అమెరికా- ఇరాన్ అణుచర్చల విషయంపై ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అణుచర్చలకు ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. అయితే ఆ విషయంలో బంతి ఇంకా అమెరికా కోర్టులోనే ఉందని అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అణుచర్చల విషయంలో తగ్గకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడంతో పాటు ఇరాన్ సైతం వెనక్కితగ్గేలా కనిపించకపోవడంతో ఏం జరుగుతుందా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ ఉప ముఖ్యమంత్రి మజీద్ తాక్త్ రావంచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. బంతి ఇంకా అమెరికా కోర్టులోనే ఉందని తెలిపారు.
విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ" అణు కార్యక్రమంపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే అమెరికా దానికి సంబంధించిన ఆంక్షల విషయంపై చర్చ జరపాలి. ఆ చర్చలు టేబుల్పై ఉండాలి. అదే విధంగా తన వంతు బాధ్యతను నిర్వర్తించకుండానే కొన్ని పనులు చేయాలనే భావనను ఎవరూ అంగీకరించరు" అని ఆయన అన్నారు.అయితే ఈ అంశంపై ఫిబ్రవరి 6న ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరఘ్ఛి అమెరికా రాయభారి స్టీవ్ విట్కాఫ్ చర్చలు జరిపారు. ఈ చర్చలు పరోక్షంగా జరిగాయి, దీనికి ఒమన్లు మధ్యవర్తులుగా వ్యవహరించారు.
కాగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా భారీ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్’ తోపాటు మరికొన్ని యుద్ధ నౌకలను మధ్య ప్రాచ్యానికి తరలిస్తోంది. ఇప్పటికే ‘యూఎస్ఎస్ అబ్రహాం లింకన్’ నౌకను అరేబియా సముద్రంలో మోహరించింది. ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్’ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ విమానాల వాహక నౌకగా పేరుగాంచింది.


