ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని వాయువ్య ప్రావిన్స్ అయిన ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. బజౌర్ జిల్లా మామండ్ తహసీల్లోని మలంగి ప్రాంతంలోని భద్రతా దళాల చెక్పోస్టును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పేలుడు పదార్ధాలతో నిండిన ఒక వాహనాన్ని ఆత్మాహుతి బాంబర్ నేరుగా చెక్పోస్టులోనికి పోనివ్వడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందితో సహా కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో మిలిటెంట్ కార్యకలాపాలు విపరీతంగా పెరగడం స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది.
స్థానిక వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆత్మాహుతి దాడి పేలుడుతోనే ముగిసిపోలేదు. బాంబు దాడి జరిగిన వెంటనే సాయుధ ఉగ్రవాదులు భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. ముందస్తు ప్రణాళికతో చేసిన భారీ ఆపరేషన్గా దీనిని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు తొమ్మిది మంది పాక్ సైనికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో సామాన్య పౌరులు కూడా ఉన్నారు. మొత్తం మరణాల సంఖ్య 16కు చేరింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మలంగిలోని ఒక మదర్సా భవనం సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు తీవ్రతకు ఆ భవనం పూర్తిగా ధ్వంసమై నేలమట్టమైంది. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, కార్యాలయాల కిటికీలు పగిలిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని చ్టుటుముట్టిన సమయంలో కాల్పుల శబ్దాలు మిన్నంటాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న బజౌర్ జిల్లాలో ఉగ్రవాద కదలికలు ఎక్కువగా ఉంటున్నాయి. గత కొన్నేళ్లుగా తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ)లాంటి సాయుధ గ్రూపులు ఖైబర్ పఖ్తున్ఖ్వా అంతటా భద్రతా బలగాలపై దాడులను తీవ్రతరం చేశాయి. గతంలో కూడా ఉత్తర వజీరిస్తాన్, పెషావర్ తదితర ప్రాంతాల్లో సైనిక కాన్వాయ్లు, పోలీసు స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులే జరిగాయి.
ఇది కూడా చదవండి: కమల్ హాసన్కు ‘టార్చ్ లైట్’.. ‘ఎంఎన్ఎం’లో ఉత్సాహం ఉరకలు


