సిరియాలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లకు (ఐసిస్) చెందిన రోజ్ నిర్బంధ శిబిరంలో చిక్కుకున్న ఆస్ట్రేలియన్ల స్వదేశీ ప్రయాణం ఊహించని మలుపు తిరిగింది. వాస్తవానికి 11 కుటుంబాలకు చెందిన 34 మంది ఆస్ట్రేలియన్లు సోమవారం తమ స్వదేశానికి చేరుకోవాల్సి ఉండేది. అయితే ఆఖరి నిమిషంలో వారి ప్రయాణం వాయిదా పడింది.
బిరం నుంచి కాన్వయ్ బయలు దేరినప్పటికి..సాంకేతిక కారణాల వల్ల కొద్ది గంటల్లోనే తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. రోజ్ క్యాంప్ కో-డైరెక్టర్ హుక్మియా మహమ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటికే ఈ 34 మందిని తమతో పాటు తీసుకువెళ్లడానికి సిరియా వచ్చిన వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వీరిని సిరియా నుంచి పంపించే క్రమంలో భాగంగా, మిలిటరీ ఎస్కార్ట్తో కూడిన చిన్న బస్సులలో డమాస్కస్ వైపు తరలించారు. కానీ సిరియా అధికారులతో కుదుర్చుకున్న ఏర్పాట్లలో తలెత్తిన కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల వారు వెనక్కి తిరిగి వచ్చేశారు. అయితే ఇది కేవలం ఒక రోజులో పరిష్కారమయ్యే సమస్య మాత్రమే అని సిరియా అధికారి ఒకరు స్పష్టం చేశారు.
కాగా సిరియాలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న రోజ్ శిబిరం.. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల కుటుంబ సభ్యులను ఉంచే ఒక నిర్బంధ కేంద్రం. ఈ శిబిరంలో ప్రస్తుతం 40 దేశాలకు చెందిన 2,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు. 2019లో సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల పట్టు కోల్పోవడంతో అక్కడి ప్రభుత్వం బందీలను విడిచిపెట్టేందుకు సిద్దమైంది. కానీ చాలా దేశాలు భద్రతా కారణాలతో తమ పౌరులను వెనక్కి తీసుకోవడానికి వెనుకాడుతున్నాయి. ఈ శిబిరంలో బ్రిటన్ పౌరసత్వం రద్దయిన షమీమా బేగం వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.


