ఢాకా: బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తారిఖ్ రహ్మాన్ సారథ్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ప్రభుత్వం మంగళవారం కొలువుతీరనుంది. రహ్మాన్ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. అధ్యక్షుడు మొహమ్మెద్ షాహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు. షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఆమెతో పాటు స్పీకర్ కూడా దేశం వీడి అజ్ఞాతంలోకి వెళ్లగా డిప్యూటీ స్పీకర్ జైళ్లో ఉన్నారు.
దాంతో రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ ప్రకారం నూతన పార్లమెంట్ సభ్యులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీరుద్దీన్ ప్రమాణం చేయించనున్నారు. రహ్మాన్ తండ్రి జియావుర్ రహ్మాన్ దేశాధ్యక్షునిగా, తల్లి బేగం ఖలీదా ప్రధానిగా పనిచేశారు. ఆ కుటుంబం నుంచి అత్యున్నత పదవులను అధిరోహించిన మూడో వ్యక్తిగా రహ్మాన్ నిలవనున్నారు.
తాజా ఎన్నికల్లో 297 స్థానాలకుగాను బీఎన్పీ 209 చోట్ల గెలిచింది. అతివాద జమాతే ఇస్లామీ కేవలం 68 సీట్లకు పరిమితమైంది. జూలై ఉద్యమానికి నేతృత్వం వహించిన విద్యార్థి సంఘాలు ఏర్పాటుచేసిన నేషనల్ సిటిజెన్ పార్టీ కొత్తగా షాడో కేబినెట్ను ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు విమర్శించడమే లక్ష్యంగా ఈ షాడో కేబినెట్ను ఏర్పాటుచేస్తున్నారు.
భారత్ తరఫున ఓం బిర్లా
ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ ప్రమాణస్వీకారోత్సవానికి భారత్ తరఫున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. ఢాకాలో జరిగే కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని బంగ్లాదేశ్ ఆహా్వనించగా ఆయన తరఫున భారత్ నుంచి బిర్లా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.


