భారత్‌ చేతిలో ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్‌ కీలక నిర్ణయాలు | T20 WC 2026:Pakistan Set To Take Drastic Step After India Thrashing, Axe 2 Superstars says Report | Sakshi
Sakshi News home page

భారత్‌ చేతిలో ఘోర ఓటమి.. అర్ధరాత్రి పాక్‌ కీలక నిర్ణయాలు

Feb 16 2026 8:34 PM | Updated on Feb 16 2026 8:34 PM

T20 WC 2026:Pakistan Set To Take Drastic Step After India Thrashing, Axe 2 Superstars says Report

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌  చేతిలో ఘోర ఓటమి ఎదురైన తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. నిన్న (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ ముగిసిన వెంటనే పీసీబీ అర్దరాత్రి వేల అత్యవసర సమావేశాన్ని నిర్వహించి ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లపై వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ స్టార్‌ ఆటగాళ్ల పేర్లు బాబర్‌ ఆజమ్‌, షాహీన్‌ అఫ్రిది అని తెలుస్తుంది.

వీరిద్దరిని తక్షణమే జట్టు నుంచి తప్పించాలని కొలొంబోలో ఉన్న దేశ ప్రతినిధులకు పీసీబీ అల్టిమేటం​ జారీ చేసినట్లు సమాచారం. పాక్‌ తదుపరి ఆడబోయే నమీబియా మ్యాచ్‌లో బాబర్‌, అఫ్రిది స్థానాల్లో సల్మాన్‌ మీర్జా, నసీం షా, ఫకర్‌ జమాన్‌, ఖ్వాజా నఫాయ్‌ పేర్లు పరిశీలించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది.

భారత్‌ మ్యాచ్‌లో జట్టు ప్రదర్శనపై పాక్ ప్రభుత్వం సైతం ఆగ్రహంగా ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. స్టార్‌ ఆటగాళ్లను తప్పించే విషయంలో పీసీబీ కంటే పాక్‌ ప్రభుత్వ జోక్యమే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

భారత్‌ చేతిలో తాజా పరాభవం తర్వాత పాక్‌ ప్రభుత్వంపై కూడా ఆ దేశ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారట. ముందుగా భారత్‌తో మ్యాచ్‌ ఆడమని ప్రకటించడమెందుకు, ఆతర్వాత తిరిగి ఆడటమెందుకని దుమ్మెత్తిపోస్తున్నారట. దేశ ప్రజల నుంచి ఒత్తిడి అధికం కావడంతో బాబర్‌, అఫ్రిది సహా మరికొంత మంది ఆటగాళ్లపై వేటు వేయాలని పాక్‌ ప్రభుత్వం పీసీబీకి సిఫార్సు చేసినట్లు వినికిడి.

పాక్‌ ప్రజలు పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్‌ నఖ్వీపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నట్లు తెలుస్తుంది. టీమిండియా విషయంలో నఖ్వీ మొదటి నుంచి ఓవరాక్షన్‌ చేస్తున్నాడని మెజార్జీ పాక్‌ క్రికెట్‌ అభిమానులు అనుకుంటున్నట్లు సమాచారం. 

నఖ్వీని పీసీబీ అధ్యక్ష హోదాతో పాటు మంతివర్గం నుంచి కూడా బహిష్కరించాలని పాక్‌లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయట. నఖ్వీ భారత్‌ చేతిలో ఓటమి తర్వాత తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు పలువురు పాక్‌ ఆటగాళ్లతో పాటు హెడ్‌ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ను కూడా పరుష పదజాలంతో మందలించాడని తెలుస్తుంది.

కాగా, భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమై  61 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏపై అతికష్టం మీద గెలిచిన పాక్‌.. గ్రూప్‌-ఏ పాయింట్ల పట్టికలో యూఎస్‌ఏ తర్వాత మూడో స్థానంలో ఉంది. ఫిబ్రవరి 18న నమీబియాతో మ్యాచ్‌ ఆటుఇటైతే పాక్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమిస్తుంది. అదే జరిగితే భారత్‌తో పాటు యూఎస్‌ఏ సూపర్‌-8కు చేరుకుంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement