‘మెత్తబడిన అప్పడం.. కాదు ఫైన్ తందూరీ’ | UK Parliament Sees Heated Debate Over India–UK Free Trade Agreement, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

‘మెత్తబడిన అప్పడం.. కాదు ఫైన్ తందూరీ’

Feb 11 2026 9:28 AM | Updated on Feb 11 2026 10:32 AM

UK MPs Debate Benefits Of India Trade Deal

లండన్‌: భారత్ - బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో  ఆసక్తికర చర్చ జరిగింది. బ్రిటీష్ ఎంపీలు పలు చమత్కారాలను జోడిస్తూ, ఈ ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. షాడో ట్రేడ్ సెక్రటరీ ఆండ్రూ గ్రిఫిత్ ఈ ఒప్పందాన్ని విమర్శిస్తూ ఇది ‘సొగ్గీ పాప్పడమ్స్’ (మెత్తబడిన అప్పడాలు) మూటలా ఉందని ఎద్దేవా చేశారు. బ్రిటన్ సేవల రంగాన్ని ఈ ఒప్పందంలో చేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. దీనికి ప్రతిగా వాణిజ్య శాఖ మంత్రి క్రిస్ బ్రయంట్ స్పందిస్తూ, బ్రిటీష్ వ్యాపారవేత్తలు ఈ ఒప్పందాన్ని ‘ఫైన్ తందూరీ’లా భావిస్తున్నారని సమర్థించారు.

ఈ చర్చ సందర్భంగా కీర్ స్టార్మర్ ప్రభుత్వంపై పలువురు ఎంపీలు విమర్శలు గుప్పించారు. బ్రిటన్ సేవా రంగం, న్యాయ సేవలకు సంబంధించిన నిబంధనలు లేకపోవడాన్ని వారు తప్పుబట్టారు. భారతీయ కార్మికులు, వారి యజమానులు మూడు సంవత్సరాల పాటు నేషనల్ ఇన్సూరెన్స్ చెల్లించకుండా మినహాయింపు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వస్తువుల ఎగుమతిదారులకు సుంకాల తగ్గింపు లభించడానికి  ఐదు నుండి 10 ఏళ్లు పడుతుందని, కానీ భారత ఎగుమతిదారులకు తక్షణమే ప్రయోజనం కలుగుతున్నదని గ్రిఫిత్ విమర్శించారు.

అమెరికాలో ఇలాంటి నమూనా  కారణంగానే తక్కువ వేతనాలకే లభించే భారతీయ కార్మికులు పెరిగిపోయి, స్థానిక కార్మికులకు నష్టం కలిగిందని కన్జర్వేటివ్ ఎంపీ కేటీ లామ్ హెచ్చరించారు. మరోవైపు ఈ ఒప్పందం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనదని మంత్రి క్రిస్ బ్రయంట్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ నుండి విడిపోయిన తర్వాత బ్రిటన్ కుదుర్చుకున్న అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక ఒప్పందం ఇదేనని ఆయన తెలిపారు. హెచ్‌ఎస్‌బిసి, స్టాండర్డ్ చార్టర్డ్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ ఒప్పందాన్ని సమర్థిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 2050 నాటికి భారతదేశంలో 25 కోట్ల మందికి పైగా అధిక ఆదాయం కలిగిన వినియోగదారులు ఉంటారని, ఇది బ్రిటన్ ఎగుమతిదారులకు భారీ మార్కెట్ అని ఆయన వివరించారు.

ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మకమైనదిగా లేబర్ ఎంపీ డగ్లస్ మెకాలిస్టర్ అభివర్ణించారు. జీ20 దేశాల్లో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశమని, 2028 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక, రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ఒప్పందం భవిష్యత్తులో భారీ పెట్టుబడులను తీసుకువస్తుందని, బ్రిటన్ వృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది ఒక కీలక అడుగు అని మెకాలిస్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Canada: స్కూల్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement