ఆ సదస్సు టర్నింగ్‌ పాయింట్‌  | PM Narendra Modi Pitches India as an AI Hub at International Summit | Sakshi
Sakshi News home page

ఆ సదస్సు టర్నింగ్‌ పాయింట్‌ 

Feb 23 2026 4:54 AM | Updated on Feb 23 2026 4:54 AM

PM Narendra Modi Pitches India as an AI Hub at International Summit

ఏఐ రంగంలో భారత్‌ అద్భుత విజయాలు 

వాటిని చూసి అధినేతలు ఆశ్చర్యపోయారు 

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారత్‌ సాధించిన విజయాలు చూసి ప్రపంచ దేశాల అధినేతలు ఆశ్చర్యపోయారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సును కీలక టర్నింగ్‌ పాయింట్‌గా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ శక్తిని ఎలా వినియోగించుకోవాలో దిశా నిర్దేశం చేయడానికి సదస్సు తోడ్పడుతుందని తెలిపారు. ‘మన్‌ కీ బాత్‌’లో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగించారు. 

సదస్సుకు ప్రపంచ దేశాల అధినేతలు, పారిశ్రామిక వర్గాలు, సీఈఓలు, ఐఏ స్టార్టప్‌ రంగం ప్రతినిధులు, నవీన ఆవిష్కర్తలు హాజరయ్యారని గుర్తుచేశారు. ‘‘సదస్సులో ప్రధానంగా రెండు అంశాలు దేశాధినేతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. వారు అమూల్‌ పాల కేంద్రాన్ని సందర్శించారు. రైతులు తమ పాడి పశువులను ఏఐ టెక్నాలజీతో నిరంతరం గమనించే తీరు పరిశీలించామన్నా రు. మన ప్రాచీన గ్రంథాలు, విజ్ఞానం, రాతప్రతులను ఏఐ టెక్నాలజీతో పరిరక్షిస్తున్న తీరు, వాటిని నేటి తరానికి అందిస్తున్న వైనాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. సదస్సులో మూడు ‘మేడిన్‌ ఇండియా’ ఏఐ మోడల్స్‌ విడుదల చేశాం’’ అని 
వివరించారు. 
 
డిజిటల్‌ మోసాలతో జాగ్రత్త 
ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాలు, డిజిటల్‌ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. ‘‘ప్రధానంగా వృద్ధులు ఈ మోసాల బారిన పడుతుండటం ఆందోళనకరం. బ్యాంకుల కేవైసీ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి’’ అన్నారు. టీ20 క్రికెట్‌ ప్రపంచ కప్‌లో విదేశాల తరఫున భారతీయ మూలాలున్న ఆటగాళ్లు చాలామంది ఆడుతుండటం పట్ల ప్రధాని హర్షం వెలిబుచ్చారు. ‘‘భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ మూలాలు మర్చిపోరు. భారతీయతకు ఇదొక హాల్‌మార్క్‌. తాము నివసిస్తున్న దేశాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు. 

బానిసత్వ గుర్తులను శరవేగంగా వదిలించుకుంటున్నాం. భారతీయ సంస్కృతిని సూచించే చిహ్నాల విలువను గుర్తించడం మొదలైంది. ఈ దిశగా రాష్ట్రపతి భవన్‌ ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. సోమవారం రాజాజీ ఉత్సవ్‌ జరుగనుంది. రాష్ట్రపతి భవన్‌లో బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ ఎడ్విన్‌ లూటెన్స్‌ విగ్రహం స్థానంలో స్వతంత్ర భారత తొలి భారత గవర్నర్‌ జనరల్‌ సి.రాజగోపాలాచారి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
  
పరీక్షలంటే భయమొద్దు 
విద్యార్థులంటే పరీక్షల యోధులని మోదీ అన్నారు. ‘‘మీరు త్వరలో పరీక్షలు రాయనున్నారు. మార్కుల ఆధారంగా సత్తాను లెక్కగట్టలేరని తెలుసుకోండి. మీ ప్రతిభకు అవొక్కటే ఆధారం కాదు. పరీక్షల గురించి ఎన్నో సందేహాలుంటాయి. అలాగని ఆందోళన వద్దు మిమ్మల్ని మీరు విశ్వసించండి. చదివింది మనసుపెట్టి పరీక్షల్లో రాయండి’’ అని వారికి సూచించారు. కేరళ కుంభమేళాగా పిలిచే మామంగం సంప్రదాయాన్ని మోదీ ప్రస్తావించారు. ఈ వేడుక 250 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. పలు రాష్ట్రాల్లో రైతులు సాధించిన విజయాల గురించి కూడా ప్రధాని మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement