లండన్: ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం తాలూకు టేపుల రగడ బ్రిటన్లో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలు నెరిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మండేల్సన్ (72)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అయితే మండేల్సన్పై లైంగిక దుష్ప్రవర్తన వంటి ఆరోపణలేమీ లేవు. దాదాపు పదిహేనేళ్ల కింద బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆయన ఎప్స్టీన్కు చేరవేశారన్న అభియోగాలపై దర్యాప్తు సాగుతోంది. ఎప్స్టీన్ బాగోతానికి సంబంధించి బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ ఆండ్రూను ఐదు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.
2010లో జెఫ్రీ ఎప్స్టీన్కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపిన సంగతి తెలిసిందే.
మరోవైపు.. ఎప్స్టీన్ కేసులో బాధితురాలు రినా ఓహ్ ఎదుర్కొన్న చేదు అనుభవాలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా బ్రిటీష్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్ట్ తరువాత లైంగిక వేధింపుల పర్వంపై 40 ఏళ్ల రీనా విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఎప్స్టీన్ లాంటిపవర్పుల్ వ్యక్తి సామాన్యులను, మానసికంగా బలహీనంగా ఉన్నవారిని ఎలా లోబరుచుకుంటారో, ఎలాంటి వేధింపులకు గురిచేస్తారో వివరించింది.


