మాస్కో: ఉక్రెయిన్కు గుట్టుచప్పుడు కాకుండా అణ్వాయుధాలను బదలాయించేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ ప్రయత్నిస్తున్నాయని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మంగళవారంతో ఐదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో రష్యా విదేశీ నిఘా విభాగం (ఎస్వీఆర్) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. ఇది చాలా ప్రమాదకర పరిణామమంటూ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ ఆందోళన వెలిబుచ్చారు. యుద్ధానికి తెర దించేందుకు జరుగుతున్న చర్చల్లో తాము విధించిన ప్రధాన షరతుల్లో ఉక్రెయిన్ అణ్వస్త్రరహిత దేశంగా ఉండటం అతి ముఖ్యమైనదని గుర్తు చేశారు.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి నాలుగేళ్లు నిండాయి. ఇరువైపులా లక్షలాది మంది సైనికులు సమరంలో సమిధలుగా నేలకూలినా రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ దాహం తీరడం లేదంటూ ప్రపంచ దేశాలు ఆగ్రహిస్తున్నాయి. కానీ ఈ పోరును ఆపలేక చేష్టలుడిగి చూస్తున్నాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి విఫలమై చోద్యం చూస్తోంది. ఉక్రెయిన్ రణక్షేత్రంలో రక్తధారాలు ఆగి శాంతి కపోతం ఎగురుతుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి ఎవరూ బదులు చెప్పలేని పరిస్థితి!
ఉక్రెయిన్పై తక్షణం యుద్ధం ఆపకపోతే రష్యాపై మరిన్ని అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు. అందుకు జూన్ దాకా గడువు విధించారు. ఆలోపు పుతిన్ వైఖరి మారేనా? యుద్ధానికి తెర దించేందుకు అంగీకరిస్తారా? బదులుగా ఉక్రెయిన్లోని కీలక డోన్బాస్ ప్రాంతాన్ని రష్యాకు వదులుకునేందుకు అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తారా? ఇవి ప్రస్తుతానికి ట్రిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలాయి.
2022 ఫిబ్రవరి 24న మొదలు...
2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించుకున్నాక కూడా రష్యా దురాక్రమణ దాహం తీరలేదు. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై ఏకపక్షంగా దండెత్తింది. నాటి నుంచీ పోరాడుతున్నా ఉక్రెయిన్ నుంచి 20 శాతం భూభాగాన్ని మాత్రం ఆక్రమించుకోగలిగింది. ఈ క్రమంలో ఇరువైపులా ఏకంగా 20 లక్షల మంది సైనికులు చనిపోయారని వార్తలొచ్చాయి! అయితే 3,25,000 మంది రష్యా సైనికులు చనిపోయారని, మొత్తంగా 12 లక్షల మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ సంస్థ ప్రకటించింది.
ఉక్రెయిన్ వైపు 140,000 మంది సైనికులు చనిపోయారని, 6 లక్షల మంది గాయపడ్డారని తెలిపింది. రష్యా ఆక్రమణ వేగం నత్త కన్నా మెల్లగా ఉందని నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే ఎద్దేవా చేశారు. ఐరోపా దేశాల ఆయుధ, ఆర్థికబలంతో రష్యాపై ఉక్రెయిన్ భీకరంగా పోరాడుతోంది. అందుకే నాలుగేళ్లలో డోనెట్స్క్ ప్రాంతంలో రష్యా కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ముందుకు రాగలిగిందని అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇటీవల తాము ఆక్రమించిన నాలుగు ప్రాంతాలపై ఉక్రెయిన్ హక్కులు వదలుకోవాలని, ముఖ్యంగా కీలక డోన్బాస్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. అందుకు జెలెన్స్కీ ససేమిరా అంటున్నారు.


