సుంకాలకు ముకుతాడు పడేనా? | Sakshi Guest Column On USA Donald Trump Tariffs Issues | Sakshi
Sakshi News home page

సుంకాలకు ముకుతాడు పడేనా?

Feb 25 2026 12:09 AM | Updated on Feb 25 2026 12:09 AM

Sakshi Guest Column On USA Donald Trump Tariffs Issues

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విధింపు ఒక ప్రహసనంగా పరిణమించింది.  భౌగోళిక రాజకీయ సంబంధాలను, ప్రపంచ ఆర్థిక గతిశీలతలను చిందరవందర చేయడానికి ట్రంప్‌ చూపించిన మొగ్గుదల వినాశకర పర్యవసానాలకు దారితీసింది. అమెరికా సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు దీనికే అద్దం పట్టింది. అనేక దేశాలతో అమెరికా వాణిజ్యంలో భారీ లోటు, అసమతూకం చోటుచేసుకున్నాయి. వాటిని సరిదిద్దాలన్న నిస్పృహే ట్రంప్‌ సుంకాల బెదిరింపులలో వ్యక్తమవుతూ వచ్చింది. 

బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో సహా 11 దేశాలతో కూడిన  ‘బ్రిక్స్‌’ కూటమి అమెరికా ప్రయోజనాలకు వ్యతి రేకంగా పనిచేస్తోందని ట్రంప్‌ గతంలో వ్యాఖ్యానించారు. కూటమి లోని దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడి ఆవేశం, మాటల తీవ్రత చూసిన వారికి ఆయన ‘అహంకారం’తో వ్యవహరిస్తున్నారని అనిపించడంలో తప్పు లేదు. ప్రపంచ మార్కెట్లపై అమెరికా ఆధిపత్యాన్ని స్థిరపరచాలన్న ప్రయ త్నాలే ఆయన ధోరణిలో ప్రస్ఫుటమయ్యాయి. అమెరికా ఆధిప త్యాన్ని చాటడమే నిజంగా ట్రంప్‌ ఉద్దేశమైతే, ఆయన ఆ ప్రయ త్నాన్ని విరమించుకుని, బహుశా ఎవరెస్టు శిఖరారోహణకు యత్నించినా సఫలమై ఉండేవారనిపిస్తుంది. 

తీరని వాణిజ్య లోటు
అమెరికాకు, దాని భాగస్వామ్య దేశాలు చాలా వాటితో ఉన్న వాణిజ్య లోటు ఈనాటిది కాదు. కొన్నేళ్ళుగా అది పెరిగిపోతూ వచ్చి, దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించింది. అమెరికా వాణిజ్య లోటు 2024 నాటికి ఏకంగా 1.2 ట్రిలియన్‌ డాలర్ల మేరకు ఉంది. దాని దిగుమతులు దాదాపు 3.5 ట్రిలియన్‌ డాలర్ల మేరకు ఉండగా, ఎగుమతులు 2 ట్రిలియన్‌ డాలర్లకు కొద్ది పైచిలుకు మాత్రమే. ఈ విపరీతమైన వ్యత్యాసం సుంకాల పెంచినంత మాత్రాన తగ్గేది కాదు. దిద్దుబాటు చర్యకు ఉపక్రమించడానికి అధ్యక్షుడు ట్రంప్‌ బుద్ధి కుశలతతో కూడిన విధానాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఉండాల్సింది. వాణిజ్య సమీకరణాలలో సమతూకానికి అది కొంత దోహదపడి ఉండేది. 

సుంకాల పెంపుదలలు ప్రతికూల ఫలితాలకే దారితీస్తాయి. ప్రతిగా వాణిజ్య సంబంధాలపై ‘అంతకు అంత ప్రభావం–పర్యవసానాలు’ ఉంటాయని ట్రంప్‌కు తెలియకుండా ఉంటుందని అనుకోలేం. భారత్, చైనాలతో సహా అనేక దేశాలతో అమెరికా వాణిజ్యంలో అసమతూకమే ఉంది. అమెరికా మొత్తం వాణిజ్య లోటులో ఈ రెండు దేశాల వాటాయే దాదాపు 33 శాతం. అమెరికా వాణిజ్య లోటు 2024లో సుమారు 368 బిలియన్‌ డాలర్లు ఉంటే, అందులో చైనాది సింహ భాగంగా 319 బిలియన్‌ డాలర్ల మేరకు ఉంది. భారత దేశంతో వాణిజ్య లోటు సుమారుగా 49 బిలియన్‌ డాలర్లు.

డిమాండ్‌ను బట్టే వ్యాపారం
భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్య దృక్పథం నుంచి చూస్తే, అమెరికాకు మన దేశ మొత్తం ఎగుమతులు 2024లో  91 బిలియన్‌ డాలర్లకు పైగా ఉన్నాయి. అమెరికా నుంచి మన దిగుమతులు దాదాపు 42 బిలియన్‌ డాలర్ల మేరకు ఉన్నాయి. భారతదేశ మొత్తం దిగుమతుల విలువ 700 బిలియన్‌ డాలర్లకు కొద్ది పైచిలుకు ఉంటే, దానిలో అమెరికా వాటా దాదాపు 6 శాతంగా ఉంది. 

అమెరికాకు వెళ్ళే భారత్‌ ఎగుమతులలో సహజ ముత్యాలు, శాస్త్రీయంగా పెంచిన ముత్యాలు, విలువైన రత్నాలు, పాక్షికంగా విలువైన రత్నాలు ఎక్కువ భాగం ఆక్రమిస్తున్నాయి. వాటి విలువ సుమారు 12 బిలియన్‌ డాలర్ల మేరకు ఉంటుంది. తర్వాతి వాటా ఔషధాలది (సుమారు 9 బిలియన్‌ డాలర్లు) కాగా, 6 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ఎలక్ట్రికల్‌ మెషినరీ, పరికరాలు కూడా ఎగుమతి అవుతున్నాయి. అమెరికా నుంచి మనం ఖనిజ ఇంధ నాలు, ఖనిజ నూనెలు (12 బిలియన్‌ డాలర్లు), న్యూక్లియర్‌ రియా క్టర్లు, బాయిలర్లు, యంత్ర పరికరాలు (3.2 బిలియన్‌ డాలర్లు) దిగుమతి చేసుకుంటున్నాం. 

ప్రపంచ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వాటిలో ఖనిజ చమురు (220 బిలియన్‌ డాలర్లు), శాస్త్రీయంగా పెంచిన ముత్యాలు (83 బిలియన్‌ డాలర్లు), న్యూక్లియర్‌ రియాక్టర్లు (61 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయి. వంట నూనెలకు భారత్‌ పెద్ద దిగు మతిదారుగా ఉంది. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న పశు, వెజిట బుల్‌ లేదా మైక్రోబయల్‌ ఫ్యాట్లు, నూనెల విలువ 17 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అందులో అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నది కేవలం 45 మిలియన్‌ డాలర్ల విలువైనది మాత్రమే. ఈ ఉత్పత్తికి సంబంధించి అమెరికా మొత్తం ఎగుమతుల విలువ దాదాపు 2 బిలియన్‌ డాలర్లు. ఈ ఉత్పత్తులలో గణనీయమైన భాగాన్ని మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని ట్రంప్‌ ఆశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

కానీ, డిమాండ్, సరఫరా, అవసరాలు, నాణ్యత, ధరలు వంటి ప్రధాన అంశాలు ప్రపంచ మార్కెట్లను నడిపిస్తాయి. ప్రతీకార సుంకాల పెంపు ఎగుమతి చేస్తున్న, దిగుమతి చేసుకుంటున్న రెండు దేశాలకూ పరస్పర వినాశకర ఆయుధంగా పరిణమిస్తుందని ఆయన తెలుసుకుంటే మంచిది. ట్రంప్‌ అల్టిమేటం (ఒకవేళ సఫలమైతే) అంతిమ ప్రభావం దిగుమతి చేసుకుంటున్న దేశంలోని వినియోగ దారులపైనే ఉంటుంది. ప్రస్తుత సందర్భంలో అది అమెరికన్‌ వినియోగదారులపైనే ఉంటుందని గ్రహించాలి. అమెరికా సుప్రీంకోర్టు ఈ వాస్తవాన్ని విపులీకరించింది. తదనుగుణంగా, నిరంకుశ సుంకాల పెంపుదలలకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్‌ స్వయం విధ్వంసకర మీటను నొక్కకుండా అమెరికా సుప్రీం కోర్టు తీర్పు నిరోధిస్తుందేమో చూడాలి. ట్రంప్‌ మాత్రం రూటు మార్చి కొత్త ట్యారిఫ్‌లతో ముందుకొచ్చి, తగ్గేదేలే అంటున్నారు.

– సత్యపాల్‌ మీనన్‌
సీనియర్‌ జర్నలిస్ట్, జర్నలిజం అధ్యాపకులు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement