గాజాలో శాంతి స్థాపనకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే "బోర్డ్ ఆఫ్ పీస్"ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన తొలి సమావేశం ఈ నెల 19న నిర్వహించనున్నారు. అయితే ఆ మీటింగ్ కు హాజరుకానున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఈ విషయంలో భారత్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.
ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా అసిఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యుఎస్ఏ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్థాన్ని టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుందని ఆరోపించారు. 1999 కార్గిల్ యుద్దం, 9/11 దాడుల తర్వాత ఆ దేశంతో జతకట్టడం తమ దేశానికి దీర్ఘకాలిక నష్టం కలిగించిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్లో ఉగ్రవాదం.... ప్రధానంగా అవినీతి, స్మగ్లింగ్, నెట్వర్క్ల ద్వారా పెరుగుతుందని అంగీకరించారు. దీంతో అమెరికాతో పాక్ డిస్టెన్స్ పెంచుతుందేమోనని అంతా భావించారు.
అయితే తాజాగా పాకిస్తాన్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశంలో పాల్గొననున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ ఆ సమావేశానికి హాజరుకానున్నట్లు ఆదేశ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా అదేరోజు ప్రధాని షెహబాజ్ వాషింగ్టన్లో జరిగే మరో సమావేశానికి వెళతారని పేర్కొంది. అయితే భారత్ సైతం ఈ వ్యవహారంపై స్పందించింది. బోర్డు ఆప్ పీస్ మిషన్లో పాల్గొనాలని ఆహ్వానం అందిందని ఆ అంశంపై ఆలోచనలు జరుపుతున్నామని భారత అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు.
ఇటీవల భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి మెరుగుపడిన సంగతి తెలిసిందే. ట్రంప్ అధిక పన్నులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. భారత్ సైతం దానికి కృతజ్ఞత తెలిపింది. కాగా గత నెలలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ "బోర్డ్ ఆప్ పీస్" ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటి్ంచారు. ఇందులో ఇప్పటి వరకూ 26 దేశాలు చేరాయి. భారత్ ఇందులో చేరే అంశం ఇంకా ప్రకటించలేదు.


