బ్యాంకులో అందులోనూ ప్రభుత్వరంగ బ్యాంకులో ఉంటే మన సొమ్ము, భద్రం అనుకుంటాం. తాజాగా ఆన్లైన్ జూదం (Gambling)కోసం కస్టమర్ల కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని తస్కరించిన వైనం ఆందోళన రేపింది. బెంగళూరులో జరిగిన ఈ మోసానికి సంబంధించిన వివరాలుఇలా ఉన్నాయి.
బెంగళూరులోని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ (34), కస్టమర్ల లాకర్ల నుండి సుమారు 2.7 కిలోల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి ఆన్లైన్ జూదానికి వినియోగించాడు. జనవరి 2న కొంతమంది కస్టమర్లు తమ లాకర్లను తనిఖీ చేసినప్పుడు తమ ఆభరణాలు కొన్ని మాయమైనట్లు గుర్తించారు. దీంతో వారు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వినియోగదారుల ఫిర్యాదు మేరకు బ్యాంకు అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీలో మొత్తం 24 ప్యాకెట్లలో బంగారం మాయమైనట్టు తేలింది. బ్రాంచ్ మేనేజర్ లేని సమయంలో తన వద్ద ఉన్న తాళాలతో లాకర్లను తెరిచి ఈ మోసానికి పాల్పడ్డాడు. 2025 జూన్ - 2026 జనవరి మధ్య కాలంలో నిందితుడు కిరణ్ తక్కువ మొత్తంలో బంగారాన్ని దొంగిలిస్తూ వచ్చాడు. అలా క్రమంగా మొత్తం 2,793 గ్రాముల బంగారం (దాదాపు రూ. 4 కోట్లు) మాయం చేశాడు. ఇలా కొట్టేసిన బంగారాన్ని ప్రైవేట్ రుణదాతలకు తనఖా పెట్టి, ఆడబ్బును బెట్టింగ్లో వాడేవాడు. ఇందులో 3 ప్యాకెట్లు పూర్తిగా ఖాళీ అవ్వగా, 21 ప్యాకెట్లలో కొంత మేర బంగారం పోయింది.
దొంగిలించిన బంగారాన్ని కొన్ని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. మిగిలిన బంగారాన్నిరికవరీ చేసేందుకు పోలీసులుప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ జగలసర్ అన్నారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే అరుదైన పక్షి, ముట్టుకుంటే మటాషే!
నోట్: బంగారాన్ని తాకట్టు పెట్టే కస్టమర్లు బ్యాంకు ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని డిసిపి కోరారు. తమ లాకర్ పత్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలనీ బ్యాంకు లావాదేవీల్లో పారదర్శకత ఉండేలా చూసుకోవడం చాలా అవసరమని, ఇదే మోసాలనుంచి కస్టమర్లను రక్షిస్తుందని డిసిపి లోకేష్ జగలాసర్ సూచించారు.


