బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త శకం మొదలు కానుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ ఆ దేశ ప్రధానిగా మంగళవారం ప్రమాణం చేయనున్నారు. ఈ క్రమంలో మధ్యంతర ప్రభుత్వ సారథి ముహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేశారు.
2024లో దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత తర్వాత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాటు పాలన చేపట్టింది. అయితే కొత్త సర్కార్ కొలువు దీరనుండడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకొన్నారు.
సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ ద్వారా ప్రసంగించిన యూనస్.. తన రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. "ఈ రోజుతో తాత్కాలిక ప్రభుత్వం పాలన ముగిసింది. దేశంలో కొత్తగా మొదలైన వాక్ స్వాతంత్ర్యం, ప్రాథమిక హక్కుల సాధన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదు" అని ఆయన పేర్కొన్నారు.


