న్యూయార్క్: అమెరికాలోని ఈశాన్య ప్రాంతాలపై ప్రకృతి ప్రకోపించింది. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా విరుచుకుపడిన భారీ హిమపాతం (నార్ ఈస్టర్) అగ్రరాజ్యాన్ని గజగజ వణికిస్తోంది. మేరీల్యాండ్ నుంచి మెయిన్ వరకు విస్తరించిన ఈ మంచు తుపాను ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని ‘బాంబ్ సైక్లోన్’గా అభివర్ణిస్తున్నారు.
ఆర్కిటిక్ నుంచి వీస్తున్న గడ్డకట్టే చలితో కూడిన గాలులు ఒక్కసారిగా వెచ్చని వాతావరణంతో ఢీకొనడంతో పీడనం ఒక్కసారిగా పడిపోయి, ఈ ప్రకృతి విలయం సంభవించింది. న్యూయార్క్ నగరంలో పాఠశాలలకు సెలవు ప్రకటించగా, రోడ్లపై అడుగుల కొద్దీ పేరుకుపోయిన మంచును తొలగించడానికి పాలక యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 4.5 లక్షల మందికి పైగా జనం అంధకారంలో కాలం గడుపుతున్నారు.
విమానయాన రంగంపై ఈ తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా సోమవారం నాటికి 5,600 విమాన సర్వీసులు రద్దు కాగా, మంగళవారం మరో 2,000 సర్వీసులను నిలిపివేశారు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. రోడ్ ఐలాండ్లోని టిఎఫ్ గ్రీన్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏకంగా 38 అంగుళాల మంచుతో నిండిపోయింది. ఇది 1978 నాటి రికార్డులను తిరగరాసింది. అటు రైలు, బస్సు సర్వీసులు కూడా పాక్షికంగా నిలిపివేయగా, స్టాటన్ ఐలాండ్లో రైలు రాకపోకలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు.
ప్రజా భద్రత దృష్ట్యా డోర్-డాష్ లాంటి డెలివరీ సర్వీసులు కూడా న్యూయార్క్ నగరంలో తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మంచు తీవ్రత కారణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం వాయిదా పడగా, పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ లో 19 అంగుళాల మంచు కురవగా, రోడ్ ఐలాండ్లోని వార్విక్లో మూడు అడుగులకు పైగా మంచు పేరుకుపోయింది.
కేప్ కాడ్ తీరంలో గంటకు 133 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు హరికేన్ను తలపించాయి. ఈ పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పర్యాటక ప్రాంతాలైన టైమ్స్ స్క్వేర్ వంటి చోట్ల జనసంచారం లేక వెలవెలబోతుండగా, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్, బ్రాడ్వే ప్రదర్శనలు ఆర్లింగ్టన్ నేషనల్ సెమెట్రీని కూడా మూసివేశారు. రోడ్లు ఇంకా మంచుతో నిండి ఉండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు.. పాఠశాలలను మూసి ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మంచు తుపాను బీభత్సం నుంచి సాధారణ స్థితికి వచ్చేందుకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: శశికళ సంచలన ప్రకటన


