డెహ్రాడూన్: మేజర్లు పరస్పర అంగీకారంతో సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేసిన అనంతరం పురుషుడు వివాహానికి అంగీకరించనంత మాత్రాన దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ హైకోర్టు తేల్చిచెప్పింది. వారి బంధం విఫలమైనంత మాత్రాన అది క్రిమినల్ కేస్ కాదని అభిప్రాయపడింది. ఆ హామీ మొదటి నుంచీ అబద్ధమని తేలితేనే నేరమవుతుందని పేర్కొంది. ఒక వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ముస్సోరీకి చెందిన మహిళ వేసిన కేసును కోర్టు కొట్టేసింది.
సూరజ్ బోరా అనే వ్యక్తి 45 రోజుల్లో తనను వివాహం చేసుకుంటానని చెప్పాడని, తర్వాత అందుకు తిరస్కరించాడని సదరు మహిళ ఫిర్యాదు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ ఆశిష్ నైథానీ విచారించారు. ఇద్దరు మేజర్లని, నిందితుడు సంబంధం ప్రారంభం నుంచి మోసం చేసే ఉద్దేశంతో ఉన్నట్టు నిరూపించడానికికచ్చితమైన ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. ‘‘దీర్ఘకాలిక సంబంధం పరస్పర అంగీకారాన్ని సూచిస్తుంది. కనుక ఈ దశలో నిందితునిపై క్రిమినల్ చర్యలు కొనసాగించడం వేధించడమే అవుతుంది’’ అని స్పష్టం చేశారు. 2023 జూలై 22న ఈ మేరకు దాఖలైన ఛార్జ్షిట్ను కూడా పూర్తిగా కొట్టేశారు.


