రహ్మాన్ ప్రస్థానం ఆసక్తికరం
భారత్–బంగ్లా బంధం మెరుగయ్యేనా?
తారిఖ్ రహ్మాన్. 19 ఏళ్ల ప్రవాసం వీడి తిరిగొచ్చిన నెలన్నర వ్యవధిలోనే బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ది నిజంగా ఆసక్తికర ప్రస్థానమే. ఆయన తండ్రి దివంగత ముజిబుర్ రహ్మాన్ దేశాధ్యక్షునిగా పని చేశారు. ఇక తల్లి బేగం ఖలీదా జియా ప్రధానిగా కొనసాగారు. 2001 నుంచి 2006 మధ్య ఆమె హయాంలో రహ్మాన్ రెండో అధికార కేంద్రంగా మారారన్న చెడ్డపేరు మూటగట్టుకున్నారు. పాలనతో సహా అన్ని వ్యవహారాలనూ తన కనుసన్నల్లో శాసించారంటారు.
దాంతో విపక్షాలు, సొంత పార్టీలోని అసమ్మతివాదులే గాక అమెరికా కూడా రహ్మాన్ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించాయి. అంతేగాక ఆ సమయంలో ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన అవామీ లీగ్ సారథి షేక్ హసీనా వాటిపై విచారణకు ఆదేశించారు. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు కూడా. బెయిల్పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటినుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వచ్చారు.
అస్థిరతే అదనుగా...
2024 ఆగస్టులో విద్యార్థి ఆందోళనల ముసుగులో చెలరేగిన దేశవ్యాప్త అల్లర్లతో నాటి ప్రధాని హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. అంతేగాక రాత్రికి రాత్రే ఆమె దేశం వీడి భారత్ చేరుకున్నారు. అనంతరం బంగ్లాలో అల్లకల్లోలం, అస్థిరత నెలకొన్నాయి. ఎటుచూసినా హింసాకాండ పెచ్చరిల్లింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనుస్ సారథ్యంలో ఏర్పడ్డ మధ్యంతర సర్కారు వాటికి అడ్డుకట్ట వేయడంలో పూర్తి విఫలమైంది. పరిస్థితులు పెనం నుంచి పొయ్యిలోకి జారి రాజకీయ శూన్యం నెలకొన్న తరుణంలో గత డిసెంబర్ 25న రహ్మాన్ ప్రవాసం వీడి సొంతగడ్డపై అడుగుపెట్టారు. బీఎన్పీ కార్యకర్తలతో పాటు అభిమానులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
తల్లి వయోభారం, అనారోగ్యం నేపథ్యంలో పార్టీని అన్నీ తానై నడిపించారు. జియా మరణానంతరం పార్టీ పగ్గాలు చేపట్టి ఎన్నికల రంగంలోకి దూకారు. బంగ్లా ఫస్ట్ నినాదంతో యువతతో పాటు వృద్ధులనూ ఆకట్టుకున్నారు. బీఎన్పీకి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించి పెట్టి దేశంలోకి అడుగు పెట్టిన నెలన్నర లోపే ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టనున్నారు! అయితే కోరలు చాస్తున్న మత వైషమ్యాలకు అడ్డుకట్ట వేయడం, ముఖ్యంగా అరాచక శక్తులకు ముకుతాడు వేయడం, దేశాన్ని ప్రగతి వైపు నడపడం ఆయనకు కఠిన పరీక్షే కానుంది. రహ్మాన్ భార్య డాక్టర్ జుబైదా బంగ్లా నేవీ మాజీ చీఫ్ కూతురు. వారికి కూతురు జైమా జర్నాజ్ ఉన్నారు.
భారత్ పట్ల సానుకూలతే!
షేక్ హసీనా పూర్తిగా భారత అనుకూల నేతగా పేరుపడగా ఖలీదా జియాది మాత్రం పూర్తిగా భిన్న వైఖరి. భారత్తో ఆమె ఎప్పుడూ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జియా కుమారునిగా రహ్మాన్ తీరు ఎలా ఉంటుందోనని ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా హసీనా పదవీచ్యుతి అనంతరం గత ఏడాదిన్నరగా బంగ్లాలో భారత వ్యతిరేకత భావజాలం పరాకాష్టకు చేరింది. దానికి యూనుస్ సర్కారుకూడా పరక్షంగా దన్నుగా నిలిచింది.
వీలు దొరికినప్పుడల్లా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడమే గాక క్రమంగా మన దాయాది పాకిస్తాన్కు దగ్గరవుతూ వచ్చింది. ఇదే అదనుగా బంగ్లాలో మతోన్మాద మూకలు కొన్నాళ్లుగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దమనకాండకు దిగుతున్నాయి. ఆ క్రమంలో హిందువుల హత్యలతో బంగ్లా అట్టుడుకుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాలో అడుగుపెట్టిన రహ్మాన్, తనది మాత్రం భారత వైఖరి అనుకూల వైఖరేనని ఆదినుంచీ స్పష్టమైన సంకేతాలిస్తూ వచ్చారు.
ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.


