చమురు కొనకుండా భారత్‌ను అడ్డుకుంటోంది | Lavrov Accuses US of Pressuring India to Stop Buying Russian Oil Amid Sanctions Push | Sakshi
Sakshi News home page

చమురు కొనకుండా భారత్‌ను అడ్డుకుంటోంది

Feb 11 2026 4:39 AM | Updated on Feb 11 2026 4:39 AM

Lavrov Accuses US of Pressuring India to Stop Buying Russian Oil Amid Sanctions Push

అమెరికాకు కావాల్సింది ఆర్థికపరమైన ఆధిపత్యం

అందుకే ఇతర దేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలు

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆరోపణలు

మాస్కో: ప్రపంచ దేశాలపై ఆర్థికపరమైన ఆధిపత్యం సాధించేందుకు అమెరికా టారిఫ్‌లు, ఆంక్షలు, ప్రత్యక్ష నిషేధాల వంటి అనేక రకాల అక్రమ విధానాలను అమలు చేస్తోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆరోపించారు. అదేవిధంగా, భారత్‌ తదితర దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా అమెరికాయే అడ్డుకుంటోందన్నారు. రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించడం ద్వారా పోటీ లేకుండా చేయడం వంటి అక్రమ విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. సోమవారం టీవీ బ్రిక్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లావ్రోవ్‌ అమెరికా వైఖరిని ఎండగట్టారు.

 భారత్, ఇతర బ్రిక్స్‌ సభ్య దేశాలు, కీలక వ్యూహాత్మక భాగస్వాములతో మాకున్న వాణిజ్యం, పెట్టుబడి సహకారం, సైనిక, సాంకేతిక సంబంధాలను నియంత్రించడానికి అమెరికా ప్రయతి్నస్తోందని ఆరోపించారు. గతంలో చలాయించిన ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇప్పటికీ పాశ్చాత్య దేశాలు ఇష్టపడటం లేదని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పగ్గాలు చేపట్టాక ప్రత్యర్థులను అణచివేసే చర్యలు మరింత బాహాటంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.  

ఇంధన సరఫరా మార్గాలపై పెత్తనం 
గతేడాది రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య అలాస్కాలో జరిగిన చర్చలను లావ్రోవ్‌ ప్రస్తావించారు. ‘ఉక్రెయిన్‌ సమస్య పరిష్కారం తప్పనిసరని అమెరికా తెలిపింది. మేం కోరుకున్నదీ అదే. అందుకే ఆ దేశం అందజేసిన ప్రతిపాదనలకు వెనువెంటనే ఆమోదం తెలిపాం’అన్నారు. ‘అయితే, జరిగింది వేరుగా ఉంది. అలాస్కా చర్చల తర్వాత మాపై మరిన్ని ఆంక్షలు విధించారు. అంతర్జాతీయ జలాల గుండా వెళ్లే మా ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు పెంచారు. మా చమురు కొనుగోలు చేసే భారత్, తదితర దేశాలపై ఒత్తిడులను తీవ్రతరం చేశారు. తక్కువ ధరకు మేం సరఫరా చేసే చమురు, గ్యాస్‌లను కాదని, అమెరికా నుంచి అత్యధిక ధరకు సహజవాయువును యూరప్‌ దేశాలు కొనుక్కుంటున్నాయి.

ఆ విధంగా, అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించుకుంది’అని లావ్రోవ్‌ వివరించారు. నార్డ్‌ స్ట్రీమ్‌ పైప్‌లైన్లు, ఉక్రెయిన్‌ గ్యాస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్, టర్క్‌ స్ట్రీమ్‌ పైప్‌లైన్‌ తదితర అన్ని ఖండాల్లోని ఇంధన సరఫరా మార్గాలను చెప్పుచేతల్లో పెట్టుకోవాలన్నదే అమెరికా లక్ష్యమని తెలిపారు. ‘ఆర్థికపరమైన ఆధిపత్యం కోసం అమెరికా ప్రభుత్వం ఆంక్షలు, టారిఫ్‌లు, ప్రత్యేక నిషేధాలు, కొన్ని దేశాల కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై పరిమితులు సైతం విధిస్తోంది. వీటన్నిటినీ మనం గమనంలోకి తీసుకోవాలి’అని లావ్రోవ్‌ చెప్పారు.

‘భారత్, ఇండోనేసియా, బ్రెజిల్‌ మాదిరిగా మేం కూడా అన్ని దేశాలతో సహకార భావనతో వ్యవహరిస్తున్నాం. ఆ మాటకొస్తే అమెరికాతోనూ సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నాం. అమెరికా మాత్రం అవరోధాలను సృష్టిస్తూనే ఉంది’అని విమర్శించారు. రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించినందునే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు గత వారం ట్రంప్‌ ప్రకటించడం తెల్సిందే. ఆయిల్‌ను రష్యా నుంచి కొంటున్నట్లు తెలిస్తే మళ్లీ టారిఫ్‌లను విధిస్తామని కూడా ఆయన హెచ్చరికలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement