బంగ్లా బీఎన్‌పీదే  | Bangladesh Nationalist Party wins landmark general elections 2026 | Sakshi
Sakshi News home page

బంగ్లా బీఎన్‌పీదే 

Feb 14 2026 4:00 AM | Updated on Feb 14 2026 3:59 AM

Bangladesh Nationalist Party wins landmark general elections 2026

పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం 

మూడింట రెండొంతుల మెజారిటీ 

భారత్‌ వ్యతిరేక జమాతే ఓటమి 

ప్రధాని కానున్న తారిఖ్‌ రహ్మాన్‌ 

రేపు ప్రమాణం చేసే అవకాశం 

మోదీ అభినందనలు, బీఎన్‌పీ కృతజ్ఞతలు

ఢాకా: బంగ్లాదేశ్‌ సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) దుమ్మురేపింది. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఏకంగా మూడింట రెండొంతులకు పైగా మెజారిటీతో ఘనవిజయం సాధించింది. మొత్తం 300 స్థానాలకు గాను 297 చోట్ల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. వాటిలో బీఎన్‌పీ 209 సీట్లు గెలుచుకుంది! కరడుగట్టిన భారత వ్యతిరేకిగా, పాక్‌ తాబేదారుగా ముద్రపడ్డ జమాతే ఇస్లామీ పార్టీ 68 సీట్లకు పరిమితమైంది. దానితో జట్టుకట్టిన 10 ఇతర పారీ్టలు దాదాపుగా మట్టికరిచాయి. 

2024 ఆందోళనల అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో పుట్టుకొచ్చిన జమాతే సంకీర్ణ భాగస్వామి నేషనల్‌ సిటిజన్‌ పార్టీ కేవలం 6 స్థానాల్లో నెగ్గగా 7 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షమైన షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం తెలిసిందే. రెండు పార్లమెంటు స్థానాల్లో ఫలితాల వెల్లడిపై హైకోర్టు నిషేధం విధించగా అభ్యర్థి మృతి కారణంగా ఒక స్థానంలో ఎన్నిక వాయిదా పడింది. ఓట్ల లెక్కింపులో భారీ అక్రమాలు జరిగినట్టు జమాతే ఆరోపించింది. ఫలితాలను బీఎన్‌పీకి అనుకూలంగా మార్చేందుకు వాటి వెల్లడిని ఈసీ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసిందని మండిపడింది. 
   
20 ఏళ్ల తర్వాత అధికారం 
ఎన్నికల్లో ఘనవిజయం నేపథ్యంలో బీఎన్‌పీ చైర్మన్‌ తారిఖ్‌ రహ్మాన్‌ (60) తొలిసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆదివారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. బీఎన్‌పీ ఏకంగా 20 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అధికార పగ్గాలు చేపట్టనుండటం విశేషం. ఎన్నికల విజయంపై రహ్మాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఫలితాలపై స్పందించిన తొలి దేశాధినేత ఆయనే కావడం విశేషం. ఇందుకు మోదీకి బీఎన్‌పీ కృతజ్ఞతలు తెలిపింది. బంగ్లాదేశ్‌ మాజీ అధ్యక్షుడు జియావుర్‌ రహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన రహ్మాన్‌ 19 ఏళ్ల ప్రవాసం నుంచి ఇటీవలే బంగ్లాకు తిరిగి రావడం విశేషం.

 షేక్‌ హసీనా సర్కారును కుప్పకూల్చిన దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఏడాదిన్నరకు పైగా కొనసాగుతున్న కల్లోలం బీఎన్‌పీ విజయంతో సద్దుమణిగి రాజకీయ స్థిరత్వం నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా గురువారం జరిగిన ఎన్నికల్లో 59.44 శాతం పోలింగ్‌ నమోదైంది. బంగ్లాలో ఇవి 13వ సాధారణ ఎన్నికలు. 

విద్యార్థుల ముసుగులో 2024 ఆగస్టులో పెచ్చరిల్లిన ఆందోళనలు హసీనా 15 ఏళ్ల పాలనకు తెరదించడం, ఆమె ఉన్నపళంగా దేశం వీడి భారత్‌లో ఆశ్రయం పొందుతుండటం తెలిసిందే. నాటినుంచీ ఒకరకంగా బంగ్లాలో రాజకీయ శూన్యమే నెలకొంది. దేశ పాలన వ్యవహారాలను ఏడాదిన్నరకు పైగా నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వమే చూస్తూ వస్తోంది. అయితే దేశంలో అస్థిరతకు చెక్‌ పెట్టడంలో, ముఖ్యంగా హిందువులు తదితర మైనారిటీలపై దేశవ్యాప్తంగా పెచ్చరిల్లుతున్న దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందన్న చెడ్డపేరు మూటగట్టుకుంది.  
   
సంస్కరణలకు ‘జై’
బంగ్లాదేశ్‌లో భారీ ప్రజాస్వామిక సంస్కరణలకు ప్రజలు జైకొట్టారు. ఇందుకోసం సాధారణ ఎన్నికలతో పాటుగా నిర్వహించిన రెఫరెండానికి అనుకూలంగా తీరి్పచ్చారు. రెఫరెండంలో భాగంగా ప్రతిపాదించిన సంస్కరణల ప్యాకేజీకి మద్దతు పలికారు. రెఫరెండానికి అనుకూలంగా ఏకంగా 60.26 శాతం ఓట్లు పడ్డట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 4.81 కోట్ల మంది ‘అవును’అని ఓటేయగా 2.26 కోట్ల మంది ‘కాదు’బటన్‌ నొక్కినట్టు తెలిపింది. హసీనా పదవీచ్యుతి అనంతరం తాత్కాలికంగా పాలన పగ్గాలు చేపట్టిన యూనుస్‌ గతేడాది ఈ సంస్కరణలను ప్రతిపాదించారు.

ఏడుగురుమహిళల విజయం 
బంగ్లా పార్లమెంటు ఎన్నికల్లో ఏడుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఆరుగురు అధికార పగ్గాలు చేపట్టబోతున్న బీఎన్‌పీ నుంచే నెగ్గారు. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా గెలిచారు. బీఎన్‌పీ ఈసారి మొత్తం 10 మంది మహిళలకు టికెట్లిచ్చింది.  

ముగ్గురు హిందువుల విజయం! 
బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికల్లో ముగ్గురు హిందూ అభ్యర్థులు గెలుపొందడం విశేషం! పైగా వారంతా బీఎన్‌పీ టికెట్‌పై పోటీ చేసినవారే! సీనియర్‌ నాయకుడు జ్ఞానేశ్వర్‌ చంద్ర రాయ్‌ ఢాకా–3 నియోజకవర్గం నుంచి ఏకంగా 99,163 ఓట్లు సాధించి జమాతే ఇస్లామీ అభ్యర్థి మహ్మద్‌ షహీనుర్‌ ఇస్లాంపై విజయఢంకా మోగించారు. బీఎన్‌పీ ఉపాధ్యక్షుడు నితాయ్‌ రాయ్‌ చౌధురి మగురా–2 నుంచి, దీపేన్‌ దివాన్‌ రంగమతి నుంచి గెలుపొందారు. జమాతే తరఫున ఏకైక హిందూ అభ్యర్థి కృష్ణ నంది ఓటమి చవిచూశారు.

దశాబ్దాల అనంతరంమహిళా సారథులు లేకుండా 
బంగ్లాలో దశాబ్దాల విరామం తర్వాత ప్రధాన పారీ్టలకు మహిళా సారథులు లేకుండా జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. గత 30 ఏళ్లకు పైగా షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్, బేగం ఖలీదా జియా సారథ్యంలోని బీఎన్‌పీ ప్రధాన పారీ్టలుగా తలపడుతూ వస్తున్నాయి. జియా అనారోగ్యంతో గత డిసెంబర్‌లో కన్నుమూయడం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement