మమత పాలనలో సర్వనాశనం
బెంగాలీలకు మోదీ బహిరంగ లేఖ
అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనకబడింది
మార్పు తథ్యం, జనం అదే కోరుతున్నారు
ఈసారి బీజేపీకి అవకాశమివ్వాలన్న ప్రధాని
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసమర్థ పాలనకు మారుపేరుగా మారారంటూ ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఆమె పాలనలో బెంగాల్ దుస్థితి చూసి నా గుండె పగిలింది. రాష్ట్ర ప్రజలకు మమత అన్నివిధాలా తీవ్ర అన్యాయం చేస్తున్నారు’’అంటూ మండిపడ్డారు. ‘‘రాష్ట్రానికి జరుగుతున్న ఈ తీరని అన్యాయాన్ని సరిదిద్దుతా. ‘వికసిత పశ్చిమ్ బంగా’గా తీర్చిదిద్దుతా’’అని ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ మార్పు అనివార్యమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రజలు విజ్ఞతతో కూడిన తీర్పు ఇస్తారు. తద్వారా బెంగాల్ కూడా దేశంలో ఇతర ప్రాంతాలకు దీటుగా ప్రగతి బాటన ’ ్ఛగుతుంది’’అని విశ్వాసం వెలిబుచ్చారు. ఈ మేరకు బెంగాల్ ఓటర్లను ఉద్దేశించి మోదీ సోమవారం బహిరంగ లేఖ రాశారు. బెంగాలీ భాషలో రాసిన ఈ లేఖను ‘జై మా కాళీ’అంటూ ప్రారంభించారు. ‘‘బెంగాల్లో మార్పు తథ్యం. వచ్చే ఎన్నికల్లో బెంగాలీలు విజ్ఞతతో ఓటేస్తారు. ఈ విషయంలో నాకు పూర్తి విశ్వాసముంది’’అని చెప్పారు.
అక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో బెంగాల్ యావద్దేశానికే చుక్కానిగా ఉండేదని మోదీ అన్నారు. ‘‘స్వామి వివేకానంద మొదలుకుని అరబిందో, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ టాగూర్, శ్యామాప్రసాద్ ముఖర్జీ దాకా ఎందరో గొప్ప మార్గదర్శులను దేశానికి అందించింది వంగ భూమే. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు నెలకొన్న దుస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. బెంగాల్లో పాలన మచ్చుకు కూడా కని్పంచడం లేదు’’అంటూ లేఖలో ఆయన మండిపడ్డారు.
‘‘పాలకుల అసమర్థత వల్ల 60 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనకబాటుకు గురైంది. సరిహద్దుల గుండా అక్రమ చొరబాట్లకు అడ్డాగా మారింది! ముఖ్యంగా మమత సర్కారు అధికారమే పరమావధిగా సంతుïÙ్టకరణ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది. టాగూర్ ఘనంగా కీర్తించిన ‘సోనార్ బంగ్లా’లో నకిలీ ఓటర్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఉపాధి లేమి తాండవిస్తోంది. దాంతో యువత పొట్ట చేతబట్టుకుని వలస బాట పడుతోంది. మహిళలకు భద్రత కరువైంది’’అంటూ దుయ్యబట్టారు. నానాటికీ సమస్యల్లో కూరుకుపోతున్న బెంగాల్ను చూసి దేశమంతా ఆందోళన చెందుతోందన్నారు.
‘‘బెంగాల్ ప్రజలు ఈ దుస్థితిని మౌనంగా ఇంకెంతకాలం భరించాలి? మార్పుకు సమయం ఆసన్నమైంది. ఇతర రాష్ట్రాల్లో ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయి. పేదల ముఖాల్లోకి చిరునవ్వులు వచ్చాయి. ఆయుష్మాన్ భారత్ తదితర పథకాలతో దేశమంతా ప్రగతి చెందుతోంది. ఈ వృద్ధి గాథలో బెంగాల్ కూడా భాగం కావాల్సిన తరుణమిదే’’అన్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు మోదీ చెప్పారు. ‘ఎక్కడైతే మనసు నిర్భీతిగా ఉంటుందో, ప్రజలు తలెత్తుకుంటారో...’అన్న టాగూర్ కవితా పంక్తులను ఉదహరించారు. ‘‘బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిని రూపుమాపుతుంది. అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తాం. అర్హులైన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కలి్పస్తాం’’అంటూ హామీ ఇచ్చారు.
మండిపడ్డ తృణమూల్
బెంగాలీ ఓటర్లకు మోదీ బహిరంగ లేఖపై అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. దాన్ని ఎన్నికల వేళ మోదీ ఆడుతున్న నాటకమంటూ పార్టీ అధికార ప్రతినిధి కుణాల్ ఘోష్ దుయ్యబట్టారు. బెంగాల్ సంక్షేమం పట్ల మొసలికన్నీరు కారుస్తున్న మోదీ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ ఉపాధి సహా పలు పథకాల నిధులను ఎందుకు నిలిపేశారో బదులివ్వాలన్నారు. కేంద్రం నుంచి బెంగాల్కు ఏకంగా రూ.1.96 లక్షల కోట్ల మేరకు నిధులు బాకీ ఉన్నాయని ఆయన ఆరోపించారు. ముందుగా ఆ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో బెంగాల్ అగ్రస్థానంలో ఉందని కుణాల్ చెప్పుకొచ్చారు. మోదీ లేఖను ఓట్ల కోసం ఆడిన డ్రామాగా కాంగ్రెస్ సీనియర్ నేత అ«దీర్ రంజన్ చౌదరి కొట్టిపారేశారు.


