న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)అధికారంలోకి రానుండటంతో, భారత్లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం చర్చనీయాంశంగా మారింది. 2024 జూలై నాటి విద్యార్థి ఉద్యమంపై ఉక్కుపాదం మోపినందుకు.. 2025 నవంబర్లో బంగ్లాదేశ్లోని ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో బీఎన్పీ ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు హసీనాను బంగ్లాదేశ్కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం న్యూఢిల్లీలో ప్రవాస జీవితం గడుపుతున్న షేక్ హసీనా.. బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలను ఒక ప్రహసనంగా అభివర్ణించారు. జనవరి 2026లో ఆమె ఢిల్లీ నుండి చేసిన ఒక ఒక ప్రసంగంలో.. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చి, బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. కాగా మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా నేరాలకు పాల్పడినట్లు రుజువైనందున, ఆమెను ‘భారత్-బంగ్లాదేశ్ అప్పగింత ఒప్పందం’ కింద తిరిగి తమ దేశానికి పంపాలని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఇప్పటికే భారత్ను కోరింది.
మరణశిక్ష పడిన వ్యక్తికి ఆశ్రయం కల్పించడం న్యాయవ్యవస్థను అవమానించడమేనని బంగ్లాదేశ్ నేతలు అంటున్నారు. ఈ సున్నిత అంశంపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ 2025లో ఆయన మాట్లాడుతూ, హసీనా ‘కొన్ని విలక్షణమైన పరిస్థితులలో’ భారత్కు వచ్చారని, ఆమె భవిష్యత్తు గురించి తుది నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ట్రిబ్యునల్ తీర్పును భారత్ గమనించిందని చెబుతూనే, హసీనా అప్పగింత విషయంలో భారత్ ఆచి తూచి అడుగులు వేస్తున్నదన్నారు.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం.. యూనస్ కీలక నిర్ణయం


