పాకిస్తాన్లోని అతిపెద్ద నగరమైన కరాచీలో భారీ దోపిడీ జరిగింది. మలీర్లో ఉన్న 'ఇక్బాల్ జ్యువెలరీ' షాపులో సుమారు 300 మిలియన్ పాకిస్తానీ రూపాయల (పీకేఆర్ 30 కోట్లు) విలువైన బంగారం, వజ్రాభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. వీకెండ్ సెలవులను ఆసరాగా చేసుకుని దుండగలు ఈ చోరికి పాల్పడ్డారు.
దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా నగలు భద్రపరిచే వాల్ట్ ఉన్న చోట రంధ్రం చేయడం గమనార్హం. ఈ దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే తెలిసినవారే పని అన్నట్లు అన్పిస్తోంది. కాగా ఫిబ్రవరి 12న షాపు మూసివేసిన తర్వాత వరుసగా శుక్రవారం, శనివారం సెలవలు వచ్చాయి.
ఈ రెండు రోజుల్లోనే చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం షాపు తెరిచేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం ఉదయం షాపు తెరిచేసరికి చోరి జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు షాపు యాజమాని ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో 700 తులాల స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లు చోరీకి గురైనట్లు అతడు తెలిపాడు.
మేము ఫిబ్రవరి 12న యథావిధిగా షాపు మూసివేసాము. రెండు రోజుల తర్వాత తిరిగి తెరిచి చూడగా, బాక్సులన్నీ ఖాళీగా ఉన్నాయి. అందులోని బంగారు ఆభరణాలు, బంగారు బిస్కెట్లు, వజ్రాలన్నీ మాయమయ్యాయి" అని షాపు యజమాని అయూబ్ ఖాన్ పేర్కొన్నాడు. ఓ సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కరాచీ నగర చరిత్రలోనే భారీ దోపిడీలో ఇది ఒకటిగా నిలిచింది.


