ఏడేళ్ల చిన్నారి..తన వయసుకు అనితరసాధ్యమైన దాన్ని అవలీలగా చేధించింది. పెద్దపెద్ద ఈతగాళ్ల డ్రీమ్ ఎలిఫెంటా ద్వీపం నుంచి ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వరకు ఈదడం. కానీ ఈ చిన్నారి చాలా అవలీలగా చేసి శెభాష్ అనిపించుకుంది. అంతేగాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అత్యంత సవాలుతో కూడిన సముద్ర మార్గంలో ఈదడం విశేషం. ఎవరా చిన్నారి అంటే..?..
అస్సాంకి చెందిన ఏడేళ్ల కియుచెంఘన్ ఫుకాన్ ఈ ఘనత సాధించింది. ఆ చిన్నారి ఎలిఫెంటా ద్వీపం నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకు 3 గంటల 29 నిమిషాల్లో ఈదింది. ఈ ఏడాది ఫిబ్రవరి 4న ఆ ఘనతను పూర్తి చేసింది. కియుచెంఘన్ ఎలిఫెంటా ద్వీపం నుంచి మధ్యాహ్నం 2:36 గంటలకు తన ఈత ప్రారంభించి సాయంత్రం 6:05 గంటలకు గేట్వే ఆఫ్ ఇండియాకు చేరుకుంది. ఈ ప్రదేశం బలమైన ప్రవాహాలు, మారుతున్న సముద్ర పరిస్థితులకు ప్రసిద్ధిచెందింది.
ఇది అరేబియా సముద్రంలో అత్యంత కష్టతరమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పేరుగాంచింది. అలాంటి కఠినతరమైన సముద్ర మార్గాన్ని ఏడేళ్ల ప్రాయంలో అవలీలగా జయించి.. ప్రపంచంలోనే అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కాగా, కియుచెన్ఘాన్ ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. హేమంగా ఫుకాన్ రిమ్లి, హజారికా ఫుకాన్ దంపతుల కుమార్తె. ఆ చిన్నారి కుటుంబం గౌహతిలోని సిక్స్ మైల్లో నివసిస్తుంది.
ఈ చిన్నారి గౌహతిలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ అక్వాటిక్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ శిక్షణ తీసుకుంటోంది. ఇక అస్సాం స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ దాస్ ఈ విజయాన్ని అస్సాంకే గర్వకారణంగా పేర్కొన్నారు. అస్సాం క్రీడా మంత్రి నందితా గార్లోసా ఈ చిన్నారి స్విమ్మర్ని అభినందించారు. అంతేగాదు ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయి కూడా ఈ చిన్నారినే.
(చదవండి: డ్రై ఐస్ సిండ్రోమ్’ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..)


