప్రశ్న కూడా ఇంకా పరిష్కారమవ్వలేదు.జెలెన్స్కీ అధికార బాధ్యతపై పుతిన్ సందేహాలు వ్యక్తం చేశారు, కానీ కీవ్ ఆయనను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా పేర్కొంటోంది.ట్రంప్ పాత్రఉక్రెయిన్ యుద్ధం ముగించి.. తానొక శాంతి కాముకుడిననే విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పుతిన్, జెలెన్స్కీలతో విడిగా భేటీ అయిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. -
డ్రోన్లు, క్షిపణులతో రెచ్చిపోయిన రష్యా
కీవ్: రష్యా మరోసారి భీకర గగనతల దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బుధవారం రాత్రి ఏకంగా 574 డ్రోన్లు, మరో 40 వరకు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. మూడేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య పరమైన ప్రయత్నాలు ఊపందుకున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోని పశ్చిమ ప్రాంతాలు లక్ష్యంగా రష్యా చేపట్టిన ఈ దాడుల్లో ఎక్కువగా జనావాసాలకు నష్టం జరిగిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. ఈ ఏడాదిలో రష్యా జరిపిన మూడో అతిపెద్ద డ్రోన్ దాడి, 8వ క్షిపణి దాడి ఇదని వివరించింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు చనిపోగా 15 మంది గాయపడ్డారంది. పశి్చమ దేశాలు అందించిన ఆయుధ సామగ్రి గోదాములు, ఉక్రెయిన్ సైనిక పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. కొన్ని క్షిపణులు హంగరీ సరిహద్దులకు సమీపంలో పడ్డాయని, అమెరికా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ ఒకటి ధ్వంసమైందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఫ్లెక్స్ ఫ్యాక్టరీలో 600 మంది పనిచేస్తున్నారన్నారు. వీరిలో దాడి కారణంగా ఆరుగురికి గాయాలైనట్లు వెల్లడించారు. లీవ్ నగరంపై జరిగిన దాడిలో 26 నివాస భవనాలు దెబ్బతిన్నాయన్నారు. -
జెలెన్స్కీతో మాట్లాడతా
వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధానికి ఆఖరి గడియలు దగ్గర పడిన సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై ఆక్రమణాగ్రహంతో రగిలిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు కాస్తంత మెత్తబడినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరుస్తూ పుతిన్ స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపేందుకు అంగీకరించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం ప్రకటించారు. మంగళవారం అమెరికాలో ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థకు ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో రూబియో ఈ విషయం వెల్లడించారు.‘‘జెలెన్స్కీతో భేటీకి తాను ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నట్లు స్వయంగా పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్లో చెప్పారు. ఖచి్చతంగా జెలెన్స్కీని కలుస్తానని ట్రంప్కు పుతిన్ మాటిచ్చారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత జెలెన్స్కీతో పుతిన్ భేటీకి సమ్మతి తెలపడం శాంతిస్థాపన బాటలో కీలక ముందడుగు. అయితే జెలెన్స్కీ, పుతిన్ భేటీ అయ్యాక వెంటనే ఇద్దరు మంచి మిత్రులుగా మారతారని నేను అనుకోవట్లేదు. భేటీ జరిగిందంటే ఏకంగా శాంతి ఒప్పందం కుదిరిందని ఇప్పుడే భావించడం తొందరపాటే అవుతుంది. ఎన్నో అంశాలపై స్పష్టతరావాల్సి ఉంది.మరెన్నో అంశాలపై విస్తృతస్థాయి చర్చ జరగాల్సి ఉంది. గత మూడున్నరేళ్ల యుద్దకాలంలో రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు సంయమనంతో మాట్లాడుకున్నదే లేదు. ఈ ధోరణే ఇన్నాళ్లూ రణరంగంలో మరింత రక్తంచిందేలా చేసింది. మరణాలు, మారణహోమాలకు యుద్ధం చిరునామాగా మారింది. కానీ ఇప్పుడు కాస్తంత సుహృద్భావ వాతావరణంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు మాటలు కలిపారు. తొలుత పుతిన్, జెలెన్స్కీ ముఖాముఖి భేటీ ఉంటుంది. ఇది సత్ఫలితాలనిస్తే ఆ తర్వాత ఇరునేతలకు ట్రంప్ జతకూడుతారు. అప్పుడు త్రైపాక్షిక సమావేశం సాకారమవుతుంది’’అని రూబియో అన్నారు. ఇరుపక్షాలకు అనువైన చోటే భేటీ: ట్రంప్ జెలెన్స్కీ, పుతిన్లకు అనువైన ప్రదేశంలోనే త్రైపాక్షిక సమావేశం నిర్వహిస్తామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు.‘‘సోమవారం మధ్యాహ్నం శ్వేతసౌధానికి విచ్చేసిన విశిష్ట అతిథులతో చక్కని సమావేశం జరిగింది. ఐరోపా సమాఖ్య సభ్యదేశాల అగ్రనేతలతో సంయుక్త భేటీలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం. త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న మా ఉమ్మడి నిర్ణయాన్ని వెంటనే పుతిన్కు ఫోన్చేసి చెప్పా. ఆయన అందుకు సమ్మతించారు.త్వరలోనే ఈ భేటీ ఉంటుంది. జెలెన్స్కీ, పుతిన్కు అనువైన నగరంలోనే తొలుత వాళ్లిద్దరూ సమావేశమవుతారు. ఇది చక్కటి ఫలితాన్నిచ్చాకే నేను వాళ్లతో కలిసి త్రైపాక్షి సమావేశాన్ని నిర్వహిస్తా. ఈ భేటీకి సాకారం చేసేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి రూబియో, నా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ చెమటోడుస్తున్నారు’’అని ట్రంప్ అన్నారు. -
సంధి సాధ్యమేనా?!
పరస్పరం కలహించుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంధి కుదర్చటానికీ, సామరస్యం సాధించటానికీ అలాస్కా శిఖరాగ్ర సమావేశానికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అనధికార అధికార ప్రతినిధిగా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే కఠినాతికఠినంగా వ్యవహరిస్తామని అలాస్కా సమావేశానికి ముందు హెచ్చరించిన ఆయన... కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని, శాంతి ఒప్పందం కోసం చర్చలు జరగాలని చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం వైట్హౌస్లో తనను కలిసినప్పుడు సైతం ఇలాంటి సలహాయే ఇచ్చారు. దీన్ని ఏదో మేరకు సరిదిద్ది, ఉక్రెయిన్కు కనీస భద్రత గ్యారెంటీనైనా సాధించాలన్న ధ్యేయంతో ఆరుగురు యూరొప్ దేశాల నేతలు ట్రంప్తో భేటీ అయ్యారు. అమెరికాతో పాటు రష్యా, ఉక్రెయిన్లు పాల్గొనే త్రైపాక్షిక చర్చలకు సుముఖంగా ఉన్నామని ట్రంప్ చెప్పటం ఉన్నంతలో ఊరటనిచ్చే అంశం. కానీ ట్రంప్ దానికైనా కట్టుబడతారా లేదా... పుతిన్ను ఒప్పించగలరా లేదా అన్నది చెప్పలేం. జెలెన్స్కీకి మొన్న ఫిబ్రవరిలో వైట్హౌస్లో ఎదురైన చేదు అనుభవాలను నివారించి, ఆయన వెనక యూరప్ దేశాలన్నీ ఉన్నాయని చెప్పటానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడెరిక్ షుల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు కలిశారు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్నార్థకం. ఉక్రెయిన్కు ‘నాటో తరహా’ భద్రత కల్పించటానికి ట్రంప్ అనుకూలమే గానీ అదంతా యూరప్ దేశాలే చూసుకోవాలట. తమ వంతుగా గగనతల రక్షణ విషయంలో సాయంగా నిలుస్తారట! అసలు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఏం చేస్తారనే ఆదుర్దా కన్నా ఆయన నాటో పక్షాన ఉంటారా ఉండరా అనే బెంగ ఎక్కువైంది. జెలెన్స్కీతో మళ్లీ ఆయన లడాయికి దిగితే అటుతర్వాత తాము సైతం మాట్లాడే స్థితి ఉండకపోవచ్చన్న భయంతోనే యూరప్ అధినేతలు వైట్హౌస్కు వెళ్ళినట్టు కనిపిస్తోంది. కోల్పోయిన భూభాగాల గురించీ, నాటో సభ్యత్వం గురించీ మరిచిపోవాలని తొలుత తనను కలిసిన జెలెన్స్కీకి చెప్పటంతో పాటు యూరప్ దేశాధినేతల ముందు కూడా ట్రంప్ ఆ మాటే అనటం గమనించదగ్గది. ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన నాటి నుంచీ పుతిన్ చెప్పిన మాటల్నే ట్రంప్ ఇప్పుడు వల్లిస్తున్నారు. చాలా అంశాల్లో పుతిన్కూ, తనకూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన ఇప్పటికే ప్రకటించారు. పుతిన్ దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆక్రమించిన క్రిమియాలో పలు పట్టణాలు, నదులూ, పర్వతశ్రేణులూ ఉన్నాయి. విలువైన పంటభూములున్నాయి. ఇవిగాక మూడున్నరేళ్లకు పైగా సాగుతున్న దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలున్నాయి. వీటిని వదులుకోవటమంటే జెలెన్స్కీకి ఆత్మహత్యా సదృశం. అయినా తమ కోసం ట్రంప్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సి వచ్చింది. జెలెన్స్కీకి అంతకన్నా గత్యంతరం లేదు. ఉక్రెయిన్కి ప్రస్తుతం అందుతున్న సాయంలో 47 శాతం వాటా అమెరికాదే. జర్మనీ 9, బ్రిటన్ 8, జపాన్ 6 శాతాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కెనడా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫ్రాన్స్ వంటివి ఒకటి, రెండు శాతాలకు మించి ఇవ్వడం లేదు. అందుకే జెలెన్స్కీ నోరెత్తలేకపోతున్నారు.అమెరికా గత పాలకుల ప్రాపకంతో ఉక్రెయిన్ను రెచ్చగొట్టి, రష్యాతో గిల్లికజ్జాలకు దిగేలా చేసిన యూరప్ దేశాలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుబోని దుఃస్థితి. నెలక్రితం ట్రంప్తో మాట్లాడాక అంతా సామరస్యంగా పరిష్కారమైందని, ఉక్రెయిన్ విషయంలో తమను సంప్రదించకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోబోరని యూరప్ దేశాధినేతలు నమ్మారు. అలాస్కా శిఖరాగ్రానికి వారం రోజుల ముందు కూడా వారంతా ట్రంప్ను కలిశారు. ఆ భేటీకి జెలెన్స్కీని కూడా తీసుకెళ్లారు. ముందు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాలనీ, ఆ తర్వాతే ద్వైపాక్షికమో, త్రైపాక్షికమో చర్చలుండాలనీ ఆ భేటీలో అందరూ అభిప్రాయపడ్డారు. తాజాగా ట్రంప్ త్రైపాక్షిక చర్చల గురించి మాట్లాడుతున్నా పుతిన్ అందుకు సుముఖంగా ఉంటారా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. ఆ మాటెలా ఉన్నా అలాస్కా శిఖరాగ్రం భారత్కు ఎంతో కొంత మేలు చేసిందని చెప్పాలి. రష్యాపై ఆగ్రహంతో మనపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఆ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు చెబుతున్న మాటకు కట్టుబడి సాధ్యమైనంత త్వరలో త్రైపాక్షిక చర్చలకు ట్రంప్ చొరవ తీసుకుంటే... పుతిన్ను ఒప్పిస్తే అది శాంతికి దోహదపడుతుంది. -
శాంతి సాధనలో మూడు ముక్కలాట
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో, 18 నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయ కులతో జరిపిన చర్చలు ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. అందుకు సంబంధించి ఉండిన చివరి అనుమానాలు 18 నాటి వైట్ హౌస్ సమావేశంతో తీరిపోయాయి. అంతకుముందు 15న అలాస్కాలో ట్రంప్, పుతిన్ల మధ్య జరిగిన చర్చలలో కనిపించిన సానుకూలతను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయకులు వైట్హౌస్ సమావేశంలో భంగపరచవచ్చుననే సందేహా లుండేవి. శాంతి ప్రయత్నాలకు ముందు కాల్పుల విరమణ జరిగి తీరాలనే పట్టుదలతో ఉండిన ఆ బృందం, ట్రంప్ ఆలోచనను తిరిగి మార్చవచ్చుననే భావన చాలా మందికి కలిగింది. కానీ, అది గ్రహించి కావచ్చు 18 నాటి చర్చలకు ముందు రాత్రే ట్రంప్, కేవలం కాల్పుల విరమణ వల్ల ఉపయోగం లేదనీ, పూర్తి స్థాయిలో శాంతి కోసం ప్రయత్నం జరగాలనీ స్పష్టం చేశారు.పుతిన్ వాదనను అంగీకరించిన ట్రంప్అంతిమంగా అలాస్కా, వైట్ హౌస్ భేటీల సారాంశం ఏమిటి? మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంపై అమెరికా, రష్యా అధ్యక్షులు మొదటిసారి సమావేశమయ్యారు. వెంటనే కాల్పుల విరమణకు పుతిన్ను ఒత్తిడి చేయగలనని, అందుకు సమ్మతించని పక్షంలో తీవ్ర మైన చర్యలు తీసుకోగలనంటూ వెళ్లారు ట్రంప్. అక్కడ మూడు గంటల చర్చలలో పుతిన్ ఇచ్చిన సుదీర్ఘమైన వివరణలతో పూర్తిగా సంతృప్తి చెంది, కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని,సంపూర్ణ స్థాయిలో శాంతి సాధనే సరైన మార్గమనే వాదనతో అంగీ కరించారు. చంచల స్వభావిగా పేరున్న ఆయన అటువంటి అభిప్రా యంపై స్థిరపడటం ఈ కథాక్రమంలోని కీలకమైన మలుపు. పుతిన్ వాదన నచ్చినప్పటికీ అట్లా స్థిరపడక పోయి ఉంటే, యూరోపియన్ల సమావేశంలో తన ఆలోచనను తిరిగి మార్చుకునే వారేమో! అపుడు విషయం మళ్లీ మొదటికి వచ్చేది. జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ షుల్జ్, యూరోపియన్ నాయకుల తరఫున మాట్లాడుతూ, శాంతి చర్చల కన్నా ముందు కాల్పుల విరమణ తప్పనిసరియని వాదించారు. కానీ ట్రంప్ జర్మనీ ఛాన్స్లర్ మాటను తోసిపుచ్చారు.ఈ ఒక్క విషయమే ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, ఈ దశలో మొత్తం విషయమంతా అమెరికా అధ్యక్షుడు ఎవరి వాదనను అంగీకరించి ముందుకు పోగలరన్న దానిపైనే ఆధారపడి ఉంది. ఇపుడు రెండు చర్చల అనంతరం అందుకు స్పష్టత వచ్చినందున ఇతర విషయాలను చూద్దాము. అవి ప్రధానంగా మూడు. ఒకటి– రష్యా కోరుతున్న భూభాగాలను ఉక్రెయిన్ వదలుకోవటం; రెండు– ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకపోవటం; మూడు– ఉక్రెయిన్కు భవిష్యత్తులో భద్రత కోసం రక్షణ హామీలు లభించటం. ఈ మూడు అంశాలు కూడా అలాస్కాలో, వైట్ హౌస్లో ప్రస్తావనకు వచ్చాయి. రష్యా తాను ఇప్పటికే పూర్తిగానో, పాక్షికంగానో ఆక్రమించిన క్రిమియా, డొనెటెస్క్, జపోరిజిజియా, ఖేర్సాన్, లుహాన్స్క్, ఖార్కివ్ ప్రాంతాలను తమకు అప్పగించటం, ఆ యా నియంత్రణ రేఖలను అదే స్థాయిలో స్తంభింపజేయటం జరగాలని కోరుతున్నది. అవి అన్నీ కాకపోయినా ఏదో ఒక మేరకు వదులుకోవాలని ట్రంప్ మొదటినుంచి అంటున్నారు. యూరోపియన్ నాయకుల వైఖరి ఇంచుమించు అదే! వైట్ హౌస్ చర్చల సందర్భంలో అవుననక, కాదనక... అది జెలెన్స్కీ తేల్చుకోవలసిన విషయమని వదలి వేశారు. భూభాగాలను వదలుకొనే ప్రసక్తి లేదని జెలెన్స్కీ అంటూనే, అది తనకు, పుతిన్కు, ట్రంప్కు మధ్య త్రైపాక్షిక చర్చ లలో తేలుతుందని మరొకవైపు సూచిస్తున్నారు. ఈ పరిణామాల న్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు, రష్యా డిమాండ్లలో ఒకటి కొలిక్కి రాగల అవకాశాలు సూత్రరీత్యా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకూడదు...‘నాటో’లో ఉక్రెయిన్ సభ్యత్వం విషయానికి వస్తే, రష్యా డిమాండ్కు అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నారు. అసలు ఉక్రెయిన్ ఆ సంస్థలో చేరాలనుకోవటమే రష్యా అభద్రతా భావానికి, ఈ దాడికి మూల కారణమని కూడా అన్నారు. అటువంటి వైఖరి తీసుకున్న తర్వాత ఇక ఉక్రెయిన్ ఆ సైనిక కూట మిలో చేరగల అవకాశం ఉండదు. వాస్తవానికి అందులో చేరాలనే మాట ఉక్రెయిన్ రాజ్యాంగంలో లాంఛనంగా ఉన్నప్పటికీ, ఆ పట్టుదల యూరోపియన్ దేశాలదే! రష్యాను క్రమంగా చుట్టుముట్టి, ఛిన్నాభిన్నం చేయాలన్నది వారికి గతం నుంచి గల దీర్ఘకాలిక ప్రణాళిక. అయితే, ఈ ఒప్పందాల క్రమంలో ఉక్రెయిన్ తామిక ‘నాటో’లో చేరబోమంటూ రాజ్యాంగపరంగా ప్రకటించవలసి ఉంటుందన్నది రష్యా డిమాండ్. అది జరగాలని ట్రంప్ కూడా ఒత్తిడి చేయవచ్చు. అదే జరిగితే యూరోపియన్ నాయకులు చేయ గలిగింది ఉండదు. ఆ విధంగా శాంతి సాధనకు మరొక అడ్డంకి తొలగిపోతుంది. ఉక్రెయిన్లోని రష్యన్ జాతీయుల హక్కుల పరి రక్షణ వంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి గానీ, ఇతరత్రా గల ప్రధాన సమస్యలు పరిష్కారమైనపుడు అవీ కావచ్చు.ఉక్రెయిన్కు ఆందోళనకరంగా ఉన్న ప్రధానాంశం తమ రక్షణ. చర్చలలో రష్యా అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా అందుకు కొన్ని సడలింపులు చూపటం శాంతి సాధనకు మార్గాన్ని సుగమం చేసింది. అక్కడ ట్రంప్తో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్కు భద్రత ఏర్పడటం తప్పనిసరి అవసరమని, అక్కడి ప్రజల మూలాలూ తమ ప్రజల మూలాలూ ఒకటేనని, కనుక వారికి రక్షణ ఏర్పాట్లకు ఎటు వంటి అభ్యంతరమూ లేదని అన్నారు. ఆ భద్రత ఏ రూపంలోన న్నది ప్రశ్న. ‘నాటో’లో చేరేందుకు వీలు లేదన్న పుతిన్ డిమాండ్ను ట్రంప్ అంగీకరించారు. అట్లా చేరకపోయినా 5వ ఆర్టికల్ను పోలిన రక్షణలు కల్పించగలమని ట్రంప్ సూచించగా అందుకు పుతిన్ సమ్మతించారు. ఆర్టికల్ 5 అనే మాట ప్రచారంలోకి వచ్చినట్లు అందులోని వివరాలు ప్రచారంలోకి రాలేదు గానీ, అవి గమనించ దగ్గవి. నాటోలోని ఏ దేశంపై అయినా బయటి దేశం దాడి జరిపితే అది మొత్తం నాటో కూటమిపై జరిగిన దాడిగా పరిగణించి అందరూ ఆ దేశానికి మద్దతుగా కదలివస్తారు. కానీ దాని అర్థం అందరూ యుద్ధంలో ప్రవేశిస్తారని కాదు. ఎవరు ఏ రూపంలో పాల్గొంటారన్నది వారి నిర్ణయం. ఉక్రెయిన్ నాటోలో లేకపోయినా అమెరికా సహా అందరూ తమ తమ సహాయాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో గుర్తించవలసింది మరొకటి ఏమంటే, ఉక్రెయిన్కు అంద జేసే ఆయుధాలన్నీ ఖరీదుకేగానీ ఉచితంగా కాదు. వైట్హౌస్ చర్చలు సానుకూలంగా ఉన్నట్లు భావించిన ట్రంప్ ఆ వెంటనే పుతిన్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఇరుపక్షాలూ సన్నద్ధమైతే మొదట రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షికంగా, తర్వాత అమెరికా అధ్యక్షుని చేరికతో త్రైపాక్షికంగా చర్చలు జరుగు తాయి. శాంతి దిశగా అడుగులైతే పడుతున్నాయి. ఇందుకు తిరిగి ఏ భంగమూ కలగదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
కొన్ని మారవు! యుద్ధం ఆపడం ఇక..: ట్రంప్
పుతిన్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీతో ఉక్రెయిన్ శాంతి చర్చలు జరపబోతున్నారు. అయితే దానికంటే కొన్ని గంటల ముందు ఆయనో కీలక ప్రకటన చేశారు. జెలన్స్కీ కాస్త తగ్గి.. కాంప్రమైజ్ కావాలన్న రీతిలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారాయన. రష్యా నుంచి క్రిమియాను తిరిగి పొందడం, ఉక్రెయిన్ నాటోలో చేరడం ఈ రెండూ అసాధ్యమేనని ట్రంప్ ఆ పోస్టులో స్పష్టం చేశారు. ‘‘తలుచుకుంటే జెలెన్స్కీ వెంటనే రష్యాతో యుద్ధాన్ని ముగించవచ్చు. లేదంటే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. 12 ఏళ్ల కిందట ఒక్క తూటా పేలకుండానే ఒబామా క్రిమియా భూభాగాన్ని రష్యాకు అప్పజెప్పారు. అలాగే నాటోలోనూ ఉక్రెయిన్ చేరడం వీలుకాదు. కొన్ని ఎన్నటికీ మారవు అనే విషయాన్ని గుర్తించాలి’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలస్కా వేదికగా ట్రంప్ మూడు రోజుల కిందట అలస్కాలో భేటీ అయ్యారు. అయితే కాల్పుల విరమణ విషయంలో పుతిన్ అస్సలు తగ్గలేదని తెలుస్తోంది. యుద్ధవిరామం గురించి కాకుండా.. భూభాగాల మార్పిడిపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. పుతిన్ ప్రతిపాదన ప్రకారం.. క్రిమియాపై సర్వాధికారాలు రష్యావే. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు అనే షరతులు ఉన్నాయి. అయితే జెలెన్స్కీ మాత్రం రక్షణపరంగా కీలక ప్రాంతాలైన తూర్పు భూభాగాల ఉపసంహరణను తిరస్కరిస్తూనే శాంతి చర్చలకు సిద్ధమయ్యారు. అలస్కా సమావేశం తర్వాత.. ట్రంప్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలతోనూ ఫోన్లలో మాట్లాడారు. పుతిన్తో జరిగిన చర్చల సారాంశాన్ని వాళ్లను చేరవేశారాయన. అంతేకాదు.. శాంతి చర్చల్లో పురోగతి కనిపించిందని కూడా ప్రకటించారు. వైట్హౌజ్లోని తన ఓవెల్ ఆఫీస్లోనే జెలెన్స్కీతో ట్రంప్ సోమవారం భేటీ కాబోతున్నారు. జెలెన్స్కీ గతంలో అమెరికాకు ఒంటరిగా వెళ్లి.. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేత లైవ్లో తిట్లు తిన్నారు. ఈ క్రమంలో.. ఈసారి జెలెన్స్కీతో పాటు బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే తదితరులు వాషింగ్లన్ వెళ్తారని సమాచారం. ఉక్రెయిన్ భద్రతా హామీలతో పాటు రష్యాపై ఆంక్షలు కొనసాగించాలని వీళ్లంతా ట్రంప్ను ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తోంది. బెదిరింపుల నుంచి బతిమాలేదాకా.. రష్యాపై ఆంక్షలు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై నేరుగా విమర్శలు.. ఉక్రెయిన్ యుద్ధం ఆపే క్రమంలో ట్రంప్ మొదటి నుంచి చేసుకొస్తోంది ఇదే. బెదిరింపులతోనే ఇరు దేశాధినేతలను దారికి తేవాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే అవేవీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ట్రంప్ సహనం కట్టలు తెంచుకున్నా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేకపోయింది. ఈ క్రమంలో అలస్కా భేటీ తర్వాత ట్రంప్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. పుతిన్ టఫ్గాయ్.. ఇక అంతా జెలెన్స్కీ చేతుల్లోనే ఉందంటూ వ్యాఖ్యానించారాయన. అయితే యూరోపియన్ దేశాల ప్రొత్సహంతో జెలెన్స్కీ కూడా ఈ విషయంలో అస్సలు తగ్గడం లేదు. దీంతో ట్రంప్ బతిమాలింపు దిశగా ప్రయత్నాలు చేయబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత.. త్రైపాక్షికం?పుతిన్, జెలెన్స్కీలతో కలిసి ట్రంప్ త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. గ్జిన్హువా మీడియా సంస్థతో జర్మన్ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ మాట్లాడుతూ.. ఆగస్టు 22వ తేదీన ఈ భేటీ ఉండనుందని, జెలెన్స్కీ-ట్రంప్ భేటీ తర్వాత దీనిపై ఓ స్పష్టత వస్తుందని చెప్పారు. అయితే రష్యా, ఉక్రెయిన్ ఈ ప్రకటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం.. డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. బదులుగా యుద్ధ విరామంతో పాటు ఉక్రెయిన్కు భద్రతా హామీలు దక్కుతాయి. -
ఉత్కంఠతో మొదలై ఉసూరుమనిపించి..
జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్న్(అలాస్కా): ఎడాపెడా టారిఫ్ల పిడిగుద్దులు కురిపించి ప్రపంచదేశాలకు సుంకాల ముచ్చెమటలు పట్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శక్తిసామర్థ్యాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎదుట నిర్విర్యమయ్యాయి. అలాస్కాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రపంచ దేశా లు అత్యంత ఉత్కంఠతతో ఎదురుచూసిన ట్రంప్, పుతిన్ శిఖరాగ్ర చర్చలు దాదాపు మూడు గంటలపాటు జరిగినా చివరకు ఎలాంటి సత్ఫలితాలనివ్వకుండానే ముగిశాయి. దీంతో దురాక్రమణ జెండా ఎగరేసి ఉక్రెయిన్పై బాంబుల మోత మోగిస్తున్న రష్యాను నిలువరించి ఉక్రెయిన్లో శాంతికపోతాలు ఎగిరేలా చేస్తానన్న ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞ నెరవేరలేదు. అలాస్కాకు చేరుకున్నది మొదలు చర్చలు, సంయుక్త ప్రకటనదాకా ఆద్యంతం పుతిన్దే పైచేయి కనిపించింది. అయితే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేశామని ట్రంప్ ప్రకటించగా ఒప్పందం కంటే ‘పరస్పర అవగాహన’దిశగా సఖ్యత కుదిరిందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్లో శాంతిస్థావనకు ఇరునేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే నిర్దిష్ట ప్రణాళికలను ఇరువురూ బయటపెట్టలేదు. కానీ ఈ చర్చలకు కొనసాగింపుగా రష్యా రాజధాని మాస్కోలో మరోదఫా చర్చలు జరిగే అవకాశముంది. పుతిన్పై ప్రశ్నల శరాలు తన ఏలుబడిలో రష్యా మీడియా పుతిన్ను ముక్కుసూటి ప్రశ్నలడిగే దుస్సాహసం చేయదు. కానీ అమెరికాలో అడుగుపెట్టిన పుతిన్కు అమెరికా అంతర్జాతీయ మీడియా ప్రశ్నలతో మూకుమ్మడి దాడి చేసింది. పుతిన్ దాదాపు ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వనప్పటికీ ప్రశ్నల బాణాలు సంధిస్తూ మీడియా పుతిన్కు నోటమాట రానివ్వకుండా చేసింది. ‘‘ఉక్రెయిన్లో అమాయక పౌరుల ప్రాణాలను తీయడం ఎప్పుడు ఆపేస్తారు? శాంతిస్థాపనకు కంకణం కట్టుకున్నానని మీరు చెప్పే మాటలను ట్రంప్ ఎందుకు నమ్మాలి? ఇలా పలు ప్రశ్నలను మీడియా గట్టిగా అడిగినా పుతిన్ మౌనంగా ఉండిపోయారు. తాను ఆ ప్రశ్నలను వినదల్చుకోలేదు అన్నట్లు చెవులు మూసుకున్నారు. సాదర స్వాగతం పలికిన ట్రంప్ పుతిన్ కంటే ముందే యాంకరేజ్ సిటీలోని ఎయిర్పోర్ట్కు ట్రంప్ చేరుకున్నారు. తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన పుతిన్కు ట్రంప్ ఎర్ర తివాచీ పరచి మరీ సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజిచ్చారు. రెడ్కార్పెట్పై నడిచి వెళ్లేటప్పుడు అమెరికా అత్యంత భారీ బాంబులను జారవిడిచే బీ–2 బాంబర్ యుద్ధవిమానాలతోపాటు ఎఫ్–22 ఫైటర్జెట్లు గగనతలంలో దూసుకుపోయాయి. ట్రంప్ తన బీస్ట్ కారులో పుతిన్ను ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో ఇద్దరూ వెనకసీట్లో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. తర్వాత జాయింట్ ఎల్మెండార్ఫ్–రిచర్డ్స్న్ వైమానిక స్థావరంలో ఏర్పాటుచేసిన సమావేశమందిరానికి చేరుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలçహాదారు మార్కో రూబియో, ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, జాతీయ భద్రతా సలహాదారు యూరీ ఉషకోవ్ల సమక్షంలో ట్రంప్, పుతిన్లు సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్పై దాడులు మొదలెట్టాక పుతిన్ అమెరికా గడ్డపై కాలుమోపడం ఇదే తొలిసారి.అమెరికా మా పొరుగు దేశం భేటీ తర్వాత సంయుక్త సమావేశంలో పుతిన్ తొలుత మాట్లాడారు. ‘‘అమెరికా, రష్యాలు పొరుగుదేశాలే. మమ్మల్ని కేవలం మహాసముద్రాలే వేరుచేస్తున్నాయి. అది కూడా కేవలం నాలుగు కిలోమీటర్లే. మిగతా అంశాల్లో మేం మిత్రదేశాలమే. అందుకే రెడ్కార్పెట్పై నాకు స్వాగతం పలకేటప్పుడు ట్రంప్ నన్ను హలో పొరుగుమిత్రుడా(నెయిబర్) అని సంబోధించారు. అమెరికాలో ఇప్పటికీ ఆర్థోడాక్స్ చర్చిలు ఉన్నాయి. మా మధ్య సాంస్కృతిక బంధం బలోపేతానికి కృషి చేస్తాం. పరస్పర ప్రయోజనకర, సమస్థాయి ఒప్పందాలకు ఈ సాంస్కృతికబంధాలు వారధిగా నిలుస్తాయి. ప్రచ్ఛన్నయుద్ధంకాలంనుంచి ఇరు దేశాల సంబంధాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఇకమీదట విభేదాలు విడనాడి చర్చల మార్గంలో పయనిద్దాం. వాస్తవానికి ఇలాంటి భేటీ ఎప్పుడో జరగాల్సింది’’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం అంశాన్ని పుతిన్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘సంక్షోభమే ఈ సమావేశాలకు ప్రధాన పునాది. ఉక్రెయిన్ను చుట్టుముట్టిన సమస్యలకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఉక్రేనియన్ల ఆందోళనను అప్పుడూ పట్టించుకున్నా. ఇప్పుడూ పట్టించుకుంటున్నా. మా మూలాలు ఒక్కటే. పరస్పర సంఘర్షణ కారణంగా ఇరువైపులా శాంతి ప్రక్రియలో ఉక్రేనియన్లు, యురోపియన్లు అవరోధాలు కల్పించొద్దు. అంతా శుభమే జరగాలని కోరుకుంటున్న ట్రంప్కు నా ధన్యవాదాలు. మా ఇరు పక్షాలు చక్కటి ఫలితాల కోసమే పాటుపడుతున్నాయి. అమెరికా శ్రేయస్సు కోసం ట్రంప్ పరితపిస్తున్నారు. అలాగే రష్యా స్వప్రయోజనాలు మాకు ముఖ్యం. ట్రంప్తో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. కానీ ఉక్రెయిన్ అంశంలో అమెరికాతో ఒక అవగాహనకు వచ్చాం’’అని పుతిన్ స్పష్టంచేశారు.నేరుగా శాంతి ఒప్పందమే అత్యుత్తమం తర్వాత ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడు వ్లాదిమిర్తో సమావేశం అత్యంత సత్ఫలితాలనిచి్చంది. అయితే తదుపరి దశ(శాంతిచర్చల)కు చేరే క్రమంలో ఎంతో పురోగతి సాధించాం. ఈ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మాకు సువర్ణావకాశం దక్కింది. కానీ ఇంకా కొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది. (శాంతి)ఒప్పందం కుదరాలంటే అంతకుముందు మరో ఒప్పందం కుదరాలి. సంక్షోభం సమసిపోవాలంటే నాటో కూటమి దేశాలు, ఉక్రెయిన్ వల్లే సాధ్యం. ఒప్పందం పూర్తిగా వాళ్ల చేతుల్లోనే ఉంది. వారానికి వేల మంది చనిపోకుండా నిలువరించాల్సి ఉంది. చర్చల కొనసాగింపుగా మరోదఫా వ్లాదిమిర్తో భేటీ కావాల్సి ఉంది’’అని ట్రంప్ అన్నారు. దీంతో వెంటనే పుతిన్ కల్పించుకుని ‘‘ఈసారి మాస్కోలో కలుద్దాం’’అని అన్నారు. తర్వాత ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘ఉక్రెయిన్, రష్యాలు నేరుగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే ఈ యుద్ధాన్ని ముగించేందుకు అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నా అది సమగ్ర స్థాయిలో అమలుకావడం కష్టమే. కాల్పుల విరమణ తరచూ ఉల్లంఘనలకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఉక్రెయిన్, రష్యా నేరుగా శాంతి ఒప్పందం చేసుకోవాలి. సోమవారం వైట్హౌస్లో జెలెన్స్కీతో సమావేశమవుతా. మా చర్చలు ఫలవంతమయ్యాక పుతిన్తో మాట్లాడతా. ఆ తర్వాత పుతిన్, జెలెన్స్కీలు ఒక్కచోటకు చేర్చి యుద్ధవిరమణకు కృషిచేస్తా’’అని ట్రంప్ అన్నారు. -
జెలెన్స్కీ, (ఉక్రెయిన్ అధ్యక్షుడు) రాయని డైరీ
శుక్రవారం అలాస్కాలో ట్రంప్, పుతిన్ కలిసినప్పుడు చరిత్రలో నేను చదువుకున్న ‘యాల్టా’ సమావేశమే నాకు గుర్తుకొచ్చింది!నేను పుట్టటానికి 33 ఏళ్ల ముందు జరిగిన సమావేశం అది. అప్పటికి పుతిన్ పుట్టలేదు. ట్రంప్ కూడా పుట్టలేదు. యాల్టా సమావేశం జరిగిన ఏడాదికి ట్రంప్, ఏడేళ్లకు పుతిన్ పుట్టారు.‘యాల్టా’ ఇప్పుడు ఉక్రెయిన్లో ఉంది. అప్పట్లో సోవియెట్ యూనియన్లో ఉంది. యాల్టాకు పోలికగా ఇప్పుడు అలాస్కా నాకు గుర్తుకు రావటానికి తగినన్ని కారణాలే ఉన్నాయి.రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో యాల్టా సమావేశం జరిగింది. ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో అలాస్కా సమావేశం జరిగింది.యాల్టా సమావేశం రూజ్వెల్ట్, స్టాలిన్, చర్చిల్ల మధ్య జరిగింది. అలాస్కా సమావేశం ట్రంప్, పుతిన్ల మధ్య జరిగింది.యాల్టాలో రూజ్వెల్ట్, చర్చిల్ కలిసి స్టాలిన్కు కొన్ని దేశాల భూభాగాలను పంచి పెట్టారు! ఇప్పుడు ట్రంప్ కూడా ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాలను నా చేత ఇప్పించేందుకు ట్రంప్కు మాట ఇచ్చి ఉంటారా?!అలాస్కాకు, యాల్టాకు అన్నిటికన్నా ముఖ్యమైన పోలిక... యాల్టా సమావేశం ఫిబ్రవరిలో జరగటం! ఆ తర్వాత 77 ఏళ్లకు ఉక్రెయిన్ మీదకు రష్యా దురాక్రమణ కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభం అవటం!శనివారం ఉదయం ట్రంప్ పర్సనల్ సెక్రెటరీ నటాలీ ఫోన్ చేసి, ‘‘ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాపీగా లేరు...’’ అన్నారు!సోమవారం వాషింగ్టన్లో ట్రంప్కూ, నాకూ మధ్య జరగబోయే సమావేశంలో ట్రంప్ తనేమి చెప్పబోతారో, దాన్నే ముందుగా నటాలీ చేత నాకు చెప్పించటానికి ట్రంప్ ఫోన్ చేయించి ఉంటారని నాకు అర్థమైంది. ‘‘ట్రంప్ ఒక్కరేనా, ప్రెసిడెంట్ పుతిన్ కూడా హ్యాపీగా లేరా?’’ అన్నాను.నా వ్యంగ్యాన్ని ఆమె సరిగానే అర్థం చేసుకున్నప్పటికీ, అదేమీ పట్టనట్లు ‘‘మీరూ, పుతిన్ ఓపెన్ డోర్స్ మీటింగ్లో కూర్చుంటే బాగుంటుందని ప్రెసిడెంట్ ట్రంప్ భావిస్తున్నారు...’’ అన్నారు.‘‘ఓపెన్ ఆన్సర్లు లేకుండా, ఓపెన్ డోర్ మీటింగులతో ఏమౌతుంది చెప్పండి మిసెస్ నటాలీ?’’ అన్నాను.నటాలీ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత, ‘‘మూడో ప్రపంచ యుద్ధం కనుక మొదలైతే ఇక అదే చివరిది అవుతుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు’’ అన్నారు!!మూడో ప్రపంచ యుద్ధం వస్తే అదే ఆఖరి యుద్ధం అవుతుందని జోస్యంలా చెప్పటం కాకుండా, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఈ భూగోళానికే పెద్ద విపత్తు అని ఒక జాగ్రత్తలా ఎవరూ ఎందుకు మాట్లాడరు!‘‘మిసెస్ నటాలీ! రోజంతా మీరు ప్రెసిడెంట్ పక్కనే ఉంటారని, ఇంటర్నెట్లో ప్రెసిడెంట్ ట్రంప్పై వచ్చే ప్రశంసాపూర్వకమైన కథనాలను ఆయనకు అందిస్తుంటారని విన్నాను. ట్రంప్ కనుక పుతిన్తో, ‘మీరే ముందు యుద్ధం ఆపేయండి’ అని ఒక్క మాట అనగలిగినా మా వైపు నుండి కూడా ఒక ప్రశంసాపూర్వకమైన కథనం మీకు లభ్యమౌతుంది...’’ అన్నాను, నవ్వుతూ.ఆ మాటకు తనూ నవ్వారు. ఇద్దరం ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కెరీర్లో ఉన్నవాళ్లం. ఆ మ్యాజిక్ ఏదో మా మాటల్లో పనిచేసినట్లుంది. ప్రెసిడెంట్కు సెక్రెటరీగా కాకుండా, ఒక కో–ఆర్టిస్ట్గా నాతో సైన్ ఆఫ్ అయ్యారు నటాలీ.అలాస్కా సమావేశం జరిగినప్పటికీ కీవ్ను ఆక్రమించేందుకు రష్యా ఇంకా ఇంకా దగ్గరికి వస్తూనే ఉంది! రేపు ట్రంప్తో నా మీటింగ్ తర్వాత కూడా రష్యాకు నేను ఒకటే చెబుతాను.‘‘మీరు మాపై దాడికి వచ్చినప్పుడు మీరు మా ముఖాలను చూస్తారు. మా వీపులను కాదు, మా ముఖాలను!’’ అని చెప్పిందే చెబుతాను. -
ట్రంప్, పుతిన్ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్!
అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పుకొచ్చారు.#WATCH | Alaska, USA | US President Donald Trump says, "We had a very productive meeting, there were many points that we agreed on. Couple of big ones that we haven't quite gotten there but we made some headway. There's no deal until there's a deal so I will call up NATO in a… pic.twitter.com/mY5t9zkoCT— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో డీల్ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్ నిరాకరించారు. #WATCH | Alaska, USA | Russian President Vladimir Putin says, "... We see the strive of the administration and President Trump personally to help facilitate the resolution of the Ukrainian conflict and his strive to get to the crux of the matter to understand this history is… pic.twitter.com/kiOKgw2JBf— ANI (@ANI) August 15, 2025అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.#WATCH | Alaska, USA | "Next time in Moscow," says Russian President Vladimir Putin as US President Trump thanks his counterpart for today's meeting."... I could see it happening," replies President Trump.Source: The White House/ YouTube pic.twitter.com/N3U6Rygllj— ANI (@ANI) August 15, 2025 పుతిన్కు ఘన స్వాగతం..ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్హౌస్, క్రెమ్లిన్లు ప్రకటించాయి.#WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin exchange greetings in Anchorage, ahead of their talks.Source: Reuters pic.twitter.com/mdGoQe6qqx— ANI (@ANI) August 15, 2025 అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్కు చేరుకున్నారు. అక్కడ పుతిన్కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. #WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin share the same car to reach the venue for their talks. Source: Reuters pic.twitter.com/X9YkJvqb6g— ANI (@ANI) August 15, 2025 -
ట్రంప్, పుతిన్ ఏకాంత చర్చలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతోందని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో ట్రంప్, పుతిన్తోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని తెలిపాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండదని పేర్కొన్నాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపబోతున్నారు. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2018 జూలై 16న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్ మధ్య రెండు గంటలపాటు గోప్యమైన భేటీ జరిగింది. అప్పటి చర్చల్లో పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. ఫల వంతం కాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో గోప్యంగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటిలాగే విఫలమయ్యే అవకాశం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ట్రంప్, పుతిన్ తోపాటు ఇరుపక్షాల నుంచి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పుతిన్తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉన్న ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్తో గట్టిగా వాదించి, ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడు తుందని ఆయన భావిస్తున్నట్లు సమా చారం. ఎందుకంటే చర్చల గదిలో ఇతరు లు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి, వెనక్కి లాగే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్తో మొదట కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పుతిన్ విజయమే: బోల్టన్ అలస్కాలో జరిగే భేటీని పుతిన్ విజయంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభివర్ణించారు. సమావేశానికి ట్రంప్ను స్వయంగా రప్పిస్తుండడం ద్వారా పుతిన్ ఇప్పటికే పైచేయి సాధించారని అన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపేస్తుందన్న నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు. అయితే, జాన్ బోల్టన్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాకు అపజయం ఉండదని పేర్కొన్నారు. -
భారత్పై అమెరికా సుంకాలు.. ఆగమవుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థ: ట్రంప్
ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యే వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత్ వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో.. ఇరు దేశాలవి డెడ్ ఎకానమీ అంటూ గతంలో వ్యాఖ్యానించింది తెలిసిందే. తాజాగా.. భారత్పై అమెరికా విధించిన భారీ సుంకాలు రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బలాంటిదని అభిప్రాయపడ్డారు.వైట్హౌజ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రష్యా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదు. అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, అదే సమయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లలతో ఆగమాగమవుతోంది. అదొక విశాలమైన దేశం. అపారమైన సామర్థ్యమూ ఉంది. కాబట్టి తిరిగి తమ దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలి’’ అని సూచించారు. ఈ సమయంలో భారత్ ప్రస్తావన తీసుకొచ్చారాయన..‘‘రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశానికి.. 'మీరు రష్యా నుంచి చమురు కొంటే 50% టారిఫ్ వేస్తాం' అని హెచ్చరించాం. చెప్పినట్లే చేశాం కూడా. ఇది ముమ్మాటికీ రష్యాకు పెద్ద దెబ్బనే’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ చేసిన ఈ ఎకానమీ వ్యాఖ్యలపై రష్యా ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఇదిలా ఉంటే.. భారత్ అమెరికాకు మిత్రదేశమేనని, వాణిజ్యం మాత్రం సక్రమంగా లేదని చెబుతూ ట్రంప్ 25 శాతం ప్రతీకార సుంకాలను విధించారు. ఆ సమయంలో రష్యా నుంచి భారత్ చమురు కోనుగోళ్ల నేపథ్యంపైనా ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ భారత్ వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో ఇరు దేశాల తమ డెడ్ ఎకానమీలను మరింత దిగజారచుకుంటున్నాయని.. ఆ అంశాన్ని అమెరికా పట్టించుకునే స్థితిలో లేవని అన్నారు. అటుపై భారత్పై మరో 25 శాతం పెనాల్టీ టారిఫ్ విధించడంతో ఆ సుంకాలు 50 శాతానికి చేరాయి. అయితే భారత్ ఈ సుంకాలను అన్యాయంగా పేర్కొంది. అదే సమయంలో.. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే తాము ముందుకు సాగుతామని స్పష్టం చేసింది.మరో పక్క.. తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐదు యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తానే ఆపుతానంటూ చెబుతూ వస్తున్నారు కూడా. ఈ క్రమంలో.. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీ కానున్నారు. అయితే తమను చర్చల్లో భాగం చేయకుంటే ఆ చర్చలకు అర్థం ఉండదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మొదటి నుంచి వాదిస్తున్నారు. ఈ క్రమంలో అలస్కా భేటీలో జెలెన్స్కీకి చోటు ఉంటుందా? లేదంటే ట్రంప్తో విడిగా భేటీ అవుతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. #WATCH | Washington, DC | On Russia-Ukraine war and meeting with Russian President Vladimir Putin, US President Donald Trump says, "This could have been a third world war... I thought it was very respectful that the president of Russia is coming to our country, as opposed to us… pic.twitter.com/rrOyuRkFTG— ANI (@ANI) August 11, 2025 -
అలస్కా చర్చల్లో జెలెన్స్కీకీ చోటు?
వాషింగ్టన్: ఈ నెల 15వ తేదీన అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన దౌత్యపరమైన విభేదాలకు తెరతీసింది. ఈ సమావేశంలో కుదరబోయే ఒప్పందంపై ఉప్పందుకున్న యూరప్ దేశాల నేతలు ఉక్రెయిన్ భవిష్యత్తును నిర్ణయించే భేటీలో అధ్యక్షుడు జెలెన్స్కీకి చోటు కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు..ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు మద్దతు పలికారు. అదే సమయంలో, ట్రంప్–పుతిన్ చర్చల తర్వాత ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలని, ఉక్రెయిన్కు సైతం ఒప్పందంలో భాగస్వామి అయ్యే అవకాశమివ్వాలని జేడీ వాన్స్ను కోరారు. అలస్కాలో శుక్రవారం పుతిన్–ట్రంప్ మధ్య జరిగే శిఖరాగ్రంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు లేదు. అయితే, జెలెన్స్కీ పాల్గొనే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. ట్రంప్–పుతిన్ల సమావేశం తర్వాత మాత్రమే జెలెన్స్కీకి చాన్సుంటుందని చెబుతున్నారు. వేగంగా చోటుచేసుకున్న పరిణామాల నడుమ అలస్కా శిఖరాగ్రంపై నిర్ణయం వెలువడింది. శిఖరాగ్రం వేదికను ఇంకా ఖరారు చేయలేదు. అంతేకాదు, ఇద్దరు నేతల మధ్య చర్చకు రావాల్సిన అంశాలపైనా స్పష్టత రాలేదని చెబుతున్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు నేతలతో కలిసి త్రైపాక్షిక చర్చలకు సైతం సిద్దంగా ఉన్నా, పుతిన్ వినతి మేరకు ద్వైపాక్షిక చర్చలకు అవసరమైన ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నామని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. యూరప్ నేతల డిమాండ్లివీ..అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అవనున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..ఇందులో జెలెన్స్కీ పాల్గొనేదీ లేనిదీ మాత్రం స్పష్టం చేయలేదు. యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఉక్రెయిన్ను కూడా భాగస్వామిగా చేర్చుకోవాలని జెలెన్స్కీతోపాటు యూరప్ దేశాల నేతలు కోరుతున్నారు. ట్రంప్ ప్రకటనను స్వాగతించిన జెలెన్స్కీ, తమ భూభాగాన్ని రష్యాకు ధారాదత్తం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తోసిపుచ్చారు. పుతిన్–ట్రంప్ చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అంశాలేమిటి, కుదరనున్న ఒప్పందం వివరాలేమిటి? అంటూ జేడీ వాన్స్తో సమావేశమైన యూరప్ దేశాల ఉన్నతాధికారులు కూపీ లాగారు. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు పుతిన్ బుధవారం అందించిన పత్రాల్లో ఏముందంటూ ఆరా తీశారు. ‘ఈ చర్చల్లో ఉక్రెయిన్కు భాగస్వామ్యం ఉండాలి. చర్చల అనంతరం ముందుగా కాల్పుల విరమణ అమల్లోకి రావాలి. ఆ తర్వాతే మిగతా అంశాల అమలు విషయం తేల్చాలి. ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తే..ప్రస్తుతం రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలి...’వంటి షరతులను వారు జేడీ వాన్స్కు వినిపించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనపై ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, పోలండ్, యూకే, ఈయూ, ఫిన్లాండ్ దేశాల నేతలు సంతకాలు చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకూ గ్యారెంటీ ఇవ్వాలని కోరారు. తమ ప్రతినిధి విట్కాఫ్ మాస్కోలో పుతిన్తో జరిపిన సమావేశంలో కుదిరిన ఒప్పందంపై మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్.. కొన్ని భూభాగాలను వదులుకోవడం వంటి అంశాలున్నాయని చెప్పడం యూరప్ దేశాలతోపాటు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పుతిన్ అందజేసిన పత్రంలో తాము పాక్షికంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతోపాటు డోన్బాస్ ప్రాంతం పూర్తిగా స్వాధీనం చేయాలనే అంశం ఉన్నట్లు యూరప్ దేశాలంటున్నాయి. ఖెర్సన్, జపొరిజియాల్లోనూ రష్యా ఆర్మీ తిష్టవేసింది. వీటి విషయం తేల్చలేదు. అమెరికా ఇచ్చే భద్రతాపరమైన గ్యారంటీల విషయం సైతం అస్పష్టంగా ఉంది. దీనిపై వైట్ హౌస్ అధికారులను ఈయూ నేతలు పదేపదే ప్రశ్నిస్తున్నా స్పందనలేదు. -
అమెరికా-ఉక్రెయిన్ మధ్య రక్షణ సహకారంలో కొత్త మలుపు
-
ఆ రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరో మలుపు
అమెరికా-ఉక్రెయిన్ మధ్య రక్షణ సహకారం మరో మలుపు తిరిగింది. ఉక్రెయిన్కు పంపాల్సిన ఆయుధాలను తిరిగి అమెరికా డిఫెన్స్కు మళ్లించే ప్రక్రియ షురూ అయ్యింది. పెంటగాన్ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో జరగబోయే భేటీ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తిని రేపుతోంది. గత నెలలో వాషింగ్టన్లోని రక్షణ శాఖలో వెలువడిన ఓ రహస్య మెమో బయటకు వచ్చింది. ఉక్రెయిన్కు వెళ్ళాల్సిన కొన్ని రకాల ఆయుధాలను తిరిగి అమెరికా రక్షణ నిల్వల్లోకి మళ్లించే నిర్ణయం తీసుకున్నట్లు ఈ మెమో వెల్లడించింది. ఎల్బ్రిడ్జ్ కొల్బీ, అమెరికా రక్షణ విధానాల ప్రధాన అధికారి ఈ మెమో పై సంతకం చేశారు.ఈ నిర్ణయం అమలైతే… ఉక్రెయిన్ కోసం కేటాయించిన బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు అమెరికాలో డిఫెన్స్ నిల్వలను నింపడానికి ఉపయోగపడతాయి. ఉక్రెయిన్కు అధికంగా సాయం చేస్తే, అమెరికా వద్ద తక్షణ రక్షణ అవసరాల కోసం కీలకమైన సామగ్రి కొరత ఏర్పడుతుందన్నది పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొంది. వాటిలో ముఖ్యంగా ఇంటర్సెప్టర్ క్షిపణులు, వాయు రక్షణ వ్యవస్థలు, ఆర్టిలరీ గోళాలు ఉన్నాయి. గత నెలలో రక్షణ మంత్రి పీటె హేగ్సెత్, ఉక్రెయిన్కి పంపాల్సిన పెద్ద ఆయుధాల ప్యాకేజీని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇది కొల్బీ మెమో ప్రకారం తీసుకున్న నిర్ణయమే. కొల్బీ ఎప్పటినుంచో ఉక్రెయిన్కు అధిక ఆయుధ సహాయం ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు.అయితే, ఈ నిర్ణయం బయటకు రాగానే అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారు. రష్యా దాడులు రోజువారీగా జరుగుతున్న వేళ, ఉక్రెయిన్కి రక్షణాత్మక ఆయుధాలను నిరంతరం అందిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అదే కాకుండా, నాటోతో కొత్త ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్కి అవసరమైన ఆయుధాలను అమెరికా తయారు చేస్తుంది. వాటి ఖర్చు యూరోపియన్ మిత్రదేశాలు భరిస్తాయి. ఈ ప్రణాళిక విలువ బిలియన్ల డాలర్లు దాటే అవకాశం ఉండటంతో ఈ ఒప్పందం ఎలా అమలవుతుందనే దానిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. -
జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై దాడి
మాస్కో: జనావాసాలపై పరస్పర బాంబులేసుకుంటున్న ఉక్రెయిన్, రష్యాలు ఒక్కసారిగా యుద్ధంలో రేడియోధార్మికత భయాలను పెంచాయి. ఉక్రెయిన్కు చెందిన అత్యంత కీలకమైన జపోరి జియా అణువిద్యుత్ కేంద్రంపై ఆదివారం దాడి జరిగింది. ఈ న్యూక్లియర్ ప్లాంట్ ఆవరణలోని నిర్మాణం నుంచి భారీ స్థాయిలో మంటలు, పొగ వెలువడుతున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే దాడిలో అణువిద్యుత్ కేంద్రం ప్రధానభాగం దెబ్బతిన్నదా? లేదా? అనేది తెలియరాలేదు. దీంతో రేడియోధార్మికత వ్యాపించవచ్చన్న భయాలు ఒక్కసారిగా యూరప్లో వ్యాపించాయి. యూరప్ ఖండంలోనే అతిపెద్ద అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా పేరొందిన జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్ను యుద్ధసమయంలో రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్ రష్యా అధీనంలో ఉంది. దీంతో ఉక్రెయిన్ సేనలే తమ డ్రోన్ ద్వారా దాడికి పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్లాంట్ ప్రధాన నిర్మాణానికి 1,200 మీటర్ల దూరంలో దాడి వి ధ్వంసం జరిగిందని, ప్రమా ద అంచనా, నిజా నిజాలు నిగ్గుతేల్చేందుకు అంతర్జాతీ య అణుఇంధన సంస్థ (ఐఏఈఏ) తమ ప్రత్యేక పర్యవేక్షణా బృందాన్ని హుటాహుటిన జపోరి జియా ప్లాంట్కు పంపించింది. ‘‘ మా ఏజెన్సీ టీమ్ను ఇప్పటికే పంపించాం. దాడి ధాటికి రేడియో ధార్మికత వెలువడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఈ ఉపద్రవాన్ని అడ్డుకోక తప్పదు’’ అని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తంచేశారు. రష్యా చమురు నిల్వ కేంద్రంపై దాడిరష్యాలోని చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ దాడులకు తెగబడింది. దీంతో చమురు కేంద్రం తగలబడి అగ్నికీలలు ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఆస్తి నష్టం పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. నల్ల సముద్ర తీరంలో రిసార్ట్లకు పేరెన్నికగన్న సోచీ సిటీలో ఈ ఆయిల్ డిపో ఉంది. ఏకంగా 120కిపైగా అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు శ్రమించారని క్రాన్సో్నడార్ రీజనల్ గవర్నర్ వెనియామిన్ కోంద్రాతెవ్ తన ‘టెలిగ్రామ్’ ఖాతాలో ఒక పోస్ట్చేశారు. దట్టంగా కమ్ముకున్న పొగ కారణంగా ముందజాగ్రత్తగా సోచీ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలను నిలిపేశారు. గత 24 గంటల్లో 93 ఉక్రెయిన్ డ్రోన్లను నేలరాల్చామని రష్యా రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది. మరోవైపు తమపై 76 డ్రోన్లు, 7 క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆదివారం తెలిపింది. -
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల భయం.. నేవీ వేడుకలను తగ్గించుకున్న రష్యా
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో రష్యా తన నేవీ డే వేడుకలపై కోత పెట్టింది. భద్రతాపరమైన ఆందోళనలతో బాల్టిక్ సముద్ర తీరంలోని సెయింట్ పీటర్స్బర్గ్, కలినిన్ గ్రాడ్లలో, సుదూర తూర్పు తీర నౌకాశ్రయంలో వార్షిక నేవీ డే ఉత్సవాల సందర్భంగా ఆదివారం చేపట్టాల్సిన యుద్ధ నౌకల పరేడ్లను రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని రష్యా అధికారులు తెలిపారు. సొంత నగరం సెయింట్ పీటర్స్బర్గ్లోని నేవీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు పుతిన్ స్వయంగా హాజరు కావాల్సిన జరిగే కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ధ్రువీకరించారు. అన్ని రకాల పరిస్థితులను బేరీజు వేసుకున్నాకే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. భద్రతకు మించింది మరేది లేదని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన 99 డ్రోన్లను కూల్చినట్లు ఆదివారం రక్షణ శాఖ తెలిపింది. వీటిలో సెయింట్ పీటర్స్బర్గ్ నగరంపైకి వచ్చినవి కూడా ఉన్నాయంది. లెమొనొసోవ్ ప్రాంతంలో డ్రోన్ శకలాలు పడి ఒక మహిళ గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. డ్రోన్ల భయంతో సెయింట్ పీటర్స్బర్గ్లోని పుల్కొవో ఎయిర్పోర్టు అధికారులు ఆదివారం ఉదయం డజన్ల కొద్దీ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నారు. యుద్ధ నౌకలను నిర్మించడంతోపాటు నేవీ శిక్షణను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. -
‘మీ ఎకానమీని కూల్చేస్తాం’.. భారత్, చైనాలకు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్: ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు లిండ్సే గ్రాహం భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడాయిల్ను కొనుగోలు చేయాలని చూస్తే మీ ఆర్ధిక వ్యవస్థను నిట్ట నిలువునా కూల్చేస్తామని ఆయా దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.ఇంతకు ముందు గ్రాహం రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్ విధించాలనే ప్రతిపాదనలు తెచ్చారు. ఈ క్రమంలో మరోసారి టారిఫ్ ధరల్ని ప్రస్తావిస్తూ ఆయా దేశాలపై విమర్శలు గుప్పించారు. ఫాక్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రష్యా వద్ద తక్కువ ధరకే ఆయిల్ దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న బ్రెజిల్,చైనాతో పాటు భారత్కు నేను చెప్తున్నది ఒకటే. కీవ్ వద్ద ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలతో ఈ యుద్ధం(టారిఫ్) కొనసాగుతుంది. ఈ యుద్ధంలో సంబంధిత దేశాల్ని చీల్చి చెండాడుతాం. ఆర్ధిక వ్యవస్థను కూల్చేస్తామని పునరుద్ఘాటించారు. మీరు (భారత్,చైనా, బ్రెజిల్) చేస్తున్నది రక్తపాతం. ఎవరైనా అతన్ని ఆపే వరకు అతను (పుతిన్) ఆగడు అంటూనే.. రష్యాపై ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారు. ట్రంప్తో ఆటలాడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే. మీ చేష్టల ఫలితంగా మీ దేశ ఆర్ధిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు. కాగా, ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆదేశించారు. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండించింది. అమెరికా మాపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. Lindsey Graham: Here’s what I would tell China, India and Brazil. If you keep buying cheap Russian oil… we will tariff the hell out of you and we’re going to crush your economy pic.twitter.com/x05J3G8oOk— Acyn (@Acyn) July 21, 2025 -
ట్రంప్ కొత్త రాగం!
చాలా తరచుగా మాటలు మార్చే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై కత్తిగట్టారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి రాకపోతే ‘కఠినాతి కఠినమైన’ సుంకాలు విధించటంతోపాటు, తీవ్రమైన ఆంక్షలు మొదలుపెడతానని హెచ్చరించారు. అంతేకాదు... ఉక్రెయిన్ కోసం నాటో దేశాలకు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థనూ, ఇతరేతర ఆయుధాలనూ విక్రయిస్తారట. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడు రిపబ్లికన్ పార్టీ వైఖరికీ, ట్రంప్ అప్పట్లో చేసిన ప్రకటనలకూ తాజా హెచ్చరికలు పూర్తి విరుద్ధం. ఉక్రెయిన్ విషయంలో బైడెన్ ప్రభుత్వానికి మద్దతునిచ్చారంటూ తమ పార్టీకి చెందిన అప్పటి స్పీకర్ కెవిన్ మెకార్తీకి ఉద్వాసన పలికింది రిపబ్లికన్లే. అటు తర్వాత వచ్చిన మైక్ జాన్సన్ను సైతం ఇబ్బంది పెట్టారు. చిత్రమేమంటే అప్పట్లో ఉక్రెయిన్కు సాయం అందించటాన్ని గట్టిగా వ్యతిరేకించినవారంతా ఇప్పుడు ట్రంప్ మాదిరే అభిప్రాయాలు మార్చుకుని ఆయనకు మద్దతునిస్తున్నారు. ట్రంప్ విధానం అద్భుతమైనదంటూ పొగుడుతున్నారు. ఉక్రె యిన్కు అందించదల్చుకున్న ఆయుధాలను ట్రంప్ నాటోకు విక్రయిస్తున్నారని, అందువల్ల అమె రికా నష్టపోయేదేమీ వుండదని వీరి వాదన. యూరప్ దేశాలు ఇటీవల రక్షణ బడ్జెట్లను విపరీతంగా పెంచాయి. ఆ డబ్బంతా అమెరికా ఖజానాకు చేరుతుందన్నది రిపబ్లికన్ల అంచనా. ట్రంప్ అన్నంత పనీ చేస్తారని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడున్న వైఖరి సెప్టెంబర్ నాటికి వుంటుందనటానికి లేదు. తాను అధ్యక్షుడయ్యాక కలవటానికొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్హౌస్లో తీవ్రంగా అవమానించి, యుద్ధోన్మాదిగా చిత్రించిన ట్రంప్ ఆర్నెల్లయ్యేసరికి ఆ పాత్ర తానే పోషించటానికి సిద్ధపడ్డారు. ట్రంప్ చెబుతున్న ప్రకారం రష్యా దారికి రాకపోతే ఆ దేశంతో వాణిజ్యం నెరపే దేశాలపై కూడా వంద శాతం సుంకాలు విధించాలి. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న మన దేశంతోపాటు ఏటా 25,000 కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటున్న చైనాపై కూడా చర్యలుండాలి. మన మాటెలావున్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో వున్న చైనాతో నేరుగా యుద్ధానికి దిగటంతో సమానం. పిపీలక ప్రాయమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ ఇంత వివాదానికి దిగుతారా అన్నది ప్రశ్నార్థకం. పైగా అమెరికా మిత్ర దేశాలైన ఈయూ, జపాన్ సైతం రష్యాతో ఇప్పటికీ గణనీయంగా వాణిజ్య లావాదేవీలు సాగిస్తున్నాయి. లక్ష్మణ రేఖల్ని గీయటంలో ట్రంప్ను మించినవారు లేరు. అధికసుంకాల విధింపు హెచ్చరిక ఏమైందో కనబడుతూనే వుంది. దాన్ని వరసగా పొడిగించుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి వచ్చే నెల 1వ తేదీ తాజా డెడ్లైన్. అసలు పదవిలోకి వచ్చేముందే ‘నేను అధ్యక్షుడినైన రెండు వారాలకల్లా రష్యా–ఉక్రెయిన్ లడాయి ఆగితీరాలి’ అని హెచ్చరించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని ఏదోవిధంగా రష్యాను అదుపు చేయటానికి శ్రమిస్తున్న నాటో కూటమి ఎలాగైతేనేం ట్రంప్ అంతరంగాన్ని పట్టుకుని, ఆయన అభిప్రాయాన్ని మార్చగలిగింది. మొన్నటివరకూ తిట్టిన నోరే మెచ్చుకునేలా చేసింది. కానీ ఇదెంత కాలం? నిజానికి ‘వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు నాటోకు అందిస్తాం. మొండికేస్తున్న రష్యాను దారికి తెస్తాం’ అంటూ ట్రంప్ సోమవారం చేసిన ప్రకటన నాటోను లోలోన వణికిస్తోంది. కొత్తగా తాము పెంచుకున్న రక్షణ కేటాయింపులన్నీ అమెరికా ఆవిరి చేస్తుందన్న భయం వాటిని వేధిస్తోంది. పైగా అవసరమైన ఆయుధాలు అందించటం రోజుల్లో, నెలల్లో పూర్తయ్యేది కాదు. అమెరికా, యూరప్ దేశాల దగ్గ రున్న ఆయుధాలన్నిటినీ వినియోగించినా రష్యాపై తక్షణ ఆధిక్యత అసాధ్యం. కొత్తగా ఆయుధాల ఉత్పత్తి మొదలై నాటో కూటమికి చేరటానికి సంవత్సరాలు పట్టొచ్చు. యూరప్ దేశాల్లో వున్న ఆయుధ పరిశ్రమ పరిమాణం చిన్నది. అమెరికా ఒక్కటే లక్ష్యాన్ని పూర్తి చేయటం అంత సులభం కాదు. వాణిజ్యం వరకూ చూస్తే రష్యా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువేమీ కాదు. అవి 300 కోట్ల డాలర్లు మించవని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అమెరికాకు ఎంతో అవసరమైన ఎరు వులు, ఇనుము, ఉక్కు, యురేనియంలున్నాయి. ఇప్పటికే మూడేళ్లుగా ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా కొత్తగా నష్టపోయేది కూడా వుండదు. కానీ రష్యాతో వాణిజ్య లావాదేవీలున్న దేశాలను గణనీయంగా దెబ్బతీసేందుకు అవకాశం వుంటుంది. కానీ అది ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యలన్నీ అమలైతే రష్యా స్పందన గురించి ట్రంప్ ఆలోచించినట్టు లేరు. ఆ పర్యవసానా లను ఎదుర్కొనగలిగే శక్తిసామర్థ్యాలు అమెరికాకు లేవు. ఇప్పటికే పీకల్లోతు రుణ భారంతో కుంగు తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధంలో వేలుపెడితే మరింత దిగజారుతుంది. ఏరికోరి ఈ విపత్తు తెచ్చుకోవటానికి ట్రంప్ సిద్ధపడకపోవచ్చు. అయితే రష్యాకు ఆయన విధించిన గడువులో ఒక మతలబుంది. మరో యాభై రోజులకల్లా వేసవి ముగిసి, హిమ పాతం మొదలై రష్యాకు ఇబ్బందులెదురవుతాయి. ఇప్పటికే స్వాధీనమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు నిలబెట్టుకోవటం మినహా అది చేయగలిగేది వుండదు. ఎటూ యుద్ధం జోరు తగ్గుతుంది గనుక దాన్ని తన ఘనతగా చెప్పు కోవటమే ట్రంప్ ఆంతర్యమని నిపుణులంటున్న మాట కొట్టివేయదగ్గది కాదు. యుద్ధాన్ని అంతం చేయటానికి దాన్ని మరింత తీవ్రతరం చేస్తామనటం తెలివితక్కువైనా కావాలి... మూర్ఖత్వమైనా కావాలి. ట్రంప్ వ్యవహార శైలి దేనికి దగ్గరగా వున్నదో త్వరలో తేలిపోతుంది. -
మాస్కోను కొట్టగలవా?
వాషింగ్టన్: దీటైన అస్త్రశస్త్రాలు అందిస్తే మాస్కోను కొట్టగలవా? రష్యాపై భీకరంగా దాడిచేయగలవా? అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూటి ప్రశ్న వేశారు. జూలై నాలుగో తేదీన జెలెన్స్కీకి ఫోన్చేసిన మాట్లాడిన సందర్భంగా ట్రంప్, వొలదిమిర్ జెలెన్స్కీల మధ్య జరిగిన సంభాషణ తాలూకు విశేషాలను తాజాగా అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్పై క్షిపణుల వర్షం కురిపిస్తూ తీవ్ర నష్టం చేకూరుస్తున్న రష్యాకు సైతం అదే స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం కల్గించాలని జెలెన్స్కీకి ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది.ఇరునేతల సంభాషణ వివరాలను కొన్ని అత్యున్నత వర్గాలు వెల్లడించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘‘ చూడు వొలదిమిర్.. నువ్వు రష్యా రాజధాని మాస్కో నగరంపై క్షిపణులతో దాడి చేయగలవా?’’ అని ట్రంప్ ప్రశ్నించగా.. ‘‘ తప్పకుండా. మీరు సరైన మిస్సైళ్లు ఇస్తే దాడి చేసి చూపిస్తా’’ అని జెలెన్స్కీ హామీ ఇచ్చారు. ‘‘ మీకు కావాల్సిన సుదీర్ఘ శ్రేణి క్షిపణులను అందిస్తాం. రష్యాలోని సెయింట్పీటర్స్బర్గ్ను ధ్వంసంచేయగలరా?’’ అని ట్రంప్ ప్రశ్నించగా.. ‘‘ ఆ స్థాయిలో దాడికి సరిపడా ఆయుధాలు సమకూరిస్తే తప్పకుండా దాడిచేస్తాం’’ అని జెలెన్స్కీ మాటిచ్చారు. ‘‘ దాడుల్లో రక్తమోడుతూ ఉక్రెయిన్వాసులు పడుతున్న బాధను రష్యన్లు అనుభవించాలి. మీ దాడులతో వాళ్లకూ నొప్పి తెలిసిరావాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్తో సయోధ్య కుదుర్చుకోవాలని, లేదంటే 50 రోజుల్లోపు సుంకాల సుత్తితో మోదుతానని రష్యాను ట్రంప్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ సంభాషణల అంశం తెరమీదకు రావడం గమనార్హం. శాంతి ఒప్పందం చేసుకోండని ఎంతమొత్తుకున్నా రష్యా వినిపించుకోవట్లేదని, సహనం నశించి ట్రంప్ ఇలా జెలెన్స్కీని దాడులు చేయగలవా? అని ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే సంభాషణల వార్తపై అటూ శ్వేతసౌధంగానీ, ఇటు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయంగానీ స్పందించలేదు.నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో కలిసి శ్వేతసౌధంలో ట్రంప్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ పుతిన్ అంత సులభంగా లొంగే మనిషి కాడు. మన నేతలనే మభ్యపెట్టాడు. క్లింటన్ మొదలు జార్జ్ బుష్, ఒబామా, బైడెన్దాకా అమెరికా అధ్యక్షులను తన మాటలతో మభ్యపెట్టాడు. నేను వాళ్లలాగా ఫూల్ను కాబోను. బిలియన్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్కు సరఫరా చేస్తా. నాటో సభ్యదేశాలు ఆర్డర్ ఇచ్చిన 17 గగనతల రక్షణ వ్యవస్థ మిస్సైల్ లాంఛర్లన్నీ ఉక్రెయిన్కు పంపిస్తాం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
పగలంతా తేనె పలుకులు, రాత్రైతే..
ఉక్రెయిన్ సంక్షోభంలో.. పుతిన్ వైఖరి పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్ విధానాలు తనకేమాత్రం నచ్చడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఈ ఇద్దరు దేశాధినేతలు తరచూ ఫోన్లో మాట్లాడుకుంటుండడం తెలిసిందే.రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరి పట్ల నేను తీవ్ర నిరాశ చెందారు. పుతిన్ శాంతి కోసం మాట్లాడతారని అనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి ఉక్రెయిన్పై దాడులు చేయిస్తున్నారు. ఇది నాకు ఏమాత్రం నచ్చలేదు అని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పుల్స్టాప్ పెట్టే దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడితే.. పుతిన్-జెలెన్స్కీ వైఖరి వల్ల నాలుగు అడుగులు వెనక్కి పడుతున్నాయి. దీంతో ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. పైగా ట్రంప్-పుతిన్లు తరచూ ఈ అంశంపై ఫోన్లో మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. రష్యాపై ఆంక్షలు?రష్యాపై కొత్త ఆంక్షలు విధించే అవకాశాన్ని ట్రంప్ సూచన ప్రాయంగా తెలియజేశారు. మేము రేపు ఏం చేస్తామో చూడండి అంటూ మీడియాతో వ్యాఖ్యానించారాయన. అమెరికా సెనేటర్లు ఇప్పటికే రష్యాపై ‘స్లెడ్జ్హామర్’(కఠినమైన) ఆంక్షల బిల్లును ప్రతిపాదించిన సమాచారం. పైగా ఈ బిల్లు రష్యా విషయంలో ఆంక్షలు విధించేందుకు ట్రంప్కు విస్తృత అధికారాలను కల్పించనుందని తెలుస్తోంది.తాజా వ్యవహారంతో ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరీముఖ్యంగా అమెరికా-రష్యా సంబంధాల్లో కీలక మలుపుగా భావించబడుతున్నాయి. ట్రంప్ మాటలు, చర్యలు.. ఉక్రెయిన్ ఉద్రిక్తతల్లో రష్యాపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను అందించనున్నట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు ఇది ఎంతో అవసరమని అని ఆయన.. ఈ ఆయుధాల ఖర్చును అమెరికా భరించదని, యూరోపియన్ యూనియన్ 100% చెల్లించనుందని తెలిపారు.ఈ క్రమంలో ఇది జస్ట్ బిజినెస్ అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. -
‘మాది జీరో.. ఖర్చంతా మీదే’.. ఉక్రెయిన్కు ట్రంప్ షాక్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండవ దఫా పాలనలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి కొన్ని దేశాలకు షాకిస్తున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఉక్రెయిన్కు పిడుగుపాటులా మారింది. ట్రంప్ తన తాజా ప్రకటనలో ఉక్రెయిన్కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా ‘జీరో డాలర్లు’ ఖర్చు చేస్తుందని, అందుకు అయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్ యూనియన్(ఈయూ) మోయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్కు రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్లును అమెరికా భరించబోదని, ఆ ఆర్థిక బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకోసం మేము జీరో డాలర్లు ఖర్చు చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో రష్యా దండయాత్రను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్కు సైనిక, మానవతా సహాయాలను అందించడంలో అమెరికా కీలకపాత్ర పోషించింది. అయితే ఇకపై అలాంటి సహాయం అందబోదని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. 🚨 JUST IN: President Trump announces that the United States is spending 0 DOLLARS on the upcoming weapons to Ukraine.The EUROPEAN UNION will."That's the way it SHOULD'VE BEEN a long time ago.""The European Union is paying for it. We're not paying ANYTHING. It'll be… pic.twitter.com/pHlBm3zg5J— Eric Daugherty (@EricLDaugh) July 14, 2025యూరోపియన్ దేశాలు ప్రాంతీయ భద్రతను పరిపుష్టం చేసేందుకు మరింతగా సాయం అందించాలని అమెరికాను కోరిన దరిమిలా అధ్యక్షుడు ట్రంప్ తన దీర్ఘకాల వైఖరిని వెల్లడించారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న నిరంతర దాడిపై స్పందించిన ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. కాగా ట్రంప్ తాజా ప్రకటన కొత్త చర్చకు దారితీసింది. తన ప్రత్యర్థి రష్యా దురాక్రమణను ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక మద్దతుపై ఎక్కువగా ఆధారపడుతున్న ఉక్రెయిన్కు ఇది పిడుగుపాటులా పరిణమించింది. అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై యూరోపియన్ యూనియన్ ఇంకా స్పందించలేదు. -
రష్యా-ఉక్రెయిన్ వార్ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే
శనివారం రాత్రి రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన అతిపెద్ద దాడి ఇదేనంటూ ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిల్లో 249ని కూల్చేశామని.. మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని.. గత రాత్రి అతిపెద్ద దాడే జరిగిందంటూ ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లు అధికారులు వివరించారు. ఈ దాడిలో ఉక్రెయిన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోయిందని.. ఒక పైలట్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రష్యా ఆరు గంటలకు పైగా దాడులు చేసింది. దేశ వ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతీన్నాయని అధికారులు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య 2022 దాడులు కొనసాగుతున్నాయి. 36 నెలలు గడిచినా ఆగని రష్యా, ఉక్రెయిన్ పోరు ఆగడం లేదు.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది.తొలి రోజుల్లో రాజధాని కీవ్దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు.ఇదీ చదవండి: Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు -
రష్యా దాడుల్లో 12 మంది మృతి
కీవ్: రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్తోపాటు పలు ప్రాంతాలపై ఆదివారం రాత్రి డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. దాడుల్లో కీవ్లో ఏడుగురు సహా మొత్తం 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 30 మంది క్షతగాత్రులయ్యారు. రష్యా 352 డ్రోన్లు, 11 బాలిస్టిక్ క్షిపణులు, ఐదు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఉక్రెయిన్ పేర్కొంది. వీటిలో 339 డ్రోన్లు, 15 క్షిపణులను తమ గగనతల వ్యవస్థలు అడ్డుకున్నాయంది. నివాసప్రాంతాలు, ఆస్పత్రులు, క్రీడా సముదాయాలు లక్ష్యంగా దాడులు జరిగాయని ఆర్మీ తెలిపింది. కీవ్లో ఐదంతస్తుల అపార్టుమెంట్లో కొంతభాగం కుప్పకూలగా ఏడుగురు చనిపోయారని, నలుగురు శిథిలాల్లో చిక్కుకున్నారంది. -
ఇది దుస్సాహసాల యుగం
ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగింది. కానీ అదంత తేలిక కాలేదు. ఇప్పటికీ తన లక్ష్యం సాధించలేక పోయింది. చైనాపై ఆధారపడటం అనివార్యమైంది. ఇటీవలి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు దాన్ని మరీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. అయితే రష్యా ఏం ఓడలేదు. పైగా, 2022 ఫిబ్రవరి తర్వాత ఎన్నడూ లేనంత బలీయంగా ఇప్పుడు రూపొందింది. అంతర్జాతీయంగా రష్యాను ఏకాకి చేయాలన్న పథకం నీరుగారి పోయింది. ఈ పథక రచనలో ప్రధాన సూత్రధారి అమెరికా భంగపడింది. ఎలాగోలా రష్యాతో ఒప్పందం చేసుకోవాలని ఈ అగ్రరాజ్యం ఇప్పుడు అంగలారుస్తోంది. యూరోపియన్ యూనియన్ భద్రత మీద, ఉక్రెయిన్ సార్వభౌమికత మీద చేస్తున్న వ్యయం తగ్గించుకోవాలని భావిస్తోంది. యుద్ధం ద్వారా కాకుండా దౌత్యంతోనే ఈ ఊబి నుంచి బయటపడాలనుకుంటోంది.రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇందుకు ససేమిరా అన్నా ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. ‘దుస్సాహసం ఫలిస్తుంది’ అన్నది పుతిన్ తన అనుభవాల నుంచి నేర్చుకున్నపాఠం. ఒక దేశం మీద దండెత్తాడు. ఇప్పటిదాకా నెగ్గుకొచ్చాడు. మరింత ఉక్రెయిన్ భూభాగంపై పట్టు సాధించగలనన్న, తద్వారా తన విదేశాంగ విధానం ఎలా ఉండాలో నిర్ణయించుకునే శక్తి రష్యాకు సమకూరుతుందన్న, తూర్పు మధ్య యూరప్ ప్రాంతాల భద్రతకు ఢోకా ఉండదన్న ఆలోచన ఇలాగే కొనసాగవల్సిందిగా పుతిన్ను పురిగొల్పి ఉంటుంది. దుస్సాహసం ఫలిస్తుంది!గాజా మీద ఇజ్రాయెల్ దురాక్రమణకు దిగింది. హమాస్ టెర్రరిజం ప్రస్తుత సంక్షోభానికి పురిగొల్పింది అనడంలో సందేహం లేదు. అయితే, అందుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మితిమీరి ప్రతిస్పందించింది. అంతర్జాతీయ విశ్వసనీయతను కోల్పోయింది. ఇజ్రాయెల్ అంటే అదో జాతి నిర్మూలన శక్తి అని ప్రపంచవ్యాప్తంగా ఒక తరం మనస్సులో శాశ్వతంగా ముద్ర పడింది. ఈ దాడి ఆ దేశ వనరులను హరించివేసింది. పొరుగున ఉన్న అరబ్బు దేశాలతో సాధారణ సంబంధాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇజ్రాయెల్ దీర్ఘకాలిక భద్రత కూడా ప్రమాదంలో పడినట్లే!అయితే ఇజ్రాయెల్ ఏం ఓడలేదు. ఆ దేశపు దూరదృష్టి లేని వ్యూహకర్తలు కోణం నుంచి చూస్తే, హమాస్ నాయకత్వాన్ని తుదముట్టించడంతో పాటు వారి సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ ఈ పోరులో విజయం సాధించింది. హెజ్బొల్లా నాయకత్వాన్ని, సైనిక సదుపాయాలను నిర్మూలించి, లెబనాన్ పాలనలో మార్పు తెచ్చింది. సిరియా ప్రభుత్వ మార్పుకు పరోక్షంగా దోహదపడింది. నెతన్యాహూ ఇలాగే ముందుకు సాగి ఇరాన్ మీద దాడి చేశాడంటే అందులో ఆశ్చర్యపోయేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు తీర్చిదిద్దుతాయి. పుతిన్ అనుకున్నట్లే, నెతన్యాహూకు కూడా అతడి అనుభవం పాఠం నేర్పింది. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను అన్నింటినీ ఉల్లంఘించాడు. యుద్ధఖైదీ అభియోగం మోపి అరెస్టు చేయాలన్న ఇంటర్నేషనల్ వారెంటును పట్టించుకోలేదు. పాలస్తీనా కలలను చిదిమివేసిన అనుభవమే మరో దేశంపై దండెత్తడానికి, ఆ దేశ అణుశక్తి కార్యక్రమాలను వమ్ము చేయడానికి, అక్కడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నెతన్యాహూను పురిగొల్పి ఉంటుంది.ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోయినా...వీగర్ల స్వయంప్రతిపత్తి ప్రాంతమైన షిన్జియాంగ్ను చైనా జైలుగా మార్చేసింది. టిబెట్లో జనాభా స్వరూప స్వభావాలను మార్చింది. హాంకాంగ్ను హస్తగతం చేసుకుని రెండు వ్యవస్థల విధానాన్ని అమలు చేస్తామన్న చట్టబద్ధ హామీని విస్మరించింది. సౌత్ చైనా సముద్రంలోని ద్వీపాలను సైనిక స్థావరాలుగా చేసుకుంది. తన సరిహద్దుల వెలుపల తైవాన్తోపాటు, ఇతర తూర్పు ఆసియా దేశాల్లో పరోక్ష అధికారం చలాయిస్తోంది. ఇవేవీ కూడా ప్రత్యక్ష ఆక్రమణలు కాకపోవచ్చు. కానీ ఇవన్నీ కలిపి చూస్తే, తన ఆధిపత్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోయి చివరకు పూర్తిగా కబళించివేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ చర్యలతో చైనా ప్రతిష్ఠ మసకబారింది. చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు వీలుగా పలు దేశాలు కూటములుగా జట్టు కట్టేందుకు, చైనా వస్తు సరఫరాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పరిస్థితికి దారితీసింది. అయినా చైనా ఏం ఓడలేదు. వాస్తవానికి, తన ఆక్రమణలు అన్నిటినీ ‘న్యూ నార్మల్’గా మార్చేయగలిగింది. సాగర జలాల్లో తన అధికార ప్రదర్శనను కొనసాగించగలనని, లేదా తైవాన్ను ఆక్రమించుకోగలనని జిన్పింగ్ అనుకుంటే అందులో ఆశ్యర్యపడేదేం లేదు. ఒక మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే జిన్పింగ్ కూడా అనుభవాల నుంచి పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను హస్తగతం చేసుకున్నాడు. దేశానికి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ప్రత్యర్థులను అణచివేయడానికి అవినీతి వ్యతిరేక ఉద్యమాలను ఉపయోగించుకున్నాడు. హిమాలయాల్లో కానీ, సాగరాల్లో కానీ, పసిఫిక్ లేదా యూరేషియాలో కానీ ఇలాగే ముందుకు సాగాలని ఈ అనుభవమే జిన్పింగ్ను పురిగొల్పి ఉంటుంది. ఉగ్రవాద దుస్సాహసంఏప్రిల్ 22న పాకిస్తాన్ తైనాతీలు మరోసారి ఇండియాపై పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడ్డారు. అలాంటి ఘటన, దాని పర్యవసానాలు... టెర్రరిజం ఎగుమతుల కేంద్రంగా పాకిస్తాన్ పొందిన గుర్తింపును ఇంకా బలపరిచాయి. అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని మరింత కుంగదీశాయి. సైనిక పరంగా పాకిస్తాన్ బలహీనతలను బహిర్గత పరచాయి. దేశ సౌభాగ్యానికి అవసరమైన ప్రాదేశిక సమగ్రతను మరింత దూరం చేశాయి.అయితే తాను ఓడిపోయానని పాకిస్తాన్ అనుకోవడం లేదు. పైగా, రావల్పిండిలోని మిలిటరీ జనరళ్ల దృష్టిలో పాకిస్తాన్ గెలిచింది. తామే తప్పూ చేయడం లేదన్న యుద్ధోన్మాద ధోరణి ఇకమీదటా చెల్లిపోతుందని ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అనుకుంటే అందులో ఆశ్చర్యపడేదేం లేదు. మనిషిని అతడి అనుభవాలు రూపుదిద్దుతాయి. జిన్పింగ్, పుతిన్, నెతన్యాహూల మాదిరిగానే, తన అనుభవాలు అతడికి పాఠం నేర్పాయి. ఆ పాఠం: దుస్సాహసం ఫలిస్తుంది. మునీర్ ద్వేషం రగిల్చే ప్రసంగాలు చేశాడు. ఉగ్రవాద తైనాతీలను ప్రోత్సహించాడు. ప్రత్యర్థిని సైనిక ఘర్షణలోకి దించాడు. అంతర్జాతీయ పాత్ర కోసం అభ్యర్థన చేశాడు. కాల్పుల విరమణను విజయంగా ప్రకటించుకున్నాడు. కొన్ని తరాల ప్రజలను శోకంతో తపించేలా చేసినా, పాకిస్తాన్కు కావల్సిన ప్రచారాన్ని, ప్రజల్లో చీలికను సాధించిపెట్టిన ఇలాంటి ఉగ్రదాడులతోనే ముందుకుసాగేందుకు మునీర్ను అతడి అనుభవం పురిగొల్పవచ్చు. మరో దేశం మీద దండెత్తడం, ప్రజలను ఆకలితో అలమటింపజేయడం దుస్సాహసం (అడ్వెంచరిజమ్) అవుతుంది. టెర్రరిజానికి ఆశ్రయం ఇవ్వడం లేదా మరొకరి భూభాగాన్ని కైవసం చేసుకోవడం దుస్సాహసం అవుతుంది. అన్ని అంతర్జాతీయ నియమాలనూ, చట్టాలనూ ఉల్లంఘించడం, ట్రైబ్యునల్ ఉత్తర్వులను తిరస్కరించడం దుస్సాహసం అవుతుంది. మానవ సమాజాలు ఏర్పడినప్పటి నుంచీ దుస్సాహసం ఉంది. దీన్ని అడ్డుకునేది చట్టం, ఆచారం, స్వీయ నిగ్రహం... ఇవేవీ కావు. విఫలమవుతామన్న భయం, అందుకు చెల్లించాల్సిన మూల్యం మాత్రమే దుస్సాహసాన్ని అడ్డుకోగలవు. విషాదం ఏమిటంటే, ఇప్పుడు ఈ వైఫల్యభీతి అంతరించింది. అడ్వెంచరిజం ఫలించే యుగం ఇది.ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఉక్రెయిన్ పై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
ఉక్రెయిన్ మొత్తం మాదే.. పుతిన్ సంచలన ప్రకటన
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటేనని.. ఉక్రెయిన్ మొత్తం రష్యాదే అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం తమదేనని అన్నారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తెర లేపాయి.రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ..‘ఉక్రెయిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఇదే విషయం నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ఉక్రెయిన్ తమకు తాముగా సమస్యలను సృష్టించుకుంటోంది. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటే. దీని ప్రకారం ఉక్రెయిన్ మొత్తం మాదే. ఉక్రెయిన్ నగరం సుమీని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యం మాకు లేదు. ఉక్రెయిన్లో శాంతి సాధించాలనుకుంటే మాతో కలిసి రావాలి. మేము ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. అలాగే, ఉక్రెయిన్ లొంగిపోవాలని కూడా మేము కోరుకోవడం లేదు. రష్యా శాంతికి కట్టుబడే ఉంది. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షలను వదులుకోవాలి. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలపై మాస్కో నియంత్రణను అంగీకరించాలి. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 ఒప్పందాలను గుర్తుచేసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.Russians and Ukrainians are one people, and in that sense, the whole of Ukraine is ours — Putin 😳 pic.twitter.com/krghibrx0m— Frontalforce 🇮🇳 (@FrontalForce) June 20, 2025ఖండించిన పుతిన్అయితే, ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని నివాస ప్రాంతాలపై తాము దాడి చేశామన్న వ్యాఖ్యలను పుతిన్ ఖండించారు. తమ సైన్యం అటువంటి లక్ష్యాలను ఢీకొట్టలేదని వెల్లడించారు. తాము నివాస గృహాలపై దాడులు చేయలేదని, సైనిక స్థావరాలపైనే చేశామన్నారు. జెలెన్ స్కీతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ గతేడాది తన పదవీకాలం ముగియడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన చట్టబద్ధతను కోల్పోయారని ఆరోపించారు.ఈ సందర్భంగా పుతిన్..‘జెలెన్ స్కీతో సహా ఎవరినైనా కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది సమస్య కాదు. ఉక్రెయిన్ ఆయనకు చర్చలు జరిపే బాధ్యత అప్పగిస్తే, జెలెన్ స్కీనే అనుమతించండి. అసలు ప్రశ్న ఏమిటంటే ఫలితంగా వచ్చే పత్రాలపై ఎవరు సంతకం చేస్తారు? సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. జెలెన్ స్కీ అధ్యక్ష పదవీకాలం గతేడాది అధికారికంగా ముగిసింది. మార్షల్ లా విధించడం వల్ల అతడి వారసుడిని ఎన్నుకోలేదు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం పదవీ కాలం ముగిస్తే అధ్యక్ష అధికారాలను పార్లమెంటు స్పీకర్కు బదిలీ చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగవచ్చని జెలెన్ స్కీ వాదిస్తున్నారు. అయితే తీవ్రమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు మేము చట్టపరమైన అంశాల గురించి శ్రద్ధ వహిస్తాం. సంతకం చట్టబద్ధమైన అధికారుల నుంచి రావాలి. లేకపోతే జెలెన్ స్కీ తర్వాత ఎవరు వచ్చినా దానిని చెత్తబుట్టలో వేస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఈ అశక్తతలు దేనికి చిహ్నం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వరుసగా కనిపిస్తున్న అశక్తతలు దేనికి చిహ్నం? ఆయన జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ 140 రోజులలో ప్రకటించిన విధానాలను, తీసు కున్న చర్యలను, వాటి పర్యవసానాలను పరిశీలించినప్పుడు, వాటిలో దాదాపు అన్నింటా తన అశక్తతలే కనిపిస్తాయి. మరొక మాటలో వైఫల్యాలు. అయితే ఆ అశక్తతలు, వైఫల్యాలు వ్యక్తిగతంగా ట్రంప్కు పరిమితమైనవా, లేక అమెరికా మహా సామ్రాజ్యమే క్రమంగా బలహీనపడుతున్న స్థితికి సంకేతాలా అన్నది ఆలోచించవలసిన విషయం. ఒకవేళ ట్రంప్కు పరిమితమైన స్థితి అయితే ఇంకా మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అందుకు సవరణలు చేసుకోగల అవకాశం ఉంటుంది. అవి ఆ వ్యవస్థకే మౌలిక బలహీనతలు అయ్యే పక్షంలో సవరణలు తన కాలంలో సాధ్యపడకపోగా, ఆ తర్వాత రాగల అధ్యక్షులకు కూడా అతి పెద్ద పరీక్షలు ఎదురవుతాయి.తగిన భావజాలం ఏది?విధానాలు, చర్యలలో అంతర్గతం, విదేశీయం అని రెండు ఉంటాయి. ఎప్పుడైనా విదేశాంగ విధానాలు అంతర్గత ప్రయోజనాల కోసమేనన్నది తెలిసిందే. ఆ విధంగా చూసినపుడు ట్రంప్ విధానాలకు ఆధారమైనవి ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు. వీటిలో ప్రతిఫలించే ఆలోచన అమెరికా తన ఒకప్పటి గొప్పతనాన్ని కోల్పోయిందని! అందుకు బాధ్యత డెమోక్రాట్ల పరిపాలన అని! అమెరికా విధానాల వల్ల అమెరికన్ ధనిక వర్గాలు, ఇతర దేశాలు విపరీతంగా లాభపడుతుండగా సామాన్యులు నష్టపోతూ అమెరికా వెనుకబడుతున్నదనీ; సామాన్యులు, అలాగే తమ దేశం బాగుపడే విధానాల వల్లనే తిరిగి ‘అమెరికా ఫస్ట్’ కాగల దన్నది ఆయన తర్కం.ఇది యథాతథంగా సహేతుకమైన, ఆహ్వానించదగిన తర్కంగానే కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా అనుసరిస్తూ వచ్చిన పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాలను, వాటి ఆధారంగా నిర్మితమైన వ్యవస్థను రద్దు చేయటం కాకున్నా ఒక మేర సవరించాలన్నా మామూలు విషయం కాదు. రద్దు చేయాలన్నది ట్రంప్ ఆలోచన ఎంతమాత్రం కాదు. అంతర్గతంగా, విదేశీయంగా కొన్ని మార్పులు చేయాలని మాత్రం అనుకున్నట్లు ఆయన మాటలు, చేతలు సూచించాయి. ఆ కొద్దిపాటి మార్పులకైనా తగిన ఫిలసాఫికల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. కానీ ట్రంప్ ప్రధానంగా ఉద్వేగాల వ్యక్తి. ఉద్వేగతలకు లోతు ఉండదు, చంచలత ఉంటుంది.అమెరికా మహా సామ్రాజ్యపు శక్తి ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడటం ఈ 21వ శతాబ్దపు ఆరంభం నుంచే నెమ్మదిగా మొదలై, 2008 నాటి ఆర్థిక సంక్షోభంతో వేగం అందుకున్నది. అమెరికా ‘గ్రేట్నెస్’ పోవటమని ట్రంప్ అన్నదానికి ఆరంభాలు అప్పటి దశాబ్దం నుంచే కనిపిస్తాయి. అమెరికా బలాలు నాలుగింటిలో ఆర్థికం, రాజకీయం రెండు గాక, సైనికం, శాస్త్ర – సాంకేతికం మరొక రెండు. ఈ చివరి రెండింటిలో అమెరికా శక్తి ఆర్థిక, రాజ కీయాలవలె తగ్గలేదు గానీ, ఆ రెండు రంగాలలో ఇతరుల నుంచి పోటీలు పెరగసాగాయి. అనగా అమెరికాకు అవి పరోక్ష బలహీనత లన్నమాట. దెబ్బకొట్టిన నిర్ణయాలుట్రంప్ తమ దేశాన్ని మళ్లీ ‘గొప్పది’ చేయదలచుకుంటే, ఈ నాలుగు బలహీనతలను ఆపటం ఏ విధంగాననే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఒకవేళ ఉన్నా కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎదుర వుతాయి. వాటిలో మొదటిది–చరిత్రలో ఏ సామ్రాజ్యాలూ శాశ్వతంగా నిలవనపుడు అమెరికా అందుకు భిన్నం కాగలదా అన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు స్వీయ ప్రయోజ నాల స్పృహలు పెరుగుతూ, ఎవరి దారులు వారు వెతుక్కుంటూ, వాటిలో కొన్ని గణనీయంగా అభివృద్ధి చెందుతూ, అమెరికా, యూరప్ల పట్ల గత విధేయతలు బలహీనపడుతూ, బహుళ ధ్రువ ప్రపంచం క్రమంగా ఆవిష్కారమవుతున్నపుడు, అమెరికాకు గానీ, అమెరికన్ కూటమికి గానీ ఒకప్పటి ‘గొప్పతనం’ తిరిగి ఎట్లా సాధ్యమన్నది మరొక ప్రశ్న. అంతెందుకు, ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాము అధికారానికి వచ్చిన కొత్తలోనే, ‘ఏకధ్రువ ప్రపంచమన్నది గతించిన విషయ’మన్నారు.ఈ విధమైన బలహీనతలు అర్థమవుతూ, అదే సమయంలో అమెరికాను కనీసం ఉన్న స్థాయిలో నిలబెట్టాలని, అట్లాగే అక్కడి సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా రూపొందించాలని కొత్త అధ్యక్షుడు భావించితే, అందులో ప్రశంసించదగినదే తప్ప కొట్టివేయ వలసింది ఉండదు. ఆ విధంగా ఆయన ఒక వాస్తవవాది అను కోవాలి. అందుకు తగిన ఆచరణ ఏమిటన్నది అసలు ప్రశ్న. దిగుమతి సుంకాలను అన్ని దేశాలపై పెంచితే ఆదాయం భారీగా పెరిగి వాణిజ్య లోటు, ద్రవ్యలోటు, అప్పులు తగ్గుతాయనీ, ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చుననీ భావించారు. అందుకు తోడుగా అనేక రూపాలలో వ్యయ నియంత్రణ చేయ బూనారు. ఉద్యోగాల కోత, విదేశీ సహాయాల ఆపివేత వంటివి అందులో ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైన సుంకాల హెచ్చింపు వెంటనే గందరగోళంలో పడింది. ఉద్యోగాల కోత తీవ్రమైన వ్యతి రేకతను తెచ్చిపెట్టింది. స్టాక్ మార్కెట్లు వరుసగా దెబ్బతినగా,బాండ్ల మార్కెట్ ఎదురుతిరిగి, డాలర్ విలువ పడిపోవటం మొదలైంది. అమెరికా ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైన వాటిపై ఇతర దేశాలు ఎదురు సుంకాలు విధించటంతో ధరలు పెరగ సాగాయి. ఈ పరిణామాలతో జంకిన ప్రభుత్వం సుంకాల వాయిదాలు, తగ్గింపులు, చర్చల మార్గానికి మళ్లింది. ఇదే ఇప్పటికీ కొనసా గుతున్నది. ఉద్యోగాల కోత, అక్రమ వలసదారులను భయపెట్టి వేలకు వేలుగా పంపివేయటం వల్ల ఉత్పత్తి, సర్వీస్ రంగాలు దెబ్బ తినటం వెంటనే కనిపించింది. అది గ్రహించి యజమానులకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వబూనినా ఉపయోగం లేకపోయింది. ఉక్రెయిన్ వైఫల్యంఆ విధంగా కొన్ని వారాలు గడిచేసరికి ఆ గందరగోళం స్వదేశంలో, విదేశాలలో కూడా అందరికీ అర్థమై ట్రంప్ పట్ల గౌరవం, భయం తగ్గాయి. పరిపాలనా వ్యవహరణలు అస్తవ్యస్తంగా మారటంతో సన్నిహిత సలహాదారులను తొలగించటం కూడా మొదలైంది. ఎలాన్ మస్క్ ఉదంతం తాజా ఉదాహరణ. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు కొత్తగా వినవస్తున్నది. యూనివర్సిటీలు, విద్యా శాఖ, పరిశోధనా సంస్థలు, ఆరోగ్య రంగాలను వేధిస్తూ అమెరికాను తిరిగి గొప్పదిగా ఎట్లా చేయగలరన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి వేసేందుకు నిజంగానే ప్రయత్నించినా అది ఆగకపోగా తీవ్రమవుతున్నది. దానితో ఆయన చేతులెత్తేశారు. గాజా పట్ల గందరగోళం. నెతన్యాహూ తనను ఏ విషయంలోనూ లెక్క చేయటం లేదు. ఉక్రెయిన్, యూరప్ తమ దారి తాము చూసు కుంటున్నాయి. ఇరాన్ లొంగి రావటం లేదు. సిరియా, లెబనాన్పై దాడుల నిలిపివేతకు నెతన్యాహూ అంగీకరించటం లేదు. చైనాతో పాటు ‘బ్రిక్స్’ దేశాలు ట్రంప్ ఎంత భయపెట్టినా తమ కూటమిని మరింతగా విస్తరిస్తూ, డాలర్కు బదులు తమ స్థానిక కరెన్సీలలో చెల్లింపులను పెంచుతూనే ఉన్నాయి. మౌలిక స్థాయిలో, విస్తృత స్థాయిలో ఈ అమెరికన్ సామ్రాజ్యవాద బలహీనతలు ట్రంప్ ధోరణి వల్ల మరింత పెరుగుతున్నాయి. తన అశక్తతలు ఈ మౌలిక స్థితికి చిహ్నాలవుతున్నాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగింది. ఏకంగా 400 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించి, అతిపెద్ద దాడికి పాల్పడింది. ఈ దాడి దేశమంతటినీ ప్రభావితం చేసిందని, లెక్కలేనంత మంది గాయపడ్డారని, వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుని, ఉక్రెయిన్ ‘ఆపరేషన్ స్పైడర్వెబ్’ను నిర్వహించిన దరిమిలా, రష్యా తాజాగా ఉక్రెయిన్పై భీకరదాడి చేసింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఈరోజు, మన దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్తో పాటు అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగాయి. రష్యన్లు 400కు మించిన డ్రోన్లు, 40కిపైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మంది గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ శిథిలాల కింద విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని కొందరు ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్ ఈ కోవకు చెందిన వ్యక్తి. యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ఉక్రెయిన్ రాజధాని కైవ్లో ఈ దాడి కారణంగా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. లుట్స్క్లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్లో మరొక వ్యక్తి మృతిచెందారు. మొత్తం ఆరుగురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఉక్రేనియన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ (సీఎన్ఎన్) మీడియాకు తెలిపింది. రష్యా జరిపిన ఈ సైనిక దాడి ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న దాడులలో అతిపెద్ద దాడి. కైవ్ ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: కాళ్ల బేరానికి పాక్.. ‘సింధు ఒప్పందం’పై వేడుకోలు -
కొన్నాళ్లు కొట్టుకోనీ!
వాషింగ్టన్/కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. రెండు దేశాలనూ ఇంకొన్నాళ్లు కొట్టుకోనివ్వడమే మేలని వ్యాఖ్యానించారు. గురువారం వైట్హౌస్లో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవి మరీ చిన్నపిల్లల మాదిరిగా కీచులాడుకుంటున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘కొన్నిసార్లు ఓపికున్నంత సేపు కొట్టొకోనివ్వడమే మేలు. తర్వాత ఇద్దరినీ చెరోవైపు లాగేయాలి. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పా’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ‘‘నా మాట వినకపోతే చాలా కఠినంగా వ్యవహరిస్తా. యుద్ధానికి తెర దించకపోతే రెండు దేశాలపైనా ఆంక్షలు విధిస్తా’’ అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు.రష్యా డ్రోన్ దాడుల్లో ఐదుగురు మృతిబుధవారం రాత్రి ఉత్తర ఉక్రెయిన్లోని ప్రిలుకీ నగరంపై రష్యా డ్రోన్ దాడిలో ఐదుగురు మరణించారు. ‘‘స్థానిక ఫైర్ చీఫ్ ఒలెక్జాండర్ లెబిడ్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. ఆయన భార్య, కుమార్తె, ఏడాది వయసున్న మనవడు చనిపోయారు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. చిన్నారి తల్లి కీవ్లో పోలీసు అధికారి. అక్కడ రష్యా దాడులు పెరగడంతో బాబును తల్లిదండ్రుల దగ్గర వదిలేందుకు వచ్చి తనతో పాటుగా బలైంది. పుతిన్తో ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోపే ప్రిలుకీపై దాడి జరగడం గమనార్హం. ఆదివారం తమ వైమానిక స్థావరాలపై జరిపిన దాడులకు గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ తనతో అన్నట్లు అనంతరం ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు సాగిస్తుండటం తెల్సిందే. -
రష్యాకు తత్వం బోధపడాలి!
శాంతి సాధన కోసం తుర్కియేలో రష్యా–ఉక్రెయిన్ల మధ్య చర్చలకు 24 గంటల ముందు ‘ఆపరేషన్ స్పైడర్స్ వెబ్’ పేరిట ఉక్రెయిన్ ప్రయోగించిన వందలాది డ్రోన్లు ఆదివారం రష్యా సైనిక స్థావరాలు అయిదింటిలో భారీ విధ్వంసం సృష్టించగలిగాయి. మరోవైపు రష్యా అంతకుముందూ, ఆ తర్వాతా ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇలా పరస్పర దాడుల నేపథ్యంలో సోమవారం జరిగిన చర్చలు సహజంగానే గంటన్నరలో ముగిశాయి. కరచాలనాలు లేకుండా, కాల్పుల విరమణ ఊసెత్తకుండా యుద్ధఖైదీల మార్పిడిపై ఒప్పందం కుదుర్చుకుని రెండు బృందాలూ నిష్క్రమించాయి. అయిదు స్థావరాలపై ఉక్రెయిన్ దాడులకు ప్రయత్నించిన మాట వాస్తవమే అయినా మూడు చోట్ల దాడుల్ని నిరోధించగలిగామని రష్యా చెప్పుకుంటోంది. అందుకు భిన్నంగా తమ డ్రోన్లు రష్యాలోని 41 బాంబర్ విమానాలను ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ వివరిస్తోంది. దానికి వేలకోట్ల నష్టం వాటిల్లిందని చెబుతోంది. రష్యా దాడుల పర్యవసానంగా ఈ మూడేళ్ల కాలంలో ఉక్రెయిన్ సైన్యం వేలాదిమందిని కోల్పోయింది. ఇలాంటి నష్టాలను పెద్ద దేశం కనుక రష్యా భర్తీ చేసుకోగలుగుతోంది. అందుకే నల్లసముద్రంలో రష్యా దూకుడును తగ్గించేందుకు ఉక్రెయిన్ పూర్తిస్థాయిలో డ్రోన్లను నమ్ముకున్నట్టు కనబడుతోంది. యుద్ధం మొదలైన తొమ్మిది నెలల తర్వాత ఉక్రెయిన్ తొలిసారి 2022 డిసెంబర్లో రష్యా భూభాగంలో దాడులు మొదలు పెట్టింది. ఈ మూడేళ్ల కాలంలో తన స్థావరాలు, ఇంధన డిపోలు, యుద్ధ విమానాల గోడౌన్లు పటిష్టం చేసుకోవటంలో రష్యా శ్రద్ధ పెట్టిన మాట నిజమే అయినా ఉక్రెయిన్ సైతం డ్రోన్ల వినియోగంలో తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే పనిలోబడింది. ఆ విషయంలో అది విజయవంతమైందని ఆదివారంనాటి దాడులు వెల్లడిస్తున్నాయి. ప్రత్యర్థి దేశం తమతో పోలిస్తే పిపీలకమని, తమది అగ్రరాజ్యం, సంపన్న దేశమని మిడిసిపడే పరిస్థితి వర్తమాన కాలంలో ఎవరికీ లేదని ఉక్రెయిన్ దాడి వెల్లడిస్తోంది. యుద్ధం తప్పనిసరైనప్పుడు అందుకు అనుగుణంగా లోతైన అధ్యయనం చేసి, ఎప్పటికప్పుడు తనను తాను తీర్చిదిద్దుకున్న పక్షమే దీటుగా నిలబడగలుగుతుంది. ఉక్రెయిన్ ఆ పని చేయగలిగిందని ఈ ఉదంతం నిరూపిస్తోంది. యుద్ధం ప్రారంభించిందీ, దాన్ని వద్దు వద్దని ఎంతమంది చెబుతున్నా వినకుండా కొనసాగిస్తున్నదీ రష్యాయే గనుక అది ప్రస్తుత నష్టానికి తనను తానే నిందించుకోవాలి. చర్చలు ప్రారంభమయ్యాకైనా గౌరవప్రదంగా కాల్పుల విరమణకు సిద్ధమై తన డిమాండ్లేమిటో చెబితే వాటిపై ఉక్రెయిన్ వైఖరేమిటో తేటతెల్లమయ్యేది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినా, నిలిచిపోయిన యుద్ధాన్ని తిరిగి కొనసాగనీయరాదన్న ఆత్రుత అందరిలో వుండేది. అందువల్ల కొంత రాజీకి ఉక్రెయిన్ను ఒప్పించటానికి కూడా ప్రయత్నాలు సాగేవి. కానీ చర్చలకు ఒప్పుకున్నాక కాల్పుల విరమణ ఇంకా ఉనికిలోకి రాలేదన్న ఏకైక కారణంతో అది దాడుల్ని కొనసాగించింది. రష్యా దురాక్రమించిన భూభాగమంతా వెనక్కిస్తే తప్ప యుద్ధ విరమణ ఉండబోదని మొన్న జనవరి నెలాఖరున ఉక్రెయిన్ చెప్పటంతో ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ఇకపై అమెరికా నిఘా సమాచారం అందబోదని ప్రకటించారు. తాజా దాడులు గమనిస్తే ఉక్రెయిన్ ఆ అవరోధాన్ని కూడా అధిగమించగలిగిందని అర్థమవుతుంది. పైగా రష్యా గడ్డపైకి ట్రక్కుల్లో డ్రోన్లు తీసుకెళ్లి, లక్ష్యాలను చేరుకోగానే అవి ఒక్కసారిగా ఎగిరి యుద్ధ విమానాలను ధ్వంసం చేసేలా పథకం రచించింది.ఈ పరిణామానికి రష్యా ఎటూ ఆందోళన పడుతుంది. కానీ పాశ్చాత్య దేశాలు సైతం కంగారు పడక తప్పదు. ఎందుకంటే ఎవరి నిఘా సాయమూ లేకుండా చవగ్గా లభించే డ్రోన్లతో రష్యావంటి దేశంలో పెనువిధ్వంసం సృష్టించగలగటం మాటలు కాదు. తమ పొరుగునేవుండి, తమ ప్రోత్సాహంతో రష్యాను చీకాకు పర్చటానికి ముందుకొచ్చిన చిన్న దేశం సైనికంగా ఇంత పటిష్టం కావటం పాశ్చాత్య దేశాలు జీర్ణించుకోలేనిది. 2014 మొదట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వుండిన విక్టర్ యెనుకోవిచ్ తమ కీలుబొమ్మ కాలేదని అతన్ని కుట్రపూరితంగా పడగొట్టి జెలెన్స్కీని ప్రతిష్టించింది పాశ్చాత్య దేశాలే. అందుకు అమెరికా సైతం దన్నుగా నిలబడింది. నాటోను తూర్పువైపు విస్తరించాలన్న ఆ దేశాల దురాలోచనే ఇందుకు కారణమని గ్రహించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ దురాక్రమణకు తెరతీశారు. డ్రోన్ దాడుల్లో రష్యా కోల్పోయిన యుద్ధ విమానాలు టియూ–95, టియూ–160 విమానాలు. అవి క్రూయిజ్ క్షిపణుల్ని ప్రయోగించగల సామర్థ్యం వున్నవి. ఉక్రెయిన్ చెబుతున్నదే నిజమైతే రష్యా వైమానిక పాటవం 34 శాతం కోల్పోయిందని సైనిక నిపుణుల అంచనా. వీటిని తిరిగి సమకూర్చుకోవాలంటే వేలాది కోట్ల రూబుళ్ల వ్యయమవుతుంది. రష్యాకు తత్వం బోధపడినట్టేనా? తమ దాడులతోపాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షల తీవ్రతను పెంచాలన్నది జెలెన్స్కీ వాదన. కానీ అమెరికా కనుసన్నల్లో నడిచే ఆ దేశాలు అందుకు సిద్ధపడలేవు. యుద్ధాన్ని ప్రారంభించటం సులభమే, కొనసాగించటమూ పెద్ద కష్టం కాదు. కానీ ముగించటం అత్యంత క్లిష్టమైనది. ఇరుపక్షాలకూ అప్పటికే యుద్ధం ప్రతిష్టాత్మకంగా మారిపోతుంది. విరమణకు సిద్ధపడితే దేశాన్ని పాదాక్రాంతం చేశారన్న అపఖ్యాతి వస్తుంది. అలాంటి అవమానాన్ని దిగమింగటానికి జెలెన్స్కీ సిద్ధంగా వున్నా పుతిన్ ససేమిరా అనటమే ప్రస్తుత సమస్య. ఇప్పటికే ఎంతో జాప్యం జరిగింది. కనుక ఈ యుద్ధం ఆపటానికి ప్రపంచ దేశాలు ప్రయత్నించాలి. తగిన హామీలిచ్చి పుతిన్ను ఒప్పించాలి. -
డ్రోన్ వార్ఫేర్!
డ్రోన్ల రంగప్రవేశంతో యుద్ధాల తీరుతెన్నులే సమూలంగా మారిపోతున్నాయి. యుద్ధ విమానాలు మొదలుకుని చిన్నపాటి ఆయుధాల దాకా అన్నింటికీ డ్రోన్లు అతి సమర్థమైన ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి. ఈ కొత్త తరం డ్రోన్ వార్ఫేర్కు ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ పరాకాష్టగా నిలిచింది. ఇది ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పక్కలో పాక్ వంటి దాయాది ఉన్న భారత్కు పెను హెచ్చరిక సంకేతమే. నిఘా నేత్రాలకు చిక్కకుండా డ్రోన్లను కీలక సైనిక స్థావరాల, పౌర వ్యవస్థల సమీపానికి చేర్చగలిగితే చాలు, వాటిపై పెను దాడులకు పాల్పడవచ్చు.ఊహించలేనంత నష్టం కలగజేయవచ్చు. పాక్ ప్రేరేపిత ఉగ్ర ముఠాల స్లీపర్ సెల్స్ దేశమంతటా చొచ్చుకుపోయి మాటేసి ఉన్నాయన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో మనకిది ఆందోళనకర పరిస్థితేనని రక్షణ నిపుణులు అంటున్నారు. అలాంటి దాడులను కాచుకోవడం నిజంగా కత్తిమీద సామేనని అభిప్రాయపడుతున్నారు.నాలుగేళ్ల క్రితమే: మన సైనిక దళాలను లక్ష్యం చేసుకుని నాలుగేళ్ల క్రితమే డ్రోన్ దాడులకు తెగబడ్డారు. 2021లో జమ్మూలోని వైమానిక స్థావరంపై రెండు డ్రోన్లతో దాడులు చేశారు.వాటి ద్వారా అత్యాధునిక పేలుడు పదార్థాలను (ఐఈడీ) ఎయిర్బేస్పైకి జారవిడిచారు. అవి అదృష్టవశాత్తూ బహిరంగంగా నిలిపి ఉంచిన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లకు, సిబ్బందికి దూరంగా పడి పేలడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆ ఐఈడీలు పాక్ సైన్యం అందజేసినవేనని దర్యాప్తులో తేలింది. వాటి తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాలన్నీ మిలిటరీ గ్రేడ్కు చెందినవని నిర్ధారణ అయింది. పాక్ నుంచి మనకు ఎన్నిరకాలుగా పెను ముప్పు పొంచి ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ మాత్రమే.అదే పాక్ యుద్ధ తంత్రం!: ప్రత్యక్ష పోరులో పాక్ కనీసం కొద్ది రోజుల పాటు కూడా భారత్ ముందు నిలవలేదని ఆపరేషన్ సిందూర్, అనంతర ఘర్షణలు మరోసారి నిరూపించాయి. కనుక పాక్ తనకు బాగా అలవాటైన సూడో యుద్ధ నీతినే నమ్ముకుంటుందనడంలో సందేహం లేదు. ఉగ్ర ముఠాలకు మనపై దాడులకు ప్రేరేపించి, అందుకు కావాల్సిన సరంజామా అంతా అందించి సాయపడుతుంది. ఈ ముప్పుకు డ్రోన్ల రూపంలో ఇప్పుడు కొత్త కోరలు మొలిచినట్టే. కనుక భారత్ అత్యంత అప్రమత్తతతో మెలగక తప్పదు. అందుకే భారత్ డ్రోన్ దాడులను సమర్థంగా కాచుకుని, పూర్తి స్థాయిలో తిప్పికొట్టే వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. భారత్ తన కీలక సైనిక స్థావరాలు, మౌలిక వ్యవస్థల రక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.’సిందూర్’లో డ్రోన్ల హవాఆపరేషన్ సిందూర్, తదనంతర ఘర్షణల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఆపరేషన్ తొలి రోజు మే ఏడో తేదీన పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలు, స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేయడం తెలిసిందే.⇒ అందుకు ప్రతి చర్యగా పాక్ ప్రధానంగా నమ్ముకున్నది డ్రోన్ దాడులనే. మన సరిహద్దుల పైకి వందలాది డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో చాలావరకు మన భూభాగంలోకి ప్రవేశించాయి.⇒ ఫలితంగా పాక్తో జరిగిన నాలుగు రోజుల ఘర్షణల్లో భారత్ కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగించింది.⇒ పాక్ వైమానిక స్థావరాలపై దాడులకు ముందు యుద్ధ విమానాల ముసుగులో డ్రోన్లను పంపి దాయాది కీలక రాడార్ వ్యవస్థలు ఎక్కడెక్క డున్నదీ పక్కగా పసిగట్టింది. ఆ వెంటనే గుక్కతిప్పుకోనివ్వని క్షిపణి దాడులతో వాటిని ధ్వంసం చేసింది.⇒ తర్వాత పాక్లోని 11 కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసి చావుదెబ్బ తీసింది. రాడార్ వ్యవస్థలను కోల్పోయిన పాక్ నిస్సహాయంగా చూస్తుండటం తప్ప ఏమీ చేయలేకపోయింది. పాక్ ఆర్మీ చీఫ్తో పాటు సైనిక ఉన్నతాధికారులు బ్యాంకర్లలో తల దాచుకోవాల్సి వచ్చింది. కేవలం డ్రోన్లను ఎరగా వేసి భారత్ ఇంతటి ఫలితాలు సాధించడం విశేషం. -
రణ పంచతంత్రం
అగ్రరాజ్యం అమెరికాకు సరిసాటిగా ప్రపంచంలోనే పేరెన్నికగన్న రష్యా గత మూడేళ్లుగా ఉక్రెయిన్ను యుద్ధంలో ముచ్చెమటలు పట్టిస్తోంది. యుద్ధం తొలినాళ్లలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ను వందలాది ట్యాంక్లతో చుట్టేసి ఆక్రమించినంత పనిచేసిన రష్యా ఆతర్వాత కాస్తంత వెనుక్కు తగ్గింది. అణ్వాయుధాలు లేని ఉక్రెయిన్ ఏనాటికైనా తన ముందు తలవంచక తప్పదన్న రష్యా నిఘా నిర్లక్ష్యం తాజాగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఉక్రెయిన్ డ్రోన్ల దండు ‘స్పైడర్ వెబ్’ పేరుతో చేసిన దాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్తతరహా రణతంత్రంగా మార్మోగిపోతోంది.దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు యుద్ధవ్యూహాలకు పదునుపెట్టక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. గతంలో యుద్ధట్యాంకులను ఎంత త్వరగా ముందుకు ఉరికిస్తే అంత త్వరగా శత్రుదేశ భూభాగం మన వశం అవుతుందనే భావన ఉండేది. ఇప్పుడు ఎంత మెరుపువేగంతో డ్రోన్లను సరైన లక్ష్యందిశగా పంపితే అంత త్వరగా సమరక్షేత్రంలో జైత్రయాత్ర పూర్తిచేయొచ్చనే వాదన మొదలైంది. ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ దాడి ప్రపంచవ్యాప్తంగా ఐదు రకాలుగా రణవ్యూహాలను రాటుదేల్చాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదింటి గురించి ఓసారి పరిశీలిస్తే..1. దాడి కంటే వ్యూహం కీలకంయుద్ధంలో ఎంత బలంగా కొట్టామనేది కాదు. ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టామనేది ముఖ్యం. దాడి కంటే వ్యూహం ప్రధానమని తాజా ఘటన మరోసారి నిరూపించింది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కంటే ముందు.. ముందస్తు ప్రణాళికలో ఎలాంటి పొరపాట్లులేకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. రష్యా వైమానికస్థావరాలపై దాడి కోసం తాము దాదాపు ఏడాది, ఏడాదిన్నరకాలంగా వ్యూహరచన చేస్తున్నామని ఆదివారం దాడి తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఖచ్చితమైన దాడి కంటే అత్యంత స్పష్టమైన ప్రణాళిక అనేదే యుద్ధవిజయానికి కీలకం. కొత్త తరహా వ్యూహాన్ని రచించడం, దాని అమలుకు సిబ్బందిని మోహరించడం, దాడి చేయడం, దాడి తర్వాత అక్కడి నుంచి మెరుపువేగంతో అదృశ్యమవడం అనేవి ముఖ్యం.2. రవాణా మార్గాలు.. రణతంత్ర ఆయుధాలుయుద్ధంలో సరిహద్దుల వద్దకు క్షిపణులను, భారీ బాంబులను తరలించడానికి స్వదేశంలోని రహదారులనే ఏదేశమైనా ఉపయోగించుకుంటుంది. కానీ ఉక్రెయిన్ ఈ దాడిలో రష్యన్ రహదారులనూ ఉపయోగించుకుంది. డ్రోన్లను సరిహద్దు దాటించాక ఎవరూ గుర్తుపట్టకుండా చెక్క క్యాబిన్లలో సర్దిపెట్టి వాహనాల్లోకి ఎక్కించారు. తర్వాత వందల కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుమార్గంలోనే తీసుకెళ్లారు. సరిహద్దు దాటొచ్చిన డ్రోన్లను ఉక్రెయిన్ సమీప ప్రాంతాల్లో ఉపయోగించకుండా ఇలా వందల కిలోమీటర్లు తరలిస్తుందనే రష్యా అధికారులు అస్సలు ఊహించలేదు.అందుకే సుదూర ప్రాంతాల్లో ఎక్కడా వాహనాల తనిఖీలు జరగలేదు. యుద్ధంవేళ దేశవ్యాప్తంగా భారీ కంటైనర్లను సైతం తనిఖీచేయాలనే కొత్త నిబంధనను ఈ ఉదంతం తెరమీదకు తెస్తోంది. ప్రతీ కంటైనర్ను తనిఖీచేస్తే ఇంతటి దాడుల నుంచి ఏ దేశమైనా రక్షణ పొందొచ్చనే కొత్త పాఠాన్ని ఈ దాడి బోధిస్తోంది. రష్యాలో జరిగే అక్రమ సరకు రవాణా మార్గాలను ఉక్రెయిన్ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఏదైనా దేశంలో జరిగే స్మగ్లింగ్, అక్రమ రవాణా అనేది ఇలాకూడా వైమానికస్థావరాలపై దాడులకు పరోక్షంగా కారణమవుతుందని ఈ ఉదంతం చాటుతోంది.3. బుల్లి డ్రోన్తోనూ భారీ లక్ష్యం బద్దలు!ఆదివారం రష్యాలో ధ్వంసమైన విమానాలను ఉక్రెయిన్ ప్రధాన భూభాగం నుంచి సుదూర ప్రాంతాల్లో నిలిపి ఉంచారు. ఈ విమానాలను ఉక్రెయిన్ తన సొంత భూభాగం నుంచి లక్ష్యంగా చేసుకుని దాడిచేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణి కావాలి. ఆ క్షిపణి తయారీకి భారీ స్థాయిలో వ్యయం తప్పదు. సైబీరియా, ఆర్కిటిక్ ఖండ సమీప రష్యా వైమానిక స్థావరాలపై దాడి చేయాలంటే అత్యంత సుదూరాలకు ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులు అవసరం. కానీ ఇవేం లేకుండానే ఇదే పనిని బుల్లి డ్రోన్లు అత్యంత సులభంగా పూర్తిచేయగలవని తాజా ఘటనతో స్పష్టమైంది. అంటే సుదూర లక్ష్యల ఛేదనకు వందల కోట్ల ఖర్చుతో తయారైన క్షిపణులతో పనిలేదని ఈ ఘటనతో తేలిపోయింది. లక్ష్యం ఎంత దూరంగా ఉందనేది ముఖ్యంకాదు. దానికి ఎంత దగ్గరి నుంచి బద్దలుకొట్టగలం అనేదే ప్రధానం.4. తక్కువ వ్యయంతో ఎక్కువ నష్టం చేయొచ్చు..ముల్లును ముల్లుతోనే తీయాలనేది పాత సామెత. యుద్దవిమానాలను కూల్చేయాలంటే మనం కూడా యుద్ధవిమానంతోనో, క్షిపణితోనో దాడి చేసి నాశనంచేయాల్సిన పనిలేదని ఈ దాడి కొత్త విషయాన్ని చెబుతోంది. అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న బాంబర్ విమానాలను నాశనం చేయడానికి అత్యంత చవకైన డ్రోన్లు ఉంటే చాలు. ఉక్రెయిన్ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి.వాటి విలువ ఏకంగా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇంతటి శక్తివంతమైన అస్త్రాలను నిర్వీర్యంచేసేందుకు మనం కూడా అంతే స్థాయిలో ఖర్చుచేయాల్సిన పనిలేదని ఈ దాడి ఘటన తేటతెల్లంచేసింది. స్పైడర్స్ వెబ్ దాడి తర్వాత రణతంత్రాల పాఠాలను తమకూ బోధించాలని కొన్ని మిత్రదేశాలు బతిమాలినట్లు అంతర్జాతీయమీడియాలో కథనాలు వెలవడ్డాయి. అణ్వస్త్ర దేశంకాకపోయినా ఇప్పుడీ దాడితో ఉక్రెయిన్ ఒక్కసారిగా వార్ హాట్ఫేవరెట్గా నిలిచింది.5. మనం మాత్రమే రహస్యం అనుకుంటే సరిపోదు..రహస్య స్థావరం అనేది రహస్యంగా ఉంటేనే బాగుంటుంది. అందరికీ తెల్సిపోయాక రహస్య స్థావరం అంటే బాగోదు. గగనతల నిఘా నేత్రాలు కొలువైన శాటిలైట్లయుగంలో ప్రతీదీ బహిరంగమే. అందుకే ఫలానా చోట స్థావరం ఉందని తెలిసినా దానిపై దాడి చేయడం అసాధ్యం అనే స్థాయిలో దానికి భద్రత కల్పించడం అవశ్యమని తాజా ఘటనతో నిరూపితమైంది. నిఘా సంస్థ కార్యాలయంలో రహస్యాలు ఎంత భద్రంగా ఉంటాయో, నిఘా సంస్థ పరిసరాలు సైతం అంతే రక్షణాత్మకంగా ఉండాలని తాజా ఘటన చాటింది.రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్ఎస్బీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం సమీపంలోనే తమ కమాండర్సెంటర్ను నిర్వహించామని ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో శత్రు దేశాలపై నిఘాతోపాటు స్వీయ నిఘాపైనా మరింత దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. అధునాతన ఆయుధాలకంటే అధ్భుతమైన ఆలోచనలే ఆయాదేశాలకు అసలైన అస్త్రాలుగా అక్కరకొస్తాయని స్పైడర్స్వెబ్ ఘటన ఉద్ఘాటిస్తోంది. -
ఆపరేషన్ స్పైడర్స్వెబ్...నయా పెరల్ హార్బర్!
నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యానికి చెందిన ఏకంగా 41 బాంబర్ విమానాలను ఏదో వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా దాని సొంతగడ్డ మీదే ధ్వంసం చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం సృష్టించింది. అది కూడా ఏ ఒక్కచోటో కాదు. రష్యావ్యాప్తంగా ఏకంగా మూడు టైమ్ జోన్లలో, ఏకంగా 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు వైమానిక స్థావరాలపై ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరగడం విశేషం. ఆ దెబ్బకు రష్యా బాంబర్ శ్రేణి విమానాల్లో మూడో వంతు తుడిచిపెట్టుకుపోయాయి! అత్యంత సంక్లిష్టమైన ఇంతటి ఆపరేషన్ను పూర్తి కచ్చితత్వంతో, కేవలం డ్రోన్ల సాయంతో కారుచౌకగా, తనవైపు ఎలాంటి ప్రాణనష్టమూ లేకుండా పూర్తి చేసిన వైనం రక్షణ నిపుణులనే విస్మయపరిచింది. ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదేనని చెబుతున్నారు. అంతేగాక ఏ కోణం నుంచి చూసినా అత్యంత విజయవంతమైన దాడిగా కూడా ఇది నిలిచింది. రష్యా చరిత్రలో అతి పెద్ద నిఘా వైఫల్యంగా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ దాడులను తమ పాలిట ‘పెరల్ హార్బర్’ ఉదంతంగా రష్యా మీడియానే అభివర్ణిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం చివర్లో హవాయిలోని పెరల్ హార్బర్పై జపాన్ మెరుపు దాడులకు దిగి అమెరికా యుద్ధనౌకలను సముద్రంలో ముంచేసింది. ఈ ఉదంతం అమెరికాను యుద్ధంలోకి లాగడమే గాక జర్మనీ, జపాన్ తదితర అక్షదేశాల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ‘ఆపరేషన్ స్పైడర్స్వెబ్’ పేరిట ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులు రష్యాను ఆ స్థాయిలో దెబ్బకొట్టాయని అక్కడి మీడియా వాపోతోంది. అది అక్షరాలా నిజమేనని రక్షణ నిపుణులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆధునిక యుద్ధ వ్యూహాలను తక్షణం సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని వారంటున్నారు.ఇంత భారీ ఆపరేషన్కు రష్యా గడ్డ మీద కూడా అవసరమైన మద్దతు తప్పనిసరి. ఇందుకోసం ఉక్రెయిన్ రష్యాలో ఏకంగా ఆఫీసే తెరిచింది! అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్ఎస్బీ కార్యాలయం పక్కనేనని జెలెన్స్కీ వెల్లడించడం విశేషం. ఏ ప్రాంతంలో అన్నది మాత్రం చెప్పలేదు. → మొత్తం ఆపరేషన్ను ఉక్రెయిన్ సీక్రెట్ సరీ్వస్ (ఎస్బీయూ) పక్కాగా నిర్వహించింది.→ దీన్ని జెలెన్స్కీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దాడి వెనక ఏడాదిన్నర ప్రణాళిక ఉన్నట్టు వెల్లడించారు. ‘‘రష్యా గడ్డ నుంచే ఎంతోమంది ఇందుకు తోడ్పడ్డారు. వారందరినీ దాడులకు ముందే సురక్షితంగా తరలించాం. మావైపు ప్రాణనష్టం లేకుండా రష్యాను చావుదెబ్బ తీశాం’’ అన్నారు. రష్యాపై మరిన్ని దాడులు తప్పవన్నారు.→ డ్రోన్ దాడుల అనంతరం రష్యా ప్రతీకార దాడుల్లో 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతికి బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ పదాతి దళాధిపతి మేజర్ జనరల్ మైకేలియో ద్రాపత్యు రాజీనామా చేశారు.ఎక్కడెక్కడ దాడులు... → ఒలెన్యా (ముర్మాన్స్క్ ), బెలయా (ఇర్కుట్స్క్ –సైబీరియా), ద్యాగిలెవొ (సెంట్రల్ ర్యాజాన్), ఇవనొవొ → ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బెలయా ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉంటుంది! → వీటిలో ఒలెన్యా, బెలయా స్థావ రాల మధ్య దూరం ఏకంగా 6,000 కి.మీ.! ఇవి పరస్పరం మూడు టైమ్ జోన్ల దూరంలో ఉండటం విశేషం. → అమూర్, ఇవనోవో, ర్యాజన్ తదితర ప్రాంతాల్లోనూ డ్రోన్ దాడుల యత్నాలు జరిగాయని రష్యా ధ్రువీకరించింది.గతంలోనూ... మూడేళ్ల పై చిలుకు యద్ధంలో అనూహ్య, ఆకస్మిక దాడులతో రష్యాకు ఉక్రెయిన్ తీవ్ర నష్టం కలిగించడం ఇది తొలిసారేమీ కాదు. → 2022 ఏప్రిల్లో రష్యా యుద్ధనౌక మోస్క్ వాను నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైళ్లతో ఉక్రెయిన్ నల్లసముద్రంలో ముంచేసింది. ళీ 2022 అక్టోబర్లో ఆక్రమిత క్రిమియాను రష్యా భూభాగానికి కలిపే కీలక కెర్చ్ బ్రిడ్జిని బాంబులతో పేల్చేసింది. ళీ 2024 ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా సరిహద్దులు దాటి రష్యా భూభాగంపై మెరుపు దాడులకు దిగి కుర్క్స్ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకుంది. తీరని అవమానం మిగిల్చిుంది!ట్రక్కుల్లో తరలించి...సింపుల్ ప్లానింగ్. పూర్తి గోప్యత. పక్కా రిహార్సల్స్. ఆకస్మిక దాడి. అమలులో మెరుపువేగం. 100 శాతం లక్ష్యసాధన. సర్జికల్ స్ట్రైక్స్ వంటి స్పెషల్ ఆపరేషన్స్ ఏ మేరకు సఫలమైందీ తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్ విలియనం మెక్రావెన్ సిద్ధాంతీకరించిన గీటురాళ్లు. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో మేళవించిన ఆపరేషన్గా స్పైడర్స్ వెబ్ నిలిచింది. → మొత్తం ఆపరేషన్లో ఉక్రెయిన్ చాలావరకు పౌర మౌలిక సదుపాయాలనే వాడుకుంది. → ఇంతటి భారీ స్థాయి దాడులకు ప్రణాళిక రచించిన ఉక్రెయిన్, అందుకు సిద్ధం చేసిన డ్రోన్లను రష్యాలోకి తేలిగ్గా దొంగచాటుగా తరలించడం విశేషం. → అనంతరం వాటిని ట్రక్కుల్లో చెక్క కంటైనర్లలో పెట్టి ఎయిర్బేస్లకేసి తరలించారు. → ఒక్కో కంటైనర్లో 36 డ్రోన్లను ఉంచారు. వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. → దాడుల్లో ఎక్కడా ప్రత్యక్షంగా సిబ్బందిని నియోగించే అవసరమే లేకుండా పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేశారు. → ట్రక్కులను వైమానిక స్థావరాలకు అతి సమీపంలోకి తీసుకెళ్లారు. → అక్కడినుంచి నిర్ధారిత సమయంలో కంటైనర్ల పైకప్పును రిమోట్ ద్వారా తెరిచారు. → ఆ వెంటనే వాటిలోంచి డ్రోన్లు పైకెగిరి లక్ష్యాలపైకి దూసుకెళ్లాయి. సరిగ్గా విమానాలపై పడి పేలిపోయాయి. కంటైనర్ల నుంచి డ్రోన్లు పైకి ఎగురుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా మీడియా విడుదల చేసింది. వాటిని అడ్డుకునేందుకు కొందరు సాయుధులు ట్రక్కులపైకి ఎక్కుతున్న దృశ్యాలు కూడా కొన్నింట్లో కనిపిస్తున్నాయి.కారుచౌకే.. కానీ ఖతర్నాక్ రష్యా ఎయిర్బేస్లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడింది ఎఫ్పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) రకం డ్రోన్లు. → ఇవి కారుచౌకగా దొరుకుతాయి. పేలుడు పదార్థాలను బిగించి పంపగల ఒక్కో ఎఫ్పీవీ డ్రోన్ ఖరీదు కేవలం రూ.42 వేలు మాత్రమేనని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. → అయితే గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి. → డ్రోన్కు అమర్చిన కెమెరా సాయంతో అక్కడి పరిసరాలను దాని ఆపరేటర్ ప్రత్యేక కళ్లద్దాల సాయంతో లైవ్లో చూడటమే గాక వీడియో తీయగలడు. రిమోట్గా ఆపరేట్ చేయగలడు. → పరిసరాల చిత్రీకరణ వంటి సైనికేతర పనుల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడుతుంటారు. వీటి రేంజ్ కొన్ని కిలోమీటర్లకే పరిమితం.రష్యా అణుదాడి చేస్తుందా...? ఉక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది. కారుచౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఉక్రెయిన్పై భారీ స్థాయిలో విరుచుకుపడటం ఖాయమే. → ఉక్రెయిన్ ప్రధానంగా నాటో సభ్యదేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది. కనుక యూరప్లోని నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు. వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. → ఉక్రెయిన్ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. డ్రోన్ దాడులు పూర్తిగా తన పనేనని, నాటో మిత్రులకు ఏ సంబంధమూ లేదని జెలెన్స్కీ ప్రకటించారు. వాణిజ్యపరంగా సులువుగా అందుబాటులో ఉన్న డ్రోన్లనే దాడుల్లో వాడినట్టు వివరించారు. అందుకు రుజువుగా దాడుల ఫొటోలను విడుదల చేశారు. → నష్ట, అవమాన తీవ్రత దృష్ట్యా ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి దిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.రష్యాకు నష్టం ఇలా... → 41 టీయూ–95, టీయూ–22ఎం3 దీర్ఘ శ్రేణి బాంబర్లు, దాడుల్లో వాటికి ఆద్యంతం దన్నుగా నిలిచే ఏ–50 నిఘా విమానాలపై డ్రోన్ దాడులు జరిగాయి. → వాటిలో 14 పూర్తిగా, మిగతా 27 చాలావరకు ధ్వంసమైనట్టు చెబుతున్నారు. → మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్నది ఈ విమానాలనే! → ఈ నష్టం విలువ కనీసం రూ.60 వేల కోట్ల (700 కోట్ల డాలర్ల)పై చిలుకేనని రష్యా రక్షణ శాఖే అంచనా వేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్


