T20 WC 2026: ఇంగ్లండ్‌ను భయపెట్టిన మరో పసికూన | T20 WC 2026: England into super 8 by beating Italy | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఇంగ్లండ్‌ను భయపెట్టిన మరో పసికూన

Feb 16 2026 7:22 PM | Updated on Feb 16 2026 7:25 PM

T20 WC 2026: England into super 8 by beating Italy

టీ20 ప్రపంచకప్‌ 2026లో మాజీ ఛాం​పియన్‌ ఇంగ్లండ్‌కు ప్రతి మ్యాచ్‌ గండంగా నడుస్తుంది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లీష్‌ టీమ్‌ను ప్రతి జట్టూ భయపెడుతుంది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ చేతిలో ఘోర పరాభవాన్ని వెంట్రుకవాసిలో తప్పించుకున్న బ్రూక్‌ సేన.. ఇవాళ (ఫిబ్రవరి 16) మరో పసికూన ఇటలీ చేతిలోనూ ఇంచుమించు అదే అనుభవాన్ని ఎదుర్కొంది. 

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ఇటలీ, క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఇంగ్లండ్‌ను భయపెట్టింది. అనుభవాన్నంతా రంగరించి ఈ ఇంగ్లండ్‌ బయటపడింది కానీ, ఏమరపాటుగా ఉండి ఉంటే మాత్రం చుక్కెదురయ్యేదే.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఇటలీ బౌలర్లు తొలుత తెగ ఇబ్బంది పెట్టారు. ఆది నుంచి వరుస విరామాల్లో ఇంగ్లండ్‌ వికెట్లు తీశారు. ఆఖర్లో విల్‌ జాక్స్‌ (22 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకోబట్టి ఇంగ్లండ్‌ గట్టెక్కింది. 

నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఇటలీ బౌలర్లు ఏమాత్రం కుదురుకోనివ్వలేదు. కొన్ని పరుగులు చేసేలోపే వికెట్లు తీశారు. జాక్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడకపోయుంటే ఇంగ్లండ్‌ 200 పరుగుల మార్కును తాకలేకపోయేది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో సాల్ట్‌ 28, బట్లర్‌ 3, బేతెల్‌ 23, బాంటన్‌ 30, బ్రూక్‌ 14, సామ్‌ కర్రన్‌ 25, ఓవర్టన్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. ఇటలీ బౌలర్లలో స్టీవార్ట్‌, కలుగమగే చెరో 2, స్మట్స్‌, అలీ హసన్‌, బెన్‌ మనెంటి తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇటలీ ఆదిలో తడబడినప్పటికీ.. బెన్‌ మనెంటి (60), జస్టిన్‌ మోస్కా (43), గ్రాంట్‌ స్టివర్ట్‌ (45) ఇంగ్లండ్‌ శిబిరంలో గుబులు రేపారు. మనెంటి.. మోస్కాతో కలిసి నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను భయపెట్టాడు. 

బెన్‌ మనెంటి క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ వణికిపోయారు. మనెంటి భారీ సిక్సర్లు బాదుతూ ఇంగ్లండ్‌ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మనెంటి ఔటయ్యాక కూడా ఇటలీ కాసేపు పోరాడింది. అయితే ఈ దశలో ఇంగ్లండ్‌ బౌలర్లు పుంజుకొని మ్యాచ్‌పై పట్టు సాధించారు. 

ఇటలీ పని అయిపోయిందన్న దశలో స్టీవర్ట్‌ తన మెరుపు విన్యాసాలతో మరోసారి ఇంగ్లండ్‌ను దడదడలాడించాడు. స్టీవర్ట్‌ ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌​ సిక్సర్లతో విరుచుకుపడి ఎనిమిదో వికెట్‌కు జస్ప్రీత్‌ సింగ్‌తో కలిసి 18 బంతుల్లోనే 40 పరుగులు జోడించాడు.

దీంతో ఇటలీ గెలుపుకు 12 బంతుల్లో 30 పరుగులు అవసరమయ్యాయి. స్టీవర్ట్‌ ఉన్న ఊపులో ఇటలీ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఈ సమయంలో సామ్‌ కర్రన్‌ స్టీవర్ట్‌ వికెట్‌ తీసి ఇంగ్లండ్‌ను ఊపిరి పీల్చుకునేలా చేశాడు. 

19 ఓవర్‌లో కర్రన్‌ రెండు వైడ్లు వేసినా, మరో 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన స్టీవర్ట్‌ వికెట్‌ తీశాడు. అక్కడే ఇంగ్లండ్‌కు గెలుపుపై ఆశలు చిగురించాయి. కర్రన్‌ ఇచ్చిన ఊపుతో చివరి ఓవర్‌లో ఓవర్టన్‌ రెచ్చిపోయాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీసి ఇటలీని ఆలౌట్‌ చేశాడు. 

తద్వారా ఇటలీ 24 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్‌ ఊపిరి పీల్చుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించగా.. ఇటలీ ఓడినా, గర్వంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇటలీ తమకంటే చాలారెట్లు మెరుగైన నేపాల్‌పై సంచలన విజయం సాధించి, క్రికెట్‌ ప్రపంచాన్ని మెప్పించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement