ఎమర్జెన్సీ ల్యాండింగ్ వేళ అదుపుతప్పిన విమానం
సోమాలియాలో ఘటన
మొగదిషు(సోమాలియా): టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతికలోపం తలెత్తడంతో విమానం వెంటనే ల్యాండింగ్కు ప్రయత్నించి రన్వే మీద అదుపుతప్పి ఎదురుగా ఉన్న సముద్రజలాల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం సోమాలియాలోని మొగదిషు నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మరణాల వివరాలు తెలియరాలేదు. ఘటన జరిగినప్పుడు విమానంలో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. విషయం తెల్సి విమానాశ్రయ అత్యయక సిబ్బంది హుటాహుటిన తీరానికి చేరుకుని ముమ్మర సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
మొగదిషులోని ఆడెన్ అబ్దుల్లే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గాల్కకోయో నగరానికి విమానం బయల్దేరిన 15 నిమిషాలకే సమస్య మొదలైందని, తప్పనిపరిస్థితుల్లో ల్యాండింగ్కు ప్రయత్నించగా రన్వే నుంచి పక్కకు జరిగి హిందూమహాసముద్ర జలాల్లోకి వెళ్లిందని ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ డైరెక్టర్ అహ్మెద్ మోవాలిమ్ చెప్పారు. ఘటనపై విమాన యాజమాన్యం ‘స్టార్స్కై ఏవియేషన్’ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టామని అధికారులు వెల్లడించారు.


