ఇటీవల ఇరాన్కు వ్యతిరేకంగా ఆదేశంలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగాయి. లక్షలాది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. దీంతో ఖమేనీ సర్కార్ వారి నిరసనలను ఉక్కుపాదంతో అణిచివేసింది. పెద్ద సంఖ్యలో అక్కడి పౌరులపై కాల్పులు జరిపింది. మిగతా వారిని జైళ్లలో బంధించింది. ఇదంతా తెలిసిన విషయమే.. అయితే జైళ్లలో బంధించిన నిరసనకారులను ఇరాన్ చిత్రవధకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని అక్కడి సైనికులు కాల్చివేస్తున్నారని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు అణు ఒప్పందంపై చర్చలకోసం ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఆ చర్చలు విఫలమైతే గనుక తీవ్ర యుద్ధం తప్పేలా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న అంతర్గత పరిస్థితులు ప్రపంచాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపిన వారిని అక్కడి ప్రభుత్వం ఊచకోత కోస్తున్నట్లు తెలుస్తోంది.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. "ఇరాన్ నిరసనల్లో గాయపడిన వారిని అక్కడి భద్రతా బలగాలు ఆసుపత్రుల్లోనే కాల్చి చంపుతున్నాయి. అందుకోసం ఆసుపత్రుల్లో ఇటీవల చేరిన వివరాలను ఇరాన్ భద్రతా బలగాలు సేకరిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు ప్రతిరోజు సాధారణంగా మారిపోయాయి. భద్రతా బలగాల భయానికి నిరసనల్లో గాయపడిన వారు ఆసుపత్రులకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాకుండా అక్కడ జైళ్లలో మగ్గుతున్న మహిళలపై తీవ్రమైన లైంగిక దాడులు జరుగతున్నాయి. అక్కడ నిరసనలల్లో అరెస్టై జైళ్లలో ఉన్న మహిళలు తమ కుటుంబసభ్యులను గర్భనిరోధక మాత్రలు పంపించాల్సిందిగా కోరుతున్నారు" అని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
వీటితో పాటు గడిచిన మూడు వారాల్లో 207 మంది రాజకీయ ఖైదీలు ఉరితీయబడ్డారని తెలిపింది. వారందరిని దేశవ్యాప్తంగా ఉన్న 57 జైళ్లలో బంధించారు. అయితే అమెరికా కథనాల ప్రకారం ఇరాన్ వ్యతిరేక నిరసనల్లో దాదాపు 6,221 మంది ఖైదీలు మరణించగా, ఇరాన్ లెక్కల ప్రకారం 3,117 మంది ప్రాణాలు వదిలారు. నిరసనల్లో ఇప్పటివరకూ 42,000 మందిని అరెస్టు చేశారు.


