మెరుపుదాడితో మట్టుబెట్టిన మెక్సికో సైన్యం
తమ బాస్ మరణంతో రెచ్చిపోయిన డ్రగ్స్ ముఠా సభ్యులు
6 చోట్ల దాడుల్లో 25 మంది సైనికుల దుర్మరణం
పలు ప్రాంతాల్లో దుకాణాలు, బ్యాంకులు, వాహనాలకు నిప్పు
మెక్సికో సిటీ: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు స్వర్గధామమైన మెక్సికోలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అధినేత నెమెసియో రూబెన్ ఒసెగుయెరా సెర్వాంటిస్ అలియాస్ ఎల్ మెంచోను మెక్సికో సైన్యం పక్కా వ్యూహంతో దాడి చేసి హతమార్చింది. సొంత రాష్ట్రం జలిస్కోలోని తపల్పా పట్టణంలో ఎల్ మెంచో దాక్కున్నాడని అమెరికా ఇచ్చిన కాస్తంత నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన మెక్సికో సైన్యం ఆ ప్రాంతాన్ని తమ అ«దీనంలోకి తెచ్చుకుంది. అతను పారిపోకుండా రహదారులను కాలిపోతున్న వాహనాలతో దిగ్బంధించింది.
సైన్యం మెరుపుదాడితో వెనువెంటనే అప్రమత్తమైన మెంచో అనుచరులు అత్యంత అధునాతన ఆయుధాలతో సైనికులపైకి కాల్పులు జరిపారు. సైన్యం సైతం కాల్పులతో దీటుగా బదులిచ్చింది. ఈ హోరాహోరీ కాల్పుల్లో ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని విమానంలో సమీప సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఎల్ మెంచో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మెంచోతోపాటు మరో ఆరుగురు డ్రగ్స్ ముఠా సభ్యులు హతమయ్యారు. మరో ఇద్దరిని అరెస్ట్చేశారు.
ఆయుధాలతో నిండిన వాహనాలను, రాకెట్ లాంచర్లు, ఇతర ఆయుధాలను సైన్యం స్వా«దీనం చేసుకుంది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 30 మంది నేర అనుమానితులు సైతం చనిపోయారని మెక్సికో సిటీ పోలీస్ చీఫ్ ఒమర్ గార్సియా హర్ఫNఛ్ చెప్పారు. మిచోవాకన్లో మరో నలుగురు చనిపోయారు. తమ బాస్ మరణించడంతో పట్టరాని ఆవేశంతో డ్రగ్స్ ముఠా సభ్యులు దేశంలో వేర్వేరు చోట్ల దాడులకు పాల్పడ్డారు.
ఆరు ఘటనల్లో మొత్తం 25 మంది నేషనల్గార్డ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మెంచో ఆట కట్టించినందుకు సైన్యాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ అభినందించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ ముఠాల ఆటకట్టించాలన్న ప్రజా డిమాండ్లు, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి అమెరికా నుంచి నిఘా సాయం తీసుకున్నారు. తమ ముఠా నాయకుడు చనిపోయాడన్న పట్టరాని ఆగ్రహంతో మాదకద్రవ్యాల ముఠా సభ్యులు పేట్రేగిపోయారు. వీధుల్లోకి వచ్చి దుకాణాలు, బ్యాంకులు, వాహనాలకు నిప్పుపెట్టారు.
తపల్పా పట్టణంలో జరిగిన ఆపరేషన్లో ముఠా సభ్యులు జరిగిన నేషనల్గార్డ్ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు. పుయెర్టో వల్లాట్రాలోని జైలులో జైలు గార్డ్ను ఎల్ మెంచో అనుచరులు చంపేశారు. గ్వాడలజారాలో రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయంపై దాడి చేసి ఒకరిని చంపేశారు. అమెరికాలోకి అక్రమంగా ఫెంటానిల్ మాదకద్రవ్యాన్ని సరఫరాచేస్తూ ఎల్ మెంచో అతిపెద్ద నేరం చేశాడని ట్రంప్ సర్కార్ గతంలోనే ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఎల్ మెంచో అరెస్ట్కు వీలుగా కీలక సమాచారం ఇచ్చిన వాళ్లకు ఏకంగా 1.5 కోట్ల డాలర్లు(దాదాపు రూ.136.35 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఎల్ మెంచో సారథ్యంలోని సీజేఎన్జీ ముఠాను విదేశీ ఉగ్రసంస్థగా ట్రంప్ సర్కార్ ఈనెలలోనే ప్రకటించింది. గతంలో వేరే డ్రగ్స్ ముఠాలో పనిచేసిన ఎల్ మెంచో 2009లో అందులోంచి బయటికొచ్చి సొంతంగా ‘ది జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్(సీజేఎన్జీ) పేరుతో కొత్తడ్రగ్స్ ముఠాను తయారుచేసి మాదకద్రవ్యాల అక్రమ సరఫరాతోపాటు బెదిరింపులు, హత్యలు, అపహరణల వంటి నేరాలకు పాల్పడ్డాడు.
భారతీయులకు భారత సర్కార్ అడ్వైజరీ..
ముఠా సభ్యుల విధ్వంసం నేపథ్యంలో అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని మోదీ సర్కార్ సోమవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. ‘జలిస్కో రాష్ట్రంలోని పుయెర్టో వల్లాట్రా, ఛపాలా, గ్వాడలజారా సిటీలతోపాటు మిచోవాకన్, గుయెరియో, న్యూవో లియాన్ రాష్ట్రాల్లో ఉండే భారతీయులు ఘర్షణలు జరిగే వైపు వెళ్లకండి. తదుపరి నోటీస్ వచ్చేదాకా సురక్షిత ప్రాంతాలకే పరిమితంకండి. సైన్యం జాడలేని ప్రాంతాల్లో బయట తిరగకండి. మీ షెల్టర్లలోనే ఉండిపోండి. స్థానిక అధికారుల సూచనలను పాటించండి’’అని మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో ఒక
పోస్ట్పెట్టింది.
మూడు దశాబ్దాలుగా మారణ హోమం
59 ఏళ్ల ఎల్ మెంచో పశి్చమ మెక్సికోలోని మిచోవకన్ రాష్ట్రంలో 1966లో అగిలిలా పరిధిలోని మారుమూల గ్రామంలో జని్మంచాడు. ఇతని కుటుంబం అవకాడో పంట సాగుచేసేది. ఐదో తరగతిలోనే బడి చదువు మానేసిన మెంచో టీనేజీలోనే అక్రమ గంజాయి పంట సాగుకు గార్డ్గా పనిచేసేవాడు. తర్వాత మెరుగైన జీవితం కోసం 1980 దశకంలో అక్రమంగా కాలిఫోరి్నయా రాష్ట్రంలోకి చొరబడ్డాడు. హెరాయిన్ సరఫరా చేస్తూ 1994లో అమెరికా పోలీసులకు దొరికిపోయాడు.
మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మరో నేరం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు దేశబహిష్కరణ చేసి మెక్సికోకు తిప్పి పంపారు. 30 ఏళ్ల వయసులో స్వదేశం వచ్చాక పోలీస్బలగాల్లో పనిచేశాడు. అప్పుడు మాదకద్రవ్యాల ముఠాల గుట్టుమట్టు తెల్సుకుని ఉద్యోగం వదిలేసి మిలేనియో కార్టెల్లో చేరాడు. అక్కడే ముఠా నేతల్లో ఒకరి చెల్లిని పెళ్లాడి కీలక నేతగా ఎదిగాడు. తర్వాత కార్టెల్లో విభేదాలు, ముఠాపై సైన్యం దాడులతో వేరే ముఠాలతో చేతులు కలిపాడు.
అవి రెండు ముక్కలవడంతో చివరకు సొంతంగా 2009లో జలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ను ఏర్పాటుచేసుకుని మెక్సికోలోనే అతిశక్తివంతమైన ముఠాల్లో ఒకటిగా దానిని విస్తరింపజేశాడు. మూడు దశాబ్దాలపాటు ఎన్నో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లుచేసి సైన్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. కొకైన్, మెథాంఫెటమైన్స్, ఫెంటానిల్ డ్రగ్స్తోపాటు శరణార్థులనూ అమెరికాలోకి తరలించాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై, తమ ముఠాపై దాడి చేయడానికి వచ్చిన సైన్యంపై ఏకంగా డ్రోన్లతో దాడిచేసేవాడు. బాంబుపేలుళ్లు జరిపించేవాడు. దొరక్కుండా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలో దాక్కునేవాడు. 2015లో ఏకంగా సైనిక హెలికాప్టర్పై దాడిచేసి నేలమట్టంచేశాడు. ఆన్లైన్ ద్వారా ముఠా సభ్యులను చేర్చుకునేవాడు.
ఇదీ మా విజయమే: ట్రంప్
ఇప్పటికే చాలా యుద్ధాలను ఆపానని పలుమార్లు ప్రకటించుకున్న ట్రంప్ సోమవారం సైతం ఎం మెంచో మరణాన్ని సైతం తన విజయంగా అభివరి్ణంచుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం మహిళా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఎల్ మెంచోను హతమార్చడానికి మెక్సికో ప్రభుత్వానికి కీలకమైన నిఘా సమాచారాన్ని అమెరికాయే అందజేసింది. గతంలోనే మెంచో ముఠాను ట్రంప్ ఉగ్రసంస్థగా ప్రకటించి మంచిపని చేశారు. నార్కోటెర్రరిజానికి పాల్పడే వాళ్లకు తగిన శిక్ష వేస్తామని ట్రంప్ గతంలోనే పునరుద్ఘాటించారు’’అని ఆమె రాసుకొచ్చారు.
దీంతో సంబరపడిన ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘మేం ఈ మధ్య చాలా విజయాలను సాధిస్తున్నాం. ఇది మరీ అతిశయోక్తిగా ఉన్నా వాస్తవం మాత్రం ఇదే’’అని రాసుకొచ్చారు. దీనిపై మెక్సికో ఆగ్రహం వ్యక్తంచేసింది. పలువురు నేషనల్గార్డ్ సభ్యుల ప్రాణత్యాగాల ఫలితంగానే మా ఆపరేషన్ విజయవంతమైంది. దాడికి అమెరికా కాస్తంత మాత్రమే నిఘా సమాచారం ఇచ్చింది. మిగతా పనంతా మేమే కష్టపడి పూర్తిచేశాం’’అని మెక్సికో కరాఖండిగా చెప్పేసింది.


