టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్పై తమదే పైచేయి అని టీమిండియా మరోసారి నిరూపించింది. కొలంబో వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో సల్మాన్ ఆఘా బృందాన్ని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తాజా ఎడిషన్లో వరుసగా మూడో విజయం నమోదు చేసిన టీమిండియా.. గ్రూప్-ఎ నుంచి సూపర్-8కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.
తదుపరి నెదర్లాండ్స్తో బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్లో టీమిండియా తలపడుతుంది. మరోవైపు.. గ్రూప్-ఎ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్తో అమెరికా పోటీ పడుతోంది. కాగా లీగ్ దశలో అమెరికా నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుంది.
పటిష్ట స్థితిలో అమెరికా
ఇందులో భారత్, పాకిస్తాన్ చేతిలో ఓడిన అమెరికా జట్టు.. నెదర్లాండ్స్, నమీబియా జట్లపై గెలుపొందింది. తద్వారా నాలుగు పాయింట్లు సాధించింది. నెట్రన్రేటు +0.787గా ఉంది. ఇక టీమిండియా చేతిలో భారీ తేడాతో పాక్ ఓడిపోవడంతో అమెరికా సూపర్-8 ఆశలు సజీవమయ్యాయి.
ఈ నేపథ్యంలో అమెరికాను దాటి సూపర్-8కు చేరాలంటే పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో తప్పక గెలవాలి. కొలంబో వేదికగా నమీబియాపై పాక్ గెలిస్తేనే సూపర్-8కు చేరుతుంది. అయితే, ఇరుజట్లలో పాక్ పటిష్టమైనదే అయినా.. అత్యంత నిలకడలేని జట్టుగా పాకిస్తాన్కు చెడ్డపేరు ఉంది.
పాక్ సూపర్-8 చేరాలంటే?
మరోవైపు.. ఈ టోర్నీలో అమెరికా, జింబాబ్వే, ఇటలీ, నేపాల్ వంటి పసికూన జట్లు పటిష్ట జట్లకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అమెరికా టీమిండియాకు గట్టి పోటీనివ్వగా.. జింబాబ్వే మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. నేపాల్.. రెండుసార్లు చాంపియన్ అయిన ఇంగ్లండ్ను వణికించగా.. తొలిసారి వరల్డ్కప్ ఆడుతున్న ఇటలీ నేపాల్ను చిత్తు చేసింది.
కాబట్టి నమీబియాతో మ్యాచ్లో పాక్ జాగ్రత్తగా ఆడితేనే సజావుగా సూపర్-8కు చేరుతుంది. లేదంటే.. గత ఎడిషన్ మాదిరే ఈసారి లీగ్ దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. కాగా పాక్ తమ తొలి రెండు మ్యాచ్లలో నెదర్లాండ్స్, అమెరికాలను ఓడించి నాలుగు పాయింట్లు సంపాదించింది. నెట్రన్రేటు -0.403.
నెట్రన్రేటు పరంగా
కాబట్టి నమీబియాతో మ్యాచ్లో నెగ్గితేనే ఆరు పాయింట్లతో పాక్ అమెరికాను దాటి సూపర్-8లో అడుగుపెట్టగలదు. ఒకవేళ నమీబియా చేతిలో ఓడితే గనుక అమెరికాతో సమానంగా నాలుగు పాయింట్లు ఉన్నా నెట్రన్రేటు పరంగా యూఎస్ మెరుగ్గా ఉంది. కాబట్టి అక్కడా పాకిస్తాన్కు ప్రమాదమే పొంచి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికి వెస్టిండీస్, టీమిండియా మాత్రమే సూపర్-8 బెర్తులను అధికారికంగా ఖరారు చేసుకున్నాయి.


